breaking news
Time to vote
-
USA Presidential Elections 2024: పోలింగ్ డే ఉచితాలు
మన లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ను పెంచేందుకు.. కొన్ని కంపెనీలు ఇచ్చిన ఆఫర్లు గుర్తున్నాయా? ఓటేస్తే ఉచితంగా బీర్, రెస్టారెంట్లో బిల్లుపై డిస్కౌంట్, పోలింగ్ కేంద్రానికి ఉచిత ప్రయాణం..! ఆ... అలాంటి ఆఫర్లే ఇప్పుడు అమెరికా ఎన్నికల్లోనూ ఓటర్లకు పలు కంపెనీలు ఇస్తున్నాయి. 2,000 కంటే ఎక్కువ కంపెనీలు ‘టైమ్ టు ఓట్’ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నాయి. ఉద్యోగులు ఓటు వేసేందుకు అనుగుణంగా పని షెడ్యూల్ను అందుబాటులోకి తెచ్చాయి. ఓటేయడానికి వెళ్లేందుకు ఉచిత ప్రయాణాల నుంచి.. ఓటేసిన వారికి ఉచిత డోనట్స్వరకు కొన్ని సంస్థలో ఉచితాలు ప్రకటించాయి. → పోలింగ్ రోజు ఉబర్ యాప్లోని ‘గో ఓట్’ ఆప్షన్పై క్లిక్ చేస్తే యూజర్లకు రకరకాల ఆఫర్లు వస్తాయి. పోలింగ్ కేంద్రానికి ప్రయాణాలపై 50 శాతం డిస్కౌంట్ (10 డాలర్ల వరకు) పొందవచ్చు. సమీపంలోని పోలింగ్ కేంద్రాన్ని కూడా యాప్లో తెలుసుకోవచ్చు. ఉబర్ ఈట్స్ కూడా 25 శాతం డిస్కౌంట్పై ఆర్డర్లను అందిస్తోంది. → పోలింగ్ రోజున 50 శాతం డిస్కౌంట్ (10 డాలర్ల దాకా) ఇస్తున్నట్లు ‘లిఫ్ట్’ యాప్ తెలిపింది. యూజర్లు నవంబర్ 5లోగా రైడ్ కోడ్ ఓటీటీ24ను ప్రీలోడ్ చేసుకోవచ్చు. దీనివ్లల కనీసం 30 లక్షల మంది ఓటేసేందుకు వస్తారని లిఫ్ట్ అంటోంది. → కారు రెంటల్ కంపెనీ హెరŠట్జ్ ‘డ్రైవ్ ది ఓట్’ డీల్లో భాగంగా అక్టోబర్ 21 నుంచి నవంబర్ 5 దాకా రెండు, అంతకంటే ఎక్కువ రోజులు రెంట్కు తీసుకునే వారికి ఒక రోజు రెంట్ డిస్కౌంట్ ఇస్తోంది. → సెలవు దినాల్లో ఆఫర్లు ప్రకటించే క్రిస్పీ క్రీమ్.. ఉచితంగా డోనట్స్ ఆఫర్ చేస్తోంది. యూఎస్లోని అన్ని క్రిస్పీ క్రీమ్ దుకాణాలు ఓటేసిన వారికి ఉచిత ఒరిజినల్ గ్లేజ్డ్ డోనట్ అందిస్తున్నాయి. → ఓటేసినట్టు రుజువు చూపించి తమ స్టోర్లో ఏదైనా కొనుగోలు చేస్తే ఉచిత షేక్ ఇస్తామని డైనర్ స్టైల్ చైన్ జానీ రాకెట్స్ ప్రకటించింది. → 400 కంటే ఎక్కువ స్టోర్లున్న రౌండ్ టేబుల్ పిజ్జా పలు ఆఫర్లు ప్రకటించింది. తమ అతి పెద్ద పిజ్జాపై ఆరు డాలర్ల డిస్కౌంట్ ఇస్తోంది. → ఫర్నిచర్ స్టోర్ ఐకియా కూడా ఓటింగ్ డే నాడు ఓటర్లకు ఫ్రోజెన్ యోగర్ట్ ఉచితంగా ఇస్తోంది. → ఎనిమిది రాష్ట్రాల్లో 50 రెస్టారెంట్లున్న లేజీ డాగ్ కూడా ‘ఐ ఓట్’ స్టిక్కర్ ఉన్నవారికి ఎంట్రీ కొనుగోలుపై నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ ఉచితంగా అందిస్తోంది. → ఓటింగ్ రోజు ఉచిత ప్రయాణాన్ని ‘లైమ్’ అందుబాటులోకి తెచ్చింది. ఓటర్లు చెకౌట్ ఆప్షన్ దగ్గర కోడ్ Vౖఖీఉ2024 నమోదు చేస్తే లైమ్ స్కూటర్, బైక్ రైడ్తో పోలింగ్ కేంద్రానికి ఉచితంగా వెళ్లొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అవును... ఆ ఊరొకటుంది!
