breaking news
tiruvuru police station
-
తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ..
తిరువూరు: టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఈ నెల 7న టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు రానున్న సందర్భంగా ఏర్పాట్ల పరిశీలనకు విచ్చేసిన నాయకుల నడుమ ప్లెక్సీ వివాదం ఘర్షణకు దారితీసింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రాంమోహన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, టీడీపీ నేత నాగుల్మీరాలతో కలిసి కేశినేని నాని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈలోగా పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి దేవదత్ ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఎంపీ నాని ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఉద్దేశపూర్వకంగానే ఎంపీ ఫొటో ప్లెక్సీలో లేకుండా చేశారని ఆరోపిస్తూ కార్యాలయం బయట నాని వర్గం బైఠాయించింది. ఇందుకు నియోజకవర్గ ఇన్చార్జి దేవదత్ కారణమని ఆరోపిస్తూ ఆయనపై దాడికి యత్నించారు. స్థానిక నేతలు దేవదత్ను ఒక గదిలో ఉంచి తలుపులు వేశారు. బహిరంగ సభాస్థలిని పరిశీలించిన అనంతరం నాని సోదరుడు చిన్ని కూడా పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. చిన్నీ గో బ్యాక్ అంటూ నాని వర్గం గేటు వద్ద బైఠాయించగా, పోలీసులు చిన్నీని కార్యాలయంలోకి తీసుకెళ్ళారు. ఏర్పాట్లపై సమీక్ష జరిపే అవకాశం లేకుండా ఇరు వర్గాల కార్యకర్తలు టీడీపీ కార్యాలయ ఆవరణలో కుర్చీలు విసురుకుంటూ దాడులకు పాల్పడుతూ గందరగోళం సృష్టించారు. జిందాబాద్, గో బ్యాక్ నినాదాలతో సుమారు రెండు గంటల పాటు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఆఫీసులో కుర్చీలు విసురుకుంటున్న కార్యకర్తలు ఎస్ఐపై కార్యకర్తల దాడి.. టీడీపీ వర్గవిబేధాల నేపథ్యంలో బుధవారం తిరువూరు పార్టీ కార్యాలయంలో ఘర్షణ పడిన కార్యకర్తలు పోలీసులపైనే దాడులకు పాల్పడ్డారు. రణరంగాన్ని తలపించే రీతిలో కార్యాలయంలో ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్నిల వర్గీయులు దాడికి తెగపడి కుర్చీలు విసురుకున్నారు. పరిస్థితి అదుపు చేయడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు సీఐ అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదర గొట్టినప్పటికీ రెచ్చగొట్టే ధోరణిలో నాని, చిన్నీల అనుచరులు బీభత్సం సృష్టించారు. చేతికందిన వస్తువుల్ని విసురుకుంటూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఇరువర్గాలను పోలీసులు శాంతింపజేసే యత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. గాయపడిన ఎస్ఐ సతీష్ తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు, విస్సన్నపేట మండలాల నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశానికి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ సంఘటనతో భయాందోళనలకు గురై పరుగులు తీశారు. దాడులకు పాల్పడవద్దని, శాంతియుతంగా వ్యవహరించాలని పదే పదే కోరినా ఫలితం లేకపోవడంతో లాఠీఛార్జీ చేసి అల్లరిమూకలను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై కొందరు కుర్చీలు విసిరారు. ఈ దాడిలో తిరువూరు ఎస్ఐ సతీష్ తలకు బలమైన గాయమైంది. ఎట్టకేలకు ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఎస్ఐ సతీష్ను ఆసుపత్రికి తరలించారు. కవ్వింపు చర్యలకు పాల్పడిన ఇరువర్గాలు.. పార్టీ కార్యాలయంలో పరిస్థితి చేయి దాటుతున్నప్పటికీ ఎంపీ నాని, చిన్ని ఏమాత్రం వెనక్కు తగ్గకుండా మీడియాతో