గార్సియా బ్రదర్స్ను పట్టిస్తే కోటి డాలర్లు.. అమెరికా ప్రకటన
శాన్డియాగో: అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం డ్రగ్స్ ముఠాలను తుడిచిపెట్టే చర్యలను మరింత ముమ్మరం చేసింది. అమెరికా తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో ఇటీవల మెక్సికో ప్రభుత్వ ఆర్మీ అత్యంత శక్తివంతమైన జలిస్కో న్యూ జనరేషన్ ముఠా నాయకుడు నెమెసియో రుబెన్ ఒసెగువెరా సెర్వాంటెస్ అలియాస్ ఎల్ మెంచోను మట్టుపెట్టడం తెల్సిందే.అదేవిధంగా, మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా, టిజువానా రాష్ట్రాలతో సరిహద్దులున్న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోకి దొంగచాటుగా డ్రగ్స్ తరలించే సినలొవా డ్రగ్ముఠాపై తాజాగా ట్రంప్ సర్కారు దృష్టి సారించింది. జలిస్కో, సినలొవా ముఠాల మధ్య ఆధిపత్యం కోసం తీవ్రంగా పోరు సాగుతోంది. సినలొవా ముఠా నేతలుగా ఉన్న ఇద్దరు సోదరులను పట్టించిన వారికి కోటి డాలర్లను బహుమానంగా ఇస్తామని గురువారం అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. రెనె అర్జాటె గార్సియా(42)అలియాస్ లా రానా, అల్ఫొన్సో అర్జాటే గార్సియా(52) అలియాస్ అక్విలెస్ ఆచూకీ తెలిపిన వారికి 50 లక్షల డాలర్ల చొప్పున అందిస్తామంది. వీరిద్దరిపై ఇప్పటికే శాండియాగోలో డ్రగ్స్కు సంబంధించిన పలు కేసులున్నాయి.