breaking news
Telangana Project
-
రేవంత్ మాట.. బాబు గుట్టు!
కాలం కలిసిరాకపోతే తాడే పామవుతుందట. పాపం... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిప్పుడు ఈ సామెతను పదే పదే తలచుకుంటూ ఉండి ఉంటారు. ఎందుకంటే... పోతిరెడ్డిపాడు వద్ద గత ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తన కోరిక మీద చంద్రబాబు నిలిపివేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా ఆ రాష్ట్ర శాసనసభలోనే ప్రకటించారు. కావాలని చెప్పారో, క్రెడిట్ కోసం చెప్పారో, అనుకోకుండా చెప్పేశారో తెలియదు కాని... ఈ నిజం కాస్తా చంద్రబాబు ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీసేసింది. తెలంగాణ ప్రజల మెప్పు కోసం లేదంటే బీఆర్ఎస్పై పైచేయి కోసం రేవంత్ అసలు వాస్తవాన్ని ఒప్పుకోవడంతో చంద్రబాబు కాస్తా రాయలసీమ ద్రోహిగా ముద్రపడిపోయారు. రాయలసీమ కరువు శాశ్వత నివారణకు వృథా అవుతున్న కృష్ణా జలాల సద్వినియోగమే మేలైన మార్గమని నమ్మిన గత ముఖ్యమంత్రి జగన్ పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. వరద వచ్చినప్పుడు రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లలో నిల్వ చేయాలన్నది ఈ పథకం ఉద్దేశం. దీనిపై తెలంగాణ రాజకీయ పార్టీల నేతలు అప్పట్లోనే విమర్శలు చేసినా జగన్ దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు. తమకు కేటాయించిన నీటిలోనే తీసుకుంటామని, పైగా వరద నీరు సముద్రంలో కలిసే బదులు వాడుకుంటే మంచిది కదా అని వాదించేవారు. తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా తీసుకుంటున్నట్లే తాము కూడా అదే 800 అడుగుల నీటి మట్టం వద్ద నీటిని తీసుకుంటే తప్పేమిటని ప్రశ్నించేవారు.నిజానికి పోతిరెడ్డిపాడు వల్ల తెలంగాణకు నష్టమేమీ ఉండదన్నది నిపుణుల అభిప్రాయం.కాకపోతే నదీ జలాల పంపిణీపై ట్రిబ్యునల్ ఏర్పడినట్లు ఈ స్కీమ్ను పరిగణనలోకి తీసుకుంటే ఏపీకి ఎక్కువ వాటా ఇవ్వాల్సి వస్తుందన్నది తెలంగాణ అభ్యంతరం. అయినా ఏ రాష్ట్రం అయినా తన సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తుంది. అదే రీతిలో జగన్ రాయలసీమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ను ముందుకు తీసుకువెళ్లారు. ఆ తరుణంలో రేవంత్ రెడ్డే అప్పట్లో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొంతమందితో ఎన్జీటీకి ఫిర్యాదు చేయించారని అనేవారు. టీడీపీ అనుకూలంగా ఉన్నవారే ఈ స్కీమ్పై ఫిర్యాదు చేసినా చంద్రబాబు నాయుడు పట్టించుకోకుండా మౌనంగా ఉన్నారన్న విమర్శ వచ్చేది. ఏడువేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును శరవేగంగా చేయడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇచ్చింది. అయినా తాగు నీటి అవసరాల పేరుతో ఈ స్కీమును కొనసాగించారు. దాదాపు 85 శాతం పనులు పూర్తి చేయించారు. అంతలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయి, టీడీసీ. జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి రావడంతో ఈ స్కీమ్ కు గ్రహణం పట్టినట్లయింది. కేంద్రంలో కూడా ఇదే కూటమి పాలిస్తున్న నేపథ్యంలో స్కీమ్ను కొనసాగించి ఉంటే చంద్రబాబుకు మంచి పేరు వచ్చేది. కాని ఆ పని చేయకపోగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిక మేరకు ఈ ప్రాజెక్టును నిలిపివేశారు. పర్యావరణానికి సంబందించి కేంద్రం నిర్వహించిన సమావేశంలో ఏపీ ప్రభుత్వం తన వాదనను వినిపించలేదని ఫలితంగా అనుమతులు రాలేదని, దానివల్ల రాయలసీమకు తీరని నష్టం వాటిల్లుతుందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి లోక్సభలోనే చెప్పారు. ఎందుకు ఏపీ ప్రభుత్వం అలా చేసిందన్నదానికి ఇప్పుడు సమాధానం దొరికినట్లయింది. రేవంత్, చంద్రబాబులు ఏకాంతంగా భేటీ అయి తీసుకున్న నిర్ణయమట. తనమీద గౌరవంతో చంద్రబాబు ఈ పని చేశారని రేవంత్ చెప్పారు. ఇది రేవంత్ మీద గౌరవంగా చూడాలా? లేక రాయలసీమ ప్రజల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ది కొరవడడంగా చూడాలా? అందరూ వీరిద్దరి సంబంధంగా చూస్తారు. గత శాసనసభ ఎన్నికల సమయంలో టీడీపీ తెలంగాణలో పరోక్షంగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది. రేవంత్ను కాంగ్రెస్ లోకి పంపడం మొదలు, ఆయన ముఖ్యమంత్రి అవడం వరకు చంద్రబాబు పాత్ర ఉందని చాలామంది చెబుతుంటారు. తాజాగా జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో సైతం తెలుగుదేశం పార్టీ మాత్రం తన మిత్రపక్షమైన బీజేపీకి కాకుండా కాంగ్రెస్కే అనుకూలంగా పనిచేసిందన్నది బహిరంగ రహస్యం. రాజకీయంగా ఇంతగా కలిసిపోయిన చంద్రబాబు, రేవంత్లు రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పనిచేస్తే ఫర్వాలేదు. ఇప్పటి వరకు తెలంగాణలో చంద్రబాబు చెప్పినట్లే రేవంత్ ప్రభుత్వం నడుస్తోందని అనుకునేవారు. తాజాగా ఈ రేవంత్ ఈ సమాచారం వెల్లడించడంతో కొత్త అనుమానాలు వస్తున్నాయి. రేవంత్ చెప్పినట్లు ఏపీలో చంద్రబాబు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారన్న భావన కలుగుతుంది. అందులో ఇది ఒకటి. కాకపోతే ఈ రహస్యం రేవంత్ చెప్పేస్తారని చంద్రబాబు ఊహించి ఉండరు. దీనివల్ల ఏపీలో చంద్రబాబుకు రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా రేవంత్ ఈ గుట్టు విప్పడం విశేషం. ఏపీ నీటి ప్రయోజనాలను పణంగా పెట్టి మరీ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఆపేయడం వెనుక కారణాలేమిటి అన్న ప్రశ్న సహజంగానే వస్తుందని ఇప్పటికే వైసీపీ నేతలు పలువురు ఈ అంశంలో చంద్రబాబు తీరును ఎండగడుతూ విమర్శలు చేస్తున్నారు. కొందరైతే చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు, రేవంత్కు 2009 నుంచి సంబంద బాంధవ్యాలు ఏర్పడ్డాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్లవలసి వచ్చింది.అయినా చంద్రబాబు ఆ కేసులో ఇబ్బంది పడకుండా రేవంత్ సహకరించారని చెబుతారు. అప్పటి నుంచి వీరి మధ్య దోస్తి బాగా కుదిరిందని రాజకీయవర్గాలు నమ్ముతాయి. చంద్రబాబు నాయుడు కుటుంబ వ్యాపార ప్రయోజనాలు కూడా తెలంగాణలో అధికంగా ఉన్నాయి. కారణం ఏమైనా చంద్రబాబు ఈ విధంగా రాయలసీమకు అన్యాయం చేయడానికి కూడా సిద్దపడడంం దారుణమనిపిస్తుంది. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు జవాబు ఇవ్వకపోవడం గమనార్హం. జగన్ ఒక విజన్తో రాయలసీమ అభివృద్దికి, నీటి సమస్య తీర్చడానికి ప్రయత్నిస్తే చంద్రబాబు మాత్రం ఎంతసేపు రాజకీయాలకే ప్రాముఖ్యత ఇస్తుంటారన్న విషయం మరోసారి తేటతెల్లమవుతుంది. పైకి మాత్రం రాయలసీమను రత్నాల సీమ చేస్తానని చెబుతుంటారు. చంద్రబాబు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కొత్తగా ఒక్క ఇరిగేషన్ స్కీమ్ తీసుకురాలేదు. ఉన్నవాటిని పూర్తి చేయలేదు. ఎన్నికల సమయాలలో మాత్రం శంకుస్థాపనల హడావుడి చేస్తుంటారు. 