breaking news
Theories
-
జపానీ జిందగీ
మనిషై పుట్టాక ఊహించని ఉత్పాతాలు, ఉలిదెబ్బలు, ఉలికిపాటులు తప్పవు! అందుకే ‘మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే/ మనసున్న మనిషికి సుఖము లేదంతే’ అన్నారు ఆత్రేయ! అయితే ‘మనసు ఉండాలే కాని, సుఖశాంతులను మనంతట మనమే సొంతం చేసుకోవచ్చు’ అంటున్నారు జపనీయులు.‘మదిలో ఎంత అనురాగం నిండితే అంత వైరాగ్యం’ ఇది మనిషిని స్థిరచిత్తుడిగా మార్చగలిగే గొప్ప మంత్రం! కానీ రాగద్వేషాల నియంత్రణలో ఓటమి లేని కథలు చాలా అరుదు! కాలంతో పరుగులు తీయడం, కాలం రాయని రాతల కోసం తహతహలాడటం, గడచిపోయిన గతాన్ని పదేపదే విశ్లేషించుకోవడం, మిగిలి ఉన్న వయసుని లెక్కలేసుకోవడం ఇవే, ఇవే మనిషికి తీరని వేదనలు. వాటికి తోడు మరణ భయం! ఆ భయం ఊహ తెలిసినప్పటి నుంచి వేధించే మనోగతం! అదెప్పటికీ తప్పని, తప్పించుకోలేని జీవన చక్రం! మనిషిని, మనసునీ అతలాకుతలం చేసే ఆ నిర్వేదం నుంచి బయటపడటానికే ఇప్పుడు ప్రపంచమంతా జపనీయుల వైపు చూస్తోంది. వారు అవలంబించే కొన్ని జీవన విధానాలు మనసుని కుదుటపరుస్తాయట. మనిషిని ఆనందకేళిలో విహరింపజేస్తాయట! అసలేంటా జపాన్ సిద్ధాంతాలు? అవి అంత గొప్పవా?సంతృప్తికరమైన జీవితాన్ని పొందడానికి జపాన్ లో చాలా సిద్ధాంతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రస్తుతం ప్రపంచవాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. ఇంచుమించు ఒకేలాంటి భావాలతో, లోతైన అర్థాలతో రూపొందిన వారి జీవిన విధానం గొప్ప తాత్వికతకు నిదర్శనం! వాటిలో కొన్ని, శతాబ్దాల నాటి సంస్కృతిలో ముడిపడినవి కాగా, మరికొన్ని ఆధునిక జీవనశైలితో తలపడేవి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, జీవిత పరమార్థం తెలుసుకోవడానికి ఆ జీవన విధానాలు వేస్తున్న బాటలేంటీ?జీవితంలో అహ్లాదాన్ని నింపుకోవడానికి జపనీస్ తత్త్వశాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోవాలంటే.. ముందుగా అక్కడ అత్యంత ప్రాచుర్యం పొందిన ‘ఇకిగాయ్’ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. ఇకిగాయ్లో ‘ఇకి’ అంటే జీవితం, ‘గాయ్’ అంటే విలువ లేదా ప్రయోజనం. ఇది జీవితానికి ఒక కారణాన్ని, ఉద్దేశ్యాన్ని ముందుగానే నిర్ధేశించుకోమని చెబుతుంది. రోజు మొదలయ్యేందుకు ఒక కారణాన్ని ఏర్పరచుకుని ప్రయాణించడం ఉత్తమమని బోధిస్తుంది. ఇందులో ప్రధానంగా నాలుగు అంశాలున్నాయి. ఆ నాలుగింటినీ ఒకదానితో ఒకటి మిళితం చేసుకోగలిగినప్పుడు మనం ఇకిగాయ్ అనే లక్ష్యాన్ని సాధించినట్లే. అందుకు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ నాలుగు ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.‘మీరు దేనిని ప్రేమిస్తారు?’ అనేది మొదటి ప్రశ్న. దానికి అనుబంధంగా మీ అభిరుచులు, హాబీలు, ఏ పని చేసినప్పుడు మీరు సమయం గురించి మర్చిపోగలరు? సంతోషంగా ఉండగలరు? అనే అంశాలన్నీ ఆ ప్రశ్నతో పాటే ఉద్భవిస్తాయి. ‘మీ నుంచి ప్రపంచానికి ఏం అవసరం?’ అనేది రెండవ ప్రశ్న. దానిలో భాగంగా ‘మీ చుట్టూ ఉన్న సమాజానికి లేదా ప్రపంచానికి మీరు ఎలా సహాయపడగలరు? ఏ సమస్యలను పరిష్కరించగలరు? సమాజంలో దేన్ని సరిచేయగలరు?’ అనే అంశాలు తోడవుతాయి. ‘మీరు దేనిలో సమర్థులు?’ ఇది మూడవ ప్రశ్న. దానికి అనుబంధంగా మీ నైపుణ్యాలు, ప్రతిభ, మీకు సహజంగా వచ్చే పనులు అన్నీ లెక్కలోకి వస్తాయి.‘దేని నుంచి మీరు డబ్బు పొందగలరు? లేదా సంపాదించుకోగలరు’ ఇది నాలుగవ ప్రశ్న. ఈ ప్రశ్నతో ఇకిగాయ్ సంపూర్ణమవుతుంది. దీనిలో మీ నైపుణ్యాలు, ప్రతిభలను ఉపయోగించి మీరు జీవనోపాధిని ఎలా పొందగలరు?’ అనేది నిర్థారించుకోవచ్చు. ‘ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానాలు దొరికి, ఒకదానితో ఒకటి కలిసే చోట, మీ ఇకిగాయ్ ఏర్పడుతుందని జపనీస్ సంస్కృతి చెబుతుంది.జపాన్ లో, ముఖ్యంగా ఒకినావా వంటి ప్రాంతాలలో ఎక్కువ మంది ప్రజలు నూరేళ్లకు పైగా, సంతోషంగా జీవిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఇకిగాయ్ అని అక్కడి వారు చెబుతున్నారు. తమ జీవితానికి ఒక స్పష్టమైన ఉద్దేశ్యం ఉండటం వల్లే, వారు రోజూ ఉత్సాహంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తారట.మా అనేది రెండు వస్తువుల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని లేదా రెండు సంఘటనల మధ్య ఉన్న విరామాన్ని సూచిస్తుంది. ఆ ఖాళీకి కూడా విలువ ఉంటుందని, ఇది కేవలం శూన్యం కాదని జపనీయులు నమ్ముతారు. సంగీతంలో రెండు స్వరాల మధ్య ఉండే నిశ్శబ్దం, మాటల మధ్య ఏర్పడే చిన్నపాటి విరామం.. ఇవన్నీ ఇందుకు ఉదాహరణలుగా ఈ సిద్ధాంతం చెబుతుంది. మా అనేది ఆలోచించడానికి, ప్రతిబింబించడానికి, అర్థాన్ని కనుగొనడానికి కొంత శూన్యాన్ని సృష్టిస్తుంది. ఆ శూన్యమే మనసుని తేలిక పరుస్తుందని ఈ సిద్ధాంత సారాంశం. జీవితంలో తొందరపడకుండా, ప్రతి క్షణాన్ని ఆస్వాదించమని చెప్పడమే మా ఉద్దేశం.నూరేళ్ల జీవనంప్రపంచ ఆరోగ్య లెక్కల ప్రకారం భారతీయుల సగటు ఆయుర్ధాయం 69 నుంచి 70 సంవత్సరాలు. 80 నుంచి 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవిస్తున్న వారి దేశాల జాబితాలో జపాన్ ముందువరసలో ఉంది! అయితే మలిదశలో కూడా జపనీయులు చాలా సంతోషంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తున్నారట! అందుకు వారి జీవన విధానమే ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు.జపనీయులు ఎల్లప్పుడూ బెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్ని పాటిస్తారు. ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు ఆరోగ్య సంస్థలు పనిచేస్తుంటాయి. అవి ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి.చాలామంది జపనీయులు ఎంత రుచికరమైన ఆహారాన్ని తింటున్నా 80 శాతం కడుపు నిండాక ఆపేస్తారు. అలా చేస్తే దీర్ఘాయువు కలిగి ఉంటామని అక్కడి ప్రజలు నమ్ముతారు.జపాన్ ప్రజలు వయసు పైబడిన తమ కుటుంబ సభ్యులను ఒల్డ్ ఏజ్ హోమ్లకు పంపించరు. కుటుంబ సభ్యుల సంరక్షణ బాధ్యతను చూసుకోవడం వారి సంప్రదాయంగా భావిస్తారు. వృద్ధాప్యంలో కుటుంబంతో కలిసి జీవిస్తే మానసికంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయని, సంతోషంగా జీవిస్తారని, పెద్దలతో కలిసి జీవనం సాగిస్తే భవిష్యత్తుకి ఉపయోగకరమని అక్కడి వారు నమ్ముతారు.నిజానికి జపనీయులు అధిక పరిశుభ్రతను పాటిస్తారు. అక్కడ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యానవనాలు, రోడ్లు, పబ్లిక్ ప్రదేశాలు కూడా చాలా పరిశుభ్రంగా ఉంటాయి.జపాన్ ప్రజలు నెమ్మదిగా, నమిలి నమిలి తినే శైలిని ఇష్టపడతారు. ఒకే పెద్ద ప్లేట్లో కాకుండా చిన్నచిన్న ప్లేట్లలో లేదా చిన్నచిన్న బౌల్స్లో ఆహారాన్ని తినడానికి ప్రాధాన్యమిస్తారు.అక్కడివారు ఎక్కువగా తినే సమయంలో టీవీ చూడటం, సెల్ ఫోన్ వాడటం వంటివి చేయకుండా కుటుంబ సభ్యులంతా కలిసి తింటుంటారు, పైగా చాలామంది డైనింగ్ టేబుల్స్, కుర్చీలు వాడకుండా నేలపై కూర్చుని భోజనం చేయడానికి ఇష్టపడతారు.జపనీస్ ప్రజలు సమతుల ఆహారాన్ని తీసుకుంటారు. పండ్లు, తృణధాన్యాలు, సోయా, ఆకు కూరలు ఎక్కువగా తీసుకుంటారు. వారు తీసుకునే ఆహారాలన్నీ తక్కువ మొత్తంలో కొవ్వులు, చక్కెరలను కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. దాంతో గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి బయటపడవచ్చు. వారు తీసుకునే ఆహారం వల్లే జపాన్ లో ఊబకాయం రేటు చాలా తక్కువగా ఉందని తేలింది.జపాన్లో అన్ని వయసుల వారు నడవడానికే ఇష్టపడతారు. సమీపంలోని ఉన్న గమ్యస్థానాలకు నడిచి వెళ్లిపోతుంటారు. లేదంటే సైకిల్ వాడతారు. అలాగే బాతాఖానీ వేసేటప్పుడు ఎక్కువగా నేలపైనే కూర్చుంటారు. ఈ పద్ధతుల వల్ల పేగులకు, కండరాలకు మంచి వ్యాయామం అవుతుంది. వారి ఆయుర్దాయం పెరగడానికి అవి కూడా దోహదం చేస్తున్నాయి.మొత్తానికి జపనీయులు– సమతుల ఆహారాన్ని తీసుకోవడంతో పాటు ఇతరులకు సహాయం చేయడం, ప్రతి దానిపట్ల కృతజ్ఞతతో ఉండటం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రేమగా కలిసి జీవించడం ఇలా ఎన్నో అంశాలు వారి ఆయుర్దాయాన్ని రెట్టింపు చేస్తున్నాయి.సమస్యల వలయంలో జపాన్ లో జననాల రేటు చాలా తక్కువగా ఉంది, అదే సమయంలో, వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీనివల్ల పని చేసేవారి సంఖ్య తగ్గి, సామాజిక భద్రత, ఆర్థిక వ్యవస్థపై భారీ భారం పడుతోంది. 2060 నాటికి జపాన్ జనాభా 8.67 కోట్లకు పడిపోవచ్చని అంచనా!మరోవైపు వివిధ నివేదికల ప్రకారం, జపాన్లో 15 సంవత్సరాల లోపు పిల్లల సంఖ్య సుమారు 13.7 మిలియన్లు ఉండగా.. ఆ దేశప్రజలు పెంచుకుంటున్న కుక్కలు, పిల్లుల సంఖ్య కలిపి 15.9 మిలియన్లకు పైగా ఉంది. జపాన్ సమాజంలో ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి పెంపుడు జంతువులను ఆశ్రయిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ సమస్యలను పక్కన పెడితే, ఎక్కువ కాలం సంతోషంగా జీవిస్తున్న వారి సంఖ్య జపాన్లో ఎక్కువగా ఉండటంతో ప్రపంచ దేశాలు వారి జీవన విధానంపై దృష్టిపెడుతున్నాయి.యుటోరిఇది జపాన్ లో ఒక విశిష్టమైన భావన. దీనిని తెలుగులో ‘మనసుకి విశ్రాంతినివ్వడం’ లేదా ‘సమయం కేటాయించడం’ అని చెప్పవచ్చు. ఆధునిక ప్రపంచంలో మనం నిరంతరం పరుగులెత్తుతూ, పనిఒత్తిడిలో మునిగిపోతూ, మనసుకి అవసరమైన విరామాన్ని ఇవ్వాలని ఈ సిద్ధాంతం చెబుతోంది.యుటోరి అంటే కేవలం విశ్రాంతి తీసుకోవడమే కాదు, ఇది జీవితంలోని ఆనందాన్ని గుర్తించడానికి ఉద్దేశపూర్వకంగా సమయం కేటాయించుకోవడం కూడా! మరి అందుకేం చెయ్యాలి?వేగాన్ని తగ్గించుకోవాలి – ప్రతి పనిని తొందరగా పూర్తి చేయాలనే ఒత్తిడిని పక్కన పెట్టి, నెమ్మదిగా చేయడం అలవరచుకోవాలి.చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించుకోవాలి– మన చుట్టూ ఉన్న ప్రకృతిని, జీవితంలోని చిన్న చిన్న అద్భుతాలను గమనించడానికి మనసుకు కాస్త సమయం ఇవ్వాలి. ఉదాహరణకు, ఉదయం సూర్యోదయాన్ని చూడడం, ఒక పూలమొక్కను పరిశీలించడం, పక్షుల కిలకిలరావాలు వినడం ఇవన్నీ మనసుని ఉత్తేజపరుస్తాయి.సహజంగా శ్వాస తీసుకోవాలి– నిజానికి ఉరుకుల పరుగుల జీవనంలో కొన్ని రోజుల పాటు మనం ఊపిరి పీల్చుకునే విధాన్ని కూడా గమనించకుండా గడిపేస్తాం. ఒక్క క్షణం ఆగి ఆ పక్రియను గమనిస్తుండాలి. శ్వాస తీసుకోవడాన్ని గమనిస్తే, మనసుకు ఎనలేని హాయి కలుగుతుంది. ధ్యానం, ప్రాణాయామం ఈ తరహాకు చెందినవే!మానసిక విరామం పొందాలి– పనికి, ఆలోచనలకు ఒక విరామమిచ్చి, మనసును ఖాళీగా ఉంచడం నేర్చుకోవాలి.వీటన్నింటినీ పాటిస్తూ మన జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రశాంతంగా మార్చుకోవడమే యుటోరీ లక్ష్యం. ఇది మనస్సుకి ప్రశాంతతను అందించి, జీవితాన్ని మరింత అర్థవంతంగా మారుస్తుంది.మోటైని మోటైని అంటే ‘వృథా చేయవద్దు’ లేదా ‘విలువను గుర్తించు’ అని అర్థం. ఏదైనా వస్తువు, సమయం, శక్తి లేదా వనరులను వృథా చేయకుండా, వాటిని పూర్తిగా వినియోగించుకోమని ఈ సిద్ధాంతం చెబుతుంది. సృష్టిలో ప్రతిదానిపైనా కృతజ్ఞత కలిగి ఉండాలని, ప్రతిదానికీ విలువను, గౌరవాన్ని ఇవ్వాలని ఇది చెబుతుంది. ఉదాహరణకు మిగిలిపోయిన ఆహారాన్ని పారవేయకుండా తినడం, పాత వస్తువులను, వస్త్రాలను తిరిగి ఏదో ఒక రూపంలో వినియోగించడం వంటి ఎన్నో విలువలను ఇది నేర్పిస్తుంది.