breaking news
Thumb impressions
-
95 వేలమందికి మళ్లీ ఆధార్
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 95 వేల మంది ఆధార్ కార్డులను సస్పెన్షన్లో పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఆధార్ నమోదు చేసుకుని, నంబర్ పొందినప్పటికీ వారి వేలి ముద్రలు, కనుపాపలు సక్రమంగా నమోదు కాకపోవటంతో యూఐడీ అధికారులు వారి ఆధార్ను పక్కన పెట్టారు. వీరందరికీ సంబంధించిన జాబితాను యూఐడీ అధికారులు బెంగళూరు నుంచి పంపారు. ఆ జాబితాను జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని చౌక ధరల దుకాణాల్లో ప్రదర్శించనున్నారు. జూన్ 1వ తేదీ నుంచి ఆ జాబితాలోని వారంతా దగ్గర్లో ఉన్న మీ-సేవ, ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లో ఉన్న శాశ్వత ఆధార్ సెంటర్లలో వేలిముద్రలు, కనుపాపలు నమోదు చేయించుకుని నమోదు పత్రం తీసుకోవాలని కోరారు. తిరిగి పాత ఆధార్ నంబర్తోనే పునరుద్ధరణ జరుగుతుందని పౌర సరఫరాల శాఖ అధికారి ఉమామహేశ్వరరావు చెప్పారు. -
బాధపెడుతున్న ‘బయోమెట్రిక్’!
తాళ్లూరు, న్యూస్లైన్ : సామాజిక పింఛన్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రవేశ పెట్టిన బయోమెట్రిక్ విధానం లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది. కొందరు వృద్ధ లబ్ధిదారుల వేలి ముద్రలు సరిపోలక వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. చేతివేలి ముద్రలు అరిగిపోయిన వృద్ధుల అవస్థ వర్ణనాతీతంగా ఉంది. ఇప్పటికే మూడు నెలల నుంచి పింఛన్లు అందుకోలేక పోవడంతో ఇకపై పింఛన్ వస్తుందో రాదో అన్న ఆందోళన వారిలో నెలకొంది. దర్శి నియోజకవర్గంలో దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో మొత్తం 21,222 మంది సామాజిక పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. అందులో 1805 మంది లబ్ధిదారులకు పింఛన్ నగదు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఒక్కొక్క పంచాయతీకిఒక్కొక్క ఫినో సంస్థ కో-ఆర్డినేటర్ ఉండి పింఛన్ల నగదును పంచేవారు. ప్రస్తుతం పోస్టాఫీసులకు అనుసంధానం చేయడంతో పింఛనుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముండ్లమూరు మండలం వేములలోని పోస్టాఫీసు నుంచి పింఛన్ సొమ్ము తీసుకోవాలంటే వేముల బండకు చెందిన వృద్ధులు 4 కిలోమీటర్ల మేర నడిచివెళ్లలేక నరకయాతన పడుతున్నారు. వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోక పోతే రద్దయ్యే అవకాశం ఉంది. దీంతో పింఛనుదారులు ఎంపీడీఓ కార్యాలయాల వద్ద అర్జీలు పెట్టుకునేందుకు వెళుతున్నారు. అక్కడ కూడా సిబ్బంది అందుబాటులో లేకపోవటంతో తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు.