వడ్డీ వ్యాపారుల వేధింపులు: మహిళ మృతి
కడప: వైఎస్సార్ జిల్లా కడప పట్టణంలో వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఓ మహిళ బలైంది. వివరాలు స్ధానిక ఎర్రబడి అగాడివీధికి చెందిన వహీదాబాను(53) అవసరాల కోసం రూ.1.5 లక్షలు అప్పు చేసింది. క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించేది. అయితే వడ్డీవ్యాపారులు వహీదాను బెదిరించి ఆమె పేరుతో ఉన్న 5 సెంట్ల స్థలాన్ని బలవంతంగా రిజిష్ట్రేషన్ చేయించు కున్నారు. నాలుగు రోజుల క్రితం వడ్డీ వ్యాపారులు ఇల్లు ఖాళీ చేయమని బెదిరించి వెళ్లారు.
ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా వడ్డీవ్యాపారుల మనుషులు బెదిరించడంతో మనస్థాపానికి గురై వహీదా చనిపోయినట్టు మృతురాలి సోదరుడు మహమూద్ విలేకరులకు తెలిపాడు. గతంలో ఆ స్థలం విషయమై పోలీసు పంచాయతీ కూడా జరిగిందని, వడ్డీవ్యాపారులు బలవంతంగా బెదిరించి స్థలాన్ని రాయించుకున్నారని పేర్కొన్నాడు. వడ్డీ వ్యాపారులపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు మహమూద్ చెప్పాడు.