breaking news
telugu films
-
జోరుగా హుషారుగా...
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో.. ప్రత్యేకించి హైదరాబాద్లో తెలుగు చిత్రాల మూవీస్ షూటింగ్స్ సందడి జోరుగా హుషారుగా ఉంది. ప్రస్తుతం భాగ్యనగరంతో (హైదరాబాద్) పాటు పరిసర ప్రాంతాల్లో కొన్ని చిత్రాల షూటింగ్స్ జరుగుతున్నాయి. వెంకటేశ్, ప్రభాస్, మహేశ్బాబు, ఎన్టీఆర్, గోపీచంద్, నాని, విజయ్ దేవరకొండ, కల్యాణ్ రామ్, శ్రీ విష్ణు వంటి పలువురు హీరోలు హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్లో జోరుగా హుషారుగా పాల్గొంటున్నారు. ఆ వివరాలు ఏంటో ఓ లుక్కేద్దాం...శంషాబాద్లో... ‘గుంటూరు కారం’ (2024) వంటి హిట్ మూవీ తర్వాత మహేశ్బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రమిది. దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మహేశ్బాబు రాముడిగా, రుద్రగా కనిపించనున్నారు. హీరోయిన్ ప్రియాంకా చోప్రా మందాకినిగా, మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.సైన్స్ ఫిక్షన్ ట్రావెల్ టైమ్ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ‘వారణాసి’ రూపొందుతోంది. ఇందులోని రామాయణం ఎపిసోడ్ సినిమాకి హైలైట్గా ఉంటుందట. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్లో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా సెట్ వేయించారు. ఈ షెడ్యూల్లో మహేశ్బాబు లేకున్నప్పటికీ కీలక తారాగణంపై ఈ సెట్లో ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట రాజమౌళి.ఈ సినిమా చిత్రీకరణకు కాస్త బ్రేక్ రావడంతో కుటుంబంతో కలిసి విదేశాలకు వెకేషన్ వెళ్లిన మహేశ్బాబు తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఈ నెల 16 నుంచి ఆయన ‘వారణాసి’ షూటింగ్లో పాల్గొంటారని తెలిసింది. ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. మహేశ్బాబు–రాజమౌళి కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ‘వారణాసి’పై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2027 ఏప్రిల్ 7న ‘వారణాసి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు మోకిలా... ఇటు శంకర్పల్లి హీరో వెంకటేష్ ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ఇటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా, అటు అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ మూవీ... ఇలా రెండు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారాయన. వెంకటేష్–కల్యాణ్ రామ్ హీరోలుగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్–అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఐదో సినిమాగా, కల్యాణ్ రామ్–అనిల్ రావిపూడి కాంబోలో రెండో సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘వెంకీఅనిల్5, ఎన్కేఆర్ఏఆర్2’ అన్నది వర్కింగ్ టైటిల్.ఈ చిత్రంలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని మోకిలాలో జరుగుతోంది. అక్కడ వేసిన ప్రత్యేకమైన భారీ సెట్లో జరుగుతున్న ఈ షెడ్యూల్లో వెంకటేష్, కల్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అనిల్ రావిపూడి శైలిలో వినోదాత్మకంగా ఈ మూవీ రూపొందుతోంది. ‘‘వెంకటేష్–కల్యాణ్ రామ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వీరిద్దరి ఆన్ స్క్రీన్ అనుబంధం ఆడియన్స్ని మెస్మరైజ్ చేస్తుంది.ఈ సినిమా నుంచి కల్యాణ్ రామ్ పుట్టినరోజు (జూలై 5న) సందర్భంగా విడుదల చేసిన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్కు మంచి స్పందన లభించింది. క్రేజీ మల్టీస్టారర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ⇒ వెంకటేష్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ‘హౌస్ నెం: 47 (ఏకే 47)’ అనేది ఉపశీర్షిక. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘కేజీఎఫ్, ‘హిట్ 3, తెలుసు కదా’ చిత్రాల ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లిలో జరుగుతోంది. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబరు 2న విడుదల కానుంది.అల్యూమినియం ఫ్యాక్టరీలో... హీరో గోపీచంద్ కూడా స్పీడ్ పెంచారు. ఓ వైపు ‘సింగ’, మరోవైపు ‘భరతవర్ష’ మూవీస్తో బిజీగా ఉన్నారాయన. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ‘సింగ’ ఒకటి. ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్ హీరోయిన్గా తెలుగులో అడుగుపెడుతున్నారు. 70ఎంఎం ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.గోపీచంద్తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు వెంకట్. జూన్ 12న గోపీచంద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సింగ’ టైటిల్తో పాటు ఆయన లుక్ను యూనిట్ రివీల్ చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘సింగ’. ఫైట్ మాస్టర్గా సక్సెస్ అందుకున్న వెంకట్.. గోపీచంద్ని ఎంత పవర్ఫుల్ మాస్ లుక్లో చూపించనున్నారో గ్లింప్స్తోనే చూపించాం.యాక్షన్, ఎమోషన్, డ్రామా కలగలిపిన పవర్ఫుల్ కథతో రూపొందుతోన్న ఈ సినిమాలో గోపీచంద్ను కొత్త కోణంలో చూపించనున్నారాయన. యాక్షన్ డైరెక్టర్ నుంచి దర్శకుడిగా వెంకట్ చేస్తున్న ఈ ప్రయాణంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... గోపీచంద్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘భరతవర్ష’. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. అజీజ్ నగర్లో... హీరో ప్రభాస్ యమా జోరు మీద ఉన్నారు. వరుస పాన్ ఇండియన్ మూవీస్తో దూసుకెళుతున్నారాయన. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్, ఫౌజీ, కల్కి 2’ వంటి సినిమాలు చిత్రీకరణలు జరుపుకుంటున్నాయి. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.భద్రకాళి పిక్చర్స్, టి. సిరీస్ బ్యానర్స్పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్తో పాటు కీలక తారాగణం పాల్గొంటుండగా ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట సందీప్ రెడ్డి. ‘‘భారీ స్థాయిలో, అద్భుతమైన ఎమోషన్స్తో రూపొందుతోన్న ‘స్పిరిట్’ చిత్రం ప్రేక్షకులకు ఓ ఇంటెన్స్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని అందించేలా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకుట్టుకునేలా ఈ మూవీని రూపొందిస్తున్నాం. 2027 మార్చి 5న 8 భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ⇒ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మరో చిత్రం ‘ఫౌజీ’. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘ఫౌజీ’ షూటింగ్ ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా పండగ సందర్భంగా అక్టోబరులో ‘ఫౌజీ’ సినిమా విడుదల కానుంది. ఆర్ఎఫ్సీలో... ‘దేవర’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్’. ‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిల్ కపూర్, బిజూ మీనన్ , ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, రాజీవ్ కనకాల, అశుతోష్ రాణా, అన్షుమన్ పుష్కర్, సిద్ధాంత్ గు΄్తా, ప్రభాస్ శ్రీను, శత్రు, శివ, భీమల్ జీత్ ఒబెరాయ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ఈ చిత్రం కోసం అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్లో ఎన్టీఆర్తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ నీల్. ఇప్పటివరకు చూడనటువంటి మాస్ లుక్లో ఎన్టీఆర్ని చూపించనున్నారట దర్శకుడు.ఈ మూవీలో ఓ లుక్లో సన్నగా కనిపించే ఆయన మరో లుక్లో కొంచెం బొద్దుగా కనిపిస్తారని తెలిసింది. మాస్ హీరో, మాస్ డైరెక్టర్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘డ్రాగన్’ మూవీపై ఇటు ట్రేడ్ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో ఫుల్ బజ్ నెలకొంది. ‘‘డ్రాగన్’ కథ గోల్డెన్ ట్రైయాంగిల్ ప్రాంతంలోని అంతర్జాతీయ అక్రమ వ్యాపారం నేపథ్యంలో సాగుతుంది. ఎన్టీఆర్ ఇందులో లూగర్ అనే పాత్రలో అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన అస్సాసిన్–ఇన్–చీఫ్ అనే పాత్రలో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2027 జూన్ 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే. గండిపేటలో... విజయ్ దేవరకొండ హీరోగా ‘రణబాలి, రౌడీ జనార్థన’ వంటి సినిమాలు తెరకెక్కుతున్నాయి. ‘రణబాలి’ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ–రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘రణబాలి’. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. హాలీవుడ్ మూవీ ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్ర పోషిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది.విజయ్ దేవరకొండతో పాటు ఈ మూవీలోని ఇతర ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారట రాహుల్. ‘‘19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ‘రణబాలి’ రూపొందుతోంది. విజయ్ దేవరకొండ బర్త్ డే (మే 9) సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్లోని యాక్షన్ సీక్వెన్సులు మూవీ లవర్స్ను బాగా ఆకట్టుకున్నాయి.భారీ అంచనాలున్న మా సినిమాని సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. కాగా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘రౌడీ జనార్థన’. రవికిరణ్ కోలా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. డిసెంబరులో ‘రౌడీ జనార్థన’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్పల్లిలో... శ్రీ విష్ణు హీరోగా రెండు సినిమాలు సెట్స్పై ఉన్నాయి. వాటిలో ఒకటి ‘కామ్రేడ్ కళ్యాణ్’ కాగా మరో చిత్రానికి డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ విష్ణు–రామ్ అబ్బరాజులది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన తొలి చిత్రం ‘సామజవరగమన’ (2023) ఘన విజయం సాధించింది. ఆ మూవీ తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతోంది.మై త్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, యలమంచి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లిలో జరుగుతోంది. శ్రీవిష్ణుతో పాటు ఇతర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట రామ్ అబ్బరాజు. ఈ సినిమాకు ‘ఫ్యామిలీప్యాక్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట మేకర్స్.టైటిల్కు తగ్గట్టే ఈ మూవీలో కంప్లీట్ కామెడీతో పాటు ఎమోషన్స్ ఉంటాయని, కుటుంబ సభ్యులందరూ చూసేలా ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే... శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకిరామ్ మారెళ్ల దర్శకుడు. ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్. కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాల షూటింగ్స్ కూడా హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
ఉత్తమ తెలుగు జాతీయ చిత్రం.. సత్తా చాటిన మన సినిమాలు
-
సౌత్ ఇండియాలో క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలు ఇవే
తెలుగు అనగానే గుర్తొచ్చేది ఆవకాయ్... తమిళ్ అంటే సాంబార్... మలయాళంకి కూడా సాంబార్ టచ్ ఉంది. ఇప్పుడు ఆవకాయ్ డైరెక్షన్కి సాంబార్ సై అనడంతో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. అదేనండీ.. మన తెలుగు డైరెక్టర్ల డైరెక్షన్లో తమిళ, మలయాళ హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఇటు తెలుగు అటు తమిళ, మలయాళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో ఈ చిత్రాలు విడుదల కానున్నాయి. ఇక తెలుగు డైరెక్టర్లు – పరభాషా హీరోల కాంబో గురించి తెలుసుకుందాం. శేఖర్ కమ్ముల, ధనుష్... డీ 51 వాణిజ్య అంశాల కంటే కథకి, సహజత్వానికి ప్రాధాన్యత ఇచ్చే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ఒక సినిమా తర్వాత మరో సినిమా వెంట వెంటనే చేసేయాలని కాకుండా కొంచెం ఆలస్యమైనా మంచి సినిమాలు తీస్తుంటారు శేఖర్ కమ్ముల. ‘ఫిదా, లవ్స్టోరీ’ వంటి వరుస హిట్లు అందుకున్న ఆయన తన తర్వాతి చిత్రాన్ని తమిళ హీరో ధనుష్తో చేస్తున్నారు. ‘డీ 51’ (వర్కింగ్ టైటిల్) పేరుతో తెలుగు–తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో ఇంతకు ముందు చూడని సరికొత్త పాత్రలో ధనుష్ని చూపించనున్నారట శేఖర్. సోనాలీ నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. కాగా ధనుష్ చేసిన తొలి తెలుగు స్ట్రయిట్ మూవీ ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్ చేస్తున్నది సెకండ్ స్ట్రయిట్ తెలుగు మూవీ అవుతుంది. చందు, సూర్య కాంబో కుదిరిందా? ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్నారు డైరెక్టర్ చందు మొండేటి. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ‘ఎన్సీ 23’ (వర్కింగ్ టైటిల్) సినిమా ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు చందు. ఇప్పటివరకూ తెలుగు హీరోలతోనే సినిమాలు తీసిన ఆయన తమిళ హీరో సూర్యతో ఓ సినిమా చేయనున్నారు. వీరి కాంబినేషన్లో ఓ సినిమా రానుందంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగు తోంది. సూర్య– చందు కాంబినేషన్ దాదాపు కుదిరిందని టాక్. సరైన కథ కుదిరితే డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తానంటూ చెప్పుకొస్తున్న సూర్య.. చందు మొండేటి చెప్పిన కథ తెలుగు ఎంట్రీకి కరెక్ట్ అని భావించారట. మైథాలజీ నేపథ్యంలో సోషియో–ఫ్యాంటసీ జానర్లో ఈ చిత్రకథ ఉంటుందని టాక్. పరశురామ్తో కార్తీ? ‘గీత గోవిందం, సర్కారు వారి పాట’ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నారు డైరెక్టర్ పరశురామ్. ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ–డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో మరో సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా తమిళ హీరో కార్తీతో పరశురామ్ ఓ సినిమా తెరకెక్కించనున్నారనే వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఆ మధ్య చెన్నై వెళ్లి కార్తీకి కథ వినిపించారట ఆయన. ‘ఊపిరి’ (2016) సినిమా తర్వాత తెలుగులో ఓ సరైన స్ట్రయిట్ ఫిల్మ్ చేయాలని ఎంతో ఆసక్తిగా ఉన్న కార్తీకి పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో పచ్చజెండా ఊపారని టాక్. ఈ సినిమాకు ‘రెంచ్ రాజు’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందట. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించాలని భావిస్తున్నారట పరశురామ్. అటు కార్తీ, ఇటు పరశురామ్ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయా చిత్రాలు పూర్తయ్యాకే వీరి సినిమా సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెంకీతో దుల్కర్ లక్కీ భాస్కర్ తమిళ హీరో ధనుష్తో ‘సార్’(తమిళంలో వాత్తి) సినిమాని తెరకెక్కించి, సూపర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ వెంకీ అట్లూరి. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది. తన తాజా చిత్రాన్ని మలయాళ హీరో దుల్కర్ సల్మాన్తో తీస్తున్నారు వెంకీ అట్లూరి. ‘లక్కీ భాస్కర్’ టైటిల్తో ఈ చిత్రం రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో వెంకీ అట్లూరితో ‘సార్’ నిర్మించిన సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘లక్కీ భాస్కర్’ నిర్మిస్తున్నారు. ‘సార్’ సినిమాతో విద్యా వ్యవస్థ నేపథ్యంలో సమాజానికి చక్కని సందేశం ఇచ్చిన వెంకీ అట్లూరి ‘లక్కీ భాస్కర్’ ద్వారా మరో విభిన్న కథాంశంతో ప్రేక్షకులను మెప్పించనున్నారట. ఒక సామాన్యుడు తనకు అడ్డొచ్చిన అసమానతలను దాటుకుని ఉన్నత శిఖరాలను ఎలా చేరుకున్నాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. కాగా ‘మహా నటి’, ‘సీతా రామం’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మరో స్ట్రయిట్ తెలుగు చిత్రం ‘లక్కీ భాస్కర్’. -
తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు.. సీఎం జగన్ హర్షం
