
రైతు నేస్తం.. సాగుకు హస్తం
● ప్రతీ మంగళవారం కార్యక్రమం ● సమస్యలను దృష్టికి తేనున్న రైతులు ● సలహాలు, సూచనలు ఇవ్వనున్న అధికారులు
ఆదిలాబాద్అర్బన్: సాగులో అన్నదాతల సమస్యలు ఇట్టే పరిష్కారం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమం దోహదపడనుంది. రైతులు తమ సమస్యలు, సందేహాలను ప్రతీ వారం అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చు. ఇప్పటికే ఈ సేవలు అందుబాటులో ఉండగా మరింత విస్తరించేలా చర్యలు చేపట్టింది. జిల్లాలో మరో 32 చోట్ల రైతు నేస్తం యూనిట్లను సోమవారం ప్రారంభించింది. గతంలో ఉన్న వాటితో కలుపుకొని ప్రస్తుతం 49 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ప్రతీ వారం రైతునేస్తం..
ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా రైతు వేదికల్లో ప్రతీ మంగళవారం ఉదయం 10నుంచిమధ్యాహ్నం 12 వరకు వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. ఆ సీజన్లో రైతులకు తలెత్తిన సమస్యలను నేరుగా తెలుసుకొని వాటిని పరిష్కరించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో రైతులతో పాటు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, టెక్నికల్, వ్య వసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొంటారు. సాగులో ఏ చిన్న సమస్య ఎదురైనా రైతులు ఇందులో దృష్టికి తీసుకువస్తే సత్వర పరిష్కారం లభించనుంది.
49 చోట్ల అందుబాటులోకి..
జిల్లాలో రైతు నేస్తం కార్యక్రమాలు 2024 ఫిబ్రవరి నుంచి మొదలయ్యాయి. మొదట నాలుగు షురూ కాగా, ప్రస్తుతం 49 చోట్ల అందుబాటులోకి వచ్చా యి. తొలి విడతలో నియోజకవర్గంలో మండలానికి ఒకటి చొప్పున సదుపాయం కల్పించారు. రెండో విడతలో మండలానికి రెండు చొప్పున ఆయా రైతు వేదికల్లో సదుపాయాలు ఉండాలని వీసీ యూనిట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మండలానికి మూడు చొప్పున ఉండాలని కొత్తగా 32 యూనిట్లు ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క ఊరికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక రైతు వేదికలో 120 మంది రైతులు కూర్చునేందుకు సదుపాయం ఉండగా, అంతకన్నా ఎక్కువ మంది వస్తే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అయితే రైతునేస్తం సదుపాయం ఉన్న ఊరి రైతులే కాకుండా పక్క ఊళ్ల రైతులు కూడా రావడంతో అందులోనే సర్దుకుపోయిన సందర్భాలు లేకపోలేదు.
జిల్లాలో..
రైతు వేదికలు : 101
రైతునేస్తం కొనసాగుతున్నవి: 17
కొత్తగా ప్రారంభించినవి : 32
సదుపాయం లేనివి : 52
సాగు సమస్యలు పరిష్కారం
రైతు నేస్తంతో సాగులో తలెత్తే సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించుకోవచ్చు. అధికారులే కాకుండా అనుభవజ్ఞులు, సీనియర్లు పాల్గొంటారు. రైతునేస్తం సమస్యల పరిష్కారానికి మంచి వేదిక. రైతులు సైతం తమ అనుభవాలు పంచుకోవచ్చు.
– శ్రీధర్ స్వామి, జిల్లా వ్యవసాయాధికారి