షిన్–రిన్ యోకు ఇది జపనీయుల మానసిక చికిత్సా విధానంలో ఒక పద్ధతి. షిన్–రిన్ యోకు అంటే ‘ప్రకృతిలో లీనం కావడం’ అని అర్థం. ఇది ప్రకృతిలో, ముఖ్యంగా సురక్షితమైన అటవీ ప్రాంతాల్లో గడిపే ఒకరకమైన వైద్య విధానం. ఇది అడవిలోని ప్రశాంతతను, శబ్దాలను, సువాసనలను, దృశ్యాలను మనసారా పంచుకోమని చెబుతుంది. చెట్ల సువాసనలను పీల్చడం, పక్షుల కిలకిలరావాలు వినడం, ప్రకృతి అందాలను తాకడం, ప్రకృతితో మమేకం కావడం ఇలా ప్రతి అనుభూతిని మన పంచేంద్రియాలతో పూర్తిగా ఆస్వాదించడమే దీని ముఖ్య ఉద్దేశం. అడవుల్లోని ప్రశాంత వాతావరణం, మొక్కల నుంచి వెలువడే కొన్ని రకాల సుగంధాలు ఒత్తిడిని తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. రక్తపోటును తగ్గించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ విధానం ఎంతగానో తోడ్పడుతుంది. ప్రకృతిలో గడిపినప్పుడు మనసు తేలికపడి, ఏకాగ్రత పెరుగుతుంది. ఇది ఆధునిక జీవితంలో ఏర్పడే ఒత్తిడి, ఆందోళనల నుంచి బయటపడటానికి ఒక సహజమైన, ప్రభావవంతమైన మార్గంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది.వాబీ– సాబీ అసంపూర్ణతలోనూ అందం ఉంటుందని చెప్పే గొప్ప తాత్త్వికత ఇది. ప్రతి వస్తువు, ప్రతి మనిషి అసంపూర్ణమేనని చెప్పడంతో పాటు, అందులో కూడా ఒక ప్రత్యేకమైన సౌందర్యం ఉందని, దాన్ని చూడటం నేర్చుకోమని ఈ సిద్ధాంతం చెబుతుంది. నిజానికి దీని ప్రకారం పరిపూర్ణత అనేది ఒక భ్రమ. ఉదాహరణకు పాతబడిన చెక్క బల్లలోనూ, పగిలిన కప్పులోనూ అందాన్ని వెతకగలిగినప్పుడే జీవితాన్ని ఆస్వాదించగలమట. ‘కాలంతో పాటు వచ్చే మార్పులు, పగుళ్లు, లోపాలు, ముడతలు ఇవన్నీ చాలా కథలను చెబుతాయి. వినగలిగితే అవెంతో అద్భుతంగా ఉంటాయి’ అని చెబుతుంది ఈ సిద్ధాంతం. దీని ప్రకారం, లోపాలను లోపాలుగా చూడకుండా వాటిని జీవితంలో ఒక భాగంగా స్వీకరించడంతో, జీవితం పట్ల ఒక కొత్త దృక్పథం ఏర్పడుతుందని వివరిస్తుంది. ఈ విధానాన్ని అనుసరిస్తే మనకు జీవితంలోని మార్పులను, వృద్ధాప్యాన్ని కూడా అంగీకరించగలిగేంత ఓర్పు, నేర్పు అలవడుతుంది.షోషిన్ షోషిన్ అనే సిద్ధాంతం ‘ఎంతటి జ్ఞాని అయినా ఎల్లప్పుడూ జిజ్ఞాసతో జీవించాలి’ అని చెబుతుంది. అంటే ఎంత జ్ఞానమున్నా, ఎంత తెలుసుకున్నా, ‘నాకు అన్నీ తెలుసు’ అని భావించకుండా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలట. నిత్యం కుతూహలంతో, పూర్వపు ఆలోచనల ప్రభావం మనసుపై లేకుండా ప్రతిదాన్ని స్పష్టంగా చూడమని, తెలుసుకోమని ఈ విధానం ప్రోత్సహిస్తుంది. దాంతో సృజనాత్మకత పెరుగుతుంది. అలాగే భయం లేకుండా కొత్తకొత్త ప్రయోగాలు చేయగలిగే సత్తా ఏర్పడుతుంది. దాని వల్ల కూడా ఒక సంతృప్తి ఏర్పడుతుంది.నిజానికి ఎంత గొప్ప నియమమైనా, ఎంత గొప్ప విధివిధానమైనా వివరించి, విశ్లేషించి, అనుభవపూర్వకంగా తెలుసుకుని సిద్ధాంతాలుగా మార్చడమే గొప్ప అనుకుంటే పొరబాటు! దాన్ని తు.చ. తప్పకుండా పాటించి, తాము పాటించిన తత్త్వాన్ని తర్వాత తరాలకు అందించడమే అసలైన గొప్పతనం! అదే చేస్తున్నారు జపనీయులు! గమాన్గమాన్ అంటే సహనం లేదా ఆత్మనిగ్రహం అని అర్థం. సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు కూడా నిశ్చలంగా, గౌరవంగా ఉండమని ఈ భావన సూచిస్తుంది. సమస్యలకు కష్టాలకు నిరాశ చెందకుండా, ఎవరితో చర్చించకుండా, ఫిర్యాదులు చేయకుండా, నిశ్శబ్దంగా పరిస్థితులను ఎదుర్కోమని చెబుతుంది. జపనీస్ సంస్కృతిలో, గమాన్ అనేది ఒక బలమైన లక్షణం. ఇది వ్యక్తిగత కష్టాలను ఎదుర్కోవడానికి, సంఘంలో సామరస్యాన్ని కొనసాగించడానికి ఎంతగానో సహాయపడుతుంది. -
చంద్రుడు మన మామ కాదా?
‘చందమామ రావే.. జాబిల్లి రావే..’, ‘మామా.. చందమామా..’ అని పాటలున్నాయి. ‘కార్తీక పున్నమి వేళలోనా..’ అంటూ గీతాలూ ఉన్నాయి.. చంద్రుడి వెన్నెల తగలగానే రూపమే మారిపోయే జానపద కథలు మరెన్నో ఉన్నాయి.. ఏ దేశం, ఏ సంస్కృతి అనే తేడా లేకుండా చంద్రుడు మనందరికీ అంత దగ్గరైపోయాడు. కానీ చంద్రుడు మనవాడు కాదని, అంతరిక్షంలో తిరుగుతూ ఉంటే.. భూమి లాగేసి పట్టేసుకుందని శాస్త్రవేత్తలు కొత్త సిద్ధాంతాన్ని వెలుగులోకి తెచ్చారు. దీన్ని బలపర్చే పలు ఆధారాలనూ చూపుతున్నారు. చంద్రుడు ఎక్కడివాడు? భూమికి ఎలా దొరికిపోయాడు? ఆ సిద్ధాంతం ఏం చెబుతోంది? దానికి ప్రాతిపదిక ఏమిటనే వివరాలు తెలుసుకుందామా..భూమి నుంచి ఏర్పడిందనే అంచనాతో..చందమామ మన భూమి నుంచే ఏర్పడిందనేది ఇప్పటివరకు ఉన్న సిద్ధాంతం. దాని ప్రకారం.. సూర్యుడు, ఇతర గ్రహాలు ఏర్పడిన కొత్తలో.. అంగారకుడి పరిమాణంలో ఉన్న ‘థియా’అనే గ్రహం భూమిని ఢీకొట్టిందని, అప్పుడు భూమి నుంచి అంతరిక్షంలోకి విసిరివేయబడిన శకలాలు ఒకచోట చేరి చంద్రుడు రూపుదిద్దుకున్నాడు. భూమి గురుత్వాకర్షణ వల్ల గ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సిద్ధాంతాన్ని అందరూ విశ్వసిస్తున్నా.. ఎన్నో సందేహాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలోని పెన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. ఓ ‘బైనరీ గ్రహాల జంట’లో భాగమైన చంద్రుడిని భూమి లాగేసుకుని ఉంటుందని కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.ఎక్కడి నుంచో భూమి లాగేసుకుందా?చందమామ మిస్టరీలు ఎన్నో..నాసా శాస్త్రవేత్తలు చంద్రుడిపై నుంచి తెచ్చిన సుమారు 363 కిలోల రాళ్లు, మట్టిపై పరిశోధనలు చేశారు. ఆ రాళ్లు, మట్టిలో ఉన్న రసాయన సమ్మేళనాలలో కొన్ని భూమ్మీది తరహాలోనే ఉండగా.. మరికొన్ని చాలా విభిన్నంగా ఉన్నట్టు గుర్తించారు. భూమి నుంచే చంద్రుడు ఏర్పడితే.. ఆ రసాయన సమ్మేళనాలు ఎక్కడివనే సందేహాలు ఉన్నాయి. మరో గ్రహం భూమిని ఢీకొట్టడంతో అంతరిక్షంలోకి ఎగిసిపడిన పదార్థాలన్నీ కాలక్రమేణా ఒకచోటికి చేరి చంద్రుడు ఏర్పడినట్టు పాత సిద్ధాంతం చెబుతోంది. కానీ అలా ఎగసిపడిన పదార్థాలు.. శని చుట్టూ ఉన్న వలయాల తరహాలో భూమి మధ్య భాగానికి ఎగువన (భూమధ్య రేఖ ప్రాంతంలో) కేంద్రీకృతం కావాలని... అవన్నీ కలిసిపోయినప్పుడు చంద్రుడు కూడా భూ మధ్య రేఖకు ఎగువనే ఉండాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ చంద్రుడు భూమధ్య రేఖ కన్నా ఏడు డిగ్రీలు ఎగువన, వంపు తిరిగిన కక్ష్యలో పరిభ్రమిస్తున్నాడు. మరో తోడు నుంచి చంద్రుడిని లాగేసుకుని.. సౌర కుటుంబంలో, అంతరిక్షంలో అక్కడక్కడా ‘బైనరీ’ వ్యవస్థలు ఉంటాయి. అంటే కొంచెం అటూ ఇటుగా సమాన పరిమాణం ఉన్న ఖగోళ పదార్థాలు (ఆస్టరాయిడ్లు, గ్రహాల వంటివి..) రెండూ ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతూ ఉంటాయి. అదే సమయంలో ఆ రెండూ కలసి.. ఏదైనా నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. అలాంటి బైనరీ వ్యవస్థలో చంద్రుడు భాగమని కొత్త సిద్ధాంతం చెబుతోంది. ఆ బైనరీ మరుగుజ్జు గ్రహాలు భూమికి సమీ పం నుంచి వెళ్లినప్పుడు.. అందులోని చంద్రుడిని భూమి గురుత్వాకర్షణ శక్తితో లాగేసుకుందని, రెండో మరుగుజ్జు గ్రహం అంతరిక్షంలోకి విసిరివేయబడిందని పేర్కొంటోంది. అలా లాగేసుకోవడం సాధ్యమేనా? విశ్వంలో బైనరీ వ్యవస్థలు ఉండటం, అప్పుడప్పుడూ అలాంటి వాటిలోంచి ఒకదానిని పెద్ద గ్రహాలు, నక్షత్రాల వంటివి లాక్కోవడం సాధారణమేనని శాస్త్రవేత్తలు ఎప్పుడో గుర్తించారు. దీనికి ‘బైనరీ ఎక్సే్ఛంజ్ క్యాప్చర్’గా పేరుపెట్టారు. ఇలా బైనరీ వ్యవస్థ నుంచి ఒకదాన్ని లాక్కున్నప్పుడు.. రెండో గ్రహం/ఆస్టరాయిడ్ వేగంగా విసిరివేసినట్టుగా వెళ్లిపోతుంది.నెప్ట్యూన్ ఉపగ్రహం ట్రిటాన్.. అలా లాగేసుకున్నదే! మన సౌర కుటుంబంలోనే అలాంటివి ఎన్నోసార్లు జరిగాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డారెన్ విలియమ్స్ తెలిపారు. ‘‘ఉదాహరణకు నెప్ట్యూన్ గ్రహానికి ఉన్న ఉపగ్రహాల్లో అతిపెద్దదైన ‘ట్రిటాన్’కూడా ఒకప్పుడు బైనరీ వ్యవస్థలో భాగమే. నెప్ట్యూన్ తనకు దగ్గరగా ఆ వ్యవస్థ వచ్చినప్పుడు.. ట్రిటాన్ను లాగేసుకుందని ఇప్పటికే గుర్తించారు. అంతేకాదు ట్రిటాన్ ఉపగ్రహం నెప్ట్యూన్ చుట్టూ.. దాని మధ్యరేఖ ఎగువన కాకుండా, 67 డిగ్రీలు వంపు తిరిగిన కక్ష్యలో పరిభ్రమిస్తోంది. మన చంద్రుడు కూడా అలా వంపు తిరిగిన కక్ష్యలోనే పరిభ్రమిస్తున్నాడు. చంద్రుడిని భూమి లాగేసుకుందనే దానికి ఇదొక ఆధారం..’’అని డారెన్ విలియమ్స్ వెల్లడించారు. కొత్త సిద్ధాంతం సందేహాలను తీర్చుతోందా? ‘‘బైనరీ వ్యవస్థ నుంచి లాగేసుకున్న గ్రహాలు/ ఆస్టరాయిడ్లు దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరగాలి.. లాక్కున్న గ్రహం నుంచి మెల్లగా దూరంకావాలి.. అనే రూల్స్ కూడా ఉన్నాయి. వాటిని మా సిద్ధాంతం బలపరుస్తోంది..’’అని శాస్త్రవేత్త విలియమ్స్ తెలిపారు.మొదట్లో చంద్రుడు దీర్ఘవృత్తాకార కక్ష్యలోనే తిరిగేవాడని.. అయితే భూమి టైడల్ ఫోర్స్ వల్ల మెల్లగా వృత్తాకార కక్ష్యకు చేరాడని వివరించారు. ఆ ఫోర్స్ వల్లే చంద్రుడి ఒకవైపు భాగం ఎప్పుడూ భూమివైపే ఉండేలా..‘టైడల్ లాక్’అయిందని తెలిపారు. అంతేకాదు చంద్రుడు సగటున ఏటా మూడు సెంటీమీటర్ల మేర భూమి నుంచి దూరంగా జరుగుతున్నాడని గుర్తు చేశారు. ఎవరేం సిద్ధాంతాలు తెస్తేనేం? ఎప్పుడో కోట్ల ఏళ్లనాటి మాట అది. ఏది కరెక్టో, ఏదికాదో కాదుగానీ.. మనుషులు పుట్టేనాటికే చంద్రుడు ఇక్కడే ఉన్నాడు. అంటే మన మామ చందమామే!– సాక్షి, సెంట్రల్ డెస్క్ -
WHO: కరోనా మహమ్మారి మూలాల గురించి మీకు తెలిసిందే చెప్పండి!