1999 ఎన్నికలకు ముందు ఇలాగే పలు స్కీమ్లకు శంకుస్థాపనలు చేసి పట్టించుకోకపోతే అప్పటి విపక్షనేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2002 ప్రాంతంలో శిలాఫలకాల వద్ద పూలు పెట్టి వచ్చి నిరసన తెలిపారు. తదుపరి తాను సీఎం అయ్యాక ఆయన చేపట్టిన తొలి కార్యక్రమం జలయజ్ఞం. తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్రలలో వివిద ప్రాజెక్టులు చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు ఈ దశకు రావడానికి, జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషి అని చెప్పక తప్పదు. ఆ రోజుల్లో పోతిరెడ్డిపాడు వద్ద నీటి తరలింపు సామర్ధ్యం 44వేల క్యూసెక్కులకు పెంచడానికి పనులు ఆరంభిస్తే తెలుగుదేశం పార్టీ ప్రకాశం బ్యారేజీ వద్ద నిరసన తెలిపింది. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు దానికి వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాశారు. చంద్రబాబు వారినెవరిని వారించ లేదు. తదుపరి జగన్ ముఖ్యమంత్రి అయి తీసుకువచ్చిన రాయలసీమ లిఫ్ట్కు చంద్రబాబే నిలిపివేశారంటే ఏమనుకోవాలి. ఈ మధ్యకాలంలో రెండు రాష్ట్రాలు నీటిని మసర్ధంగా వాడుకోవాలని అంటూంటారే ఎందుకు చెబుతున్నారా అన్న సందేహం వచ్చింది. ఇప్పుడు అసలు విషయం బోధపడినట్లయింది. తెలంగాణ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడం ఒక సంగతి అయితే, ఏపీలో రాయలసీమ ప్రాజెక్టుకు మంగళం పలకడం మరో ఎత్తు. గోదావరి-బనకచర్ల స్కీమ్ అని కొన్నాళ్లు హడావుడి చేశారు. దాంతో ఏపీ రూపురేఖలు మారిపోతాయని భ్రమలు పెట్టడానికి యత్నించారు.తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించగానే, దానిని మానుకుని ఇప్పుడు గోదావరి నుంచి నల్లమల సాగర్ ప్రాజెక్టు అంటూ కొత్త గాత్రం అందుకున్నారు. ఇది కూడా సుమారు అరవైవేల కోట్ల ప్రాజెక్టు అట. ఇది ఎప్పుడు ఆరంభం అవుతుందో, ఎప్పటికి పూర్తి అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఈలోగా తెలంగాణ ప్రభుత్వం దీనికి అభ్యంతరం తెలిపింది.నిజానికి ఈ భారీ స్కీమ్ లపై చంద్రబాబుకు నమ్మకం ఉండి చేపడుతున్నారని చెప్పజాలం.కేవలం రాజకీయ ప్రయోజనాలు, ఇతరత్రా కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తుంటారని ఆయన ప్రత్యర్ధులు విమర్శిస్తుంటారు. ఒక్కటి మాత్రం నిజం. చంద్రబాబుకు గతంలో అసలు భారీ నీటి ప్రాజెక్టులంటే పెద్దగా నమ్మకం లేదు. ఎన్నికలలో అవి ఫలితాలు ఇవ్వవన్నది ఆయన భావన. టీడీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్న దివంగత నేతలు ఎర్రా నారాయణస్వామి, వడ్డి వీరభద్రరావు వంటి వారు ఆ రోజుల్లో పోలవరం ప్రాజెక్టుకోసం ఎన్ని ఉద్యమాలు చేసినా చంద్రబాబు మాత్రం కిమ్మనే వారు కారు. వైఎస్ అధికారంలోకి వచ్చాకే పోలవరం ప్రాజెక్టు సాకారం అవడం ఆరంభం అయింది. ఏది ఏమైనా రాయలసీమ ప్రజలకు రేవంత్ చెప్పిన విషయం పిడుగుపాటు వంటిది.అదే టైమ్ లో టిడిపి,జనసేన,బిజెపి కూటమి ప్రభుత్వం రాయలసీమకు తీరని ద్రోహం చేసిందన్న సంగతి నిర్దారణ అవుతుంది.ఈ కూటమిని రాయలసీమ ప్రజలు ఇంకా క్షమిస్తారా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ప్రాజెక్టులు అడ్డుకునే కుట్ర: నిరంజన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రాజెక్టుల పనులు పురోగతి లో ఉన్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల పనులు ఏడాది వ్యవధిలోనే పూర్తి చేసి 60 వేల ఎకరాలకు నీరిచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. తెలంగాణభవన్లో ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగ స్వాములైన వారు ఇప్పుడు కూడా ప్రాజెక్టులను అడ్డుకునే కుట్ర చేస్తున్నారన్నారు. -
నిర్వాసితులపై ప్రభుత్వ వైఖరి సరిచేసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: నిర్వాసితుల విషయంలో ప్రభుత్వ వైఖరి సరిచేసుకోవాలని, ప్రాజెక్టుల కోసం త్యాగాలు చేస్తున్న ప్రజల పట్ల దబారుుంపులకు స్వస్తి పలకాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం హితవు పలికారు. ప్రభుత్వం బెదిరించి, అదిరించి, జైల్లో పెట్టి ఏమీ సాధించలేదని స్పష్టం చేశారు. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన హైదరాబాద్లో ఏర్పాటు చేసిన నిర్వాసితుల సదస్సు సందర్భంగా టీజేఏసీ డిక్లరేషన్ను విడుదల చేసింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా చేస్తున్న భూసేకరణను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఈ డిక్లరేషన్ స్పష్టం చేసింది. ఇదే డిమాండ్లపై రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇందిరా పార్కు వద్ద తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తెలంగాణలో ప్రతి ఇంటి నుంచి ప్రజలు హాజరవ్వాలని సదస్సు పిలుపునిచ్చింది. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతోనో, మరో పేరుతోనో ప్రభుత్వ భూ సేకరణ కారణంగా నిర్వాసితులవుతున్న ప్రజల అభిప్రాయ సేకరణకు ఉద్దేశించిన ఈ సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూములు కోల్పోరుున బాధితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజేఏసీ విడుదల చేసిన డిక్లరేషన్.. మల్లన్నసాగర్, ఓపెన్ కాస్ట్ గనులు, వివిధ ప్రాజెక్టుల నిర్మాణ క్రమంలో నిర్వాసితులవుతున్న ప్రజలకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ముందుగానే ప్రకటించి, ప్రజామోదం పొందిన తరువాతనే యథాతథంగా అమలు పరచాలని డిమాండ్ చేసింది. ప్రాజెక్టుల నిర్మాణంలో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, జవాబుదారీతనం ఉండాలని సదస్సు అభిప్రాయపడింది. నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి క్షేత్రస్థారుులో పరిశీలనకు సాంకేతిక నిపుణులు, సామాజిక వేత్తలు, పర్యావరణ వేత్తలతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సదస్సు డిమాండ్ చేసింది. ఈ కమిటీ నివేదిక ఆమోదం పొందేవరకూ ఆ ప్రాజెక్టు కోసం భూ సేకరణను ఆపివేయాలని కోరింది. సంపూర్ణ ప్రాజెక్టు నివేదిక(డి.పి.ఆర్.) ప్రకటించకుండానే, అవసరాలకు మించి చేస్తున్న భూసేకరణ పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్వాసితులకు ప్రాజెక్టు లాభాల్లో వాటా భూ సేకరణ విషయంలో ఉన్న శ్రద్ధ నష్టపరిహారం విషయంలో లేకపోవడం పట్ల సదస్సు నిరసన తెలిపింది. పునరావాసం, ఉపాధి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టింది. రాష్ట్రం లో భూములను త్యాగాలు చేసిన నిర్వాసితులకు ప్రాజెక్టు ద్వారా అందుతున్న లాభాల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేసింది. ‘‘భూమికి భూమి’’ప్రాతిపదికన నిష్పత్తి దామాషా లో సాగుభూములను అదే ప్రాజెక్టు కింద ఇవ్వాలని డిమాండ్ చేసింది. జాతీయ భూసేకరణ చట్టం- 2013 ప్రకారమే నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేసింది. -
రైతుల సమస్యలు పరిష్కరించండి
♦ సర్కారుకు వైఎస్సార్సీపీ తెలంగాణ శాఖ సూచన ♦ వైఎస్ ముందుచూపు వల్లే ♦ తెలంగాణ ప్రాజెక్టుల్లో పురోగతి ♦ పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రచార ఆర్భాటాల కోసం సమీక్షలతో కాలం గడపకుండా రైతుల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ డిమాండ్ చేసింది. సీఎం కేసీఆర్ మొదలుకుని హరీశ్రావు, కేటీఆర్ ఇతర మంత్రులు సమీక్షల పేరిట కాలం వెళ్లబుచ్చుతున్నారు తప్పించి, ప్రజలు ముఖ్యంగా రైతాంగం సమస్యల పరిష్కారానికి ఎలాంటి చొరవా తీసుకోవడం లేదంది. గురువారం పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... రబీలో 31.90 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే ఊరుకునేది లేదంటూ అధికారులతో సమీక్షలో హరీశ్రావు హెచ్చరించడం విడ్డూరంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో తెలంగాణలో 36 ప్రాజెక్టులను ప్రారంభించారని, ఆయన హయాంలోనే 6 ప్రాజెక్టులను పూర్తి చేశారన్నారు. ప్రస్తుతం కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు జలకళతో ఉన్నాయంటే గతంలో వైఎస్ చేసిన కృషే కారణమన్నారు. అయితే ఇది తమ ఘనతగా చెప్పుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖరీఫ్లో ఏమైంది, ఎంత పంట వేశారు, ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారు, రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటీ అన్న దానిపై సమీక్ష నిర్వహించి ఉండాల్సిందన్నారు. ఖరీఫ్లో రైతులకు రూ.17,489కోట్ల మేర కొత్త రుణాలు ఇవ్వాల్సిండగా, రూ.8.60వేల కోట్లు మాత్ర మే రుణాలు ఇచ్చారని చెప్పారు. ఈ కాలంలో 1.08 లక్షల ఎకరాల్లో పంట వేసేందుకు వ్యవసాయ నిపుణులు అంచనా వేసినా, అందులో 45 శాతం కూడా రైతులు పంటలు వేయలేకపోయారన్నారు. దీంతో పాటు రుణమాఫీ జరగక, కొత్త రుణాలు అందక, కల్తీ విత్తనాలతో కుదేలై అధిక వడ్డీతో అప్పులు తెచ్చి వేసిన పంటలు దెబ్బతిని రైతులకు రూ.2 వేల కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. ఈ అంశాలతో పాటు, కరువు మండలాల జాబితాను కేంద్రానికి పంపించడం, హరితహారం పేరిట పోడు భూముల నుంచి ఎస్సీ, ఎస్టీ రైతులను వెళ్లగొట్టడంపై ఎలాంటి సమీక్షను ప్రభుత్వం నిర్వహించలేదని విమర్శించారు. మిషన్ కాకతీయపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. -
ఉ‘భయ’ గోదావరి
♦ తెలంగాణ ప్రాజెక్టుల నుంచి భారీ ఎత్తున వరదనీరు ♦ ఉప్పొంగుతున్న ఉపనదులు సాక్షి, హైదరాబాద్: ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి మహోగ్రరూపం దాలుస్తోంది. దీంతో ఉభయ గోదావరి జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉంది. తెలంగాణలోని శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, సింగూరు, నిజాంసాగర్ వంటి ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో సోమవారం ధవళేశ్వరం బ్యారేజీకి వరద నీరు వచ్చే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారవర్గాలు వెల్లడించాయి. ఛత్తీస్గఢ్, ఒడిశాల్లోనూ భారీ వర్షాలు కురుస్తోండటంతో ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు ఉప్పొంగుతున్నాయి. ఆదివారం ధవళేశ్వరం బ్యారేజీకి 2,42,600 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. ఆదివారం మరో 20.83 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి. మరో ఉపరితల ఆవర్తనం నేడు, రేపు విస్తారంగా వానలు రాష్ట్రానికి భారీ వర్షాల ముప్పు ఇంకా పొం చి ఉంది. రాబోయే రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, 28, 29 తేదీల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఆదివారం రాత్రి పేర్కొంది. అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడటమే ఇందుకు కారణం. ఇది అండమాన్ - ఆంధ్రప్రదేశ్ తీరం మధ్య కోస్తాంధ్రకు కొంత సమీపంలోనే ఉంది. దీంతో ఈ నెల 28, 29 తేదీల్లో కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ వైకే రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
నీటి విడుదలకు నో!
తెలంగాణ, ఏపీల విజ్ఞప్తిని తిరస్కరించిన కృష్ణా బోర్డు - 16 టీఎంసీలు ఇవ్వాలన్న ఏపీ, ఏడు టీఎంసీలు కోరిన తెలంగాణ - నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరడాన్ని ఎత్తిచూపిన బోర్డు సభ్య కార్యదర్శి - దీనిపై ఇరు రాష్ట్రాల కార్యదర్శులతో చర్చించి నిర్ణయిస్తామని స్పష్టీకరణ - కృష్ణా జలాల వినియోగం అంశంపై కుదరని ఏకాభిప్రాయం - కేంద్ర కమిటీ నివేదిక ఆధారంగా ‘టెలీమెట్రీ’ వ్యవస్థ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్ : కృష్ణా జలాల అంశంపై బోర్డు త్రిసభ్య కమిటీ భేటీలోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. హైదరాబాద్ తాగునీటి అవసరాలతోపాటు భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయల్సాగర్ పథకాల ట్రయల్ రన్కు కలిపి ఏడు టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణ కోరగా... సాగు, తాగునీటి అవసరాలు, పుష్కరాల కోసం తక్షణమే 16 టీఎంసీలు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. అయితే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కనీస స్థాయికి మించి పడిపోయిన నేపథ్యంలో... రాష్ట్రాలు కోరుతున్నట్లుగా నీటి విడుదల సాధ్యం కాదని బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ స్పష్టం చేశారు. దీనిపై ఇరు రాష్ట్రాల నీటిపారుదల కార్యదర్శులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ జల వనరుల శాఖ ఈఎన్సీలు వెంకటేశ్వరరావు, మురళీధర్ సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ బుధవారం హైదరాబాద్లోని జలసౌధలో సమావేశమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మూడు టీఎంసీలు వినియోగించుకుంటామని తెలంగాణ కోరింది. భీమా, నెట్టెంపాడు, కోయల్సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ట్రయల్ రన్ నిర్వహణకు కనీసం నాలుగు టీఎంసీలు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండిపోయాయని.. దీంతో భారీగా వరద జలాలు అందుబాటులోకి వస్తాయని వివరించింది. గతేడాది నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నాలుగు టీఎంసీలు విడుదల చేయాలన్న బోర్డు ఆదేశాలు అమలుకాకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. వాటిని ఈ ఏడాది సర్దుబాటు చేయాలని కోరింది. మరోవైపు నాగార్జున సాగర్ కుడి కాలువ కింద సాగు అవసరాలకు 8 టీఎంసీలు.. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి కోసం 4 టీఎంసీలు, కృష్ణా పుష్కరాల కోసం మరో 4 టీఎంసీలు విడుదల చేయాలని ఏపీ కోరింది. ఈ ప్రతిపాదనలను సమీర్ చటర్జీ తోసిపుచ్చారు. శ్రీశైలం, సాగర్లలో నీటి నిల్వలు కనిష్ట స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు జలాలను విడుదల చేయలేమని తేల్చిచెప్పారు. కేంద్ర కమిటీ నివేదిక తర్వాతే.. తెలంగాణ, ఏపీల పరిధిలో కృష్ణా జలాల వినియోగాన్ని ఎప్పటికప్పుడు లెక్కించేందుకు టెలీమెట్రీ వ్యవస్థ ఏర్పాటుపై బోర్డు త్రిసభ్య కమిటీ చర్చించింది. కల్వకుర్తి, కోయల్సాగర్, నెట్టెంపాడు, భీమా, జూరాల, ఎలిమినేటి మాధవరెడ్డి, హైదరాబాద్ తాగునీటి ప్రాజెక్టుల వద్ద టెలీమెట్రీ సెన్సర్లు ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారు కోరింది. శ్రీశైలం కుడికాలువ, హంద్రీ-నీవా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, నాగార్జునసాగర్ కుడికాలువ, పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీల వద్ద టెలీమెట్రీ సెన్సర్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిపై బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ స్పందిస్తూ.. సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) రిటైర్డు చైర్మన్లతో కేంద్రం నియమించిన త్రిసభ్య కమిటీ పర్యటించి, ఇరు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ టెలీమెట్రీ సెన్సర్లు ఏర్పాటు చేయాలన్న అంశంపై నివేదిక ఇస్తుందని చెప్పారు. ఆ నివేదిక ఆధారంగానే టెలీమెట్రీ వ్యవస్థను ఏర్పాటు చేసి, నీటి వినియోగాన్ని లెక్క కడతామని స్పష్టం చేశారు. -
తెలంగాణ ప్రాజెక్టులపై కుట్రలు: కొప్పుల
సాక్షి, హైదరాబాద్: రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఆంధ్రా ప్రాంత నేతలు ఎందరు అడ్డుపడినా తెలంగాణకు ఉన్న హక్కు మేరకు నీరు వినియోగించుకునేలా ప్రాజెక్టులు కట్టి తీరతామని మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాలతో సుహృద్భావ వాతావరణం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తుండగా చంద్రబాబు, జగన్ మాత్రం ఇరు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకునేందుకు కేంద్రానికి చంద్రబాబు అడ్డగోలు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగానే తమ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని పేర్కొన్నారు. -
ఏపీ ప్రయత్నాలు తిప్పికొడదాం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం, అక్కడి రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇందుకు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, నాయకులు ఏకం కావాలన్నారు. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డితో పాటు పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు సీఎం అధికారిక నివాసంలో మంగళవారం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కరువుతో అల్లాడే పాలమూరుకు సాగునీరివ్వాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ఒకరు దీక్షకు దిగుతామని, మరొకరు కేబినెట్ తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తామని చెబుతున్నారని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల కోసం అప్పటి ఆంధ్రా పాలకులు జీవోలు ఇచ్చి, శంకుస్థాపనలు చేసి, కొబ్బరి కాయలు కూడా కొట్టారని, అయితే నీళ్లు మాత్రం రాలేదన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో వలసలు ఆపి 16 నుంచి 17 లక్షల ఎకరాలకు సాగు నీరందించడమే తన లక్ష్యమన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్సాగర్ వంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తానన్నారు. భీమా ప్రాజెక్టు ద్వారా ఈ ఖరీఫ్కే 1.5 లక్షల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. మంత్రులు హరీశ్రావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. -
తెలంగాణ అవసరాలకే దుమ్ముగూడెం!
ప్రాజెక్టులో మార్పులు చేసే యోచనలో సర్కారు భూ సేకరణ, విద్యుత్ వినియోగం తగ్గించే వ్యూహం సాక్షి, హైదరాబాద్: తెలంగాణవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దుమ్ముగూడెం ప్రాజెక్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా అందుబాటులోకి వచ్చే నీటిని తెలంగాణ రాష్ట్రానికే పరిమితం చేసే విధంగా నిర్ణయం తీసుకునే వీలుంది. ఈ మేరకు ప్రాజెక్టు డిజైన్లో మార్పులు చేయాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను పంపించాల్సిందిగా అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించినట్టు తెలిసింది. రెండు మూడు రోజుల్లో దీనిపై పూర్తి నివేదిక సిద్ధంకానుంది. గోదావరి నది నుంచి సుమారు 165 టీఎంసీల నీటిని కృష్ణా బేసిన్కు తరలించడానికి వీలుగా దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ర్టంలో గత ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం వద్ద నుంచి నీటిని ఎత్తిపోసి నల్లగొండ మీదుగా నాగార్జునసాగర్ దిగువలోని టెయిల్ పాండ్లోకి తరలించే విధంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఇందుకోసం సుమారు రూ. 19 వేల కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. దీనికి సంబంధించిన టెండర్లు కూడా ఖరార య్యాయి. అయితే ఈ ప్రాజెక్టును అప్పట్లోనే తెలంగాణ ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భారీగా భూ సేకరణ చేయాల్సి ఉన్నందున రైతులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం పక్కనబెట్టింది. సామర్థ్యం కొంత తగ్గిస్తే సరి! రాష్ర్ట విభజనతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై తాజాగా దృష్టి పెట్టింది. భూ సేకరణను వీలైనంత తగ్గించి రైతులు ఎక్కువ నష్టపోకుండా ప్రాజెక్టులో కొన్ని మార్పులు చేయాలని భావిస్తోంది. అవసరమైతే 165 టిఎంసీలు కాకుండా కొంత తక్కువ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలన్న ఆలోచన చేస్తోంది. దీనివల్ల లిఫ్టులకు అవసరమయ్యే విద్యుత్ కూడా తగ్గుతుందని సర్కారు యోచిస్తోంది. తెలంగాణలో మూడు ప్రాజెక్టులు వరద నీటిపై ఆధారపడి ఉన్నాయి. నెట్టెంపాడు(22 టీఎంసీలు), కల్వకుర్తి(25 టీఎంసీలు), ఏఎమ్మార్పీ (30 టీఎంసీలు) ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేవు. అంటే ఈ మూడు ప్రాజెక్టులకు సుమారు 77 టిఎంసీల నీరు అవసరం. అంటే దుమ్ముగూడెం ప్రాజెక్టును 80 టిఎంసీలకు లేదా వంద టీఎంసీలకే పరిమితం చేస్తే ఖర్చు తగ్గడంతో పాటు భూ సేకరణ సమస్యను కూడా తగ్గించవచ్చని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఈ నీటితో కృష్ణా బేసిన్లోని తెలంగాణ ప్రాజెక్టులకు అవసరమైన నీరు కూడా లభ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. నాగార్జునసాగర్ పరిధిలో నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో(ఎడమ కాల్వ కింద) 6.58 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందుకోసం కృష్ణా జలాల్లో తెలంగాణకు 105 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. దుమ్ముగూడెం నుంచి టెయిల్ పాండ్కు తీసుకువచ్చే గోదావరి నీటిని ఈ ఆయకట్టుకు ఉపయోగించుకుని కృష్ణా నదిలోని నికర కోటా జలాలను ఎగువ ప్రాంతంలోని నెట్టెంపాడు, కల్వకుర్తి, ఏఎమ్మార్పీ ప్రాజెక్టులకు వాడుకోవాలని రాష్ర్ట ప్రభుత్వం యోచిస్తోంది.


