breaking news
Venugopala Charyulu
-
అద్భుత స్తూపం... అందులో 'గీత'
మహాభూతాని అహంకారో బుద్ధిహిర్ అవ్యక్తం ఏవచ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరః శ్రీమద్భగవద్గీతలో చెప్పిన ఈ శ్లోకం పరమార్థాన్ని గ్రహిస్తే ఇలాంటి కార్చిచ్చులే కాదు, మనిషి–మనిషికి మధ్య అభిప్రాయ భేదాలూ పొడచూపవు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని, తోటివారూ తనలాంటి వారే అన్న భావనను ఒంటి పట్టించుకుంటే చాలు, ప్రపంచం ఆనందాల పొదరిల్లులా ఆహ్లాదంగా మారిపోవటం ఖాయం. ప్రపంచంలో తొలి మనోవికాస గ్రంథంగా భావించే భగవద్గీత సారాన్ని విశ్వవ్యాప్తం చేయటమే దీనికి మార్గం అంటున్నారు గట్టు వేణుగోపాలచార్యులు. అందుకే ఆయన ఆధ్వర్యంలో తొలి గీతాస్తూపం అమెరికాలో ఏర్పాటైంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అర్కాన్సాస్ రాష్ట్రం లో వాల్మార్ట్ హెడ్క్వార్టర్గా ఉన్న బెంటన్విల్లోని శ్రీకృష్ణ దేవాలయం ఆవరణలో ఈ అద్భుతస్తూపం భారతకాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి ఆవిష్కృతమైంది. స్తూపాలు కావాలంటూ 20 దేశాల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. ప్రపంచం లోనే తొలి గీతాస్తూపంగా ఏర్పడ్డ ఆ నిర్మాణ రూపకర్త గట్టు వేణుగోపాలాచార్యులు మన తెలంగాణవాసి కావటం విశేషం. ఏముంది అందులో... శంఖుచక్రాలతో ప్రశాంతచిత్తంతో కొలువుదీరిన చతు ర్భుజ శ్రీమహావిష్ణువు నల్లరాతి విగ్రహంగా ప్రశాంతచిత్తంతో నిలుచున్న రూపం... దాని చుట్టూ ఎత్తయిన భారీ ప్యానల్స్... ఒక్కో ప్యానెల్పై గీతలోని అధ్యాయాలు.. వాటిల్లో శ్లోకాలు.. తాత్పర్యాలు. అలా 700 శ్లోకాలు ఆ ప్యానెల్స్పై ఆంగ్లం, హిందీల్లో కొలువుదీరాయి. వాటి అర్థం దిగువనే ఉంటుంది. పంచభూతాలమయమైన శరీరం, అదే పంచభూతాలతో నిండిన ప్రకృతితో మసలడం, సౌభ్రాతృత్వం, విశ్వశాంతి, సమానత్వం, ఆనందం... ఇలా మానవ జీవన సౌందర్యాన్ని సాక్షాత్కరించే జీవన విధానానికి మార్గదర్శనం చేస్తుందనేది ఆ స్తూపాన్ని చూసిన వారి భావన. దాని ఎదుట ఉండే కంప్యూటరైజ్ట్ సిస్టం ముందుగా సందర్శకులకు ఓ టోకెన్ జారీ చేస్తుంది. దానిపై భగవద్గీత అధ్యాయం, శ్లోకం సంఖ్య ఉం టాయి. అది తీసుకుని సరిగ్గా ఆ ప్యానెల్లోని ఆ శ్లోకం వద్దకు వెళ్లి దాన్ని చదవాలి. ఆ సమయంలో ఉన్న మానసిక స్థితిని– ఆ శ్లోకంలోని నిగూఢార్థాన్ని బేరీజు వేసుకుని అది తనకు మార్గ నిర్దేశనం చేస్తుందో పరిశీలించాలి. రూపకర్త మనవాడే.... జనగామ జిల్లా జీడికల్కు చెందిన గట్టు వేణుగోపాలా చార్యులు బెంటన్విల్ శ్రీకృష్ణ దేవాలయ ప్రధాన అర్చకులు. ఆయన తండ్రి గట్టు వెంకటాచారి ఉపాధ్యాయ వృత్తిలో దాదాపు దశాబ్దన్నరపాటు సిద్దిపేట జిల్లా అయినాపూర్లో పనిచేయటంతో వేణుగోపాలాచార్యులు పాఠశాల విద్య అక్కడేసాగింది. ఉన్నవిద్య పూర్తిచేసి చిన జీయర్స్వామి సమక్షంలో వేదాధ్యయనం ముగించి అమెరికాలో ఆధ్యాత్మక భావనలు వ్యాప్తించేందుకు వెళ్లారు. మాతృభూమిపై మమకారంతో.. ఇప్పుడు మాతృభూమిపై మమకారంతో ఇక్కడి గ్రామాల్లో కూడా భగవద్గీత సారాన్ని పంచటం ద్వారా జీవిత గమనంలో ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతంగా ఉండే మార్గాన్ని కల్పించాలని నిర్ణయించినట్టు వేణుగోపాలాచార్యులు పేర్కొంటున్నారు. వచ్చే నెల 12– 20 మధ్య సిద్దిపేట జిల్లా చేర్యాల, అయినాపూర్, తిరుమలలో గీతా హోమాలను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. – సాక్షి, హైదరాబాద్ -
‘పట్నంలో శాలిబండ...’ పాట మార్మోగుతూనే ఉంది!
‘పదవే పోదాము గౌరీ...’, ‘జయజయజయ శ్రీ వేంకటేశ...’, ‘ఎంత మంచివాడవురా...’, ‘పయనించే ఓ చిలుకా...’, ‘పట్నంలో శాలిబండ, పేరైనా గోలుకొండ...’ ఏనాటి పాటలవి... ఎంత వినసొంపైన రాతలవి... రాసిన చేతులకు మొక్కాలనిపించేంత చక్కని సాహిత్యమది. చేతుల్లోనే కాదు చేతల్లోనూ స్వఛ్చతను నింపుకున్న మనిషికి మాత్రమే స్వంతమయ్యే పద‘సంపద’ది. హైదరాబాద్, చిక్కడపల్లిలోని ఓ గల్లీలో సాదా సీదాగా కనిపించే ఇంట్లో ఎనభై మూడేళ్ల వేణుగోపాలాచార్యులును కలిసినప్పుడు ఆయనలోని అక్షర సంపన్నుడు అర్థమయ్యారు. తెలుగు, ఉర్ధూ, హిందీ, సంస్కృతం భాషల్లో ప్రావీణ్యులైన వేణుగోపాలాచార్యులు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైనా, ప్రవృత్తి రీత్యా రచయిత. కొన్ని దశాబ్థాల క్రితం ఆయన కలం స్రవించిన అక్షరాలతో అల్లుకున్న పాటలు ఇప్పటికీ జనరంజకమే. కళామతల్లి మీద అవ్యాజానురాగాలే తప్ప కాసుల కక్కుర్తి లేని ఈ ఆచార్యులు... తన కలం బలాన్ని ఏరకంగానూ సొమ్ము చేసుకోలేకపోయారు. ఆయన ‘సాక్షి’తో పంచుకున్న అను‘భావాలు’ ఆయన మాటల్లోనే... ఆ పాట సినిమాలో వాడలేదు కానీ... టీచర్ ఉద్యోగం చేస్తూనే నా కవితాభిలాషను భిన్న మార్గాల్లో తీర్చుకుంటుండేవాణ్ణి. ‘నాస్తిక్’ సినిమాలో ‘దేక్ తెరీ సంసార్ హాలత్’ పాటను ‘ఎటు మారెనో ఈ ప్రపంచ నడవడి కనుగొనవో దేవా’ అని ట్యూన్కు అనుగుణంగా మార్చి పాడుతుంటే ఎందరో అభినందించారు. నటరాజ రామకృష్ణగారి సిఫారసు లేఖతో మద్రాసు వెళ్లి, ‘ముద్దుబిడ్డ’ సినిమా తీస్తున్న దర్శక నిర్మాత కేబీ తిలక్ని కలిశాను. అదే సమయంలో పి.పుల్లయ్య గారు ‘శ్రీ వెంకటేశ్వర మహాత్యం’ తీస్తున్నారు. అందులో పాటలన్నీ ఆత్రేయగారు రాసేశారు అప్పటికీ నేను బతిమాలితే... రమణారెడ్డి, సురభి బాలసరస్వతి పాత్రల కోసం ‘చిలకో చిక్కావె ఈనాడు సింగార మొలుకుతూ’’ పాట రాయించారు. ఆ తర్వాత ఆయనే ‘పదవే పోదాము గౌరి పరమాత్ముని జూడ’, ‘జయజయజయ శ్రీ వెంకటేశ జయజయజయజయ శ్రీతజనపోషా’ రాయించారు. దీన్ని సినిమాలో వాడలేదు. అయితే ఘంటసాల ప్రైవేటుగా పాడిన ఈ పాట ఇప్పటికీ తిరుమల సహా వెంకటేశ్వరుని ఆలయాల్లో నిత్యం వినిపిస్తూనే ఉంటుంది. అమాయకుడు, మమకారం, భాగ్యవంతులు, పచ్చని