breaking news
Window grille
-
పడిపోయినా ప్రాణాలు ‘పది’లం!
బుధవారం ఉదయం.. సూరత్లోని జహంగీర్పురా ‘టైమ్స్ గెలాక్సీ’ అపార్ట్మెంట్ వాసులకు ఒళ్లు జలదరించే దృశ్యంతో ఆరోజు తెల్లారింది. నిశ్శబ్దంగా ఉండే ఆ ప్రాంతం ఒక్కసారిగా హాహాకారాలతో నిండిపోయింది. అందరూ తలెత్తి ఆకాశం వైపు భయం భయంగా చూస్తున్నారు. అక్కడ.. ఎనిమిదో అంతస్తు కిటికీ గ్రిల్కు ఒక మనిషి తలకిందులుగా వేలాడుతున్నాడు.అసలేం జరిగింది? సూరత్: 57 ఏళ్ల నితిన్ భాయ్ అడియా తన పదో అంతస్తు ఫ్లాట్లో కిటికీ పక్కనే గాఢ నిద్రలో ఉన్నారు. నిద్రలో అటు ఇటు దొర్లుతూ, ప్రమాదవశాత్తు కిటికీలోంచి ఒక్కసారిగా బయటకు జారిపోయారు. పదో అంతస్తు అంటే దాదాపు వంద అడుగుల పైచిలుకు ఎత్తు. అక్కడి నుంచి పడితే ప్రాణాలు దక్కడం అసాధ్యం. కానీ, ఆయన అదృష్టం బావుంది. కిందకు పడిపోతున్న వేగంలో, సరిగ్గా ఎనిమిదో అంతస్తు కిటికీకి ఉన్న గ్రిల్ బాక్స్లో ఆయన కాలు బలంగా ఇరుక్కుపోయింది.తలకిందులుగా గంటపాటు.. శరీరం మొత్తం గాలిలో.. ఒకే ఒక్క కాలు ఆ ఇనుప ఊచల మధ్య ఇరుక్కుపోయింది. తలకిందులుగా వేలాడుతూ, కాలి నొప్పిని భరిస్తూ ఆయన దాదాపు గంట కాలం మృత్యువుతో ఆయన పోరాడారు. ఏ క్షణమైనా పట్టు తప్పితే ప్రాణాలు గాల్లో కలిసిపోయే స్థితి. ఆ దృశ్యాన్ని చూస్తున్న చుట్టుపక్కల వారి గుండెలు ఆగిపోయినంత పనయ్యింది. సమాచారం అందుకున్న వెంటనే జహంగీర్పురా, పాలన్పూర్, అడాజన్ ఫైర్ స్టేషన్ల నుంచి సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కింద జనం రక్షణ వలలు పట్టుకోగా, అగి్నమాపక సిబ్బంది పదో అంతస్తు నుంచి తాళ్లు, సేఫ్టీ బెల్టులతో కిందకు దిగారు. గాలిలో వేలాడుతున్న నితిన్ భాయ్ను చాకచక్యంగా పట్టుకుని, ఆయన కాలిని గ్రిల్ నుంచి తప్పించారు. సురక్షితంగా ఎనిమిదో అంతస్తు కిటికీ గుండా అతన్ని లోపలికి లాగారు. వెనుదిరిగిన మృత్యువు నితిన్ భాయ్ సురక్షితంగా లోపలికి వెళ్లగానే అపార్ట్మెంట్ నివాసితులంతా ఆనందంతో కేరింతలు కొట్టారు. ప్రాణాలతో బయటపడటం ఒక ఎత్తైతే, ఆ గంట సేపు ఆయన చూపిన ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అజాగ్రత్త ప్రాణాల మీదకు తెస్తుంది.. కానీ అదృష్టం కలిసొస్తే మృత్యువు కూడా వెనుదిరుగుతుందని ఈ ఘటన నిరూపించింది. -
కిటికీ గ్రిల్స్ తొలగించి చోరీ
కోవూరు: ఇంటి మేడపై నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగలు కిటికీ గ్రిల్స్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని రెండు బీరువాల్లో ఉన్న రూ.5 లక్షల నగదు, 30 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు. ఈ ఘటన కోవూరు మండలంలోని సత్యవతినగర్లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. ఏఎస్పేట విశ్రాంత ఎంఈఓ మహబూబ్జానీ కుటుం బసభ్యులకు ఆరోగ్యం సక్రమంగా లేక కర్నూలులోని అమృత న్యూరో హాస్పిటల్లో చికిత్స చేయించుకొంటున్నారు. గురువారం రాత్రి మహబూబ్జానీ కుమారుడు అశ్విత్ఖాన్ దూరబంధువైన ఇలియాజ్తో కలిసి ఇంట్లో మేడ మీద ఓ గదిలో నిద్రపోయారు. తెల్లవారుజామున కిందకు వచ్చి చూసే సరికి ఇంట్లో ఉన్న వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాను పగులకొట్టి అందులో ఉన్న రూ.5 లక్షల నగదు, 30 సవర్ల బంగారు నగలతోపాటు రెండు లాప్ టాప్లు, ఒక ట్యాబ్ తీసుకువెళ్లినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇలాంటి చోరీలు జిల్లాలో నాలుగైదు జరిగాయని ఓఎస్డీ విఠలేశ్వర్రావు తెలిపారు. ఆయన వెంట సీఐలు శ్రీనివా సులురెడ్డి, క్రైమ్ బ్రాంచ్ సీఐతోపాటు కోవూరు ఎస్ఐ వెంకట్రావు, క్లూస్టీం ఇన్చార్జి రవీంద్రరెడ్డి ఉన్నారు. -
కిటికీ గ్రిల్స్ తొలగించి భారీ చోరీ
