breaking news
Village economical system
-
AP: గ్రామాలకు ఆర్థిక స్వాతంత్య్రం
సాక్షి, అమరావతి : గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం కొత్తగా ఆర్థిక స్వాతంత్య్రాన్ని కల్పించింది. గ్రామ పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను ఆ గ్రామ సర్పంచి, పంచాయతీ కార్యదర్శిల ఆధ్వర్యంలోనే ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లింపులకు వీలుగా ప్రతి పంచాయతీ పేరిట బ్యాంకుల్లో ముందస్తుగానే నిధుల జమకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీ పేరిట ఇప్పటికే బ్యాంకుల్లో (వ్యక్తిగత ఖాతాలను) పీడీ ఖాతాలను తెరిచింది. ఈ నిధులపై రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. బిల్లులు చెల్లింపులకు ప్రభుత్వ ట్రెజరీ అనుమతి తీసుకోవడం వంటివి కూడా ఉండవు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామ పంచాయతీలకు కేటాయించే దాదాపు రెండు వేల కోట్లకు పైగా నిధులను ఏటా ఆయా బ్యాంకు ఖాతాల్లో జమచేసే అవకాశముంది. అకౌంట్ టూ అకౌంట్కి మాత్రమే బదిలీ గ్రామాలకు కొత్తగా పూర్తిస్థాయి నిధులను అందుబాటులోకి తీసుకొస్తూ గ్రామ పంచాయతీల పేరిట బ్యాంకులో తెరిచిన పీడీ ఖాతాల నుంచి సర్పంచి సైతం ముందుగా డబ్బులు డ్రా చేసుకోకుండా ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆ ఖాతాల్లో జమయ్యే నిధులను చెక్కులతోనూ డ్రా చేసుకోవడానికి వీలుండదు. గ్రామ పంచాయతీలో వివిధ ఖర్చులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘గ్రామ స్వరాజ్య’ ఈ–పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ బిల్లు మొత్తాన్ని ఏ వ్యక్తికి అందజేయాలో అతనికి సంబంధించిన బ్యాంకు ఖాతా వివరాలను సర్పంచి అనుమతితో గ్రామ కార్యదర్శి ఆ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ పోర్టల్ పంచాయతీ అకౌంట్కు అనుసంధానమై ఉంటుంది. వివరాలు నమోదు ప్రక్రియ పూర్తవగానే గ్రామ పంచాయతీ అకౌంట్ నుంచి బిల్లు మొత్తం సంబంధిత వ్యక్తి బ్యాంకు ఖాతాకు బదిలీ అవుతాయి. ఇందుకు ప్రభుత్వ ట్రెజరీ అనుమతులు, లేదా ఇతర ఉన్నతాధికారుల జోక్యం కూడా ఎక్కడా ఉండదని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే, ఈ లావాదేవీల వివరాల సమాచారం ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులందరికీ తెలుస్తుంది. ఒకసారి లావాదేవీ పూర్తయ్యాక అందుకు సంబంధించిన వివరాల్లో మార్పులు, చేర్పులు చేయడానికి వీలుండదు. ఆన్లైన్లో నమోదు చేసే బిల్లులపై ప్రభుత్వం ఏటా ఆడిట్ నిర్వహిస్తుంది. తప్పులు దొర్లితే సంబంధిత సర్పంచి, గ్రామ కార్యదర్శిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానానికి చంద్రబాబు ‘నో’ గ్రామ పంచాయతీలకు కేటాయించే ఆర్థిక సంఘం నిధులపై రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీ నియంత్రణ లేకుండా 2018 నుంచి పూర్తిస్థాయిలో స్థానిక సంస్థల స్థాయిలోనే ఆ నిధులు అందుబాటులో ఉంచాలని 2017లోనే కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అన్ని రాష్ట్రాలకు సూచన చేసింది. కానీ, ఈ ప్రతిపాదనకు అప్పట్లోని చంద్రబాబు ప్రభుత్వం నో చెప్పింది. పూర్తిస్థాయి గ్రామ స్వరాజ్యం దిశగా.. మూడేళ్ల క్రితం రాష్ట్రంలో ఏ పంచాయతీలోనూ ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువమంది ప్రభుత్వోద్యోగులు ఉండేవారు కాదు. జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, ప్రతి గ్రామంలోనూ పది మందికి పైగా ప్రభుత్వ సిబ్బందిని నియమించారు. ఇందుకోసం ఏకంగా 1.34 లక్షల మందిని నియమించారు. నగరాలతో సమానంగా మారుమూల కుగ్రామాల్లో సైతం 543 రకాల ప్రభుత్వ సేవలను సచివాలయాల్లో అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనినైనా సొంత గ్రామంలోనే పూర్తిచేసుకునే సౌలభ్యం కల్పించింది. దీనికి తోడు.. ప్రాధాన్యతా క్రమంలో గ్రామ అవసరాలకు పంచాయతీ స్థాయిలోనే బడ్జెట్ రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తంగా రాష్ట్రంలో గ్రామాలు ఇప్పుడు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా సాగుతున్నాయి. ఐదేళ్లకు రూ.10,231కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు ఐదేళ్ల పాటు రూ.10,231 కోట్లు మేర రాష్ట్రంలోని గ్రామాలకు కేటాయిస్తారు. వీటిలో 70 శాతం పంచాయతీలకు, 15 శాతం చొప్పున మండల, జిల్లా పరిషత్లకు ఏటా నిర్ణీత మొత్తంలో విడుదల చేస్తారు. రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలు, 660 మండల పరిషత్, 13 జిల్లా పరిషత్లు ఉండగా.. ఇప్పటికే 12,686 గ్రామ పంచాయతీలు, 593 మండల పరిషత్లు, 12 జిల్లా పరిషత్లలో పీడీ ఖాతాలు తెరిచే ప్రక్రియను పంచాయతీరాజ్ శాఖ పూర్తిచేసింది. -
చిన్న రైతే.. పెద్ద దిక్కు!
కోట్లాది మంది చిన్న రైతులను, కూలీలను వ్యవసాయ రంగం నుంచి తరలించి వారికి ఎలా పునరావాసం కల్పిస్తారో ‘వృద్ధివాద’ ఆర్థిక నిపుణులు చెప్పడం లేదు. వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారం చిన్న కమతాల్లోని సుస్థిర-సేంద్రియ విధానమేనని చైనా, థాయ్లాండ్, ఫిలిప్పీన్స్ల అనుభవాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే అలా చిన్న రైతులు సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. మన పాలకులు చిత్తశుద్ధితో చేయందిస్తే.. చిన్న రైతు గ్రామీణ ఆర్థిక వ్యవస్థనే కాదు దేశ ఆర్థిక వ్యవస్థనే పునర్లిఖించగలుగుతాడు. కర్ణ కఠోరమైన అదే మాట పదే పదే వినబడుతూనే ఉంది. మొన్నటికి మొన్న అమెరికా పర్యటన సందర్భంగా కూడా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఇదే మాటను పునరుద్ఘాటించారు. భూసేకరణ, కార్మిక చట్టాలను సరళతరం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇదే విషయాన్ని నగ్నంగా చెప్పాలంటే పెట్టుబడిదారులు ఫ్యాక్టరీలు పెట్టడానికీ, కార్పొరేట్ సేద్యం చేయడానికీ, గోల్ఫ్ ఆడుకోవడానికీ, గుర్రపు పందేలకు, క్లబ్బులు కట్టుకోవడానికి వగైరా అవసరాలన్నిటికీ విస్తారంగా భూమి కావాలి. సేద్యం చేసుకుంటున్న సన్నకారు-చిన్నకారు రైతుల నుంచి సులభంగా భూమిని సేకరించాలి. వాళ్లంతా రెక్కలు తప్ప ఏమీ లేని నిరుద్యోగసేనగా సిద్ధంగా ఉండాలి. ఉద్యోగ భద్రత - పనిగంటల నియమాలు - సెలవు నిబంధనల వంటి చట్టరక్షణ లేకుండా ఈ నిరుద్యోగసేన పనిచేయడానికి వీలుగా కార్మికచట్టాలు మారాలి. ఈ సంకల్పాన్నే మనం మరో రకంగా చెప్పుకుంటున్నాం. నాగరికమైన పరిభాషను వాడుకుంటున్నాం. దేశ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయం వాటా 15 శాతానికి పడిపోయింది. కానీ, 50 శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కనుక వీరిలో అత్యధికులను ఇతర రంగాలకు మళ్లించాలి. అందుకోసం భూసేకరణ చట్టాలు, కార్మిక చట్టాలు సులభతరం కావాలి. మన అభ్యుదయ రాజకీయ నాయకులు, ఆర్థిక నిపుణులు సమష్టిగా అంగీకరించి, ఆమోదించిన భావన ఇది. రైతు నాయకులుగా పేరున్నవారు, శరద్ జోషీ లాంటివారు కూడా వ్యవసాయ రంగం నుంచి చిన్న-సన్న కారు రైతులు తప్పుకోవాల్సిందేనని వాదిస్తున్నారు. చిన్న కమతాలు లాభసాటికాదని, పెద్ద కమతాలు, వేల ఎకరాల్లో సాగించే కార్పొరెట్ వ్యవసాయంలోనే లాభాలు సాధించవచ్చని ఇలాంటి వారి అభిప్రాయం. భారతదేశంలో సుమారుగా పన్నెండు కోట్ల మంది రైతులు ఉన్నారు. వీరిలో 80 శాతానికి పైగా చిన్న-సన్నకారు రైతులే. అంటే తొమ్మిదిన్నర కోట్లకు పైగా. ఈ సమూహాన్ని (వారి కుటుంబ సభ్యులను లెక్కించకుండానే) ఒక స్వతంత్ర దేశంగా పరిగణించినట్లయితే ప్రపంచ దేశాల్లో పదమూడో స్థానం దక్కుతుంది. లాభసాటి వ్యవసాయం పేరిట - అంటే మెరుగైన స్థూలజాతీయోత్పత్తి కోసం ఇన్ని కోట్ల మందిని వ్యవసాయ రంగం నుంచి తరలించి ఏ రకంగా వారికి పునరావాసం కల్పించగలరనే విషయాన్ని ఆర్థిక నిపుణులు గానీ, అభివృద్ధివాద రాజకీయ నాయకులుగానీ ప్రస్తావించడం లేదు. ఇప్పటికే కిక్కిరిసిన నగరాలు, పట్టణాల్లో నిరుద్యోగ యువత పెచ్చుపెరిగిపోతోంది. నేటికీ పారిశ్రామిక రంగంలో ఎక్కువగా ఉపాధిని కల్పించగలిగేదిగా ఉన్న చిన్న. మధ్యతరహా పరిశ్రమలు ఏటికేడాది అధోగతికి చేరుతున్నాయి. ఇక ఆధునికసాంకేతికతను దిగుమతి చేసుకుంటూ నెలకొల్పుతున్న హైటెక్ పరిశ్రమలు అత్యున్నత విద్యావంతులకు, నిపుణ శ్రామికులకు మాత్రమే అదీ పరిమితంగానే ఉపాధిని కల్పిస్తున్నాయి.ఇక సేవారంగం ఇప్పటికే తలకు మించి విస్తరించింది. పైగా గ్రామాల నుంచి తరలించాలంటున్న కోట్లాది చిన్న-సన్నకారు రైతులకు, కూలీలకు హైటెక్ రంగంలోగానీ స్మార్ట్ సిటీల్లోగానీ ఉపాధి గగనమే. కిక్కిరిసిన మురికివాడల్లో సైతం వీరికి స్థానం దొరకదు. అలాంటిస్థితిలో గ్రామీణ అధిక జనాభాకు వ్యవసాయం నుంచి, భూమి నుంచి విముక్తి చెందించడం అంటే ఈ లోకం నుంచి విముక్తి చెందించడమే కాదా? ఈ ప్రశ్నకు సమాధానం లేకుండానే పేదరైతును భూ విముక్తుడిని చేసే బృహత్తర లక్ష్యాలను రచిస్తూనే ఉన్నారు. ఇది నిన్న మొన్నటి పరిణామం మాత్రమే కాదు. రెండున్నర దశాబ్దాల క్రితమే ఆర్థిక సంస్కరణల్లో భాగంగా తెరపైకి వచ్చింది. శతాబ్దాలుగా విత్తన స్వాతంత్య్రంతో వర్థిల్లిన మన రైతులు అలవికాని ధరలకు అదీ కల్తీ విత్తులు కొనేందుకు రోజుల తరబడి క్యూలో నిలబడే పరిస్థితి వచ్చింది. పాడి-పంటలనే జంట భావన నుంచి పాడి ఎగిరిపోయింది. ఎరువుకోసం రైతును రసాయనాల వైపు పరుగులు తీయించారు. చీడ పీడలపై విషతుల్యాలను ప్రయోగించక తప్పదన్నారు. తడిసి మోపెడైన ఖర్చులతో అప్పుల ఊబిలోకి నెట్టారు. పండించిన పంటకు మార్కెట్ మద్దతు పలకడంలేదు. అప్పుల బాధతో ఏటా వేల సంఖ్యలో అన్నదాతలకు ఆత్మహత్యలు తప్పడంలేదు. ఈ పరిణామాలన్నీ కేవలం కాకతాళీయం కాదు. పంట పొలాల్లో ప్రభుత్వాలు కోసిన ఊచకోత ఇది. మౌనంగానే సాగిన ఈ మారణహోమం మన విధాన నిర్ణేతల అభీష్టానికి అనుగుణంగానే ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వాలు చురుగ్గా జోక్యం చేసుకొని ఉంటే రైతాంగం ఈ దైన్యంలోకి దిగజారేది కాదు. కానీ ప్రభుత్వాలు జోక్యం చేసుకోలేదు. మెజారిటీ రైతులు భూ బంధాన్ని తెంచేసుకోవాలి. అప్పుడే అభివృద్ధి గ్రాఫ్ అనే పుష్పం వికసిస్తుంది. ఈ సూత్రీకరణ నుంచి పుట్టుకొచ్చిందే చిన్న కమతాలు లాభసాటి కావనే భావన. నిజమేనా..?, నిజంగానే చిన్న కమతాలు లాభసాటికావా..? చిన్న-సన్నకారు రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవించలేరా?... కొందరు మేధావులు-ఆర్థికవేత్తలు ఔనని చెబుతున్న ఈ సిద్ధాంతాన్ని చైతన్యశీలురైన ఎందరో రైతులు తమ విజయ గాథలతో పటాపంచలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక నేషనల్ శాంపిల్ సర్వేలో హెక్టారు (రెండున్నర ఎకరాలు) భూమిలో సన్నకారు రైతు రూ. 14,754 సంపాదిస్తే, చిన్నకారు రైతు రూ. 13,001, మధ్యతరగతి రైతు రూ. 10,655, పెద్దరైతు రూ. 8,783 సంపాదిస్తున్నారు. ఈ ఎన్ఎస్ఎస్ సర్వే సందేశమేమిటో మన పాలకులు, మేధావులు గ్రహిస్తే మేలు. అలాగే దక్షిణాసియాలోని వ్యవసాయ సంక్షోభంపై ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఒక అధ్యయనం చేసింది. ‘సేంద్రియ వ్యవసాయం - 2015 అనంతరం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’ అనే పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ అధ్యయనంలో వ్యవసాయ సంక్షోభానికి సంబంధించిన ఇతర అంశాలతో పాటు శరవేగంగా వస్తున్న వాతావరణ మార్పుల ప్రభావాన్ని సైతం పరిశీలించారు. ఈ సవాళ్లను అధిగమించిన చైనా, థాయ్లాండ్, మరికొన్ని దేశాల్లోని రైతుల సేద్య పద్ధతులను గమనించారు. వ్యవసాయ సంక్షోభం నుంచి బయట పడాలంటే చిన్న కమతాల్లో సాగే సుస్థిర-సేంద్రియ విధానమే మార్గమని పేర్కొంటూ ఈ నివేదికను వెలువరించారు. చైనా, థాయ్లాండ్, ఫిలిప్పీన్స్ల దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. మన పాలకులకు తెలుసుకోవాలనే చిత్తశుద్ధి వుంటే చాలు. తెలుగు రాష్ట్రాల్లోనే చిన్నరైతులు సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. సుస్థిర-సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో తెలుగు రాష్ట్రాల్లో చిన్న రైతులు ప్రపంచానికే పాఠాలు చెప్పదగ్గ అద్భుతాలను ఆవిష్కరించారు. ప్రకృతి సేద్య పద్ధతుల్లో 10-12 పంటలు కలిపి పండిస్తూ తాము తినగా మిగిలిన సేంద్రియ ఉత్పత్తులను అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందడం సాధ్యమేనని చాటుతున్న అరెకరం పొలంలో ‘అన్నపూర్ణ’ నమూనా అనుభవం మన కళ్లముందుంది. అరెకరంతోనే చిన్న రైతు కుటుం బానికి సహజాహార భద్రత కల్పించడంతోపాటు భూసారం, జీవవైవిధ్య పరిరక్షణకు ఈ పద్ధతి దోహదపడుతోంది. ఉదాహరణకు.. విజయనగరం జిల్లా మర్రిగూడకు చెందిన చంద్రమ్మ అరెకరంలో ప్రకృతి సేద్యం చేస్తోంది. ఒక సీజన్(4-5 నెల)ల్లో తన కుటుంబం తినగా మిగిలిన పంట దిగుబడులను అమ్మి రూ.32,500ల ఆదాయం పొందింది. సన్నకారు రైతు కమతాల సగటు విస్తీర్ణం తెలంగాణాలో ఎకరం 5 గుంటలు, ఆంధ్రప్రదేశ్లో ఎకరం 6 సెంట్ల వరకు ఉంది. చిన్నకారు రైతుల కమతాలు రెండు రాష్ట్రాల్లోనూ సగటున మూడున్నర ఎకరాలుంది. అరెకరంలో అన్నపూర్ణ పద్ధతిలో సాగు చేసుకోవడంతోపాటు ఒక పావెకరంలో పాలీహౌస్ నిర్మించు కునేందుకు ప్రభుత్వం తోడ్పడితే, మిగతా పావెకరంలో గడ్డి పెంచుకొని పాడి పశువులను పోషించుకుంటారు. పావెకరం పాలీహౌస్లో మార్కెట్లో గిరాకీ ఉన్న కూరగాయలు, పండ్లు పండించుకొని మార్కెట్ చేసుకునేందుకు వీరికి ప్రభుత్వం సాయపడితే.. తద్వారా పొందే ఆదాయంతో చిన్న రైతులు నిలదొక్కుకుంటారు. ఒక్క హైదరాబాద్ నగరానికే రోజుకు 3 వేల టన్నుల కూరగాయలు అవసరమవుతున్నాయి. సుమారు లక్ష చిన్న(పావెకరం) పాలీహౌస్లలో ఉత్పత్తి అయ్యే కూరగాయలు, పూలనూ కొనుగోలు చేసే శక్తి హైదరాబాద్కు ఉంది. పత్తి, వరి వంటి పంటల సాగును నియంత్రించి కూరగాయలు, పూల సాగు వైపు చిన్న రైతుల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తే.. చిన్న రైతు సమాజానికి భారం కాడు. ప్రతి గ్రామంలో సుమారు రెండొందల మంది లాభాలు పండించే రైతులు ఉన్నప్పుడు సహజంగానే ఆ పల్లె కళకళలాడుతుంది. ఈ చిన్న చిన్న రైతులే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునర్లిఖించగలుగుతారు. అంతేకాదు నిజంగానే దేశం సుస్థిరాభివృద్ధి బాటపడుతుంది. పాతికేళ్లుగా ప్రభుత్వాలు ఊచకోతలు కోస్తున్నా పొలాన్ని వదిలి చిన్న రైతు పారిపోలేదు. ఎందుకంటే.. ఈ దేశంలోని మెజారిటీ ప్రజల మతం వ్యవసాయం, సంస్కృతి వ్యవసాయం. muralivardelli@yahoo.co.in - వర్ధెల్లి మురళి సాక్షి ఎడిటర్