breaking news
Trans-Pacific Partnership
-
ఆర్సీఈపీ, సీపీటీపీపీలో భారత్ చేరాలి
న్యూఢిల్లీ: ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్సీఈపీ)తోపాటు, సమగ్ర, ట్రాన్స్పసిఫిక్ పార్టనర్షిప్కు సంబంధించి ప్రగతిశీల అంగీకారం (సీపీటీపీపీ)లో భారత్ కూడా భాగం కావాలని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. 2019లో ఆర్సీఈపీ నుంచి భారత్ బయటకు రావడం గమనార్హం. ‘‘భారీ వాణిజ్య ఒప్పందాల్లో పాలుపంచుకోని దేశాల్లో భారత్ ఒకటి. ఆర్సీఈపీ, సీపీటీపీపీలో భారత్ పాలుపంచుకోవడంతోపాటు సభ్య దేశం కావాలి. దేశ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) సంస్థలకు ఇది మేలు చేస్తుంది. దేశ ఎగుమతుల్లో 40 శాతం ఎంఎస్ఎంఈలవే ఉంటున్నాయి. బడా కొర్పొరేట్ సంస్థలు గొప్ప ఎగుమతిదారులుగా లేవు’’అని అసోచామ్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఆర్సీఈపీ అన్నది 10 ఆసియా దేశాల కూటమి. బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, మయన్మార్, సింగపూర్, థాయిల్యాండ్, ఫిలిప్పీన్స్, లావోస్, వియత్నాం సభ్యదేశాలుగా ఉన్నాయి. సీపీటీపీపీ అన్నది కెనడా, మెక్సికో, పెరూ, చిలే, న్యూజిల్యాండ్, ఆ్రస్టేరలియా, బ్రూనై, సింగపూర్, మలేషియా, వియత్నాం, జపాన్తో కూడిన కూటమి.చైనా ప్లస్ వన్తో పెద్దగా లబ్ది పొందలేదు..చైనా ప్లస్ వన్ అవకాశాలను భారత్ తగినంత అందిపుచ్చుకోలేదని సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో భారత్ కంటే వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, తుర్కియే, మెక్సికో ఎక్కువగా ప్రయోజనం పొందినట్టు చెప్పారు. అంతర్జాతీయ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలో భారత్ బలపడాలంటూ 70 శాతం వాణిజ్యం ఈ రూపంలోనే ఉంటుందన్నారు. ఇతర దేశాల కంటే మన దగ్గర టారిఫ్లు ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. ‘‘మన దగ్గర 2–3 అవరోధాలున్నాయి. టారిఫ్లు ఎక్కువగా ఉండడం ఇందులో ఒకటి. టారిఫ్లను తగ్గించకపోతే మనం ప్రయోజనం పొందలేం. అలాగే, మనకు కావాల్సిన స్థాయిలో ప్రైవేటు రంగం నుంచి పెట్టుబడులు ఉండడం లేదు. సామర్థ్య వినియోగం 70 శాతంగానే ఉంది’’అని సుబ్రమణ్యం వివరించారు. అంతర్జాతీయంగా భారత్ ప్రకాశిస్తున్న కిరణమంటూ, విధానపరమైన స్థిరత్వంతోపాటు సంస్కరణలు వేగవంతమైన వృద్ధి దిశగా నడిపిస్తున్నట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన 8.2 శాతం జీడీపీ వృద్ధిని గుర్తు చేశారు. ప్రపంచ వృద్ధిలో భారత్ 20 శాతం వాటా సమకూరుస్తోందని, రానున్న రోజుల్లో ఇది ఇంకా పెరుగుతుందన్నారు. -
‘ట్రాన్స్–పసిఫిక్’ నుంచి వైదొలగిన అమెరికా
సంతకం చేసిన అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్ : ఎన్నికల హామీల్ని వరుసగా ఆచరణలోకి తెస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాన్స్ –పసిఫిక్ భాగస్వామ్య(టీపీపీ) ఒప్పందం నుంచి వైదొలుగుతూ సంతకం చేశారు. ఒబామా హయాంలో వాణిజ్య సహకారం కోసం పసిఫిక్ మహా సముద్రం పరిధిలోని 12 ముఖ్య దేశాలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ దేశాలు 40 శాతం వాటా కలిగిఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందమైన టీపీపీపై ఏడేళ్ల పాటు సభ్య దేశాల మధ్య చర్చలు సాగాయి. 2016, ఫిబ్రవరి 4న తుది ఒప్పందంపై అమెరికాతో పాటు జపాన్ , మలేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, మెక్సికో, జపాన్ , పెరూ, సింగపూర్, బ్రూనై, చిలీలు సంతకం చేశాయి. ఒప్పందాన్ని ఆయా దేశాలు అధికారికంగా ఆమోదించాల్సి ఉంది. ఆర్థిక సంబంధాల బలోపేతం, వృద్ధి రేటును ప్రోత్సహించడం, పన్నుల్ని తగ్గించడం ఈ ఒప్పందం లక్ష్యం. ఆ లేఖలో ఏముందో చెప్పను : ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తూ.. తనకు ఒబామా మంచి లేఖ రాశారని ట్రంప్ వెల్లడిం చారు. అయితే ఆ లేఖలో ఏముందనే విషయాన్ని మీడియాకు చెప్పదలచుకోలేదన్నారు. దాన్ని మనసులోనే పెట్టుకుంటానని ట్రంప్ చెప్పారు. ట్రంప్ కార్యక్రమాలపై తప్పుడు వార్తలు ప్రచారం చేసే మీడియాతో సంబంధాలపై పునరాలోచన చేస్తామని ట్రంప్ పాలకవర్గం హెచ్చరించింది.