breaking news
top Officials
-
బీరు, బిర్యానీ తెస్తే ఓకే.. లేదంటే చచ్చారే..!
భోపాల్ : మద్యం, మాంసాహారం తీసుకురావాలని కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తున్న ఓ ఉన్నతాధికారిపై వేటు పడింది. జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు అందడంతో సదరు అధికారిపై చర్యలు తీసుకున్నారు. వివరాలు.. మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా విధులు నిర్వర్తిస్తున్న దిలీప్ మాండవి తన వద్దకు వచ్చే తహసీల్దార్, పట్వారీలు మద్యం, మాంసాహారం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాడు. ఉట్టి చేతులతో వచ్చే వారిని నానా బూతులు తిడుతూ వేధింపులకు దిగుతున్నాడు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అందడంతో అతన్ని డిప్యూటీ సెక్రటరీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
రైల్వే అధికారులకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో శిక్షణ
సాక్షి, న్యూఢిల్లీ : సిగ్నల్ ఫెయిల్యూర్ను నిరోధించేందుకు కృత్రిమ మేథను ప్రవేశపెట్టిన రైల్వేలు తాజాగా సేవలను మెరుగ్గా, వేగంగా అందించేందుకు సీనియర్ అధికారులకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో తర్ఫీదు ఇచ్చేందుకు సిద్ధమైంది. రైల్వే అధికారులు ప్రస్తుతం కీలక సందర్భాల్లో పలు కారణాల రీత్యా సత్వర నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్న క్రమంలో ఈ శిక్షణకు ప్రాధాన్యత ఏర్పడింది. సవాళ్లతో కూడిన సందార్భలు ఎదురైన సమయంలో అధికారులు తీవ్ర ఒత్తిడికి లోనవడంతో ఆ ప్రభావం వారి నిర్ణయాలపై పడుతున్నదని రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. భారతీయ రైల్వేలను ప్రక్షాళన చేసే క్రమంలో అంతర్జాతీయంగా పేరున్న శిక్షణా సంస్థ నేతృత్వంలో ఉన్నతాధికారులకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నాయకత్వ వ్యూహాలపై శిక్షణను అందచేస్తామని చెప్పారు. వదోదరలోని భారతీయ రైల్వేల జాతీయ అకాడమీలో తొలి బ్యాచ్లో జనరల్ మేనేజర్లు, డివిజనల్ రైల్వే మేనేజర్లకు శిక్షణ ఉంటుందని, తర్వాత దశల వారీగా శిక్షణను సీనియర్ అధికారులందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. -
నరకాసుర ‘కోట’...!
అంతేలేని టీడీపీ ముఖ్యనేత తనయుడి ఆగడాలు ప్రతి పనికీ ఓ రేటు..కాదంటే తప్పదు కాలయాపన తన అక్రమాలను వెలికితీస్తున్నవారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు స్థానిక ఎమ్మెల్యే హక్కులను సైతం కాలరాస్తున్న సంఘటనలు ఫిర్యాదు చేసినా చర్యలకు భయపడుతున్న ఉన్నతాధికారులు నరసరావుపేట...ఒకప్పుడు బాంబుల మోతలు...ఫ్యాక్షన్ హత్యలు...ఎన్నికల వేళ రిగ్గింగ్లు. నిత్యం ఉద్రిక్త పరిస్థితులకు ఆలవాలం. పదేళ్లుగా చూస్తే...కక్షలు, కార్పణ్యాలకు దూరంగా, ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాజీవితాలు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరికిస్తే...అటు ఇటుగా పాత రోజులు గుర్తుకు వస్తున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నరసరావుపేట కాస్తా నరకాసుర కోటగా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలా ఎలా మారింది? కారకులెవరు? పాలకులు లేరా? అధికార యంత్రాంగం ఉందా? ఉంటే ఏం చేస్తోంది ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం..! సాక్షి, గుంటూరు : పొలానికి కంచె కాపు కాయాలి..పోలీసు సమాజాన్ని రక్షించాలి...