సాక్షి, తాడేపల్లి: తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు రావటంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ టీమ్కు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. 69వ జాతీయ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమకు బొనాంజాగా నిలిచాయని పేర్కొన్నారు. ఉత్తమ సాహిత్యానికి చంద్రబోస్ (కొండ పొలం) అవార్డు గెలుచుకోవటం సంతోషమని సీఎం అన్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. 2021 సంవత్సరానికి గానూ ‘పుష్ప: ది రైజ్’లో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్ సాధించారు. చదవండి: జాతీయ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్' హవా.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ The Telugu Flag flies high at the 69th National Film Awards! My best wishes and congratulations to @alluarjun on winning the National award for best actor and @ThisIsDSP on winning the National Award for best music for Pushpa. Kudos and congratulations to @ssrajamouli garu and… — YS Jagan Mohan Reddy (@ysjagan) August 24, 2023 -
టాలీలో మాలీ హవా
‘ప్రతిభకి భాషతో సంబంధం లేదు’ అనే మాట చిత్ర పరిశ్రమలో తరచుగా వినిపిస్తుంటుంది. టాలెంటెడ్ ఆర్టిస్ట్లు ఏ భాషలో ఉన్నా తెలుగు పరిశ్రమ సాదర స్వాగతం పలుకుతుంది. ప్రస్తుతం తెలుగులో సెట్స్పై ఉన్న పలు చిత్రాల్లో జయరామ్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఫాహద్ ఫాజిల్, దేవ్ మోహన్, జోజూ జార్జ్, సుదేష్ నాయర్.. వంటి పలువురు మలయాళ నటులు కీలక పాత్రలతో హవా సాగిస్తున్నారు. ఈ మాలీవుడ్ నటులు చేస్తున్న తెలుగు చిత్రాలపై ఓ లుక్కేద్దాం. బిజీ బిజీగా... ‘భాగమతి.. అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, ధమాకా... ఇలా వరుసగా తెలుగు సినిమాలు చేశారు మలయాళ సీనియర్ నటుడు జయరామ్. నెగటివ్, పాజిటివ్ క్యారెక్టర్స్తో తెలుగులో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శ కత్వం వహిస్తున్న ‘గేమ్ ఛేంజర్’తో పాటు మహేశ్బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో జయరామ్ కీలక పాత్ర చేస్తున్నారు. అదిరే ఎంట్రీ మలయాళం స్టార్ హీరోల్లో ఒకరైన ఫాహద్ ఫాజిల్ ‘పార్టీ లేదా పుష్పా..’ అంటూ తెలుగులోకి అడుగుపెట్టారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో అదిరే ఎంట్రీ ఇచ్చారు ఫాహద్. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంలోనూ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో నటిస్తున్నారు ఫాహద్ ఫాజిల్. ‘పుష్ప’ మొదటి భాగంలో ఆయన పాత్ర నిడివి తక్కువగానే ఉన్నా రెండో భాగంలో మాత్రం పూర్తి స్థాయిలో ఉంటుందని టాక్. పదమూడేళ్ల తర్వాత... మాలీవుడ్లో ఓ వైపు స్టార్ హీరోగా దూసుకెళుతూ మరోవైపు డైరెక్టర్గా (లూసిఫర్, బ్రో డాడీ) ప్రతిభ చూపిస్తున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. కాగా మన్మోహన్ చల్లా దర్శకత్వం వహించిన ‘పోలీస్ పోలీస్’ (2010) చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చారు పృథ్వీరాజ్. ఆ చిత్రంలో ఓ హీరోగా నటించిన ఆయన పదమూడేళ్ల గ్యాప్ తర్వాత మరో తెలుగు చిత్రంలో (‘సలార్’) నటిస్తున్నారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో జగపతిబాబు ఓ విలన్గా నటిస్తుండగా ఆయన తనయుని పాత్రలో పృథ్వీరాజ్ నటిస్తున్నారట. పృథ్వీ పాత్ర నెగటివ్ టచ్తో ఉంటుందని టాక్. సెప్టెంబర్ 28న ‘సలార్’ విడుదల కానుంది. ‘శాకుంతలం’తో వచ్చి... గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘శాకుంతలం’తో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చారు దేవ్ మోహన్. మలయాళంలో నటించింది కొన్ని సినిమాలే అయినా తొలి తెలుగు చిత్రంలోనే సమంత వంటి స్టార్ హీరోయిన్కి జోడీగా నటించే అవకాశం అందుకున్నారు దేవ్ మోహన్. ఈ సినిమాలో దుష్యంత మహారాజుగా నటించి, మెప్పించారు దేవ్. ఇలా ‘శాకుంతలం’తో తెలుగుకి వచ్చి, రెండో తెలుగు సినిమా ‘రెయిన్బో’లోనూ మరో స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నాకి జోడీగా నటించే చాన్స్ అందుకున్నారు దేవ్. శాంతరూబన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. జోజు.. సుదేష్ కూడా... మలయాళంలో నటుడిగా, నిర్మాతగా, గాయకుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జోజూ జార్జ్ ‘ఆది కేశవ’ సినిమాతో తెలుగులోకి అడుగుపెడుతున్నారు. వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో విలన్గా నటిస్తున్నారు జోజూ. అలాగే నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ద్వారా సుదేష్ నాయర్ తెలుగుకి ఎంట్రీ ఇస్తున్నారని టాక్. ఈ చిత్రంలో ఆయన స్టైలిష్ విలన్ పాత్రలో కనిపిస్తారట. వీళ్లే కాదు.. మరికొందరు మలయాళ నటులు కూడా తెలుగు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
PM Narendra Modi : తెలుగు సినిమాపై ప్రధాని మోదీ కామెంట్స్ వైరల్
PM Narendra Modi Appreciates Telugu Cinemas: తెలుగు సినిమాపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించిందన్నారు. 216 అడుగుల శ్రీరామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ అనంతరం ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్పై అద్భుతాలు సృష్టిస్తోందన్నారు. 'సిల్కర్ స్కీన్ నుంచి ఓటీటీ వరకు తెలుగు సినిమాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. తెలుగు భాష చరిత్ర ఎంతో సుసంపన్నమైంది. కాకతీయుల రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం గర్వకారణం. పోచంపల్లి చేనేత వస్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించాయి' అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రస్తుతం మోదీ చేసిన ఈ కామెంట్స్ వైరల్గా మారాయి. 🙏🙏🙏🙏 #TeluguCinema 🙏🙏 pic.twitter.com/YYAjBygPow — Harish Shankar .S (@harish2you) February 5, 2022 -
చరిత్రను భద్రపరచాలి!
తెలుగు సినిమా చరిత్ర విశేషాలతో ఓ మ్యూజియమ్ను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, అలా చేయడం తన కల అని నాగార్జున అంటున్నారు. ఈ విషయం గురించి నాగార్జున మాట్లాడుతూ – ‘‘సినిమాల భద్రత, పునరుద్ధరణ అంశాలకు సంబంధించి దాదాపు రెండు సంవత్సరాల క్రితం మా స్టూడియో (అన్నపూర్ణ)లో ఓ వర్క్షాప్ నిర్వహించాం. సాంకేతికత ఎంతలా అభివృద్ధి చెందిందో ఆ వర్క్షాప్ ద్వారా మరింత తెలుసుకున్నాను. చరిత్ర సృష్టించిన తెలుగు క్లాసిక్ సినిమాలను భద్రపరిచేలా ఓ మ్యూజియమ్ను ఎందుకు ఏర్పాటు చేయకూడదు అనిపించింది. మా నాన్నగారు (దివంగత ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు) దాదాపు 250కి పైగా సినిమాలు చేశారు. దురదృష్టవశాత్తు ఆయన నటించిన కొన్ని క్లాసిక్ సినిమాలను భద్రపరచలేకపోయాం. అయితే ప్రస్తుత సాంకేతికతతో కొన్ని క్లాసిక్లను మెరుగుపరిచే అవకాశం ఉంది. అవన్నీ కూడా మ్యూజి యమ్లో పెట్టదగిన సినిమాలే’’ అన్నారు. -
తెలుగు చిత్రసీమకు ఎస్వీఆర్ గుండెకాయ లాంటివారు
‘సమాజ మర్యాదను కాపాడేలా సినిమాలు ఉండాలి. సమాజాన్ని జాగృతం చేసే సినిమా తీయాలి. కొత్త తరం నటులు ఎస్వీ రంగారావు తదితర మహానటులు నటించిన సినిమాలు చూసి, అందులోని వారి నటనను పరిశీలించి, అధ్యయనం చేసి నేర్చుకోవాలి. ఎస్వీఆర్ సినిమాలు చూసిన తర్వాతనే నటన నేర్చుకొని సినిమా రంగంలోకి రావాలి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రెండు కళ్లు అయితే ఎస్వీ రంగారావు గుండెకాయ లాంటివారు’’ అని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మంగళవారం హైదరాబాద్లో çసంగమం ఆధ్వర్యంలో మహానటుడు దివంగత ఎస్వీ రంగారావు శతజయంతి వేడుకలు జరిగాయి. గ్లామర్ మాత్రమే కాదు. గ్రామర్ కూడా ఉండాలి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్య నాయుడు మాట్లాడుతూ– ‘‘సినిమాల ద్వారా సమాజం చాలా విషయాల్లో జాగృతం అవుతుందన్న విషయం నేటి నటీనటులు గుర్తుంచుకోవాలి. సినిమాల్లో హింస, జుగుప్సాకర సంఘటనలు, అసభ్యత లాంటివి చూపితే సమాజానికి ఎక్కువ నష్టం సంభవిస్తుంది. సినిమాల్లో గ్లామర్తో పాటు గ్రామర్ కూడా ఉండాలి. సంస్కృతి, సభ్యతలకు నష్టం కలిగించేలా సినిమాలు ఉండకూడదు. తెలుగు సినీ రంగంలో గొప్ప నటులున్నారు. కైకాల, చిరంజీవి, జయప్రకాశ్ రెడ్డిలు తాము నటించేటప్పుడు శరీరంలోని ప్రతి భాగాన్ని కదిలిస్తారు. ఆనందాన్ని .. బ్రహ్మానందాన్ని పండిస్తారు. సినిమా తీసిన తర్వాత ప్రొడ్యూసర్లు తమ కటుంబాలతో ముందు సినిమా చూడాలి. వారి కుటుంబం మెచ్చితే ఆ సినిమా బాగున్నట్లే. రచయితలు రాసే మాటల్లో, పాటల్లో ఔన్నత్యం ఉండాలి. సంస్కృతిని ప్రతిబింబించేలా, సమాజ మర్యాదను పాటించేలా ఉండి ప్రజల మనసులను ఆకట్టుకొనేలా ఉండాలి. పాటలు మాధుర్యంగా ఉండాలి. ఎస్వీఆర్ సినిమాల్లో అసభ్యత, వల్గారిటీ, హింస అనేది మచ్చుౖకైనా కనిపించదు. తెలుగు సినీ రంగంలో అందమైన నటులు ఉన్నా అందమైన సినిమా కన్పించటం లేదు. సినిమాల్లో శృంగారం ఉండాలి కానీ అది సభ్యతగా ఉండాలి. శృంగారం తగ్గిపోయి అంగారం ఎక్కువైంది. పాత సినిమాలకు కొత్త సినిమాలకు పోలికే ఉండటం లేదు. నవరసాలు సినిమాల్లో ఉండాలి. సంగీత సాహిత్యాలు పోయి వాయిద్యం ఎక్కువైంది. ఈ తరం నటులు నటన నేర్చుకొని ఆ తర్వాతే సినిమాల్లోకి అడుగు పెట్టాలి. ఎస్వీ రంగారావు నటన ఆకట్టుకొనేలా ఉండేది. సినిమాల్లో ఆహార్యం పుష్కలంగా కన్పించేది. ప్రతి సీన్ చూడముచ్చటగా ఉండేది. కీచకుడు, కంసుడు.. ఇలా ఏ పాత్ర చేసినా ఆరాధనా భావం కలిగిస్తాయి. కారణం ఆయన రూపం, నటించిన తీరు. సాంఘిక, జానపద పాత్రలకు ఆయన జీవం పోశారు. నవరసాలు పండిస్తూ ఏ పాత్రల్లోనైనా ఇట్టే ఇమిడిపోయేవారు. నంబర్వన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. హీరోగానే కాదు ప్రతినాయకుడుగా విలక్షణంగా నటించేవారు. పెద్దమనిషి, తాతయ్య, ఇంటి యాజమాని ఎలా ఉంటాడో ఆయన పాత్రలు చెబుతాయన్నారు. నటనలో ఎస్వీఆర్ ఒక యశస్వీ’’ అన్నారు. గౌరవ అతిథి, ఏపీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ –‘‘సినీ రంగంలో నభూతో నభవిష్యతి అనిపించిన నటుడు ఎస్వీఆర్. సావిత్రి, ఎస్వీఆర్లకు కాలం గడిచే కొద్దీ ప్రజల్లో అభిమానం పెరుగుతోంది. సినీ రంగం నుంచి అంతర్జాతీయ స్థాయిలో తొలిసారిగా పురస్కారం అందుకొన్న నటుడు ఎస్వీఆర్. సినీ ప్రపంచం ఉన్నంత వరకు ఆయన ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటారు’’ అన్నారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడారు. ఈ వేదికపై ఎస్వీఆర్ హిట్ సాంగ్స్పై వందమంది బాలబాలికలచే ఏర్పాటు చేసిన బృందగానం ఆకట్టుకొంది. కాగా, ఎస్వీఆర్ శతజయంతి స్మారక పురస్కారాలను పలువురు నటీనటులకు అందజేశారు. ఎస్వీఆర్తో కలిసి పని చేసిన కళాకారులు కృష్ణవేణి, ‘షావుకారు’ జానకి, జమున, శారద, కె.ఆర్. విజయ, గీతాంజలి, రమాప్రభ, రోజారమణిలను, గాన కోకిల పి. సుశీలను సత్కరించారు. ఎస్వీ రంగారావు తర్వాతి తరం క్యారెక్టర్ ఆర్టిస్టులు కైకాల సత్యనారాయణ, రావి కొండలరావు, అన్నపూర్ణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, నాజర్, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళిలు ఎస్వీఆర్ శత జయంతి స్మారక సత్కారాలను అందుకొన్నారు. వారికి వెంకయ్య నాయుడు శాలువ, జ్ఞాపికను అందజేశారు. ఈ వేడుకల్లో ‘సంగమం’ వ్యవస్థాపకులు సంజయ్ కిశోర్, ప్రత్యేక అతిథిగా బ్రహ్మానందం పాల్గొన్నారు. -
జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటన
-
ఉత్తమ తెలుగు చిత్రం ‘ఘాజీ’
జాతీయ స్థాయిలో సినిమా రంగానికిచ్చే అవార్డులను ఈ రోజు(శుక్రవారం) ప్రకటించారు. 65వ జాతీయ చలన చిత్రం అవార్డుల్లో... శ్రీదేవి నటించిన మామ్ సినిమాతో పాటు టాలీవుడ్ విజువల్ వండర్ బాహుబలి2 సినిమాలకు అవార్డుల పంట పండింది. ఎన్నో సంచలనాలు సృష్టించిన బాహుబలి 2 కు మూడు అవార్డులు లభించాయి. రానా నటించిన ఘాజీ చిత్రం జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులో మొదటిసారిగా సబ్ మెరైన్ కాన్సెప్ట్తో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలనే కాక ఇప్పుడు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ స్థాయిలో ఎంపికైంది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ : వినోద్ ఖన్నా ఉత్తమ చిత్రం : విలేజ్ రాక్స్టార్స్ (అస్సామీ) హిందీ ఉత్తమ చిత్రం : న్యూటన్ జాతీయ ఉత్తమ నటి : శ్రీదేవీ (మామ్) జాతీయ ఉత్తమ నటుడు : రిద్ది సేన్ (మామ్) ఉత్తమ దర్శకుడు : జయరాజ్ (భయానకమ్) ఉత్తమ పోరాట సన్నివేశ చిత్రం : బాహుబలి2 ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు : బాహుబలి2 ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం : బాహుబలి2 ఉత్తమ నృత్య దర్శకుడు : గణేష్ ఆచార్య (టాయిలెట్ ఏక్ ప్రేమ్కథ) ఉత్తమ సంగీత దర్శకుడు : ఎఆర్ రెహ్మాన్ (కాట్రు వెలియదై) ఉత్తమ నేపథ్య సంగీతం : ఎఆర్ రెహ్మాన్( మామ్) ఉత్తమ గాయకుడు : జేసుదాసు ఉత్తమ గాయని : షా షా తిరుపతి (కాట్రు వెలియదైలోని వాన్ వరువన్ ) ఉత్తమ తమిళ చిత్రం : టు లెట్ ఉత్తమ మరాఠీ చిత్రం : కచ్చా నింబూ ఉత్తమ కన్నడ చిత్రం : హెబ్బెట్టు రామక్క ఉత్తమ బెంగాలీ చిత్రం : మయురాక్షి ఉత్తమ సహాయ నటుడు : ఫహాద్ ఫాసిల్ (తొండిముత్తలం ద్రిసాక్షియుం) ఉత్తమ సహాయ నటి : దివ్య దత్ (ఇరాదా) -
తెలుగు చలనచిత్ర దర్శకుల మండలి అధ్యక్షునిగా ఎన్. శంకర్
హైదరాబాద్లో ఆదివారం జరిగిన తెలుగు చలన చిత్ర దర్శకుల మండలి ఎన్నికల్లో ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి సానా యాదిరెడ్డిపై 310 ఓట్ల మెజారిటీతో ఎన్.శంకర్ గెలుపొందారు. ఎన్.శంకర్తో పాటు ఆయన ప్యానల్ సభ్యులు ప్రధాన కార్యదర్శిగా జి. రాం ప్రసాద్, కోశాధికారిగా కాశీ విశ్వనాద్, ఉపాధ్యక్షులుగా ఏ.యస్.రవి కుమార్ చౌదరి, ఎస్.వి.భాస్కర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా కట్టా రంగారావు, ఎమ్.ఎస్.శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా డీవీ రాజు(కళింగ), ఎన్ గోపీచంద్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా శ్రీకాంత్ అడ్డాల, అనిల్ రావిపుడి, ప్రియదర్శిని, గంగాధర్, అంజిబాబు, మధుసూదన్ రెడ్డి, కృష్ణ మోహన్, కృష్ణ బాబు, చంద్రకాంత్ రెడ్డి విజయం సాధించారు. నూతన కార్యవర్గం రెండు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతుంది. -
ఏప్రిల్ నెలలో.. సినిమాలే సినిమాలు!
-
తెలుగు చిత్రాలకు ఆంగ్ల పేర్లా?
‘దేశ భాషలందు తెలుగులెస్స’ అని ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయల చేత ప్రశంసలందుకున్నది తెలుగుభాష. పంచదారకన్నా, జుంటుతేనెలకన్నా మధురమైనది తెలుగుభాష. ఎన్నో ఏళ్ల చరిత్ర, సంస్కృతి కలిగిన భాష మన మాతృభాష. అలాంటి తెలుగుభాష గొప్పతనాన్ని తెలుగు చిత్రపరిశ్రమ మరచిపోతోంది. భారతదేశంలోనే హిందీ తర్వాత అత్యధిక చిత్రాలను నిర్మిస్తోన్న పరిశ్రమగా తెలుగు సినీ పరిశ్రమ పేరు గాంచింది. ఇంత ఘన చరిత్ర కలిగినప్పటికీ పరభాషా వ్యామోహంతో తెలుగు చిత్రాలకు ఆంగ్లపేర్లు పెడుతున్నారు మన దర్శక నిర్మాతలు. ఇటీవల కాలంలో ఈ ధోరణి శ్రుతిమించిపోతోంది. ఘనమైన వారసత్వం కలిగిన అగ్రకథానాయకుల చిత్రాలకు కూడా ఇంగ్లిష్ పేర్లే పెడుతుండటం గమనార్హం. అసలు కథలో బలమున్న చిత్రాలను, నాయికా, నాయకులు ఎవరన్నది కూడా చూడకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అలాంటప్పుడు తెలుగు చిత్రాలకు ఇంగ్లిష్ పేర్లు పెట్టాల్సిన అవసరం ఏమిటి? కాబట్టి తెలుగు చిత్రపరిశ్రమలోని అగ్రకథానాయకులు, దర్శక నిర్మాతలు ఈ విషయంపై దృష్టి సారించాలి. తెలుగు చిత్రాలకు తెలుగు పేర్లే పెట్టేందుకు కృషి చేయాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం తన ప్రోత్సాహాన్ని అందించాలి. తమిళనాడు ప్రభుత్వం మాదిరి మాతృభాషలో పేర్లు పెట్టిన చిత్రాలకు ప్రత్యేక రాయితీ కల్పించాలి. తద్వారా తెలుగుభాష మరుగునపడిపోకుండా చూడాలి. మన భాషలోని తియ్యదనాన్ని పక్కనపెట్టి ఆంగ్ల పేర్ల వ్యామోహంలో పడిపోకుండా తెలుగు చిత్ర పరిశ్రమను కాపాడాలని కోరుకుంటున్నాము. - బి. రామకృష్ణ సౌత్మోపూరు, నెల్లూరు జిల్లా -
ఈ వారం.. చిన్న సినిమాలదే..!
-
టాలీవుడే టాప్
తెలుగు చిత్రాల నిర్మాణం... విడుదలలో టాలీవుడ్ గత ఏడాది దూసుకుపోయింది. దేశవ్యాప్తంగా గత ఏడాది (ఏప్రిల్ 2013 - మార్చి 2014) మొత్తం1966 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో 349 తెలుగు చిత్రాలు విడుదలై టాలీవడ్ మొదటి స్థానంలో నిలిచింది. 326 తమిళ చిత్రాల విడుదలతో తమిళ చిత్ర పరిశ్రమ ఆ తర్వాత స్థానాన్ని పొందింది. 263 హింది చిత్రాల విడుదలతో బాలీవుడ్ మూడో స్థానంలో నిలిచింది. అయితే 2012- 13 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1724 చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో తమిళ చిత్రాలు 292 విడుదలై... మొదటిస్థానాన్ని ఆక్రమించగా, 280 చిత్రాలతో తెలుగు సినిమా రెండో స్థానంలో నిలిచింది. అలాగే 255 హిందీ చిత్రాలతో మూడో స్థానంలో నిలిచింది. కానీ అంతకుముందు ఏడాదిలో ఉన్న తమిళ చిత్రాల సంఖ్యను పడతోసి టాలీవుడ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు మొదటి స్థానంలో ఉన్న తమిళ చిత్రాల స్థానాన్ని గత ఏడాది తెలుగు చిత్రాలు అక్రమించాయి. అయితే తెలుగు చిత్రాలు భారీ సంఖ్యలో విడుదలవుతున్న బాక్సాఫీసు వద్ద అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. అది పెద్ద పెద్ద హీరోలు నటించిన ఈ పరిస్థితి నెలకొంది. చిత్రాల నిర్మాణంపై ఉన్న అసక్తితో చిన్న చిత్రాలు విడుదల సంఖ్య భారీగా పెరిగిందని... అలాగే డిజిటల్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి రావడంతో టాలీవుడ్ పరిశ్రమలో భారీ సంఖ్యలో చిత్రాలు విడుదలవుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఫిలింఫేర్ అవార్డుల బరిలో తెలుగు చిత్రాలివే
ఫిలింఫేర్ అవార్డులకు తెలుగు చిత్రాలు ఈసారి గట్టిగానే పోటీపడుతున్నాయి. 2013 సంవత్సరానికి గాను ఐడియా ఫిలింఫేర్ అవార్డులకు వివిధ విభాగాలలో పోటీపడుతూ నామినేషన్లు దక్కించుకున్న చిత్రాల వివరాలను ఫిలింఫేర్ ప్రకటించింది. దక్షిణాది నుంచి తెలుగులో వివిధ కేటగిరీలకు గాను నామినేషన్లు దక్కించుకున్న సినిమాలు, వ్యక్తుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఉత్తమచిత్రం: అత్తారింటికి దారేది, గుండెజారి గల్లంతయ్యిందే, మిర్చి, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, ఉయ్యాల జంపాల ఉత్తమ దర్శకుడు కొరటాల శివ (మిర్చి), శ్రీకాంత్ అడ్డాల (సీతమ్మ వాకిట్లో..), త్రివిక్రమ్ శ్రీనివాస్ (అత్తారింటికి దారేది), విజయ్ కుమార్ కొండా (గుండె జారి..), విరించి వర్మ (ఉయ్యాల జంపాల) ఉత్తమ నటుడు మహేష్ బాబు (సీతమ్మ వాకిట్లో..), నితిన్ (గుండె జారి..), పవన్ కళ్యాణ్ (అత్తారింటికి దారేది), ప్రభాస్ (మిర్చి), రామ్ చరణ్ (నాయక్) ఉత్తమ నటి అనుష్క (మిర్చి), నందితారాజ్ (ప్రేమకథాచిత్రం), నిత్యా మీనన్ (గుండె జారి..), రకుల్ ప్రీత్ సింగ్ (వెంకటాద్రి ఎక్స్ప్రెస్), సమంతా (అత్తారింటికి దారేది) ఉత్తమ సంగీతం అనూప్ రూబెన్స్ (గుండెజారి.. ), దేవిశ్రీ ప్రసాద్ (మిర్చి), దేవిశ్రీ ప్రసాద్ (అత్తారింటికి దారేది), ఎంఆర్ సన్నీ స్వామి (రా..రా), మిక్కీ జె మేయర్ (సీతమ్మ వాకిట్లో..) ఉత్తమ సహాయనటుడు బ్రహ్మాజీ (వెంకటాద్రి ఎక్స్ప్రెస్), ప్రకాష్ రాజ్ (సీతమ్మ వాకిట్లో..), సందీప్ కిషన్ (గుండెల్లో గోదారి), సునీల్ (తడాఖా), వెంకటేశ్ (మసాలా) ఉత్తమ సహాయనటి అంజలి (సీతమ్మ వాకిట్లో..), లక్ష్మి మంచు (గుండెల్లో గోదారి), నదియా (అత్తారింటికి దారేది), ప్రణీత (అత్తారింటికి దారేది), పునర్నవి (ఉయ్యాల జంపాల) ఉత్తమ గేయరచన అనంత శ్రీరామ్ (జాబిల్లి నువ్వే చెప్పమ్మా.. రామయ్యా వస్తావయ్యా), చంద్రబోస్ (గుండెల్లో గోదారి పొంగిపొరలుతోంది.. గుండెల్లో గోదారి), రామజోగయ్య శాస్త్రి (పండగలా దిగివచ్చావు.. మిర్చి), శ్రీమణి (ఆరడుగుల బుల్లెట్టు.. అత్తారింటికి దారేది), విశ్వ (డైమండ్ గర్ల్.. బాద్షా) ఉత్తమ గాయకుడు దలేర్ మెహందీ (బంతిపూల జానకి.. బాద్షా), కైలాష్ ఖేర్ (పండగలా దిగివచ్చావు.. మిర్చి), రంజిత్ (జాబిల్లి నువ్వే చెప్పమ్మా.. రామయ్యా వస్తాయ్యా), శంకర్ మహదేవన్ (బాపుగారి బొమ్మో.. అత్తారింటికి దారేది), సుచిత్ సురేశన్ (మీనాక్షి మీనాక్షి .. మసాలా) ఉత్తమ గాయని చిన్న పొన్ను (మిర్చి లాంటి కుర్రోడే.. మిర్చి), చిత్ర (సీతమ్మ వాకిట్లో.. సీతమ్మ వాకిట్లో), గీతామాధురి (వెచ్చని వయసు.. గుండెల్లో గోదారి), ఇందు నాగరాజ్ (ప్యార్ మే పడిపోయానే.. పోటుగాడు), శ్రేయా ఘోషల్ (హే నాయక్.. నాయక్) -
చిన్న సినిమా


