breaking news
visilance attacks
-
ఇవి తిన్నారంటే చాలా డేంజర్.. ఎందుకంటే?
కరీంనగర్: ప్రజారోగ్యానికి పారిశుధ్యం ఎంత ముఖ్యమో.. తినే పదార్థాలు శుచిగా ఉండాలనేది అంతే ముఖ్యం. కానీ కరీంనగర్లో రోడ్డు పక్కన ఫాస్ట్ఫుడ్ సెంటర్లే కాదు.. ఎక్కువ శాతం హోటళ్లలోనూ శుచీ, శుభ్రత, సరఫరా చేసే ఆహారపదార్థాల నాణ్యత దారుణంగా ఉంటోంది. కల్తీ మయంగా మారిన ఈ పరిస్థితిని నివారించేందుకు కొరడా ఝళిపించాల్సిన ఆహార తనిఖీ అధికారులు మొద్దు నిద్ర పోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏడాదికి ఒకసారో.. రెండుసార్లో మొక్కుబడిగా హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లపై దాడులు చేస్తూ ఒకటి రెండు కేసులు నమోదు చేస్తూ మమ అనిపిస్తున్నారు. ఆహార పదార్థాల శాంపిళ్లను సేకరించి ప్రయోగశాలలకు పంపి ఇక తమ పని అంత వరకేనన్నట్లుగా వ్యవహరించడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇలా జరిగింది.. సరదాగా కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లిన తిరుపతి చికెన్ మంచూరియా కోసం నగరంలోని ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్ వద్దకు వెళ్లారు. అక్కడ సుష్టుగా తిని ఇంటికి వచ్చారు. కొద్ది సేపటికే వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి వెళ్తే ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇలా జరిగిందని వైద్యులు తేల్చారు. కృష్ణకుమార్ పుట్టిన రోజు అని సరదాగా ఫ్రెండ్స్తో కలిసి రోడ్డు పక్కన ఫాస్ట్ సెంటర్ వద్ద చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నారు. మరుసటి రోజు కడపునొప్పి రావడం, కొద్ది సేపటికే విరోచనాలు మొదలవడంతో నీరసించిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రిలో చేర్పించగా ఫుడ్ పాయిజన్ అని చెప్పి వైద్యులు చికిత్స అందించారు. హోటల్ పెట్టాలంటే.. గతంలో హోటల్ పెట్టాలంటే కార్పొరేషన్ ఇచ్చే ట్రేడ్ లైసెన్సుకు తోడు వివిధ రకాల అనుమతులు పొందాల్సి వచ్చేది. మారిన పరిస్థితులు, నిబంధనల దృష్ట్యా ట్రేడ్, ఫుడ్ లైసెన్సులు పొందితే చాలు. ఇవీ ప్రమాణాలు ► వంట కోసం ఉపయోగించే నూనెను ఒకసారి కంటే ఎక్కువ వాడరాదు. ► వండిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్లలో నిల్వచేయొద్దు. ► తాగునీటికి తప్పనిసరిగా ఫిల్టర్ వినియోగించాలి. ► కుళ్లిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగదారుడికి సరఫరా చేయరాదు. ► కోడి, మేక మాంసంలను ఒకేచోట పెట్టరాదు. పదార్థాలను సరైన వాతావరణంలో నిల్వ ఉంచాలి. ► వంటగది శుభ్రంగా ఉంచుకోవాలి. మురుగునీటి వ్యవస్థ చుట్టుపక్కల ఉండరాదు. తనిఖీలతో సరి హోటళ్లు, ఫాస్ట్సెంటర్లు, బేకరీలు.. ఇతర సంస్థలపై అప్పుడప్పుడు అధికారులు తనిఖీలు చేస్తున్నా వాటి యాజమాన్యాల తీరులో మార్పు ఉండటం లేదు. అపరిశుభ్ర పదార్థాలను సరఫరా చేస్తూనే ఉన్నారు. కారణం.. తనిఖీలు చేసినా అంతగా ఇబ్బంది పెట్టే చర్యలు ఉండవన్న ధీమా వారిలో నెలకొంది. పూర్తిస్థాయిలో ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసుకున్న ఉదంతాలు మచ్చుకై నా లేవు. హెచ్చరికలు, ట్రేడ్ లైసెన్సులను ఉపసంహరించడం వంటి చర్యలతో సరిపెడుతున్నారు. స్కిన్ అలర్జీలు వస్తాయి.. కల్తీ నూనెలు, కల్తీ వస్తువులతో చేసే ఫాస్ట్, జంక్ ఫుడ్ తినడం వల్ల స్కిన్ అలర్జీలు ఎక్కువగా వస్తాయి. కండ్ల వద్ద వాపు, పెదాలు వాపు రావడం, అక్కడితో ఆగకుండా గొంతు వాపు వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో అత్యవసరంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. – డాక్టర్ రాచకొండ రమేశ్, చర్మ వ్యాధి నిపుణులు జంక్ ఫుడ్తో ప్రమాదం.. హోటల్స్, రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో తినే జంక్ఫుడ్తో చాలా ప్రమాదాలు ఉన్నాయి. రెగ్యులర్గా తినే వారు గ్యాస్ట్రబుల్, అల్సర్ వంటి వ్యాధుల భారినపడుతున్నారు. ఈ మధ్య కాలంలో కేసులు 20 శాతం పైగా పెరిగాయి. సహజసిద్ధమైన ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం కాపాడుకోవచ్చు. – డాక్టర్ అనిల్కుమార్, జనరల్సర్జన్ నియంత్రణ ఉండాలి.. ఫాస్ట్ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారీతిన సెకండ్ క్వాలిటీ వస్తువులు, అడ్డగోలుగా కెమికల్స్ వాడుతూ ఫుడ్ రుచికరంగా తయారుచేస్తున్నారు. దీంతో జనాలు సైతం రుచికి అలవాటు పడి తింటున్నారు. అది తినడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్నారు. వాటిపై నియంత్రణ ఉండాలి. – శ్యాంసుందర్, కరీంనగర్ నిరంతర తనిఖీలు చేపట్టాలి.. ఆహార కల్తీకి పాల్పడుతున్న హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లపై నిరంతరం తనిఖీలు చేపట్టాలి. రుచి కోసం హానికరమైన కెమికల్స్ వాడినట్లు గుర్తిస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. నూనెను ఎక్కువ రోజులు వాడడం వల్ల వివిధ రకాల రోగాలు వస్తున్నాయి. – భాస్కర్, కరీంనగర్ ఊబకాయులుగా తయారవుతారు.. కల్తీ ఆహారపదార్థాలు, చీజ్, బట్టర్ వంటివి వాడడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయులుగా తయారయ్యే ప్రమాదం ఉంది. మనిషికి ఊబకాయంతో పాటు బ్లడ్లో కొవ్వు చేరడం వల్ల రక్తనాళాలు మూసుకుపోతాయి. దీంతో రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. – డాక్టర్ ఉపేందర్రెడ్డి, క్రిటికల్కేర్ నిపుణులు -
ఫాస్ట్ఫుడ్ సెంటర్లపై విజిలెన్స్ అధికారులు షాకింగ్ నిర్ణయం..
కరీంనగర్: నగరంలోని ఫాస్ట్ఫుడ్ సెంటర్లపై గురువారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నగరంలోని భగత్నగర్, టవర్ సర్కిల్, సీతారాంపూర్తో పాటు పలు ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. ఆహార నాణ్యత, వాడుతున్న రసాయనాలు, పలు అంశాలపై ఆరా తీశారు. దాడుల్లో డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు అనిల్కుమార్, వరుణ్ప్రకాశ్, తహసీల్దార్ దినేష్రెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
పరిటాలలో విజిలెన్స్ దాడులు
కంచికచర్ల (కృష్ణా): ఓ పప్పుల మిల్లులో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ ఘటన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా వివిధ బృందాలుగా విడిపోయి సోదాలు జరపుతున్న విజిలెన్స్ అధికారులు సోమవారం సాయంత్రం కృష్ణా జిల్లాలో తనిఖీలు చేశారు. అయితే ఈ సోదాల్లో పరిటాలలోని ఓ పప్పుల మిల్లులో అధికారులు దాడులు చేశారు. దాడలకు సంబంధించిన వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. -
గ్రానైట్ ఫ్యాక్టరీలపై దాడులు: రికార్డుల సీజ్
హిందూపురం: అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం పరిధిలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న నాలుగు గ్రానైట్ ఫ్యాక్టరీలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం సాయంత్రం దాడులు నిర్వహించారు. బిల్లులు లేకుండా సరుకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో అందుబాటులో ఉన్న రికార్డులను సీజ్ చేశారు.