సంసారం, దేవుడున్నాడు, సంధ్యాదీపం తదితర చిత్రాల్లో కూడా పాటలు రాశాను. ‘అమాయకుడు’ సినిమా కోసం నేను రాయగా ఎల్లారీశ్వరి పాడిన ‘పట్నంలో శాలిబండ పేరైనా గోలుకొండ’ నాటి నుంచి నేటి వరకూ ప్రతి తెలుగింటిలోనూ మార్మోగుతూనే ఉంది. అలాగే ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ తెలంగాణలో నిత్యస్మరణం. సంస్కృతం నుంచి నేను తెలుగులోకి అనువాదం చేసిన ‘శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం’ను ఘంటసాల ఎంతో ఇష్టపడి ఆలపించడం నాకో మధుర జ్ఞాపకం. ఎన్టీఆర్ పేరు మార్చారు! ఓ సినిమా స్క్రిప్టు పనిమీద ఎన్టీఆర్ని కలిసినప్పుడు ఆచారి అని కాకుండా వేణుగోపాల్ అని మార్చుకోమని సలహా ఇచ్చారు. అప్పటి నుంచి అదే పేరు మీద కంటిన్యూ అయ్యాను. నాకెంతో ఇష్టమైన యాదగిరి పుణ్యక్షేత్రం మీద భక్తితో ‘యాదగిరి మహాత్యం’ సినిమాకి దర్శకత్వం వహించాను. కన్నడ రాజ్కుమార్ ‘రాఘవేంద్ర మహాత్యం’ తెలుగులో తీస్తుంటే మాటలు, పాటలు రాశాను. పాట రాయాలనే తప్ప పైసా పోగేయాలని చూడలేదు... ఇప్పుడున్నన్ని ప్రయాణ సౌకర్యాలు అప్పుడు లేవు కదా. ఉపాధ్యాయవృత్తిలో ఉంటూనే మద్రాసు వెళ్లి సినిమాలకు పనిచేయడం... ఈ రెండు పడవల ప్రయాణం అంత తేలికగా సాగింది కాదు. విద్యార్థులకు ఇబ్బంది కలగని రీతిలో లాస్ ఆఫ్ పేలు, సెలవులు పెట్టుకుని వెళ్లొస్తుండేవాడ్ని. ఆదాయపరంగా పెద్దగా ఒరిగిందేమీ లేకపోయినా... నాలోని కవితావేశాన్ని, సినీరంగం పట్ల ఆపేక్షని అదుపుచేసుకోలేదు. నా స్వంత రచనలతో పాటు హిందీ సినిమా పాటల్ని తెలుగులోకి మార్చి రాసినవి చాలా మందికి వినిపిస్తే... చెప్పా పెట్టకుండా వాడేసుకున్నారు. పారితోషికం కాదు కదా కనీసం నా పేరు కూడా టైటిల్స్లో వేయలేదు. అలాంటి మోసాలు చాలానే భరించాను. అయితే ఈ వయసులో కూడా ఇంత తృప్తిగా ఉన్నానంటే పాటకు పైసాకు లింకు పెట్టకపోవడం వల్లనే. ఇప్పుడంతా స్పీడైపోయి... పాడైపోయిందనుకోండి. వెంకటేశ్వరస్వామి మీద రాసిన వందలకొద్దీ భక్తి పాటలు, జానపద గీతాలు, శృంగార గీతాల సహా వేలాదిగా నా దగ్గర ఉన్నాయి. వీటన్నింటినీ ఎవరైనా సరే సినిమాల్లో గాని, ప్రైవేటు ఆల్బమ్స్లోగానీ ఏదో ఒక రూపంలో వినియోగించుకుంటే బావుంటుంది. - ఎస్.సత్యబాబు