చైనా ల్యాబ్ లీక్ కారణంగా కరోనా వచ్చిదంటూ యూఎస్ వాదిస్తుండగా.. అవాస్తవం అని చైనా పదే పదే తిరస్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవిడ్-19 మూలాలు గురించి మీకు తెలిసిందే చెప్పండని శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అన్ని దేశాలను కోరింది. 2019లో చైనాలో వచ్చిన ఈ కరోనా ప్రపంచ దేశాలను ఓ కుదుపు కుదిపేసింది. లక్షల్లో మరణాలు సంభవించగా, దేశాలన్ని ఆర్థిక సంక్షోభంలో కొట్టుకునే పరిస్థితకి దారితీసింది కూడా. ఈ కారణాల రీత్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మహమ్మారి పుట్టుక గురించి బహిర్గతం చేయాల్సిందిగా ఆదేశించింది. అంతేగాదు దీని గురించి అంతర్జాతీయ దేశాలతో పంచుకోవడం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు. ఇప్పడు నిందలు వేసుకోవడం ముఖ్యం కాదని, ఈ మహమ్మారి ఎల ప్రారంభమైంది అనేదానిపై అవగాహన పెంచుకుని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి అంటువ్యాధులను నిరోధించవచ్చని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. ఈ కోవిడ్-19 మూలాన్ని గుర్తించడానికి సంబంధించిన ఏ చిన్న ప్రణాళికను డబ్ల్యూహెచ్ఓ వదిలిపెట్టలేదని నొక్కి చెప్పారు. ఈ విషయంలో వాస్తవాలు కావాలి 2021లో యూఎన్ ఈ మహమ్మారి మూలం తెలుసుకోవడానికి సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్(ఎస్ఏజీఓ) గ్రూప్ను కూడా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన డేటాను చైనా పంచుకోవాలని, ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించమని ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. అలాగే డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఈ విషయమై చైనా అగ్రనాయకులతో పలుమార్లు చర్చించినట్లు కూడా తెలిపారు. ఇలాంటి విషయాలను రాజకీయాలు చేయొద్దని అది పరిశోధనలను కష్టతరం చేస్తుంది, ఫలితంగా ప్రపంచ సురక్షితంగా ఉండదని చెప్పారు. ఇటీవలే యూఎస్లోని ప్రముఖ ఎనర్జీ డిపార్ట్మెట్ కరోనా మూలానికి వ్యూహాన్ ల్యాబ్ లీకే ఎక్కువగా కారణమని నివేదిక కూడా ఇచ్చింది. అదీగాక ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్లోనే అత్యున్నత అధికారులు ఉండటంతో ఈ నివేదిక ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈమేరకు డబ్ల్యూహెచ్ఓలోని అంటువ్యాధుల ఎపిడెమియాలజిస్ట్ వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ..ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు, దీర్ఘకాల కోవిడ్తో జీవిస్తున్న వారి కోసం ఇదేలా ప్రారంభమైందనేది తెలుసుకోవడం నైతికంగా అత్యంత ముఖ్యం. శాస్త్రీయ అధ్యయనంలో ముందుకు తీసుకువెళ్లడంలో సహాయపడటానికి ఈ సమాచారం పంచుకోవడం అత్యంత కీలకం అని అన్నారు. -
సిద్ధాంతాల కోసం పోరాడిన అంబేద్కర్
గుంటూరు ఎడ్యుకేషన్ సమాజంలో పాతుకుపోయిన అంటరానితనం నిర్మూలనకు కృషి చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడారని దళిత ఉద్యమనేత డాక్టర్ కత్తి పద్మారావు కొనియాడారు. స్థానిక ఏసీ కళాశాలలోని జేడీ శీలం సెమినార్ హాల్లో ఆదివారం దళిత ఎయిడెడ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. ముత్యం అధ్యక్షతన జరిగిన సభలో కత్తి పద్మారావు మాట్లాడుతూ కుల, మత, వర్గాలతో నిండిపోయిన సమాజాన్ని మార్చగల ఆయుధం ఒక్క విద్య మాత్రమేనని గాఢంగా నమ్మిన అంబేద్కర్ ఉన్నత చదువులతో అంతులేని విజ్ఞానాన్ని సొంతం చేసుకున్నారని చెప్పారు. రాజ్యంగాన్ని రూపొందించేందుకు నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు అంబేద్కర్ను మించిన మేధావి మరొకరు కనపించలేదన్నారు. దళితులు విద్యావంతులుగా ఎదిగినప్పుడే సమాజం వారిని గుర్తిస్తుందని చెప్పారు. ప్రపంచం మొత్తం కార్లమార్క్స్ సిద్ధాంతాలను ప్రమాణికంగా తీసుకుని ముందుకెళ్తున్న సమయంలో అంబేద్కర్ 22 ఏళ్ల వయసులో కుల వ్యవస్థ నిర్మూలనపై రాసిన సిద్ధాంత గ్రంథం ప్రపంచం దృష్టిని భారతదేశం వైపు మరల్చిందన్నారు. కుల, మతాలు లేని నవ భారత నిర్మాణం కోసం అధ్యాపకులు కృషి చేసి విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య జార్జ్ విక్టర్ మాట్లాడుతూ దళితులు తమ హక్కులను పోరాడి సాధించుకున్నప్పుడే రాజ్యాధికారాన్ని సైతం కైవసం చేసుకోగలరని చెప్పారు. దళితులు కేవలం హక్కుల గురించే గాక దేశ భవిష్యత్తు గురించి ఆలోచించాలని సూచించారు. వైజాగ్లోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య పసల సుధాకర్ మాట్లాడుతూ సామాజిక, మానవీయ శాస్త్రాల అధ్యయనంతోనే దళితులు విశాల దృక్పథాన్ని అలవర్చుకోగలరన్నారు. ఉన్నత విద్యతో పాటు న్యాయ శాస్త్రంలో పట్టభద్రులుగా రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు ప్రకాష్, ఎయిడెడ్ అధ్యాపకులు పాల్గొన్నారు. -
సంతోషమే జీవితప్రయోజనం!