ప్రభుత్వంలో ఉన్న నేతలు ప్రజలను పాలించాలి.. ఈ క్రియలు వేరే కర్తలు చేస్తే జరిగేదేమిటో తెలియంది కాదు. కచ్చితంగా నరసరావుపేటలో ఇదే జరుగుతోందని ప్రజానీకం ఆందోళన చెందుతోంది. అధికార టీడీపీకి చెందిన ఓ ముఖ్యనేత తనయుడు గుప్పెట బిగించారు. అధికారాన్నీ, అధికార యంత్రాంగాన్నీ రైటు, లెఫ్ట్గా మార్చుకున్నారు. పలుకుబడిని, పరపతిని ఎరగా వేస్తున్నారు. మాట వినకపోతే దండోపాయాన్నీ ప్రయోగిస్తున్నారు. అందినకాడికి దోచుకుంటూ దందా నెరుపుతున్నారు. పరిస్థితి దయనీయం... ప్రభుత్వం వచ్చిన కొత్తలో నరసరావుపేట నియోజకవర్గంలో ఏ గ్రామం చూసినా దాడుల భయంతో వణికి పోతూ కనిపించింది. అప్పటి ఎస్పీ సీరియస్గా వ్యవహరించడంతో కొంత మేరశాంతి భద్రతలు అదుపులోకి తేగలిగారు. ప్రస్తుత పరిస్థితి మాత్రం మరింత దయనీయంగా మారిందనే సమాచారం. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నప్పటికీ ఆయన హక్కులను కాలరాసేలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం. కారణం టీడీపీ ముఖ్యనేత తనయుడికి అధికారులు సైతం భయపడతారని అందరికీ తెలిసిందే. అధికారం దాసోహం... నరసరావుపేట నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు భూములు కొనుగోలు చేసుకుని ల్యాండ్ కన్వర్షన్ కోసం అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ముందుగా టీడీపీ ముఖ్యనేత తనయుడి ఆమోద ముద్ర కావాలంటూ స్వయానా రెవెన్యూ అధికారులే ఆయన వద్దకు పంపారంటే అధికారం ఎంతగా దాసోహమైందో ఇట్టే అర్థమవుతోంది. చివరకు ఎకరాకు రూ.50 వేల వంతు న చెల్లిస్తేగానీ ఆయన ఆమోద ముద్ర వేయలేదు. మరో విషయంలో కోటప్పకొండ వద్ద వేసిన వెంచర్కు సంబంధించి ఓ రియల్టర్ అక్షరాల రూ. 50 లక్షలు ముట్టజెప్పితేగానీ ఆమోద ముద్ర పడలేదట. మార్కెట్ యార్డు షాపులను టెండర్ల ద్వారా కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించగా, ముఖ్యనేత తనయుడి ఆదేశాలతో టీడీపీ నేతలు కర్రలు, రాళ్లతో సిద్ధంగా ఉండి టెండరు వేసేందుకు వచ్చినవారిపై దాడిచేసి టెండరు ఫారాలు చించి వేస్తున్నా పోలీసులు సినిమా చూసినట్లు చూశారు. విషయం తెలుసుకున్న విపక్ష ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అక్కడకు చేరుకుని అధికార టీడీపీ దౌర్జన్యానికి నిరసనగా ధర్నా నిర్వహించారు. విషయాన్ని రూరల్ ఎస్పీ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేక పోయింది. ఇవేకాకుండా నరసరావుపేటలో ఓ అపార్టుమెంటు కట్టాలన్నా, రోడ్లు, డ్రెయిన్ల పనులు చేయాలన్నా, కాంట్రాక్టర్లు టీడీపీ ముఖ్యనేత తనయుడు నిర్ణయించిన పర్సంటేజీలు చెల్లించాల్సిందే. మున్సిపాలిటిలో రూ. 5 కోట్లు నిధులు ఉన్నప్పటికీ పర్సంటేజీలు కుదరకపోవడంతో కొన్నాళ్లుగా 34 అంశాలను రద్దు చేస్తూ వస్తున్నారు. అయితే తన అక్ర మాలను బహిర్గతం చేస్తున్న వారిపై ఆయన అన అనుచరులతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తూ తన దందా కొనసాగించడం కొసమెరుపు.! -
గవర్నర్ తో ఇరు రాష్ట్రాల అధికారుల భేటీ
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అత్యున్నత స్థాయి అధికారులు సమావేశమయ్యారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు, ప్రధాన కార్యదర్శులు డీజీపీలు అనురాగ్ శర్మ, జేవీ రాముడు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి రాజధాని పరిధి, తదితర విషయాలపై చర్చించారు. ఇరు రాష్ట్రాలకు హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండనున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్, తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.