breaking news
top target
-
మొబైల్ ముట్టుకుంటే ముప్పే!
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్ మాల్వేర్ దాడులకు గురవుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఈ విషయంలో అమెరికా, కెనడాలను కూడా దాటేసింది. జీస్కేలర్ థ్రెట్ల్యాబ్జ్ రూపొందించిన ’మొబైల్, ఐవోటీ, ఓటీ థ్రెట్’ నివేదికలో ఈ విషయం వెల్లడైంది.2023 జూన్ నుంచి 2024 మే వరకు 2000 కోట్ల పైచిలుకు మాల్వేర్ ముప్పు సంబంధిత మొబైల్ లావాదేవీలు, ఇతరత్రా సైబర్ ముప్పుల గణాంకాలను విశ్లేషించిన మీదట ఈ రిపోర్ట్ రూపొందింది. ‘అంతర్జాతీయంగా మొబైల్ మాల్వేర్ దాడుల విషయంలో భారత్ టాప్ టార్గెట్గా మారింది. గతేడాది మూడో స్థానంలో ఉన్న భారత్ ఈసారి మొదటి స్థానానికి చేరింది. ఇలాంటి మొత్తం అటాక్స్లో 28 శాతం దాడులు భారత్ లక్ష్యంగా జరిగాయి. అమెరికా (27.3 శాతం), కెనడా (15.9 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. డిజిటల్ పరివర్తన వేగవంతమవుతుండటం, సైబర్ ముప్పులు పెరుగుతుండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో భారత సంస్థలు మరింత పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఇది తెలియజేస్తోంది‘ అని నివేదిక వివరించింది.గూగుల్ ప్లే స్టోర్లో 200 పైచిలుకు హానికారక యాప్స్ను గుర్తించినట్లు, ఐవోటీ మాల్వేర్ లావాదేవీలు వార్షికంగా 45 శాతం పెరిగినట్లు తెలిపింది. ఇది సైబర్ దాడుల ముప్పు తీవ్రతను తెలియజేస్తుందని వివరించింది. అత్యధికంగా సైబర్ దాడులకు గురవుతున్నప్పటికీ.. మాల్వేర్ ఆరిజిన్ పాయింట్ (ప్రారంభ స్థానం) విషయంలో మాత్రం భారత్ తన ర్యాంకును మెరుగుపర్చుకుంది. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో అయిదో స్థానం నుంచి ఏడో స్థానానికి చేరింది.రిపోర్టులోని మరిన్ని విశేషాలు.. మొబైల్ అటాక్స్లో సగభాగం ట్రోజన్ల రూపంలో (హానికరమైన సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకుని, రన్ చేసేలా ప్రేరేపించే మోసపూరిత మాల్ వేర్) ఉంటున్నాయి. ఆర్థిక రంగంలో ఇలాంటి ఉదంతాలు జరుగుతున్నాయి. బ్యాంకింగ్ మాల్వేర్ దాడులు 29% పెరగ్గా, మొబైల్ స్పైవేర్ దాడులు ఏకంగా 111% ఎగిశాయి. ఆర్థికంగా మోసగించే లక్ష్యంతో చేసే మాల్వేర్ దాడులు, మల్టీఫ్యాక్టర్ ఆథెంటికేషన్లాంటి (ఎంఎఫ్ఏ) వివిధ అంచెల భద్రతా వలయాలను కూడా ఛేదించే విధంగా ఉంటున్నాయి. వివిధ ఆర్థిక సంస్థలు, సోషల్ మీడియా సైట్లు, క్రిప్టో వాలెట్లకు సంబంధించి ఫేక్ లాగిన్ పేజీలను సృష్టించి సైబర్ నేరగాళ్లు ఫిషింగ్ దాడులకు పాల్పడుతున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు వంటి దిగ్గజ భారతీయ బ్యాంకుల మొబైల్ కస్టమర్లను ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నారు. అచ్చం సిసలైన బ్యాంకింగ్ వెబ్సైట్లను పోలి ఉండే ఫేక్ సైట్లలో.. బ్యాంకుల కస్టమర్లు కీలక వివరాలను పొందుపర్చేలా అత్యవసర పరిస్థితిని సృష్టిస్తూ, మోసగిస్తున్నారు. గతంలోనూ నకిలీ కార్డ్ అప్డేట్ సైట్ల ద్వారా ఆండ్రాయిడ్ ఆధారిత ఫిషింగ్ మాల్వేర్ను జొప్పించేందుకు ఇలాంటి మోసాలే జరిగాయి. పోస్టల్ సర్వీసులను కూడా సైబర్ మోసగాళ్లు విడిచిపెట్టడం లేదు. యూజర్కు రావాల్సిన ప్యాకేజీ మిస్సయ్యిందనో లేక డెలివరీ అడ్రెస్ సరిగ్గా లేదనో ఎస్ఎంఎస్లు పంపడం ద్వారా వారిని కంగారుపెట్టి, తక్షణం స్పందించాల్సిన పరిస్థితిని సృష్టిస్తున్నారు. ఫేక్ సైట్ల లింకులను ఎస్ఎంఎస్ల ద్వారా పంపించి మోసాలకు పాల్పడుతున్నారు. అంతగా రక్షణ లేని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆపరేషనల్ టెక్నాలజీ (ఐవోటీ/ఓటీ) మొదలైనవి సైబర్ నేరగాళ్లకు ప్రధాన టార్గెట్గా ఉంటున్నాయి. కాబట్టి భారతీయ సంస్థలు సురక్షితంగా కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు సెక్యూరిటీ నెట్వర్క్ను మరింత పటిష్టం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోండి
ఏఎన్యూ: జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాని సాధనకోసం అహర్నిశలు కృషి చేయాలని సినీ హీరో నారా రోహిత్ అన్నారు. యూనివర్సిటీలోని డైక్మెన్ ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం జరిగిన యూనివర్సిటీ ఆర్ట్స్, సైన్స్ కళాశాలల వార్షికోత్సవానికి రోహిత్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.రాంబాబు అధ్యక్షత వహించారు. నారా రోహిత్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుందని, దానిని వెలికితీస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. ప్రపంచాన్ని జయించే సత్తా చదువులో ఉందని చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు. నలుగురితో మంచి అనిపించుకోవడం గొప్ప విషయమని మంచిగా మెలగడం, మంచిగా చేయడం ద్వారా దీనిని సాధించవచ్చన్నారు. వీసీ ఆచార్య కె.వియ్యన్నారావు మాట్లాడుతూ చార్లీ చాప్లిన్ లాంటి వంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. ఏఎన్యూ భవిష్యత్లో ప్రపంచంలోనే ప్రముఖంగా విలసిల్లిన నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల స్థాయికి చేరుకుంటుందన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు దానికోసం కృషి చేయాలన్నారు. ఆచార్య సి.రాంబాబు అధ్యక్షోపన్యాసం చేస్తూ వైకల్యాలను అధిగమించి ప్రపంచంలోనే అద్భుతాలు సృష్టించిన గొప్ప వ్యక్తులను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రెక్టార్ కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ పి.రాజశేఖర్, వీసీ సతీమణి డాక్టర్ జ్యోతి వియ్యన్నారావు, ఆర్ట్స్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎస్. విజయరాజు, సైన్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ బి.విక్టర్బాబు ప్రసంగించారు. ఈ విద్యాసంవత్సరంలో క్రీడలు, విద్యా పరమైన అంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.మధుబాబు, మిమిక్రీ కళాకారుడు బి.శివకుమార్ పలువురు అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు.