breaking news
tickets heavy rates
-
ICC World Cup 2023: ఒక రోజు హోటల్ అద్దె లక్షన్నర
అహ్మదాబాద్ పంట పండింది. ఆదివారం జరగనున్న ఇండియా– ఆస్ట్రేలియా వరల్డ్కప్ వన్డే క్రికెట్ ఫైనల్స్ సందర్భంగా ఆ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియం జాతీయ, అంతర్జాతీయ విమానాలు అభిమానులతో దిగనున్నాయి. మరి హోటల్ రూమ్లు? టికెట్లు? ఏవీ దొరకట్లేదు. రేట్లు చూస్తే గుండె గుభేల్స్. ప్రతి విశేషమూ వైరలే. ‘ఆల్ రోడ్స్ లీడ్ టు అహ్మదాబాద్’. క్రికెట్ జ్వరం, క్రికెట్ జలుబు, క్రికెట్ దగ్గు, క్రికెట్ కలవరింతలు, క్రికెట్ స్లీప్ వాక్... ఇవన్నీ ఉన్నవారు లేనివారు కూడా అహ్మదాబాద్కు చలో అంటున్నారు. అక్కడ లక్ష మంది పట్టే స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్స్. ఇండియా వెర్సస్ ఆస్ట్రేలియా. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మనవాళ్లు ఫైనల్స్. ఇది నేరుగా చూడ దగ్గ మేచ్యే గాని... టీవీలలో చూడ మ్యాచ్ కాదే... కాదు కాకూడదు అనుకుంటే మరి అహ్మదాబాద్ వెళ్లుట ఎటుల? వెళ్లెను పో అక్కడ ఆశ్రయం పొందుట ఎటుల? పొందెను పో టికెట్ సాధించుట ఎటుల?.. అన్నట్టుగా అందరూ సతమతమవుతున్నారు. అందరి దగ్గరా డబ్బులు ఉన్నాయి. కాని ఫ్లయిట్ టికెట్లు లేవు. ఒకప్పుడు ఢిల్లీ అహ్మదాబాద్ ఫ్లయిట్ టికెట్ మహా అయితే 4000. ఇప్పుడు 2500. అహ్మదాబాద్లో అత్యంత ఖరీదైన హోటల్లో రూమ్ అరవై వేలు దాకా ఉంటుంది. కాని ఇప్పుడు మామూలు హోటల్లో కూడా లక్షన్నర అడుగుతున్నారు. ఇస్తామన్నా దొరకడం లేదు. స్టేడియంలో అడుగు పెట్టడానికి 2000 టికెట్ 34 వేలకు అమ్ముతున్నారు. 2500 టికెట్ 42 వేలు. పదివేల టికెట్ అయితే లక్షా అరవై రెండు వేలు. మన దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా అభిమానులు నేరుగా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండటం వల్ల అక్కడ స్ట్రీట్ ఫుడ్డు, రెస్టరెంట్ బిజినెస్, క్యాబ్ల వాళ్లు ఆటోల వాళ్లు అందరూ రాత్రికి రాత్రి కుబేరులు అయ్యేలా ఉన్నారు. గుడ్. నగరాలకు ఇలాంటి జ్ఞాపకాలు ఉండాలి. 100 కోట్ల జాతకం ఎలా ఉందో! చూడండి తమాషా. ‘ఆస్ట్రోటాక్’ యాప్ ప్రవేశపెట్టి, దేశ విదేశాలలో ఉన్న భారతీయులు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నట్టుగా జ్యోతిష్యుణ్ణి బుక్ చేసుకునేలా చేసి కోట్లు గడించిన ఆ యాప్ ఫౌండర్ పునీత్ గుప్తాకు ఫైనల్స్ జాతకం ఏమిటో కచ్చితంగా తెలియదు. ‘రేపు ఇండియాదే గెలుపు. మా ఆస్ట్రోటాక్ జోస్యం నిజం అవుతుంది చూడండి’ అనట్లేదు అతడు. ‘ఇండియా కనుక కప్పు గెలిస్తే మా యాప్ యూజ్ చేసేవారికి 100 కోట్లు పంచుతా’ అంటున్నాడు. 2011లో ఇండియా వరల్డ్ కప్లో గెలిచినప్పుడు తాను కాలేజీ చదువులు చదువుతున్నానని, ఇప్పుడు సంపాదించాను కనుక ఆ సంతోషాన్ని 100 కోట్లు పంచి పంచుకుంటానని అంటున్నాడు. ఏమో మన జాతకం ఎలా ఉందోనని ఆస్ట్రోటాక్ యూజర్లు ఆశగా చూస్తున్నారు. ఇతగాడు ఇలాంటి వాగ్దానాలు చేస్తుంటే మనవాళ్లు కప్పు కొడితే ఫలానా బీచ్లో బట్టలు విప్పుతానని ఒక హీరోయిన్ హల్చల్ చేసింది. ఇక మొక్కులు, పొట్టేళ్లు ఎంతమంది అనుకున్నారో తెలియదు. కమాన్ ఇండియా! జాతకం తిరగరాయి. -
పయనం ... ప్రయాస