గ్రంథపు చెక్క మానవులందు జ్ఞానము అంకురించినది మొదలు ‘‘నేను ఎవ్వడను? ఎచ్చట నుండి వచ్చితిని? ఎచ్చటికి పోవుచున్నాను? మరణమే నా స్థితికి అంత్యమా లేక మరనంతర జీవితము కలదా? మానవకోటి యందు ఇట్టి వివిధత్వమునకు కారణములేమి? సృష్టికర్త ఉన్నాడా? ఉండిన యే ఉద్దేశముతో ఇట్టి విచిత్రమైన సృష్టిని గావించు చున్నాడు. ఒకడు సుఖింపనేల, మరి యొకడు దుఃఖింపనేల? ఇట్టి ప్రశ్నలు, విచారములు, సంశయములు పొటమరించు చుండెను. నాటి నుండి నేటి వరకు ఇట్టి ప్రశ్నలడుగబడుచున్నవి. ఒక్కొక్క దేశమున ఒక్కొక్కకాలమున ఒక్కొక్క మతము ఇటువంటి సమస్యల చిక్కు విడదీయ ప్రయత్నించినది. తన పుట్టు పూర్వోత్తరములు తెలిసికొను ఇచ్చ ప్రతి మానవునకును సహజముగ నుండును. ఇట్టి విషయములనే ఖయ్యాము తన రుబాయతులలో చర్చించియున్నాడు. పాశ్చాత్యవిమర్శకులు కొందరు ఖయ్యామును ఎపిక్యుర్ అని పేర్కొనిరి. వాడుకలో ఎపిక్యుర్ అనగా పరచింతన లేని భోగలాలసుడు. ఎపిక్యురస్ సిద్ధాంతములు ఒకటి రెండు విషయములలో తప్ప ఖయ్యాము నమ్మకముల కంటే భిన్నముగా ఉండును. ‘‘శరీరం భౌతికం. ఆత్మ భౌతికమైన సూక్ష్మశరీరం. ఆత్మ దేహమున వ్యాపించి యుండును. దేహముతోడ ఆత్మయు నశించును. మరణాంతర జీవితం లేదు. సంతోషమే జీవిత ప్రయోజనము. విధి యనునది లేదు. మానవుని అదృష్టము తన చేతిలో యున్నది’’ అని ఎపిక్యురస్ చెప్పెను. ఎపిక్యురసు, ఖయ్యాముల భావములు చాలావరకు పరస్పర విరుద్ధములు. ఎపిక్యురసు నిరీశ్వరవాది, ఖయ్యాము ఈశ్వరవాది. అతడు విధి లేదని చెప్పును. ఇతడు మన సుఖదుఃఖములు విధినిర్ణీతములని సిద్ధాంతీకరించును. - దువ్వూరి రామిరెడ్డి ‘పానశాల’ నుంచి. (సెప్టెంబర్ 11 దువ్వూరి వర్థంతి) -
వారికి సిద్ధాంతాలు లేవు
విశాఖపట్నం:మావోయిస్టులకు సిద్ధాంతాలు లేవని, ప్రజల ఆదరాభిమానాలు కోల్పోయారని జిల్లా ఎస్పీ విక్రమ్జీత్ దుగ్గల్ ఒక ప్రకటనలో అన్నారు. ఇప్పటికే మావోయిస్టుల దుశ్చర్యలకు విసిగిపోయిన సాగులు గ్రామస్తులు వారిని తరిమి కొట్టారని పేర్కొన్నారు. గతంలో ఇలాం టి సంఘటనలు అనేకం జరిగాయన్నారు. అయినా వారిలో మార్పు రాలేదన్నారు. ఇప్పటికైనా మావోయిస్టులు పునరాలోచించుకోవాలని,రోడ్లు వేయకుండా అభివృద్ధిని ఏవిధంగా సాధిస్తారోప్రజలకు వివరించాలని ఎస్పీ కోరారు. మంగళవారం రాత్రి ఏపీఎఫ్డీసీకి చెం దిన కాఫీ పల్పర్ యూనిట్ను, దానికి సంబంధించిన గోడౌన్, యంత్రాలను ధ్వంసం చేయ డం దుర్మార్గమన్నారు. దీంతో అనేక మంది గిరిజనులు ఉపాధి కోల్పోయారన్నారు. ఏజెన్సీ అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా మూరుమూల ప్రాంతాలకు రోడ్లు కావాలన్నారు. అప్పుడేవిద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. పండించే, సేకరించే పంటలను మైదానానికి తీసుకువెళ్లి గిట్టుబాటు ధరకు అమ్ముకునే వీలు కలుగుతుందన్నారు. ఇంత చిన్న అంశం మావోయిస్టులకు అర్థం కాదా అని ఎస్పీ ప్రశ్నించారు. మావోయిస్టుల చర్యలను గిరిజన యువతీయువకులు, విద్యార్థులు, వివిధ వ్యాపార వర్గాలతోపాటు మేధావులు తీవ్రంగా ఖండిస్తున్నారని పేర్కొన్నారు.