ఎన్నికల సమయంలో.... ఓట్ల కోసం ఆ గ్రామానికి కాలినడకన నేతలు వెళతారు. గుక్కెడు నీటి కోసం అక్కడి కొండరెడ్లు పడుతున్న కష్టాలు కళ్లార చూస్తారు...జాలిపడతారు...సమస్యతీరుస్తామని హామీలు ఇస్తారు. ఎన్నికలు అయ్యాక... ఓడిపోయిన వారేకాదు... గెలిచిన వారికి కూడా ఆగ్రామం పట్టదు. ఓట్ల సమయంలో వారు ఇచ్చిన హామీలు గుర్తుకురావు. గత యాభైఏళ్లుగా ఇదే ఒరవడికి అలవాటుపడ్డ ఆగ్రామం వేలేరుపాడు మండలంలోని కాకిస్నూర్. కాకిస్నూర్...అటవీ ప్రాతంలో అత్యంత మారుమూలన ఉంది. ఎలాంటి రహదారి, విద్యుత్ సౌకర్యంలేని ఈ గ్రామానికి వెళ్లాలంటే గోదావరి మార్గంగుండా వెళ్లాల్సిందే. వేలేరుపాడు మండలం టేకుపల్లి దాటాక గోదావరి ఒడ్డునుంచి రెండు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తే పెద్దగుట్ట పై ఈ గ్రామం కనబడుతుంది.ఇక్కడ మొత్తం 120 కొండరెడ్ల కుటుంబాలున్నాయి. ఈ గ్రామం ఏర్పడి దాదాపు వందేళ్లు అవుతోంది. ఈ గ్రామస్తులు ఆది నుంచి తాగునీటి కోసం పడుతున్న పాట్లు వర్ణనాతీతం. గ్రామానికి చేరువలో ఉన్న పాపికొండల కాల్వ నీళ్లే వీరికి తాగునీరు. ఈ కాల్వ వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ సమయంలో ఈ నీరంతా ఎర్రని బురదలా ఉండటంతో తాగలేరు. వర్షం నీటిని మాత్రమే తాగునీరుగా వినియోగిస్తారు. అదె లా అంటే... ఓ పలుచటి గుడ్డను నాలుగువైపులా తాళ్లతో కట్టి మధ్యలో రాయి ఉంచుతారు. దాని కింద బిందెపెట్టి నీళ్లు పట్టుకుంటారు. ఆ నీటిని వర్షాకాలం సీజన్లో తాగుతారు. ఆ తర్వాత రోజుల్లో పాపికొండల కాల్వే వీరికి దిక్కు. అటవీ ప్రాంతంలో పెద్ద పెద్ద గుట్టల నడుమ ఆకులు అలమలు పడి పారే ఈ కాల్వ చెలమల్లో నీటిని తోడుకొని తాగుతున్నారు. చెలమల నుంచి నీళ్ల బిందెలతో మహిళలు గుట్ట పైకి ఎక్కుతూ పడరాని పాట్లు పడుతున్నారు. ఈ కలుషిత నీరు తాగడం వల్ల రోగాలబారిన పడుతున్నారు. ఈ గ్రామంలో కనీసం మంచినీటి చేతిపంపు వేయించేందుకు నేతలు ఎవరూ ప్రయత్నించిన దాఖలాలు కూడా లేవు. ఎప్పటిలాగానే ఈ ఎన్నికల్లో కూడా నాయకులు గ్రామం బాటపట్టారు...హామీల వర్షం కురిపిస్తున్నారు...ఎప్పటికైనా సమస్య తీరకపోతుందా అని కొండరెడ్లు ఆశపడుతున్నారు.