పోలింగ్‌ కేంద్రాల మ్యాపింగ్‌ పూర్తి | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాల మ్యాపింగ్‌ పూర్తి

Jun 18 2025 3:23 AM | Updated on Jun 18 2025 3:23 AM

పోలింగ్‌ కేంద్రాల మ్యాపింగ్‌ పూర్తి

పోలింగ్‌ కేంద్రాల మ్యాపింగ్‌ పూర్తి

● 500 మంది ఓటర్లకు ఒక కేంద్రం ● వార్డు పరిధిలోని ఓటర్లంతా ఒకే చోట ఓటు వేసేలా చర్యలు ● ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్న యంత్రాంగం

కై లాస్‌నగర్‌: జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో యంత్రాంగం అందుకు అవసరమైన కసరత్తు చేపట్టింది. పోలింగ్‌కేంద్రాలు, సిబ్బందిని ఇప్పటికే గుర్తించిన అధికారులు, తాజాగా ఓటర్ల సంఖ్యకనుగుణంగా ఆయా కేంద్రాల మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తిచేశారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకునేలా 500 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రాల వారీగా రూట్లను ఎంపిక చేయడంలో నిమగ్నమయ్యారు. ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్‌ విడుదల చేసినా ఒకే విడతలో పూర్తిచేసేలా సంసిద్ధమవుతున్నారు.

వందశాతం పోలింగ్‌ సాగేలా..

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. ఒక్క ఓటు అభ్యర్థుల తలరాతలను మార్చనుంది. దీంతో ప్రతీ ఓటరు ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్‌కేంద్రాల మ్యాపింగ్‌ ప్రక్రియ చేపట్టారు. 2023 డిసెంబర్‌లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా అనుసరించి గ్రామం, వార్డులు, ఎంపీటీసీ స్థానం వారీగా కేంద్రాలను సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 4,51,744 మంది పరిషత్‌ ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 2,31,068 మంది, పురుష ఓటర్లు 2,20,619 మంది, ఇతరులు 17మంది ఉన్నారు. ఇందులో 500మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ఒక వార్డు పరిధిలోని ఓటర్లంతా అదే వార్డులో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓటు వేసేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో 875 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు వాటి పరిధిలోని ఓటర్లందరినీ ఎంపీటీసీ స్థానాలకనుగుణంగా మ్యాపింగ్‌ చేశారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల వారీగా కూడా ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావడంతో ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్‌ సిబ్బందిని మ్యాపింగ్‌ చేసే పనిలో నిమగ్నమయ్యారు.

మల్లాపూర్‌ ఇంద్రవెల్లిలోనే..

మండలాల పునర్విభజనలో భాగంగా సిరికొండ మండలంలో చేర్చిన మల్లాపూర్‌ గ్రామాన్ని ప్రభుత్వం తిరిగి ఇంద్రవెల్లి మండలంలోనే విలీనం చేసింది. అయితే ఆ మండలంలో కొనసాగేందుకు అక్కడి ప్రజలు విముఖత వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్‌తో పాటు ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న సీతక్కకు పలుమార్లు కలిసి వారు విన్నవించారు. ఈ మేరకు స్పందించిన ప్రభుత్వం మల్లాపూర్‌ను యథావిధిగా ఇంద్రవెల్లి మండలంలో విలీనం చేయాలని ఆదేశించింది. దీంతో మల్లాపూర్‌ పంచాయతీతో పాటు దాని పరిధిలోని నిజాంగూడ, ధర్మసాగర్‌ హ్యాబిటేషన్లను సైతం ఇంద్రవెల్లిలోనే చేర్చారు. ప్రస్తుతం ఆయా మండలాల్లోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీల సంఖ్యకనుగుణంగా పోలింగ్‌ కేంద్రాల మ్యాపింగ్‌ ప్రక్రియను అధికారులు చేపట్టారు. సిరికొండ, ఇంద్రవెల్లి ఎంపీడీవోల నుంచి అందుకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఈ ప్రక్రియ తుది దశకు చేరినట్లుగా సమాచారం. పోలింగ్‌ కేంద్రాల మ్యాపింగ్‌ ప్రక్రియతో సిరకొండ మండలంలో ఓ ఎంపీటీసీ స్థానం తగ్గనుండగా, ఇంద్రవెల్లిలో మరో స్థానం పెరుగనుంది.

జిల్లాలో..

గ్రామీణ మండలాలు : 20

ఎంపీటీసీ స్థానాలు : 166

జెడ్పీటీసీ స్థానాలు : 20

పోలింగ్‌ కేంద్రాలు : 875

ఓటర్లు : 4,51,704

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement