breaking news
Wheat bread
-
గోధుమపిండితో చేసిన వంటకాలు తింటున్నారా..?
గోధుమపిండి, విదేశాలలోనైతే బార్లీ, రై వంటి ధాన్యాల పిండితో చేసే వంటల్లో... ఉదా: మన రోటీలూ, పూరీలతో పాటు పాశ్చాత్యపద్ధతుల్లో చేసే బ్రెడ్, పాస్తా, కేకులు, బిస్కెట్ల వంటివి తిన్నప్పుడు ‘సీలియాక్ డిసీజ్’ కారణంగా కొంతమందిలో కడుపునకు సంబంధించిన సమస్యలు కనిపిస్తాయి. ఆ ధాన్యాల పిండిలో ఉండే గ్లూటెన్ కారణంగా ఇలా జరుగుతుంది. గ్లూటెన్ అంటే...? పిండి కలపడానికి ముందుగా దాన్ని రాశిలా పోసి మధ్యలో గుంట చేసి అందులో కాసిన్ని నీళ్లు పోస్తాం కదా... ఆ పిండిని కలపడం మొదలుపెట్టగానే కాసేపట్లో అది ముద్దగా మారుతుంది. పిండిలో స్వాభావికంగా ఉండే జిగురులాంటి స్వభావాన్నిచ్చే ఓ ప్రోటీనే ఇలా పిండిముద్దలా మార్చేందుకు దోహదం చేస్తుంది. అదే ‘గ్లూటెన్’. కొందరికి ఇది సరిపడదు. గ్లూటెన్ సరిపడని స్వభావాన్నే ‘గ్లూటెన్ ఇన్ టాలరెన్స్’ అంటారు. (ఇలాంటివారి కోసం... గ్లూటెన్ను వేరుచేసి పిండిని తయారు చేస్తుంటారు. దీన్ని ‘గ్లూటెన్ ఫ్రీ’ పిండి అని అంటుంటారు. మరికొన్ని రకాల పిండి లో స్వాభావికంగానే గ్లూటెన్ ఉండదు. దాంతో వారికి ఏ ఇబ్బందీ ఉండదు). ఆ ‘పిండి’వంటలు తింటే ఏమవుతుందంటే... గ్లూటెన్ ఉన్న పిండితో చేసిన పదార్థాలను తిన్నప్పుడు... అది సరిపడని కారణంగా చిన్నపేగుల కణాలు తీవ్రమైన రియాక్షన్ను చూపుతాయి. దాంతో చిన్నపేగుల్లోని ‘మైక్రోవిల్లై’ అనే భాగాలు దెబ్బతింటాయి. జీర్ణమైన ఆహారాన్ని పీల్చుకునే అవి దెబ్బతినడంతో... తిన్నవి ఒంటబట్టకపోవడం, దేహానికి శక్తి సమకూరకపోవడం, ఎముకలకు కావల్సినంత బలం దొరకకపోవడం, మహిళల్లో సంతానలేమి, గర్భస్రావాలు, కొన్ని నరాలకు సంబంధించిన సమస్యలు కనిపిస్తాయి. మొదట్లో సరిపడకపోయినా ఆ తర్వాత్తర్వాత నెమ్మదిగా జీర్ణవ్యవస్థ దానికి అలవాటు కావడం మొదలుపెడుతుంది. అలా జరగకపోతే చిన్నపేగులు/జీర్ణవ్యవస్థ దెబ్బతినడం మొదలై క్రమక్రమంగా అది సీలియాక్ డిసీజ్గా మారుతుంది. జీర్ణవ్యవస్థ గ్లూటెన్కు అలవాటు కాకపోవడంతో వచ్చే సమస్యను ‘రిఫ్రాక్టరీ లేదా నాన్ రెస్పాన్సివ్ సీలియాక్ డిసీజ్’గా చెబుతారు. లక్షణాలు: సీలియాక్ డిసీజ్ కూడా ఒకరకమైన ఫుడ్ అలర్జీ లాంటిదే. అయితే దీని లక్షణాలు వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటాయి. అవి... ►కడుపులో నొప్పి, గ్యాస్ నిండటంతో కడుపు ఉబ్బరం. దాంతో ఛాతీనొప్పి, ఛాతీలో / గుండెల్లో మంట ∙వికారం ►తలనొప్పి, ఒంటి మీద దురదతో కూడిన ర్యాష్ (దీన్ని డాక్టర్లు డెర్మటైటిస్ హెర్పెటోఫార్మిస్ అంటారు) ►కొందరిలో నోట్లో పుండ్లు ►రక్తహీనత ►కొందరిలో నీళ్ల విరేచనాలు / మరికొందరిలో మలబద్ధకం / దుర్వాసనతో కూడిన మలవిసర్జన ►తిన్నది ఒంటబట్టకపోవడంతో బరువు తగ్గడం. దుష్ప్రభావాలు... ఆహారం సరిగా ఒంటబట్టకపోవడంతో మరికొన్ని దుష్ప్రభావాలూ కనిపించవచ్చు. అవి... కొందరిలో దంతాలపై ఎనామెల్ దెబ్బతినడం ∙చిన్న పిల్లల్లో (అబ్బాయిలూ, అమ్మాయిల్లో) పెరుగుదల కాస్త మందగించడం ∙కొందరిలో పాలు సరిపడకపోవడం (లాక్టోజ్ ఇన్టాలరెన్స్) ∙ఎముకలు బలహీనంగా మారడం ∙అరుదుగా కొందరిలో నరాల సమస్య రావడంతో చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, స్పర్శ సరిగా తెలియకపోవడం, కాళ్లలో సమస్య తీవ్రంగా ఉంటే సరిగ్గా నిలబడలేకపోవడం వంటి సమస్యలు. నిర్ధారణ: ఆటో ఇమ్యూన్ రుగ్మతలను తెలుసుకునే కొన్ని రకాల రక్తపరీక్షల (యాంటీబాడీస్ అన్వేషించే సీరాలజీ పరీక్షల)తో పాటు ఎర్ర రక్తకణాల సంఖ్యను తెలుసుకునేందుకు చేసే రక్తపరీక్షలు దేహంలో ఇన్ఫ్లమేషన్ ఉందని తేలినప్పుడు చేసే సీ–రియాక్టివ్ ప్రోటీన్ పరీక్ష కాలేయం పనితీరు కోసం ‘లివర్ ఫంక్షన్ టెస్ట్’ పేగుల్లోని ఫ్యాటీ యాసిడ్స్ తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు ∙విటమిన్–డి, విటమిన్ బి–12 ల మోతాదును తెలుసుకునే పరీక్షలు అవసరాన్ని బట్టి ఎండోస్కోపీ పేగుల పరిస్థితిని తెలుసుకునే కొన్ని ఇమేజింగ్ పరీక్షలతో పాటు అవసరాన్ని బట్టి కొన్ని జన్యుపరీక్షలతో సమస్యను నిర్ధారణ చేస్తారు. డాక్టర్ ధీరజ్ కుమార్ అనుప, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ (చదవండి: హషిమోటో థైరాయిడైటిస్ గురించి విన్నారా? ఎందువల్ల వస్తుందంటే..) -
సెనగ తినగ
పట్టీలంటే మనకు తెలిసినవల్లా కాళ్లకు వెండి పట్టీలు... నాల్కకు పల్లీపట్టీలు కానీ శనగలతోనూ టేస్టీగా పట్టీలు ఒత్తుకోవచ్చు!రోటీలంటే మన మటుకు మనం ఎరిగినవి గోధుమరొట్టె, జొన్నరొట్టె లేదా మినపరొట్టెలే. అయితే శనగరోటీలనూ కాల్చుకోవచ్చు! వడలంటే మనమెరిగినవి పెసరవడలూ, గారెలే. కానీ ఒడలు పులకరింపజేసే శనగవడలూ చేసుకోవచ్చు. ఆత్మారాముడు... అదేనండీ సోల్ శాంతించేలా రోల్స్... మనసు పొంగేలా శనగపొంగలీ వండుకోవచ్చు. ఇవన్నీ తనివితీరేలా తినేయవచ్చు... తేన్చేయవచ్చు.కానీ ఒక్కటి మాత్రం ష్యూర్... ఈ శనగ ఐటమ్స్లో ఏది చూసినా... ఏది తిన్నా అటు రుచుల వానతో... ఇటు లాలాజలవర్షంతో నోరంతా చిరపుంజీ అయిపోవడం ఖాయం. కాసేపట్లో ప్లేట్లోనివి మాయం అయిపోవడమూ ఖాయం. పట్టీస్ కావల్సినవి: ఆలివ్ ఆయిల్ – టేబుల్ స్పూన్; క్యారట్ తరుగు – 2 టీ స్పూన్లు; ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి రెబ్బలు – 4 (కచ్చాపచ్చాగా దంచాలి); ఉప్పు – తగినంత; ఉడికించిన సెనగలు – కప్పు; బ్రెడ్ క్రంబ్స్ పొడి – 2 టేబుల్ స్పూన్లు; నిమ్మరసం – టీ స్పూన్; సోంపు (కచ్చాపచ్చాగా దంచాలి) – అర టీ స్పూన్; మిరియాల పొడి – చిటికెడు తయారీ: కడాయిలో ఆలివ్ ఆయిల్, కూరగాయల ముక్కలు వేసి ఉడికించాలి. ఉడికించిన శనగలను వడకట్టి, గరిటెతో లేదా పప్పు గుత్తితో వాటిని కచ్చాపచ్చాగా చిదపాలి. దీంట్లో బ్రెడ్ క్రంబ్స్ పొడి, సోంపు, ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి వేసి కలపాలి. కూరగాయల మిశ్రమం చల్లారిన తర్వాత శనగల మిశ్రమంలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చేత్తో ఉండలుగా చేసి, అదిమి పెనం మీద రెండువైపులా కాల్చుకోవాలి. వడల్లాగ నూనెలో వేసి కూడా వేయించుకోవచ్చు. గుగ్గిళ్లు కావల్సినవి: ఉడికించిన శనగలు – కప్పు; ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి రెబ్బలు – 4 (కచ్చాపచ్చాగా దంచాలి); ఉప్పు – తగినంత; ఆలివ్ ఆయిల్ – టేబుల్ స్పూన్; కరివేపాకు – రెమ్మ; నిమ్మరసం – టీ స్పూన్; నూనె – రెండు టీ స్పూన్లు; ఎండుమిర్చి – 2 ; పచ్చిమిర్చి – 1 (నిలువుగా కట్ చేయాలి); కొత్తిమీర – టీ స్పూన్; పోపు గింజలు – అర టీ స్పూన్ తయారీ: కడాయిలో నూనె వేసి, వేడయ్యాక పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, వెల్లుల్లి వేయించాలి. దీంట్లో ఉడికించిన శనగలు, ఉప్పు వేసి కలపాలి. చివరగా కొత్తిమీర చల్లి దించాలి. పైన నిమ్మరసం పిండి సర్వ్ చేయాలి. రోల్స్ కావలసినవి: సెనగలు – కప్పు; సెనగపప్పు – ఒకటిన్నర టీ స్పూన్; యాలకులు – 2; దాల్చిన చెక్క – చిన్నముక్క; నూనె – 4 టేబుల్ స్పూన్లు; తరిగిన ఉల్లిపాయలు – ముప్పావు కప్పు; టొమాటో తరుగు – ముప్పావు కప్పు; అల్లం తరుగు – టీ స్పూన్; పచ్చిమిర్చి తరుగు – ఒకటిన్నర టీ స్పూన్; ధనియాల పొడి – టీ స్పూన్; కారం – అర టీ స్పూన్; గరం మసాలా – అర టీ స్పూన్; చోలే మసాలా – ముప్పావు టీ స్పూన్; ఉప్పు – తగినంత; రోటీస్ – 2, గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలు – కొన్ని తయారి: రాత్రిపూట సెనగలు కడిగి, తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. ఉదయాన ప్రెషర్ కుకర్లో వడకట్టిన సెనగలు, ఒకటిన్నర కప్పు నీళ్లు, యాలకులు, దాల్చిన చెక్క వేసి మూత పెట్టి 3 విజిల్స్ పెద్ద మంట మీద, మరో మూడ్ విజిల్స్ సన్నని మంట మీద ఉంచి దించేయాలి. కడాయి స్టౌ మీద పెట్టి నూనె వేసి, కాగాక ఉల్లిపాయలు వేయించాలి. దీంట్లో టోమాటో, అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసి మూడు నిమిషాల సేపు వేయించాలి. దీంట్లో ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. మిశ్రమం బాగా ఉడికి, నూనె పైకి తేలాలి. అప్పుడు ఉడికిన సెనగలు, మసాలా, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు, ఉప్పు వేసి సన్నని మంట మీద మళ్లీ ఉడికించాలి. గ్రేవీ పూర్తిగా పొడిబారేంతవరకు స్టౌ మీదే ఉంచాలి. ఒక గిన్నెలో గుండ్రంగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా వేసి కలపాలి. రోటీ మధ్యలో పైన ఉల్లిపాయ రింగులు, ఆ పైన సిద్ధంగా చేసుకున్న శనగల మిశ్రమాన్ని ఉంచి, రోటీ మొత్తం సెట్ అయ్యేలా స్పూన్తో సర్దాలి. పైన కొత్తిమీర, ఉల్లిపాయల తరుగు వేసి రోటీ చివరలు పట్టుకొని 3 సార్లు చుట్టాలి. దీని చుట్టూత టిష్యూ పేపర్ని చుట్టి, వెంటనే అందించాలి. పొంగలి కావలసినవి: సెనగలు – రెండు కప్పులు (నానబెట్టినవి); పాలు – 6 కప్పులు; బెల్లం – ఒకటిన్నర కప్పు; నెయ్యి – తగినంత; జీడిపప్పు – 10; కిస్మిస్ – 10; ఏలకులు – 5, కొబ్బరి తురుము – అరకప్పు. తయారి: ముందుగా సెనగలను నానబెట్టుకొని వాటిలోంచి ఒకటిన్నర కప్పుల శనగలను తీసుకునిమెత్తగా రుబ్బుకోవాలి. స్టౌ మీద మూకుడు ఉంచి అందులో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్లను వేయించుకుని తీసేయాలి. తరవాత అందులోనే గోధుమరవ్వ వేయించి తీయాలి. మరికాస్త నెయ్యి వేసి, రుబ్బిన సెనగలముద్దను వేసి వేయించాలి. కొద్దిగా వేగిన తరవాత అందులో గోధుమరవ్వ, పాలుపోసి ఉడికించాలి. మిగిలిన శనగలు, బెల్లం, వేయించి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేయాలి. దించేముందు కొబ్బరితురుము, ఏలకులపొడి వేయాలి. ఇది వేడివేడిగా తింటే మంచిరుచిగా ఉంటుంది. రోటీ కావలసినవి: గోధుమపిండి – 250గ్రా.; సెనగలు – 100గ్రా.; ఉప్పు – తగినంత; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; జీలకర్రపొడి – 2 టీ స్పూన్లు; కారం – 2 టీ స్పూన్లు; నూనె – తగినంత. తయారి: సెనగలను ఒకరోజు రాత్రంతా నానబెట్టుకోవాలి. నానిన సెనగలను శుభ్రంగా నీళ్లతోకడిగి కుకర్లోపెట్టి నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉంచి దించేయాలి. సెనగలు చల్లారిన తరవాత మిక్సీలో వేసి మెత్తగారుబ్బుకోవాలి. ఈ మెత్తగా రుబ్బిన సెనగల ముద్దలోగోధుమపిండి వేసి కలపాలి. తరవాత ఇందులో తగినంత ఉప్పు, ధనియాలపొడి, జీలకర్రపొడి, కారం, కొద్దిగా నూనె వేసి అన్నీ కలిసేలా కలపాలి. తరవాత కొద్దిగా నీరు పోస్తూ చపాతీపిండిలా కలుపుకుని గంటసేపు నాననివ్వాలి. తరవాత ఈ పిండిని ఉండలుగా చేసుకుని చపాతీలాగ ఒత్తి పెనం మీద వేసి నెయ్యితో కాని నూనెతో కాని కాల్చుకోవాలి. ఈ రోటీలను ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర పచ్చిమిర్చి, పెరుగు లేదా టొమాటో సాస్తో కాని, పుదీనా చట్నీతో కాని తింటే రుచిగా ఉంటాయి. వడలు కావలసినవి: శనగలు – 250 గ్రా.; పచ్చిశనగపప్పు – 100 గ్రా.; బియ్యం – గుప్పెడు; పచ్చిమిర్చి – 5; ఉల్లిపాయలు – 2; కరివేపాకు – రెండురెమ్మలు; కొత్తిమీర – చిన్నకట్ట; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారి: ఒకరోజు రాత్రంతా శనగలను ఒక గిన్నెలో, పచ్చిశనగపప్పు బియ్యం కలిపి మరొక గిన్నెలో నానబెట్టాలి. ఉదయాన్నేవాటిని శుభ్రంగా కడిగి నీరు ఒంపేసి, విడివిడిగానే మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఈ రుబ్బిన వాటిని ఒక గిన్నెలో వేసి అందులో పచ్చిమిర్చితరుగు, ఉల్లితరుగు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి. బాణలిలో నూనె పోసి బాగా కాగాక, కలిపి ఉంచుకున్న ఈ ముద్దను వడల మాదిరిగా చేత్తో ఒత్తి, నూనెలో వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి, టిష్యూ పేపర్మీదకు తీసుకోవాలి. వీటిని టొమాటో సాస్ లేదా టొమాటో కెచప్తో తింటే బావుంటాయి.