breaking news
Victims of police
-
మర్డర్ కేసులో ట్విస్ట్! ఆరేళ్ల తర్వాత అసలు నిజం..
తాము హత్య చేయలేదని మొత్తుకున్నా.. ఇద్దరు అమాయకుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. పైగా ఐపీసీలోని సెక్షన్లన్నీ ఆపాదించి గట్టి కేసు నమోదు చేశారు. కానీ, ఆ వ్యక్తి బతికే ఉన్నాడని, వాళ్లే నేరం చేయలేదని ట్విస్ట్ వెంటనే వెలుగు చూసింది. అది తెలిసీ.. పోలీసులు గప్చుప్గా ఉండిపోయారు. వాళ్లిద్దరికీ చేయని నేరానికి.. నరకం చూపించారు. ఆరేళ్లు ఆ ఇద్దరూ నేరస్థుల హోదాలో మానసిక క్షోభ అనుభవించారు. కానీ, చివరకు న్యాయమే గెలిచింది. గుజరాత్లోని నవ్సారీలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2016, జులై 6వ తేదీన నాగులాల్ అనే వ్యక్తిని హత్య చేశారన్న ఆరోపణలపై మదన్, సురేష్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యకు సంబంధించి నాగులాల్ మృతదేహాన్ని స్వాధీన పర్చుకున్న పోలీసులు.. శవ పరీక్షను హడావిడిగా కానిచ్చేశారు. బంధువులు సైతం కొద్దిపాటి పోలికలు ఉండడంతో అది నాగులాల్ మృతదేహామే అనుకుని మధ్యప్రదేశ్లోని స్వస్థలానికి తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. ఆపై కొద్దిగంటలకే నాగులాల్ తన సోదరుడికి ఫోన్చేసి బంధువుల ఇంట్లో ఉన్నానని చెప్పాడు. దీంతో అతను గుజరాత్ పోలీసులకు సమాచారం అందించాడు. అంతేకాదు బాగా ఆకలేసి మదన్ ఇంట్లోకి దూరానని, ఆ సమయంలో మదన్ భార్య నిద్రలేవడంతో అక్కడి నుంచి పారిపోయి నవ్సారీ బంధువుల ఇంట్లో తలదాచుకున్నానని నాగులాల్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు కూడా. అప్పుడుగానీ అర్థం కాలేదు పోలీసులకు తామోక అనామక శవాన్ని నాగులాల్ మృతదేహాంగా పొరపడ్డామని. కానీ, పోలీసులు మాత్రం అదేం పట్టించుకోకుండా.. ఆ ఇద్దరి పేర్లతో ఛార్జ్షీట్ నమోదు చేశారు. పైగా ఓ నైలాన్ తాడుతో ‘బతికే ఉన్న’ నాగులాల్ను ఉరేసి చంపారని నేరం అంటగట్టారు. మూడు నెలలపాటు జైల్లో గడిపిన ఇద్దరూ.. బెయిల్ మీద విడుదలయ్యారు. అప్పటి నుంచి ఈ కేసులో నిందితులుగా కోర్టుకు హాజరవుతూనే వస్తున్నారు. ఈలోపు 19 మంది సాక్ష్యులు, 35 డాక్యుమెంట్లతో సాక్ష్యాధారాల పేరిట ఓ నివేదికను(అందులో నాగూలాల్ హత్యకు గురయ్యాడనే ఉంది) సైతం సమర్పించారు. ఈ కేసులో వాదనలు నడుస్తుండగా.. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైతం వాదనలు వినిపించారు. అదే టైంలో పోలీసులు నాగులాల్ ఆచూకీని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అయితే డిఫెన్స్లాయర్ మాత్రం పక్కా ఆధారాల్ని సేకరించారు. నాగూలాల్ బతికే ఉన్నాడని అతను ఉంటున్న గ్రామ పంచాయితీ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్, అతని సోదరుడితో సాక్ష్యం చెప్పించి మరీ బాధితులకు న్యాయం కలిగేలా చూశారు. దీంతో కోర్టు.. సురేష్, మదన్లకు నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసింది. ఆ టైంలో దర్యాప్తు చేపట్టిన పోలీస్ అధికారి ప్రదీప్సిన్హ్ గోహిల్ మీద చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించింది. ఈ కేసులో పోలీసులకు వత్తాసు పలుకుతూ వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సైతం మందలించింది కోర్టు. అంతేకాదు.. బాధితులకు ఆరేళ్లుగా కలిగిన మానసిక క్షోభ, సంఘంలో దెబ్బతిన్న గౌరవానికి గానూ క్షమాపణలు చెప్పాలని, ఇంతకాలం కలిగిన ఆర్థిక నష్టాన్ని భరించాలంటూ పేర్కొంటూ మదన్, సరేష్లకు చోరో యాభై వేల నష్టపరిహారం ప్రదీప్ చెల్లించాలంటూ మార్చి 30వ తేదీన తుదితీర్పు వెల్లడించారు అదనపు న్యాయమూర్తి సారంగ వ్యాస్. -
అస్తమించిన అరుణోదయం
పలాస: పిల్లాడి చదువుకు అందివస్తుందని ఓ మధ్యతరగతి కుటుంబీకుడు.... పిల్ల పెళ్లి చేద్దామన్న ఆశతో ఓ చిరుద్యోగి... వ్యాపారానికి పెట్టుబడిగా ఉంటుందని ఓ బడ్డీకొట్టు నిర్వాహకుడు... ఇంటికి ఫర్నిచర్ చేయించుకుందామని గుట్టుగా సంసారం చేసుకునే ఓ మహిళ... ఇలా ఎంతోమంది మళ్లీ చిట్స్ వలలో పడ్డారు. చీటింగ్కు బలైపోయారు. కాశీబుగ్గలో కోట్లలో టర్నోవర్ చేస్తున్న అరుణోదయ చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థ ఇక మూతపడక తప్పదని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఒకటి కాదు... రెండు కాదు ఏకంగా 25కోట్ల రూపాయలు బకాయిపడిన ఆ సంస్థ యజమాని ఇప్పుడు పత్తాలేకుండా పోయాడు. చేసేది లేక బాధితులంతా ఈ రోజు సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. కాశీబుగ్గ భాస్కర కాంప్లెక్స్లో నిర్వహిస్తున్న అరుణోదయ చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థ యజమాని సంపతిరావు వెంకటగోవిందరావు సుమారు 500 మంది ఖాతాదారులకు సుమారు రూ.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. 6 నెలల నుంచి ఖాతాదారులు కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా చెల్లించడం లేదు. సుమారు 100 మంది ఖాతాదారులు ఫైనాన్స్ సంస్థ కార్యాలయం వద్ద గురువారం ఆందోళనకు దిగారు. అనంతరం కాశీబుగ్గ పోలీసులకు డి.లక్ష్మణరావు అనే ఖాతాదారుడు ఫిర్యాదు చేయగా కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ కేసు నమోదు చేశారు. 20 ఏళ్లుగా కాశీబుగ్గ, టెక్కలి కేంద్రంగా నడిచిన ఈ సంస్థ కోట్లాది రూపాయల టర్నోవర్ సాధించింది. సంస్థ యజమాని ఆ మొత్తాలను స్థిరాస్తి వ్యాపారాలపై పెట్టడంతో తీవ్రంగా నష్టపోయారు. చీటీ పాడుకున్న ఖాతాదారులకు సకాలంలో డబ్బులు చెల్లించలేకపోయారు. అప్పుల బాధ తట్టుకోలేక గత ఏడాది ఆత్మహత్యకు యత్నించాడు. చివరికి సుదీర్ఘకాలం చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డాడు. ఇటీవల ఖాతాదారులు అతని కోసం కలవడానికి ప్రయత్నించినా వీలు పడలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్ రావడం, కొంతమందికి చిన్నమొత్తాలు చెల్లించి పెద్ద మొత్తాలను చెల్లించకపోవడంతో అందులోని ఖాతాదారులు చివరికి కార్యాలయం వద్ద కాపుకాశారు. ఫలితం లేకపోవడంతో గురువారం పలాసకు చెందిన సున్నపు కేశవరావు, టెక్కలికి చెందిన బి.క్రిష్ణవేణి, కొత్తఅగ్రహారానికి చెందిన బి.సత్యవతి, కాశీబుగ్గకు చెందిన బమ్మిడి పోలినాయుడు, పలాసకు చెందిన పి.కె.శ్రీను, పట్నాయక్, భీమారావు, గంధం కామేష్ తదితరులు ఫైనాన్స్ సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అనంతరం కాశీబుగ్గ పోలీస్స్టేషన్కు పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశీబుగ్గలోనే సుమారు 150 మందికి రూ.8కోట్లు ఇవ్వాల్సి ఉందని, ఇదిగో అదిగో అంటూ కాలం దాటిస్తున్నారే తప్ప డబ్బులు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని ఆరోపించారు. పైగా ఇప్పుడు ఆయన ఐపీ పెట్టేయత్నంలో ఉన్నట్టు తెలియడంతో రోటరీనగర్లో నిర్మించిన అపార్ట్మెంట్ను ఎస్బీఐ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. రూ.45 లక్షలు తమ బ్యాంకుకు ఇవ్వాలని, అందుకే ఈ భవనాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.