breaking news
Wanted criminals
-
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
భువనగిరి :స్నేహితులతో కలిసి ఆవారాగా తిరిగే ఓ యువకుడు జల్సాలకు అలవాటుపడ్డాడు. సరదాలను తీర్చుకునేందుకు దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు..చిల్లర దొంగతనాల నుంచి అంతర్రాష్ట్ర స్థాయికి ఎదిగాడు..ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడ్డాడు. వాంటెండ్ క్రిమినల్గా మారి, చివరకు పోలీసులకు చిక్కాడు. భువనగిరి రూరల్ సీఐ జువ్వాజి నరేందర్గౌడ్ శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్ సతీష్రెడ్డితో కలిసి శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం సర్వాయ్పాడు పాతబంజర్ గ్రామానికి చెందిన పోడియం మాధవరావు స్వగ్రామంలోనే 8వ తరగతి వరకు చదువుకున్నాడు. స్నేహితులతో కలిసి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. మొదటి దొంగతనం స్వగ్రామంలోని కిరాణ దుకాణంలో చేసి పోలీసులకు చిక్కాడు.18 నెలల శిక్ష అనుభవించిన అనంతరం గత ఏడాది జూలై 4వ తేదీన జైలు నుంచి విడుదలయ్యాడు. బయటికి వచ్చిన మాధవరావు నల్లగొండ, మహబూబ్నగర్, మెదక్, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో సుమారు 24 కేసుల్లో 10 లక్షలకు పైగా సొత్తును అపహరించాడు. ఆ డబ్బుతో బైక్ కొనుగోలు చేయడమే గాకుండా తన స్నేహితుడు బాలకృష్ణ ఇండికా కారుకనుగోలు చేసేందుకు రూ.లక్ష అప్పు ఇచ్చాడు. అన్ని చోరీలు ఒంటరిగానే... మాధవరావు ఒంటరిగానే దొంగతనాలు చేసేవాడు. ఎవరి సహాయం తీసుకోడు. తన స్నేహితుడు కారులో ఉదయం చోరీ చేసే దుకాణాల వద్ద రెక్కీ నిర్వహిస్తాడు. రాత్రి వేళల్లో గుట్టుచప్పుడుకాకుండా వచ్చి గడ్డపారతో దుకాణాల షట్టర్లు పైకిలేపి చోరీలు చేసేవాడు. చాకచక్యంగా చోరీలకు పాల్పడుతూ ఏడు జిల్లాల పోలీసులకు సవాల్గా మారాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 18వ తేదీన భువనగిరి మండలం రాయగిరిలో మెయిన్రోడ్డుపై గల వెంకటేశ్వర, నాగార్జున వైన్స్లలో దొంగతనం చేయడానికి ప్రయత్నించి ఓ చోట విఫలమయ్యాడు. అయితే వెంకటేశ్వర వైన్స్ గల్లాపెట్టెనుంచి 2లక్షల రూపాయలు అపహరించుకుపోయాడు. అలాగే గత సంవత్సరం 2013 సెప్టెంబర్ 21వ తేదీ రాత్రి భువనగిరి పట్టణంలోని సనా మెడికల్ దుకాణంలో రూ.1.50 లక్షల నగదు చోరీ చేశాడు. పట్టుబడ్డాడు ఇలా.. నల్లగొండ జిల్లా బీబీనగర్ టోల్గేట్ సమీపంలో శనివారం పోలీస్లు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి బైక్పై వస్తున్న మాధవరావును పోలీసులు తనిఖీ చేశారు. పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో తాను చేసిన దొంగతనాలు ఒక్కొక్కటిగా బయపెట్టాడు. వెంటనే నివా సం ఉంటున్న హైదరాబాద్లోని ముషిరాబాద్కు వెళ్లి అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా సుమారు రూ.3.28 లక్షల నగదు, పల్సర్ మోటార్సైకిల్, ఒక తులం బంగారు గొలు సు, అకాయ్టీవి, హోంథియేటర్, 4 సెల్ఫోన్లు, ఇండికా కారును స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై తెలంగాణ,ఆంధ్రప్రదేశ్లోని ఏడు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. దొంగిలించిన సొత్తుతో కారు కొన్న బాలకృష్ణ, చోరీలకు పాల్పడిన మాధవరావుపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. దొంగను పట్టుకుని సొమ్మును రికవరీ చేయడంలో భువనగిరి రూరల్ ఎస్ఐ భిక్షపతి, ఏఎస్ఐ బాసు, కానిస్టేబుల్ సిరాజ్, రాజు, సిబ్బంది మధు, నర్సింగ్, మహేందర్లు సహకరించారని చెప్పారు. -
ముగ్గురు ముదుర్లు వ్యాపారులపై వసూళ్ల వల
డబ్బు కోసం ఎంతటి ఘోరానికైనా పాల్పడే విక్రమ్ పారస్, నీరజ్ బవానా, అనిల్ గాంజా పేర్లను 2014లో ‘అత్యంత కరడుగట్టిన’ నేరస్తుల జాబితాలో చేర్చినట్టు పోలీసులు ప్రకటించారు. సంపన్నశ్రేణి వ్యాపారులు, రియల్టర్ల దగ్గరి నుంచి బలవంతంగా డబ్బు గుంజడం, అవసరమైతే హతమార్చడాన్ని వృత్తిగా పెట్టుకున్న ఈ కిరాతకుల తలలపై రూ.లక్ష చొప్పున రివార్డు ప్రకటించారు. న్యూఢిల్లీ:విక్రమ్ పారస్, నీరజ్ బవానా, అనిల్ గాంజా.. ఈ ముగ్గురి పేర్లు వింటే ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంత (ఎన్సీఆర్) వ్యాపారులకే కాదు.. నగర పోలీసులకూ ముచ్చెమటలు పడుతున్నాయి. డబ్బు కోసం ఎంతటి ఘోరానికైనా పాల్పడే వీళ్లు, అత్యంత ప్రమాదకర నేరస్తులని అధికారులు చెబుతున్నారు. సంపన్నశ్రేణికి చెందిన వ్యాపారులు, రియల్టర్ల దగ్గరి నుంచి బలవంతంగా డబ్బు గుంజడం, అవసరమైతే హతమార్చడం వీరి వృత్తి. ఎన్నో హత్యలు, బలవంతపు వసూళ్ల కేసుల్లో నిందితులైన విక్రమ్ పారస్, నీరజ్ బవానా, అనిల్ గాంజాను పట్టించిన వారికి రూ.లక్ష చొప్పున నజరానా చెల్లిస్తామని ఢిల్లీ పోలీసుశాఖ ప్రకటించింది. నగరంలో 2014లో ‘అత్యంత కరడుగట్టిన’ 10 మంది నేరస్తుల జాబితాలోని తొలి మూడు పేర్లు వీరివే అంటే ఈ ముగ్గురు ఎలాంటి వాళ్లో సులువుగానే అర్థం చేసుకోవచ్చు. 29 ఏళ్ల పారస్ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉండగా, బవానా, గాంజా మిగతా రెండుస్థానాల్లో ఉన్నారని క్రైంబ్రాంచ్ అధికారులు ప్రకటించారు. తదనంతర స్థానాల్లో సత్యవాన్, కసీముల్లా తదితరులు ఉన్నారు. షార్ప్షూటరైన కసీముల్లా పలు హత్యలు, బలవంతపు వసూళ్లు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ‘ఈ జాబితాకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాం. వీరిలో కొందరు ఘరానా నేరగాళ్లే అయినా, వాళ్లపై ఇతర రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి’ అని క్రైంబ్రాంచ్ సీనియర్ అధికారి ఒకరు వివరించారు. పారస్, గాంజా హర్యానా వాసులు కాగా, బవానా ఢిల్లీలోని బవానా ప్రాంతవాసి. ఈ ముగ్గురిపై 2010 నుంచి 2013 వరకు దాదాపు 16 కేసులు నమోదయ్యాయి. ‘పారస్, బవానా, గాంజా తమను తామే ముఠానాయకులుగా ప్రకటించుకున్నారు. వ్యాపారులు, ప్రజలను భయపెట్టి డబ్బుగుంజే చిల్లర నేరగాళ్లతో కలసి వీళ్లు పనిచేస్తుంటారు. నైరుతి, ఔటర్ ఢిల్లీలోని వ్యాపారులపై ఈ ముఠాలు ఎక్కువ దృష్టి పెడుతున్నాయి’ అని సీనియర్ అధికారి ఒకరు వివరించారు. మళ్లీ ఏకమైన పలు ముఠాలు ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఈ ముఠాల కార్యకలాపాలు పెరుగుతున్నప్పుడల్లా క్రైంబ్రాంచ్, స్పెషల్సెల్ పోలీసులు అప్రమత్తమై, తగు చర్యలు తీసుకుంటున్నారు. పేరుమోసిన నేరగాడు నీతూ దబోడియా మృతి తరువాత కూడా పారస్ అగ్రస్థాయి గ్యాంగ్స్టర్గా కొనసాగుతున్నాడని పేరు చెప్పడానికి ఇష్టపడని పోలీసు అధికారి ఒకరు అన్నారు. ఘరానా నేరగాడు దబోడియా, ఇతని అనుచరులు ఇద్దరు గత ఏడాది అక్టోబర్లో వసంత్కుంజ్లో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. మృతి చెందిన అనుచరుల పేర్లు కూడా ఢిల్లీ పోలీసుల నేరగాళ్ల జాబితాలో కనిపించాయి. ‘అత్యంత కరడుగట్టిన’ 10 మంది నేరస్తుల జాబితాలో ఉన్న వికాస్, మనోజ్, వీరి అనుచరులు వివేక్, ప్రవీణ్ మాత్రం ఇది వరకే పోలీసులకు చిక్కారు. దబోడియా వంటి గ్యాంగ్స్టర్లను హతమార్చడం ద్వారా ఢిల్లీ పోలీసులు మిగతా నేరగాళ్లలో భయాన్ని పెంచగలిగారు. దీంతో కొంతమంది కొన్నాళ్లపాటు స్తబ్దుగా ఉన్నా.. ముఠాలన్నీ తిరిగి ఏకమై నేరాలను కొనసాగిస్తున్నట్టు సమాచారం. ‘అత్యంత క్రూరంగా నేరాలకు పాల్పడే వారిని ఈ జాబితాలో చేర్చుతున్నాం. వీళ్లు పలుసార్లు పోలీసులను ఏమార్చి తప్పించుకున్నారు’ అని మరో అధికారి ఈ సందర్భంగా వివరించారు. వీరిని అరెస్టు చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలూ కొనసాగుతున్నాయని చెప్పారు.