breaking news
Water shares
-
ముందుగానే సయోధ్య
♦ కృష్ణా నీటి వివాదాలపై రంగంలోకి కేంద్రం ♦ ఏపీ, తెలంగాణతో 21న కేంద్ర జల వనరుల శాఖ సమావేశం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ పరీవాహకం పరిధిలోని ప్రాజెక్టుల్లో నీటి వాటాలు, విని యోగాలపై తెలంగాణ, ఏపీల మధ్య నలుగుతున్న వివాదాల పరిష్కారానికి కేంద్ర రంగంలోకి దిగింది. కృష్ణా పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు, వాటి నిర్వహణ, వాటాల అంశాలపై ఈ నెల 21న ఢిల్లీలో నిర్వహించే సమావేశంలో రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుని 2016-17 ఏడాది వర్కింగ్ మాన్యువల్ను సిద్ధం చేయనుంది. ఈ మేరకు కేంద్ర జల వనరుల శాఖ అదనపు కార్యదర్శి అమర్జిత్సింగ్ ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ముఖ్య కార్యదర్శులకు సమావేశం విషయమై సోమవారం లేఖల ద్వారా సమాచారం అందించారు. బోర్డు పరిధిలోనే తాత్కాలిక నియంత్రణ కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల నిర్వహణ, బోర్డు పర్యవేక్షణపై రెండేళ్లుగా అస్పష్టత కొనసాగుతోంది. బోర్డు పరిధి, మార్గదర్శకాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. గత ఏడాది నాగార్జునసాగర్ నీటి విడుదల, శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి తదితరాలపై ఏపీ, తెలంగాణల మధ్య వివాదం ఉన్న దృష్ట్యా, శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవాలని తాజాగా కేంద్రానికి ఏపీ విన్నవించింది. వీటితో పాటే హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు వద్ద మెజరింగ్ పాయింట్లు ఉండటానికి అభ్యంతరం లేదని, నెట్టెంపాడు, కోయిల్సాగర్, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ వద్ద కూడా నీటి వినియోగాన్ని లెక్కగట్టాలని, బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు, అందుకు అనుగుణంగా జారీ అయిన జీవోలు, రూపొందించిన నిబంధనల మేరకు నీటి వినియోగం ఉండాలని కోరుతోంది. దీనిపై సానుకూలంగా స్పందించిన బోర్డు ప్రాజెక్టులను నోటిఫై చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం రాజకీయంగా అడ్డుకుంది. దీంతో ప్రాజెక్టుల నియంత్రణ నోటిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే గత ఏడాది జూన్ 18, 19 తేదీల్లో కుదిరిన వర్కింగ్ మాన్యువల్పై మాత్రం త్వరలోనే ఇరు రాష్ట్రాలతో సమవేశం ఏర్పాటు చేస్తామన్న కేంద్రం.. అందుకు అనుగుణంగా ఈ నెల 21న సమావేశ తేదీని నిర్ణయించింది. ప్రాజెక్టులను తాత్కాలికంగా బోర్డు నియంత్రణలో ఉంచాలని, నీటి విడుదల, వినియోగం, వాటా మేరకు పంపకం తదితర అంశాలపై బోర్డు పర్యవేక్షణ ఉండాలని తెలంగాణ కోరుతోంది. అయితే దీనిపై ఏపీ ఎలాంటి అభిప్రాయం చెబుతుందన్నది ప్రశ్న. ఒకవేళ మార్పులు కోరితే, తెలంగాణ సైతం పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులతో తెలంగాణకు వచ్చే నీటి వాటాలపై పట్టుబట్టడం ఖాయమని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి. -
ఇప్పుడైనా ఆర్డీఎస్కు నీరందేనా..?
సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)తో రాష్ట్రానికి రావాల్సిన వాస్తవ నీటి వాటాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీతో ఉన్న వివాదాన్ని కేంద్ర సహకారంతో చక్కదిద్దుకునే ప్రయత్నం చేసిన రాష్ట్రం.. వాటా మేరకు నీటిని వినియోగంలోకి తెచ్చి నిర్ణీత ఆయకట్టుకు సాగునీరిచ్చే యత్నాలకు పూనుకుంది. కేంద్రం ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ఏపీ సహకారం అందిస్తే ఆర్డీఎస్ కింద బ్యారేజీ నిర్మించి రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడే దిశగా కసరత్తు చేస్తోంది. అవసరమైతే దీనిపై మరోమారు ఏపీతో, కర్ణాటకతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది. వాస్తవానికి ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. ఈ నీటిలో కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 7 టీఎంసీలు, పరీవాహకం నుంచి మరో 8 టీఎంసీలు లభ్యమవుతోంది. అయితే కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించినమేర నీరు రావడం లేదు. ఈ దృష్ట్యా ఆర్డీఎస్ ఆనకట్ట పొడవును మరో 5 అంగుళాల మేర పెంచాలని నిర్ణయించగా, ఇందుకు కర్ణాటక అంగీకరించింది. అలాగే కాల్వల ఆధునీకరణ కోసం కర్ణాటకకు రాష్ర్టం రూ.72 కోట్ల మేర డిపాజిట్ కూడా చేసింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీకరణ పనులకు అడ్డు తగులుతుండడంతో 4 టీఎంసీలు మాత్రమే రాష్ట్రానికి అందుతున్నాయి. దీంతో 37 వేల ఆయకట్టుకు సాగునీరందుతోంది. ఈ విషయాన్ని ఇటీవల ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం దృష్టికి తీసుకురాగా, నిర్ణీత నీటిని తెలంగాణ వాడుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఇందుకు తాము సహకరిస్తామని ఏపీ స్పష్టం చేసింది. బ్యారేజీ నిర్మిస్తే మేలంటున్న తెలంగాణ.. ఆర్డీఎస్ కింద ఉన్న నీటి కేటాయింపులను వాడుకునేందుకు బ్యారేజీ నిర్మిస్తే మేలని ప్రభుత్వం భావిస్తోంది. బ్యారేజీ అయితేనే లక్ష్యం మేర ఆయకట్టుకు నీటిని అందించవచ్చని చెబుతోంది. బ్రజేష్ ట్రిబ్యునల్ సైతం కొత్తగా తుంగభద్ర నుంచి 4 టీఎంసీల నీటిని అదనం గా ఏపీలోని కేసీ కెనాల్కు కేటాయించిన దృ ష్ట్యా, ఆ నీటిని ఈ బ్యారేజీ ద్వారా అందించవచ్చు. బ్యారేజీ నిర్మాణంలో ఏపీ సైతం భాగస్వామ్యం కావాలని రాష్ట్రం అంటోంది.