పండగ ప్రయాణం తడిసిమోపెడే.. చార్జీల మోత మోగించనున్న ప్రైవేటు ట్రావెల్స్ అదే దారిలో ఆర్టీసీ కూడా.. రైళ్లలోనూ భారీగా వెయిటింగ్ లిస్ట్ హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చే ఆర్టీసీ బస్సులలో సైతం టిక్కెట్లు దాదాపు నిండుకున్నాయి. ప్రత్యేక బస్సులు వేసి చార్జీలను 50 శాతం పెంచే అవకాశమున్నందున ప్రయాణికులపై భారం ఎక్కువగానే పడనుంది. పండగ సందర్భంగా ఆర్టీసీ నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయబోమని మంత్రి శిద్దా చెప్పారు. కానీ, ఇందుకు సంబంధించి కొత్తగా ఎటువంటి ఉత్తర్వులూ విడుదల కాలేదు. మరోపక్క ప్రత్యేక బస్సులంటూ నగరాల్లో తిరిగే మెట్రో సర్వీసులను, తెలుగు వెలుగు బస్సులను సహితం వినియోగించే అవకాశమున్నందున పండగ ప్రయాణం ప్రయాణికులకు పరీక్షగానే మారనుంది. అమలాపురం : ఇంటిల్లిపాదీ కలిసి.. ఏడాదికొక్కసారి ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండగ సంక్రాంతి. ఉపాధికి ఎక్కడెక్కడికో వెళ్లినవారంతా.. మూడు రోజులపాటు జరిగే ఈ పండగ కోసం.. రెక్కలు కట్టుకుని మరీ సొంతూళ్లలో వాలిపోవాలని కోరుకుంటారు. ఈ సెంటిమెంటును ప్రైవేటు రవాణా సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఆర్టీసీ కూడా అదే బాటలో పయనిస్తోంది. రైల్వేలో ఇప్పటికే చాంతాడంత వెయిటింగ్ లిస్టు ఉండడం, ఆశించిన స్థాయిలో ప్రత్యేక రైళ్లు నడిపే అవకాశం లేకపోవడం వీరికి పండగగా మారింది. పండక్కి వచ్చే వారిలో 70 శాతం మంది హైదరాబాద్ నుంచే ఉంటారు. తరువాత విశాఖ, విజయవాడ, అమలాపురం, తిరుపతి, చెన్నై, బెంగళూరు తదితర నగరాల నుంచి వచ్చేవారు కూడా ఉంటారు. ఇదే అదునుగా పలువురు బస్సు ఆపరేటర్లు దోపిడీకి తెర తీశారు. పండగ సమయంలో రద్దీగా ఉండే రోజులకు సంబంధించిన టిక్కెట్ల అమ్మకాలను గత నెల 15 నుంచే నిలిపివేశారు. తద్వారా ఆయా రోజులకు సంబంధించి టిక్కెట్లకు కృత్రిమ కొరత సృష్టించి, తద్వారా చార్జీలు పెంచి, ప్రయాణికులను బాదేసేందుకు సిద్ధమవుతున్నారు. పండగల ముందు 11, 12 తేదీల్లో జిల్లాలోని నగరాలు, పట్టణాలు, గ్రామాలకు ఇతర ప్రాంతాల నుంచి తరలివస్తారు. పండగల మూడో రోజైన 15న ఆదివారం కావడంతో చాలా మంది తిరిగి వెళ్లే అవకావముంది. 16, 17 తేదీల్లో తిరిగి వెళ్లేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆయా రోజుల్లో టిక్కెట్ల అమ్మకాలను పలువురు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు దాదాపు నిలిపివేశారు. కొంతమంది ఇస్తున్నా రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి అమలాపురానికి మామూలు రోజుల్లో రూ.800 నుంచి రూ.900 వరకూ ఉండే టిక్కెట్ను రూ.1500 నుంచి రూ.1,800కు విక్రయిస్తున్నారు. అంబాజీపేటకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని రూ.1,600 చేసి టిక్కెట్ కొనుగోలు చేసింది. తిరిగి వెళ్లేటప్పుడు అదే ధరకు టిక్కెట్ ఇవ్వాలన్నా.. అప్పటి పరిస్థితినిబట్టి చూస్తామని సదరు ట్రావెల్స్ సంస్థ చెప్పడంతో ఆమె అవాక్కయ్యింది. ఇప్పుడే చార్జీలు ఇలా ఉంటే 11, 12 తేదీల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పండగ పేరుతో ప్రైవేటు ట్రావెల్స్ అదనపు వసూళ్లు చేస్తే ఊరుకోబోమని రవాణా మంత్రి శిద్దా రాఘవరావు ప్రకటించినా అది ఆచరణకు దూరంగానే ఉంది. ఇక రైల్వేలో కూడా ప్రీమియం తత్కాల్ పేరుతో పండగ సమయంలో భారీగానే గుంజనున్నారు. రిజర్వేష¯ŒS రద్దు చేసుకున్నప్పుడు తిరిగి చెల్లించే సొమ్ములో భారీగా కోత పడుతున్నందున రైల్వే రిజర్వేష¯ŒS అంటేనే పలువురు బెంబేలెత్తుతున్నారు. గత ఏడాది పండగ సమయంలో హైదరాబాద్ నుంచి మధురపూడికి విమానం టిక్కెట్ రూ.11 వేల నుంచి రూ.16 వేల వరకూ పలికింది. సాధారణ సమయంలో ఇదే చార్జీ రూ.2,500కు మించదు. ఇలా ప్రయాణాలు భారంగా మారడంతో సొంత కార్లున్నవారు వాటిలోనే సొంతూళ్లకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.