- 53 తులాల బంగారం, కిలోవెండి, రూ. 2 లక్షల నగదు అపహరణ - వివరాలు సేకరించిన ఏసీపీ రఫీక్, క్లూస్ టీం - కుటుంబీకులు ఇంట్లో నిద్రిస్తుండగానే చొరబడిన దొంగలు జవహర్నగర్: కుటుంబీకులు ఇంట్లో నిద్రిస్తుండగానే దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి చొరబడిన దొంగలు 53 తులాల బంగారం, కిలో వెండితో పాటు రూ. 2 లక్షల నగదు అపహరించుకుపోయారు. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ డివిజన్ పరిధిలోని యాప్రాల్ తులసి గార్డెన్లోని డూప్లెక్స్ నంబర్ 53లో నివాసముంటున్న ఓ వ్యాపారవేత్త కంపెనీ పనిమీద శుక్రవారం ఢిల్లీకి వెళ్లాడు. ఆయన భార్య తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లోని పైగదిలో నిద్రిస్తోంది. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంటి కిందిపోర్షన్ వెనక భాగంలోని కిటికీ గిల్స్ తొలగించి లోపలికి చొరబడి చోరీకి పాల్పడ్డారు. శనివారం ఉదయం ఆమె కింది పోర్షన్లో ఉన్న బెడ్రూంలోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. ఇంట్లో ఉన్న 53 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, రూ. 2 లక్షల నగదు పాటు విలువైన సామగ్రి చోరీ అయిందని ఆమె గుర్తించింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ, క్లూస్టీం ఆదివారం ఆలస్యంగా సమాచారం అందుకున్న అల్వాల్ ఏసీసీ రఫీక్, సీఐ వెంకటగిరి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం క్లూస్ టీంను రప్పించి ఇంటి పరిసరాల్లో పరిశీలించారు. స్థానికులే చోరీకి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కాగా పూర్తి వివరాలు వెల్లడించేందుకు బాధితులు నిరాకరించారు. దాదాపు 100 డూప్లెక్స్ ఇళ్లు ఉన్న తులసి గార్డెన్లో సీసీ కెమెరాలు అసలే లేవు. ఈమేరకు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
45 తులాల బంగారం పైనే ఎత్తుకెళ్లారు..
పోలీసులకు ఫిర్యాదు చేసిన యజమాని నాగోలు: కిటికీ గ్రిల్స్ తొలగించి ఇంట్లోని నగలు చోరీ చేసి.. ఆపై నిప్పుపెట్టిన ఘటనలో 45 తులాలకు పైనే బంగారం చోరీ అయినట్టు తేలింది. అబూదాబీ నుంచి ఆదివారం ఉదయం నగరానికి వచ్చిన ఇంటి యజమాని గొట్టేటి గంగయ్య ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం... ఎల్బీనగర్ నవోదయకాలనీకి చెందిన జి.గంగయ్య, సరళ భార్యాభర్తలు. గంగయ్య అబూదాబీలో కెమికల్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన పెద్ద కుమారుడు రఘువీర్ పాలెం బస్సు ప్రమాదంలో చనిపోయాడు. అమెరికాలో ఉంటున్న మరో కుమారుడు, కుమార్తె వద్దకు గంగయ్య భార్య గత సెప్టెంబర్లో వెళ్లింది. ఈ క్రమంలో ఆమె కొంత బంగారాన్ని లాకర్లో పెట్టి.. మిగతా 45 తులాల బంగారాన్ని ముంబైలో ప్రత్యేకంగా తయారు చేయించిన బీరువాలో భద్రపరిచి అమెరికా వెళ్లింది. ఇంటి బాధ్యతలను సమీపంలో ఉండే నల్లగొండ జిల్లా చందుభట్లకు చెందిన ఎల్లయ్యకు అప్పగించారు. ఇదే ఇంట్లో సరళ సోదరి గంగ కొన్ని రోజులు ఉండి టెట్ పరీక్షకు సిద్ధమై వెళ్లిపోయింది. శనివారం తెల్లవారుజామున గంగయ్య ఇంట్లో నుంచి పొగ రావడంతో స్థానికులు గమనించి ఫైరింజిన్, ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఎల్లయ్య వచ్చి తాళం తీసి చూడగా ఇంట్లోని బీరువా పగులగొ ట్టి ఉంది. ఇంట్లోని చీరలు, కంప్యూటర్, ఏసీ, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతై ఉన్నాయి. ఈ విషయాన్ని అబుదాబీలో ఉండే గంగయ్యకు సమాచారం అందించాడు. ఆదివారం ఇంటికి చేరుకున్న గంగయ్య బీరువాలో దాచిన 45 తులాల బంగారు నగలు, మూడు ల్యాప్టాప్లు, అర కేజీ వెండి, మూడు కెమెరాలు చోరీకి గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఇంత పెద్ద చోరీ జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


