అనుచిత వ్యాఖ్యలు విరమించుకోవాలి
నల్లగొండ టూటౌన్: ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయులను ఉద్ధేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బేషరతుగా ఉపసంహరించుకోవాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సుంకరి బిక్షంగౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం డైట్ ఎదుట పీఆర్టీయూ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32 రోజుల పాటు తమ కడుపులు కాల్చుకుని విద్యార్థులను ఉద్యమంలోకి రప్పించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేస్తే మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. మంత్రి వ్యాఖ్యానించిన మాటలతో మహిళా ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా మాపై నిందలు వేయడం సరికాదన్నారు. హెల్త్కార్డులు, బకాయి డీఏ, పీఆర్సీ ఏరియర్స్ సమస్యలు పరిష్కరించకపోవడం అన్యాయమన్నారు. పుండు మీద కారం చల్లే విధంగా డిప్యూటీ సీఎం మాటలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు, డీటీఎఫ్ నేత సోమయ్య తదితరులు పాల్గొన్నారు.