మాట్లాడేందుకు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పోలీసులు సైతం అదుపు చేయలేకపోయారు. తోపులాటలో ఒక మహిళా కార్యకర్తకు సైతం గాయాలయ్యాయి. చంద్రబాబు పర్యటన గురించి ఏమాత్రం సమీక్షించకుండానే గద్దె రామ్మోహన్, తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు తదితరులు వెళ్ళిపోయారు. దళితుడిని కాబట్టి షటప్, గెటవుట్ అంటారా.. ‘నేనొక దళిత నాయకుడిని. నన్ను షటప్, గెటవుట్ అంటారా. నాలుగు గోడల మధ్య మీరు అంటే సరిపోయిందా. బయటకు వచ్చి అందరి ముందు ఇవే మాటలు అనండ’ని తిరువూరు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి ఎస్.దేవదత్తు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేశినేని నాని, ఆయన వర్గీయులు తాను ఏర్పాటు చేసుకున్న టీడీపీ కార్యాలయానికి వచ్చి పరుష పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేశినేని చిన్ని తన వర్గీయులతో కలిసి పక్కనే ఉండగా దేవదత్తు మాట్లాడిన అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన మాటల్లోనే.. ‘దళితుడినైన నేను ఉన్నత విద్యను అభ్యసించి, 15 సంవత్సరాలు వివిధ దేశాల్లో పనిచేసి జ్ఞానం పొందా. నేనేదో సమావేశంలో మాట్లాడబోతుంటే నా ఆఫీసుకే వచ్చి నన్ను షటప్, గెటవుట్ అని కేశినేని నాని అంటారా.. నా ఆఫీసులో నాకు మాట్లాడే హక్కు లేదా? రెండు సార్లు గెలిచిన మీకే హక్కు ఉందా? మీరేనా నియోజకవర్గ నాయకులు. మేము కాదా. మాకు అవకాశం లేదా. మాకు చెప్పుకునే అర్హత లేదా. ఇంకా ఎంతకాలం మీరు దళితులపై ఇలా హీనంగా మాట్లాడతారు. ఏడు నియోజకవర్గాలను గెలిపిస్తామంటున్నారు. ఎక్కడ గెలిపించారు. మీరు మాత్రమే గెలిచారు. తక్కినవి ఓడిపోయారు’. దాడి సంఘటనపై కేసు నమోదు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరువూరు ఎస్ఐ సతీష్పై దాడికి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ రమేష్ తెలిపారు. తిరువూరు పోలీసుస్టేషన్లో బుధవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఇరువర్గాలు దాడికి పాల్పడుతుండగా అదుపు చేయడానికి యత్నించిన ఎస్ఐ సతీష్కు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఎస్ఐపై దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామన్నారు. నిందితులను అరెస్టు చేస్తాం.. తిరువూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎస్ఐ సతీష్పై దాడికి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేశాం. నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు. శాంతిభద్రతలు కాపాడటానికి యత్నించిన పోలీసులపై విచక్షణా రహితంగా దాడి చేయడం శోచనీయం. సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను గుర్తించి అరెస్టు చేస్తాం. – కాంతి రాణా టాటా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ -
కుమారుడి అన్నప్రాసన పిలుపులకు వెళ్తూ..
సాక్షి, తిరువూరు : కుమారుడి అన్న ప్రాసన శుభకార్యానికి రావాల్సిందిగా పిలుపులకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ కల్వర్టులో పడి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. రహదారిపై ఆరు నెలల క్రితం ధ్వంసమైన కల్వర్టును పునర్నిర్మించడంలో తిరువూరు నగర పంచాయతీ ప్రదర్శించిన నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. పీటీ కొత్తూరు నుంచి తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్లే రహదారిని సీసీ రోడ్డుగా అభివృద్ధి చేసిన అధికారులు కల్వర్టు నిర్మాణం చేయలేదు. బలహీనంగా ఉన్న కల్వర్టు నిర్మించకపోవడంతో గానుగపాడుకు చెందిన యువకుడు బట్ట రామకృష్ణ (26) బైక్పై వెళ్తూ ప్రమాదవశాత్తూ ఆ గోతిలో పడి మృతి చెందాడు. కుమారుడి అన్న ప్రాసన మరో రెండు రోజుల్లో జరపడానికి బం ధుమిత్రులను పి లిచేందుకు వెళ్లిన భర్త కానరాని లోకాలకు చేరడంతో అతని భార్య విలపిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడి కుటుంబాన్ని స్థానిక సామాజిక ఆస్పత్రిలో ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి పరామర్శించి ఓదార్చారు. -
