ప్ర‘గతి’ తప్పుతున్న చక్రం
ప్రమాదాల బారిన ఆర్టీసీ బస్సులు ప్రశ్నార్థకమవుతున్న ప్రయాణికుల భద్రత క్షేత్రస్థాయిలో కరువైన పర్యవేక్షణ
ఆదిలాబాద్: ఆర్టీసీ ప్రయాణం సురక్షితం.. శుభప్రదం అని చెప్పుకునే సంస్థ మాటలు నీటి మూటలవుతున్నాయి. ప్రజారవాణా వ్యవస్థలో భాగమైన బస్సులు తరచూ ప్రమాదానికి గురవుతుండడంతో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది. మహాలక్ష్మి పథకం అమలులోకి రావడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అదేస్థాయిలో ఉద్యోగులపై అదనపు భారం పడుతోంది. మరోవైపు ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా.. ఉన్న అరకొర సిబ్బందిపైనే సంస్థ ఉన్నతాధికారులు అదనపు భారం మోపుతున్నారు. దీంతో వారు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ వద్ద బస్సు బోల్తా ఘటనే నిదర్శనం. ఇందులో 20 మంది వరకు గాయాలవగా.. ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
డ్రైవర్లపై పని ఒత్తిడి..
ఆర్టీసీలో నిష్ణాతులైన డ్రైవర్లను నియమిస్తారు. అ యినప్పటికీ ప్రమాదాలు చోటు చేసుకుంటుండడం కలవరపాటు కలిగిస్తుంది. ఉద్యోగులకు వరుసగా డ్యూటీలు వేస్తుండడం.. రాత్రి విధులు నిర్వహించిన వారికి సరైన విశ్రాంతి లేకుండానే వెంటనే డ్యూటీలు అలాట్ చేస్తున్నారు. దీంతో వారంతా నిద్రలేమితో సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు తెలు స్తోంది. ఇటీవల శ్యాంపూర్ ఘటనను పరిశీలిస్తే.. ఆసిఫాబాద్–ఆదిలాబాద్ మధ్య నడిచే ఎక్స్్ప్రెస్ సర్వీస్ రాత్రి 7: 30 గంటలకు ఆసిఫాబాద్ డిపో నుంచి బయలుదేరుతుంది. రాత్రి 11గంటల వరకు ఆదిలాబాద్ చేరుకుంటుంది. మళ్లీ ఇదే సర్వీస్ ఉ దయం 5 గంటలకు ఆసిఫాబాద్ బయలుదేరాలి. ఈ క్రమంలో డ్రైవర్కు సరైన నిద్ర లేని కారణంగా సోమవారం వంతెనపై నుంచి బస్సు బోల్తాపడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురికి గా యాలయ్యాయి. ఇరుకు వంతెన కారణంగానే ప్ర మాదం చోటుచేసుకుందని ఆర్టీసీ అధికారులు చె బుతున్నప్పటికీ, సరైన నిద్ర లేకపోవడమే ప్రధాన కారణంగాసంస్థ డ్రైవర్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రయాణికుల భద్రతపై నీలినీడలు..
ప్రైవేట్తో పోల్చితే ఆర్టీసీ బస్సులే క్షేమమని జనం నమ్ముతారు. అయితే ఈ మధ్య ఆర్టీసీ బస్సులు కూడా ప్రమాదాలకు గురవుతుండడం ప్రయాణికుల్లో భయాన్ని పెంచుతోంది. ముఖ్యంగా ఆర్టీసీలో సొంత డ్రైవర్ల కంటే, అద్దెకు తీసుకున్న (హైర్) బస్సుల డ్రైవర్ల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. అద్దె బస్సుల్లో కండక్టర్లు ఆర్టీసీ వారే ఉన్నా, డ్రైవర్లను మాత్రం ఆ బస్సు యజమానులే పెట్టుకుంటారు. దీనిని ఆసరాగా తీసుకుని కొంతమంది యజమానులు తక్కువ జీతానికే దొరికే, సరైన అనుభవం లేని వారిని పనిలో పెట్టుకుంటున్నారు. ఇలాంటి అనుభవం లేని డ్రైవర్ల వల్లే ప్రమాదాలు జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రమాదాల్లో కొన్ని..
నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు..
రహదారి భద్రత విషయంలో డ్రైవర్లకు ఎప్ప టికప్పుడు నిబంధనల ప్రకారం నడపాలని సూచనలిస్తున్నాం. మాసోత్సవాల సందర్భంగా శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమవు తుంది. వాహనాన్ని ఓపికతో నడిపితే యాక్సిడెంట్లకు దూరంగా ఉండవచ్చు. ఈ మేరకు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నాం.
– ఎస్ భవానీప్రసాద్, ఆర్ఎం, ఆదిలాబాద్
తూతూమంత్రంగా శిక్షణ..
రోడ్డు ప్రమాదాలు నివారించేలా ఏటా రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఆర్టీసీలో డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, పలు సందర్భాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తుంటారు. అయితే వీటిని పకడ్బందీగా చేపట్టాల్సింది పోయి, తూతూ మంత్రంగా నిర్వహిస్తుండడంతో ఫలితం ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఆర్టీసీ ప్రమాదాల్లో ముఖ్యంగా సంస్థ డ్రైవర్లతో పోల్చితే పీహెచ్బీ డ్రైవర్ల కారణంగానే ఎక్కువగా చోటు చేసుకుంటుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేస్తున్న అధికారులు, తప్పు తమపై పడకుండా డ్రైవర్లు, కండక్టర్లపై నెట్టివేస్తున్నారని పలువురు ఉద్యోగులు బాహటంగానే పేర్కొంటున్నారు.


