ఆదిలాబాద్టౌన్: బాధిత కుటుంబాలకు జిల్లా పోలీసుశాఖ అండగా ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. అనారోగ్యంతో మృతిచెందిన హోంగార్డు లక్ష్మి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బుధవారం రాంనగర్లోని ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణ సహాయార్థం రూ.10వేలు కుటుంబ సభ్యులకు అందజేశారు. హోంగార్డు ఇన్చార్జి చంద్రశేఖర్, వార్డు కౌన్సిలర్ చరణ్గౌడ్, హోంగార్డులు పాల్గొన్నారు.
విద్యుత్ తీగ తగిలి రైతుకు గాయాలు
దహెగాం: వన్యప్రాణులను వేటాడేందుకు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి రైతుకు గాయాలైనట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. మండలంలోని లగ్గాం గ్రామానికి చెందిన మొరె సాయిప్రభు పంబాపూర్ శివారులోని పొలానికి మంగళవారం సాయంత్రం వెళ్లాడు. పంబాపూర్ గ్రామానికి చెందిన కొడిపె శ్రీను అడవి జంతువులను వేటాడడానికి అమర్చిన విద్యుత్ తీగలకు తగలడంతో గాయాలయ్యాయి. బుధవారం సాయిప్రభును చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. బాధితుడి తమ్ముడు సాయిదేవా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
స్కూల్ బస్సు, లారీ ఢీ
భైంసారూరల్: మండల పరిధిలోని నిర్మల్–భైంసా జాతీయ రహదారిపై మాటేగాం వద్ద బుధవారం స్కూల్ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి... ఎగ్గాం నుంచి సుమారు 15 మంది విద్యార్థులతో భైంసా వైపు వెళ్తున్న బ్రిలియన్స్ స్కూల్ బస్సు మాటేగాం వద్దకు రాగానే డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఘటనలో బస్సులో ఉన్న నలుగురు విద్యార్థులు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి గాయపడిన వారిని భైంసా ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎంఈవో సుభాష్, ఎస్సై సుప్రియ ఆస్పత్రికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
రైతులకు కూరగాయల విత్తనాలు పంపిణీ


