breaking news
thirupahti
-
బలహీన పడుతున్న ‘దిత్వా’.. ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవు
సాక్షి, అమరావతి/తిరుపతి అర్బన్/తిరుమల/ఇందుకూరుపేట/ఒంగోలు సబర్బన్/సాక్షి, చెన్నై: దిత్వా తుపాను ఆదివారం తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతూ క్రమేపీ బలహీనపడుతోంది. సోమవారం తెల్లవారుజాముకల్లా ఇది తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం సాయంత్రానికి ఇది గంటకు 4 కిలోమీటర్ల వేగంతో కదులుతూ చెన్నైకి 150 కిలోమీటర్లు, వేదరన్నియంకు 170, కరైకల్కు 120, కడలూరుకు 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 6.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే జిల్లా నావూరులో 4.8, బుచ్చిరెడ్డిపాలెంలో 4.7, జలదంకిలో 3.6, పులికల్లులో 3.6, తిరుపతి జిల్లా చిట్టమూరులో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. మైపాడు, కోడూరు, జువ్వలదిన్నె, తుమ్మలపెంట, రామాయపట్నం బీచ్లలోకి పర్యాటకులు రాకుండా మెరైన్, స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. తుపాను నేపథ్యంలో చల్లగాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరిగింది. నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు తుపాను ప్రభావంతో సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.తిరుపతి జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం దిత్వా తుపాను తిరుపతి జిల్లాను వణికిస్తోంది. జిల్లాలోని 24 మండలాల్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ తుపాను హెచ్చరికల నేపథ్యంలో సోమవారం తిరుపతి జిల్లాలోని అంగన్వాడీ స్కూల్స్తోపాటు పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో తిరుమలలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందుజాగ్రత్తగా పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను టీటీడీ అధికారులు మూసివేశారు. తిరుమలలోని ఐదు డ్యామ్లు పూర్తిగా నిండినట్లు టీటీడీ వాటర్ వర్క్స్ ఈఈ సుధాకర్రెడ్డి తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ (ఫోన్ నంబర్ 0877 2236007)ను ఏర్పాటు చేశారు.ప్రకాశం, వైఎస్సార్సీపీ కడప జిల్లాల్లో...ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం నుంచి చిరు జల్లులు కురుస్తున్నాయి. సోమ, మంగళవారాలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఒంగోలులోని కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలోనూ శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు వర్షం కురుస్తోంది. జిల్లాలో అత్యధికంగా ఒంటిమిట్టలో 25.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చే దశలో ఉన్న పంటలను వర్షం దెబ్బతీస్తుందని భయపడుతున్నారు. తమిళనాడులో భారీ వర్షం... ఆరుగురు మృతినాగపట్నంలో కుంభవృష్టి... 23 సెం.మీ. వర్షపాతం నమోదు. దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడులోని కావేరి డెల్టా ప్రాంతంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు అతిభారీ వర్షం కురిసింది. కావేరి డెల్టా పరిధిలోని తిరువారూర్, రామనాథపురం జిల్లాల్లో భారీ వర్షం పడింది. అత్యధికంగా నాగపట్నంలో 23 సెం.మీ., మైలాడుతురైలో 20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వివిధ ప్రాంతాల్లో ఆరుగురు మృతిచెందారు. గోడలు, ఇళ్లు కూలి రామనాథపురం జిల్లాలో ముగ్గురు, తుత్కుకూడి, నాగపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు, విద్యుత్ షాక్తో మైలాడుతురై జిల్లాలో ఒకరు మృతిచెందారు. దిత్వా తుపాను ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నాగపట్నం, కడలూరు మీదుగా పుదుచ్చేరి వైపునకు నెమ్మదిగా ప్రయాణించి కరైకాల్–పుదుచ్చేరి మధ్య బలహీన పడుతుండటంతో చెన్నై నగరంతోపాటు శివారు జిల్లాల్లో పెద్దగా వర్షం కురవలేదు. -
May 10 Tirumala: తిరుమలలో నేటి రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 10 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 65,508 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 25,996 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 2.97 కోట్లుగా లెక్క తేలింది. -
తిరుమల: అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు
సాక్షి, తిరుపతి: తిరుమల అలిపిరి మెట్లమార్గంలో భక్తులు విశ్రాంతి తీసుకునే రెండు రాతి మండపాల్లో ఒకటి శిథిలావస్థకు చేరుకుందని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఈవో ఏ.వీ. ధర్మారెడ్డి తెలిపారు. కుడి వైపు ఉన్న రాతి మండపం రిపేరు చేయడానికి కూడా వీలు లేకుండా శిథిలావస్థకు చేరుకుందని వెల్లడించారు. రాతి మండపం రాళ్ళు పునర్నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు. ఇదే కాకుండా శిథిలావస్థకు చేరిన తిరుమలలోని పార్వేట మండపాన్ని కూల్చి పునర్నిర్మాణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. శిథిలావస్థకు చేరిన రాతి మండపాలపై సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఈవో ధర్మారెడ్డి మండిపడ్డారు. 16వ శతాబ్దంలో సాళువ నరసింహరాయులు నిర్మాణం చేసిన.. రాతి మండపాలను యథావిధిగా రూ.1.36 లక్షలు వెచ్చించి 20 పిల్లర్లతో పునర్ నిర్మాణం చేస్తున్నామని స్పష్టం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నడక మార్గంలో చిరుతలు సంచారం తగ్గిన నేపథ్యంలో ఆంక్షలు సడలించామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఘాట్ రోడ్ లో ద్విచక్ర వాహనాలు రాత్రి పది గంటల వరకు అనుమతిస్తున్నామని వెల్లడించారు. కంచె నిర్మాణంపై వైల్డ్ లైఫ్ అధికారులు రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదని అన్నారు. అటవి జంతువుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచామని, సి.సి కెమెరాలుతో పాటు ట్రాప్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: విద్యార్థుల క్షేమమే లక్ష్యంగా మరిన్ని చర్యలు -
ముంచే ఆట..
ఈత చాలా సరదాగా ఉండే ఆట మాత్రమే కాదు. శరీరానికి అవసరమైన వ్యాయామం కూడా. అయితే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇది ముంచేస్తుంది. అందుకే పిల్లలు ఈతకు వెళ్లాలంటే పెద్దలు తోడుండాల్సిందే! ఈత ఆడేటప్పుడు కూడా పెద్దలు గమనిస్తూనే ఉండాలి. లేకుంటే జరగరాని సంఘటన ఏదైనా జరగవచ్చు. తిరుపతి సిటీ : ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. ఇంకో పది రోజుల్లో వేసవి సెలవులు వస్తున్నాయి. ఇప్పుడు చిన్నారులు బడి నుంచి ఇంటికి రాగానే బ్యాగ్ను పక్కన పెట్టి ఆటల బాట పడుతున్నారు. నగరంలో ఈత కొలనులు తగినన్ని లేనందున శివారు ప్రాంతాల్లోని చెరువులు, బావుల్లో ఈత కొట్టేందుకు చిన్నారులు ఉత్సాహం చూపుతున్నారు. తల్లిదండ్రులు వీరిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. బడి ముగిశాక చిన్నారులు స్నేహితులతో ఆటలు ఆడేందుకు ఇష్టపడతారు. కానీ పిల్లలను ఇంటి ఆవరణలో, పరిసర ప్రాంతా ల్లో ఆడుకునేలా, చదువుకునేలా తల్లిదండ్రులు దృష్టిసారిం చాలి. పిల్లలకు ఈత నేర్పాలనుకుంటే తల్లిదండ్రులు కానీ, కుటుంబసభ్యులు కానీ తీసుకెళ్లి వెంట ఉండి నేర్పించడం ఉత్తమం. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్కాంప్లెక్స్లో ఉన్న స్వి మ్మింగ్ పూల్ ఈత నేర్చుకోవడానికి అందుబాటులో ఉంది. దాంతో పాటు తిరుపతి నగరంలోని పలు స్టార్ హోటళ్లలో స్విమ్మింగ్ పూల్స్ అందుబాటులో ఉన్నాయి. గంటకు 500 నుంచి 1000 రూపాయలు లోపు ఫీజు వసూలు చేస్తారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలు - బడి వదలగానే పిల్లలను అవసరమైతే తప్ప బయటకు పంపడం మంచిదికాదు. వీలైతే విశ్రాంతి తీసుకునేలా చూడాలి. - పిల్లల కోసం తల్లిదండ్రులు కొంత సమయాన్ని కేటాయించాలి. వారితో సరదాగా సంతోషంగా, విజ్ఞాన వినోద సంబంధమైన పుస్తకాలు చదివేలా చూడాలి. - పిల్లలకు ఇంటినుంచి బయటకు వెళ్లిన తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేలా అవగాహన కల్పించాలి. - తల్లిదండ్రులకు ఇంటిపనులకు సాయమందించేలా అలవాటు నేర్పించాలి. ఇంటిలోనే ఉంటూ క్యారంబోర్డు, చెస్ వంటి క్రీడలను పిల్లలకు అలవాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేసవి నుంచి ఉపశమనం ఈత నేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా వేసవిలో ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే రోజూ గంట సేపు ఈత కొట్టడం వల్ల శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుంది. కండరాలకు మంచి వ్యాయామం ఉంటుంది. ఎండల్లో పిల్లలు తిరగకుండా ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఎక్కువగా తిరగడం వల్ల డీ హైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం పూట ఎండలో తిరగకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. -
తిరుమలలో రద్దీ సాధారణం
చిత్తూరు: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శానానికి 2 గంటలు, సర్వదర్శనానికి 5 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.


