అమెరికాలో వైద్యం!
బాలీవుడ్ నాయికల్లో సూపర్స్టార్ ఎవరు? అంటే సమాధానం ‘కరీనా కపూర్’. కొత్తదనం కోసం పరితపించడం కరీనా ప్రత్యేకత. రెండుమూడేళ్ల క్రితం ఆమె జీరో సైజ్ చేశారు. అప్పట్నుంచీ బాలీవుడ్ కథానాయికలందరూ ఆమె బాటే పట్టారు. అయితే... ఇదంతా రెండుమూడేళ్ల నాటి ముచ్చట. ఇప్పుడైతే... ఆమె జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. దీపిక, కత్రినా, కంగనా... ప్రస్తుతం హంగామా అంతా వీరిదే. వీళ్ల వేగాన్ని అందుకోవడం కరీనాకు కష్టంగానే ఉంది. దానికి కారణం... పెళ్లయ్యాక ఆమె బరువు పెరగడమే. వైవాహిక జీవితం తన నట జీవితాన్ని పూర్తిస్థాయిలో డామినేట్ చేస్తోందని, దాంతో కెరీర్పై కరీనా సరిగ్గా ఏకాగ్రత చూపించలేకపోతోందని ఆమె సన్నిహితులే చెప్పుకుంటున్నారు.
ఇటీవల కొన్ని సందర్భాల్లో మీడియాకు చిక్కిన కరీనా స్టిల్స్ కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అందుకే... ఈ సమస్య నుంచి త్వరితగతిన బయటపడటానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు కరీనా. ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా.... శరీరంలోని అదనపు కొవ్వును ఆరోగ్య కరంగా కరిగించే అత్యాధునిక చికిత్స ప్రస్తుతం అమెరికాలో అందుబాటులో ఉందని తెలుసుకొని, తన బరువును తగ్గించుకోవడం కోసం అమెరికా వెళ్లారామె. వెళ్లడమే కాదు, అక్కడే వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండి, తన బరువును తగ్గించుకుని, మళ్లీ నాజూకుగా, ముంబయ్లో అడుగుపెట్టారు. ఇప్పుడు కరీనా మునుపటి అందంతో మెరిసిపోతున్నారని బాలీవుడ్ టాక్. సాటి కథానాయికలకు దీటైన పోటీ ఇవ్వడానికి ప్రస్తుతం కరీనా సమాయత్తమవుతున్నట్లు వినికిడి.