ఎటూ తేలని 'చిన్నారి' పంచాయితీ
ఇద్దరు తల్లుల నడుమ నలిగిపోతున్న 2 సంవత్సరాల చిన్నారి పంచాయితీ ఎటూ తేలకపోవడంతో స్త్రీ శిశుసంక్షేమ శాఖాధికారులు శుక్రవారం బిడ్డను బుద్ధవరంలోని చైల్డ్కేర్సెంటరుకు అప్పగించారు. దాదాపు మూడు నెలలుగా కొనసాగుతున్న చిన్నారి వివాదం ముదిరిపాకాన పడడంతో తిరువూరు పోలీసుస్టేషనులో గురువారం పంచాయితీ చేసిన విషయం విదితమే. అయితే చిన్నారి కోసం కన్నతల్లి హేమలత, పెంచిన తల్లి విమల ఎవరికి వారే పట్టుదలకు పోవడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలని ఐసీడీఎస్ సీడీపీవో అంకమాంబను కోరారు. దీంతో ఇరువురి వాదనల్లో నిజమెంతో తేలేవరకు ఆ బిడ్డను చైల్డ్ కేర్ సెంటరుకు అప్పగించామని సీడీపీవో అంకమాంబ తెలియజేశారు.కాగా చైల్డ్కేర్ సెంటరుకు బిడ్డను అప్పగిస్తారని తెలియడంతో హేమలత, విమలల మధ్య రాజీకుదర్చడానికి కొందరు పెద్దలు చేసిన ప్రయత్నం విఫలమయింది. పత్తాలేని మధ్యవర్తులు... హేమలత బిడ్డను పెంచుతామని డబ్బులు తీసుకున్న తిరువూరుకు చెందిన విజయనాధం అనే వ్యక్తి కనిపించకపోవడంతో సమస్య జఠిలమైంది. విజయనాథం నుంచి ఆ బిడ్డను తీసుకున్న మరో వ్యక్తి తన సమీపబంధువైన విమలకు సంతానం లేకపోవడంతో పెంపకం నిమిత్తం అప్పగించారు. అయితే తాము పెంచుకుంటున్న పాపను విక్రయించడానికే హేమలత మళ్లీ వివాదం సృష్టిస్తోందని విమల ఫిర్యాదులో పేర్కొంది. పాపం పసిపాప.... ఆ పాపకు తల్లిదండ్రులు ఎవరో తెలియదు. తనను అల్లారు ముద్దుగా పెంచుతున్న వారితో బోసినవ్వులు నవ్వుతూ, నవ్విస్తూ 19 నెలలు గడిపింది. దేవుడిచ్చిన వరంగా భావించిన ఆ దంపతులు ఈ పాపను అపురూపంగా పెంచుకున్నారు. విధి ఎంత విచిత్రంగా ఉంటుందటే ఆ పాపతో పాటు పెంచుకుంటున్న వారిలోనూ వేదన మిగిల్చింది. పాప తన కూతురంటూ వచ్చిన తల్లిలోనూ అదే వేదన మిగిలింది. ఈ పాపను ఎవరి వద్ద ఉంచాలనేది అధికారులతో పాటు ఎవరూ తేల్చి చెప్పలేని పరిస్థితి వచ్చింది. అసలేం జరిగిందంటే.... నాలుగేళ్ల క్రితం తిరువూరుకు చెందిన బల్లిపర విజయనాధంకు నెల్లూరుకు చెందిన హేమలత చెన్నైలో పరిచయం అయింది. ఆమె వద్ద ఉన్న తొమ్మిది నెలల కుమార్తెను విజయనాధంకు ఇచ్చి కనిపిచకుండా పోయింది. విజయనాధం ఆ పాపను తిరువూరులోని గద్దల సందీప్, విమల దంపతులకు ఇచ్చాడు. వీరికి నాలుగేళ్ల క్రితం పెళ్లయినా పిల్లలు పుట్టలేదు. విజయనాధం ఈ పాపను ఇవ్వడంతో దేవుని ప్రసాదమని భావించి తీసుకున్నారు. నా బిడ్డను నాకివ్వండి... పందొమ్మిది నెలల్లో రెండుసార్లు హేమలత విమల దంపతుల వద్దకు వచ్చింది. తన కుమార్తెను తనకు ఇవ్వాలని కోరింది. అయితే వారు ఆమె కోరికను తిరస్కరించారు. నాలుగు నెలల క్రితం మరోసారి వచ్చిన హేమలత ఇలాగే అడిగి వెళ్లిపోయింది. అయితే వారం రోజుల క్రితం తిరువూరు వచ్చి తన కుమార్తెను తనకు ఇవ్వాలంటూ గొడవ చేసింది. దీంతో విమల దంపతులు పోలీసులను ఆశ్రయించారు. పోలీస్స్టేషన్లో జరిగిన పంచాయితీ ఎటూ తేలకపోవడంతోనూ, కన్నతల్లినని చెప్పుకుంటున్న హేమలత వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో పాపను పోలీసులు ఐసీడీఎస్ వారికి అప్పగించారు.