breaking news
Telangana Electricity Regulatory Commission
-
‘విద్యుత్ సర్వీస్’ ఇక ఈజీ
హన్మకొండ: విద్యుద్దీకరణ చేపట్టనున్న ప్రాంతాల్లో ఎల్టీ సర్వీసుల మంజూరు సులభతరం చేశారు. పైగా ఖర్చుల భారం కూడా తగ్గించారు. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి జనవరి 29న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నూతన నిబంధనలు అమలు కావాల్సి ఉండగా, అవగాహన లేకపోవడం, సమాచార లోపం తదితర కారణాలతో ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి కచ్చితంగా అమలు చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ఆదేశించారు. సర్వీస్ మంజూరుకు అవసరమైన విద్యుత్ లైన్ నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం ఇప్పటి వరకు వినియోగదారుడు భరించాల్సి వచ్చేది. ఇప్పటి నుంచి కిలోమీటర్ దూరం వరకు ఎలాంటి విద్యుత్ లైన్ నిర్మాణ ఖర్చులు చెల్లించాల్సి ఉండదు. దీంతో విద్యుత్ వినియోగదారుడికి రూ.లక్షకు పైగా సొమ్ము ఆదా కానుంది.రైతులకు ఊరట కొత్త విద్యుత్ సర్వీసుల మంజూరులో రైతులకు ఊరట లభించింది. ఇప్పటి వరకు 3 స్తంభాల దూరం వరకు నిర్ణీత చార్జీలతో విద్యుత్ సర్వీస్ మంజూరు చేసేవారు. మూడు స్తంభాల దూరం దాటితే ఓఆర్సీ కింద రైతులు రూ.45 వేలకు పైగా చెల్లించేవారు. ప్రస్తుతం నూతన నిబంధనలతో కిలోమీటర్ దూరం వరకు విద్యుత్ లైన్ నిర్మాణానికి ఎలాంటి ఖర్చులూ ఉండవు. పరిశ్రమలకు కూడా కిలోమీటర్ వరకు ఎలాంటి నిర్మాణ ఖర్చులు ఉండవు. గతంలో అధికారులు, సిబ్బంది ఎస్టిమేషన్ సాకుతో వినియోగదారులను రకరకాలుగా ఇబ్బందులకు గురిచేసేవారనే ఆరోపణలున్నాయి. కిలోమీటరు దూరం దాటితే ఎస్టిమేట్ మేరకు ఖర్చులు వినియోగదారుడు భరించాలి.ఏకరీతి విధానం తీసుకొచ్చిన టీజీ ఈఆర్సీ విద్యుత్ లైన్ నిర్మాణం అవసరం లేకున్నా... కిలోమీటర్ దూరం విద్యుత్ లైన్ వేయాల్సి ఉన్నా ఒకే నిబంధన, చార్జీలు వర్తించేలా ఏకరీతి విధానాన్ని టీజీ ఈఆర్సీ తీసుకొచ్చింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న నిబంధనల్లో మార్పులు చేసింది. లోడ్ ఆధారిత చార్జీలు చెల్లిస్తే విద్యుత్ సర్వీస్ మంజూరు చేస్తారు. అవసరమైతే విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ను కూడా ఏర్పాటు చేస్తారు.ట్రాన్స్ఫార్మర్ ఖర్చులు కూడా డిస్కం భరిస్తుంది. వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలకు ప్రత్యేక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అమర్చితే ఈ ఖర్చులను వినియోగదారుల నుంచి డిస్కం వసూళ్లు చేస్తుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇతరులకు విద్యుత్ సరఫరా చేయడానికి వీలులేదు. టీజీ ఈఆర్సీ రెగ్యులేషన్స్ ప్రకారం చార్జీల వివరాలు ఇలా..» ఎల్టీ–1, గృహాలకు విద్యుత్ సర్వీస్ మంజూరు» కిలోవాట్కు రూ.500 సర్వీస్ కనెక్షన్ చార్జీలతోపాటు అదనంగా డెవలప్మెంట్ చార్జి, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.» కిలోవాట్ నుంచి 5 కిలోవాట్ల వరకు కనీస చార్జీ రూ.500తోపాటు ప్రతీ కిలోవాట్కు రూ.600 చొప్పున, వీటికి అదనంగా డెవలప్మెంట్ చార్జీ, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.» 5 కిలోవాట్ పైనుంచి 20 కిలోవాట్ల వరకు కనీస చార్జీ రూ.2,900తోపాటు ప్రతీ కిలోవాట్కు రూ.1,500 చొప్పున వీటికి అదనంగా డెవలప్మెంట్ చార్జీ, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.» 20 కిలోవాట్లకు పైన.. ప్రతీ కిలోవాట్కు రూ.10 వేల చొప్పున చెల్లించాలి.ఎల్టీ–2: గృహేతర, వాణిజ్యం » కిలోవాట్ వరకు.. కనీస చార్జీ రూ.వెయ్యికి అదనంగా డెవలప్మెంట్ చార్జీ, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.» కిలోవాట్ నుంచి 5 కిలోవాట్ల వరకు కనీస చార్జీ రూ.వెయ్యితోపాట ప్రతీ కిలోవాట్కు రూ.1,200 చొప్పున చెల్లించాలి. అదనంగా సెక్యూరిటీ డిపాజిట్, డెవలప్మెంట్ చార్జీ ఉంటుంది.» 5 కిలోవాట్ పైనుంచి నుంచి 20 కిలోవాట్ల వరకు కనీస చార్జీ రూ.5,800తో పాటు ప్రతీ కిలోవాట్కు రూ.2 వేల చొప్పున చెల్లించాలి. అదనంగా సెక్యూరిటీ డిపాజిట్, డెవలప్మెంట్ చార్జీ ఉంటుంది.ఎల్టీ–3: పరిశ్రమలు» 20 కిలోవాట్లపై ప్రతీ కిలోవాట్కు రూ.10 వేల చొప్పున చెల్లించాలి.» 20 కిలోవాట్ల వరకు ప్రతీ కిలోవాట్కు రూ.4 వేల చొప్పున అదనంగా సెక్యూరిటీ డిపాజిట్, డెవలప్మెంట్ చార్జీ చెల్లించాలి.» 20 కిలోవాట్లపై ప్రతీ కిలోవాట్కు రూ.10 వేల చొప్పున అదనంగా సెక్యూరిటీ డిపాజిట్, డెవలప్మెంట్ చార్జీ చెల్లించాలి.ఎల్టీ–4: కుటీర పరిశ్రమలు » నిర్ణీత లోడ్ వరకు కిలోవాట్కు రూ.వెయ్యి చొప్పున చెల్లించాలి.ఎల్టీ–5: వ్యవసాయం » కిలోవాట్కు రూ.వెయ్యి చెల్లించాలి. దీనికి అదనంగా డెవలప్మెంట్ చార్జీ, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. -
పరిశ్రమల గుండె గు'బిల్లు'
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని ఓ పారిశ్రామిక వాడలో గత నెలలో రూ.39వేలు విద్యుత్ బిల్లు చెల్లించిన పరిశ్రమకు కొత్త విధానంలో రూ.3.50 లక్షల బిల్లు జారీ అయింది. ప్రతీ నెలా రూ.5 లక్షల కరెంటు బిల్లు చెల్లించే మరో పరిశ్రమకు ఏకంగా రూ.25 లక్షలు చెల్లించాలని బిల్లు వచ్చింది. పవర్ ఫ్యాక్టర్ పేరుతో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) తెచ్చిన నూతన బిల్లింగ్ విధానం పరిశ్రమల గుండెల్లో గుబులు రేపుతోంది. కొత్త బిల్లింగ్ విధానం పెనుభారం మోపుతోందని పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు వాపోతున్నాయి. మూడు నుంచి ఐదు రెట్లు అధికంగా బిల్లులు చెల్లించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి కల్పనపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కమ్)లు రూ.వేల కోట్లు అదనంగా వసూలు చేయడంపైనే దృష్టి పెట్టాయనే విమర్శలు విన్పిస్తున్నాయి. కొత్త బిల్లింగ్ అమలుకు కొంత సమయం ఇవ్వాలని, తమతో చర్చించిన తర్వాత దశల వారీగా అమలు చేయాలని ఆయా వర్గాలు కోరుతున్నాయి. పవర్ ఫ్యాక్టర్ నియంత్రణ కోసం.. టీజీఈఆర్సీ 2025–26 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలకు కొత్త కేవీఏహెచ్ (కిలో ఓల్ట్ యాంపియర్ అవర్) బిల్లింగ్ విధానాన్ని అమలు చేయాలని డిస్కమ్లను ఆదేశించింది. హైటెన్షన్ (హెచ్టీ) కేటగిరీ కిందకు వచ్చే వినియోగదారుల విద్యుత్ వినియోగం (పవర్ ఫ్యాక్టర్) స్థిరంగా (విద్యుత్ పరిభాషలో ఒక యూనిటీకి సమానం లేదా కొంచెం తక్కువ) ఉంచేందుకు నూతన బిల్లింగ్ విధానం దోహదపడుతుందని చెప్పింది. పవర్ ఫ్యాక్టర్ స్థిరంగా ఉంచేందుకు ఈ ఏడాది మార్చిలోగా ‘ఆటోపవర్ ఫ్యాక్టర్ కంట్రోల్ ప్యానెల్స్’ (ఏపీఎఫ్సీపీ) మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని పరిశ్రమలను డిస్కమ్లు ఆదేశించాయి. ఈ నూతన బిల్లింగ్ విధానం గత డిసెంబర్ నుంచి అమలు కాగా.. జనవరి మొదటి వారం నుంచి పరిశ్రమలకు విద్యుత్ బిల్లులు జారీ అవుతున్నాయి. మూడు నుంచి ఐదు రెట్లు అధికంగా బిల్లులు వస్తున్నాయంటూ ఆయా వర్గాలు డిస్కమ్ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలపై ప్రతి నెలా రూ.500 కోట్ల మేర అదనపు భారం పడుతుందని వాపోతున్నాయి. కొత్త విధానం ఎందుకంటే.. గతంలో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు కిలో వాట్ అవర్ (కేడబ్ల్యూహెచ్) ఆధారంగా కేవీఏహెచ్ (కిలో ఓల్ట్ యాంపియర్ అవర్) బిల్లింగ్ విధానం ఉండేది. ఈ విధానంలో వినియోగించిన విద్యుత్కు మాత్రమే బిల్లులు వేస్తారు. కిలో ఓల్ట్ యాంపియర్ రియాక్టివ్ అవర్ (కేవీఏఆర్హెచ్)ను పరిగణనలోకి తీసుకునే వారు. కేవీఆర్ఎహెచ్ అంటే మోటార్ల లాంటి యంత్రాలు ఆన్లో లేకున్నా పరోక్షంగా కొంత విద్యుత్ను వినియోగించుకుంటాయి. దీనిని రియాక్టివ్ ఎనర్జీగా పరిగణిస్తారు. దీన్ని బిల్లుల వసూలులో పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఈ రియాక్టివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల వల్ల గ్రిడ్పై ప్రతికూల ప్రభావం ఉంటుంది. దీంతో పవర్ ఫ్యాక్టర్ను స్థిరీకరించేందుకు ‘ఆటో పవర్ ఫ్యాక్టర్ కంట్రోల్ ప్యానెల్స్’ ఏర్పాటు చేసుకోవాలని పరిశ్రమలను డిస్కమ్లు ఆదేశించాయి. ఈ ప్యానెల్స్ రియాక్టివ్ ఎనర్జీని కూడా యూనిట్లుగా లెక్కిస్తాయి. అందువల్ల పరిశ్రమలు వినియోగించే విద్యుత్ యూనిట్లు పెరుగుతాయి. దీంతో బిల్లులు భారమవుతున్నాయి. ప్యానెల్స్లోని కెపాసిటర్లు రియాక్టివ్ ఎనర్జీ పవర్ ఫ్యాక్టర్ ఒక యూనిటీని మించకుండా చూస్తాయి. తద్వారా గ్రిడ్పై హెచ్చుతగ్గుదల ప్రభావం పడకుండా నెట్వర్క్లో ఓల్టేజీ సమస్యలు పరిష్కారమవుతాయని అంటున్నారు. ఇందులోనూ మార్పులు.. కొత్త బిల్లింగ్ విధానంతోపాటు గతంలో అమలు చేసిన టైమ్ ఆఫ్ డే (టీఓడీ) టారిఫ్ విధానంలోనూ డిస్కమ్లు మార్పులు చేశాయి. టీఓడీ టారిఫ్లో పీక్ అవర్స్ (ఉదయం 6 నుంచి రాత్రి 10వరకు)లో పరిశ్రమల విద్యుత్ వినియోగంపై ఒక్కో యూనిట్పై అదనంగా రూ.1 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. ఆఫ్ పీక్ అవర్స్ (రాత్రి 10 నుంచి ఉదయం 6వరకు)లో ఒక్కో యూనిట్ వినియోగంపై రూ.1.50 చొప్పున రాయితీ ఉండేది. ఇటీవల టీఓడీలోనూ మార్పులు చేస్తూ పీక్ అవర్స్లో వినియోగంపై అదనపు వసూలును కొనసాగిస్తూనే, ఆఫ్ పీక్ అవర్స్లో వినియోగించే విద్యుత్పై రాయితీని తొలగించారు. టీఓడీ టారిఫ్లో మార్పులతోనూ అదనపు భారం పడుతోందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. గడువు కోరుతున్న యజమానులు కొత్త మెకానిజం ఏర్పాటు చేసుకునేంత వరకు పాత పద్ధతిలోనే బిల్లులు చెల్లించేలా వెసులుబాటు ఇవ్వాలని పరిశ్రమల యజమానులు డిస్కమ్లను కోరుతున్నారు. దీంతో వరంగల్, పెద్దపల్లి జిల్లాల పరిధిలోని రైస్ మిల్లర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) వెసులుబాటు కల్పిస్తూ రెండు నెలల్లోగా ఏపీఎఫ్సీపీ మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని గడువు విధించింది. మరోవైపు, కొత్త మెకానిజం ఏర్పాటుకు అవసరమైన పరికరాలు, కన్సల్టెన్సీల కోసం పరిశ్రమల యజమానులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. దీంతో ఆయా పరికరాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో వెంటనే సమకూర్చుకునే పరిస్థితి కనిపించడం లేదు. భట్టిని కలిసేందుకు సమాయత్తం కొత్త బిల్లింగ్ విధానంతోపాటు పీక్, నాన్ పీక్ అవర్స్లో వసూలు చేసే టారిఫ్లపై పునరాలోచన చేయాలని పారిశ్రామిక సంఘాలు కోరుతున్నాయి. 50వేలకు పైగా పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య యూనిట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంఘాలు ఇటీవల భేటీ అయ్యాయి. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ), తెలంగాణ ఇండ్రస్టియలిస్ట్స్ ఫెడరేషన్ (టిఫ్), తెలంగాణ ఐరన్ అండ్ స్టీల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (టిస్మా), తెలంగాణ స్టేట్ టూల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (టీఎస్టీఎంఏ), చెర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ (సీఐఏ)తో పాటు పలు సంస్థలు ఈ భేటీలో పాల్గొన్నాయి. ఈ అంశంపై త్వరలో డిప్యూటీ సీఎం, పరిశ్రమల శాఖ మంత్రిని కలిసేందుకు సమాయత్తం అవుతున్నాయి. -
విద్యుత్ బిల్లు.. ముందే చెల్లిస్తే రిబేటు!
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ బిల్లులను ముందుగానే చెల్లించే వినియోగదారులకు చార్జీలను తగ్గించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మేరకు రిటైల్ టారిఫ్ ఖరారు నిబంధనలను సవరించాలని సూచించింది. 2020–21లో అమలు చేయనున్న విద్యుత్ టారిఫ్ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు త్వరలో సమర్పించనున్నాయి. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ముందస్తు బిల్లుల చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రిబేటును ప్రతిపాదించే అవకాశాలున్నాయి. వర్కింగ్ కాపిటల్ భారం తగ్గుదల.. గత ఆగస్టులో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అవసరమైన విద్యుత్ కొనుగోళ్ల కోసం డిస్కంలు కనీసం ఒకరోజు ముందు ఉత్పత్తి కంపెనీలకు బిల్లుల చెల్లింపులు జరపాలని ఆదేశించింది. దీంతో డిస్కంలు వ్యయప్రయాసలు పడుతూ ముందస్తు చెల్లింపులు జరుపుతున్నాయి. దీంతో ఉత్పత్తి కంపెనీలపై వర్కింగ్ కాపిటల్ భారం తగ్గుతోంది. జనరేటింగ్ టారిఫ్ తగ్గించాలి.. వర్కింగ్ కాపిటల్ తగ్గుతున్న నేపథ్యంలో ఉత్పత్తి కంపెనీలకు డిస్కంలు చెల్లించే జనరేటింగ్ టారిఫ్ను తగ్గించాలని తాజాగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సూచించింది. ఉత్పత్తి కంపెనీల వర్కింగ్ కాపిటల్ భారం తగ్గితే ఆ మేరకు డిస్కంలకు పూర్తిస్థాయి పరిహారం అందించడానికి ప్రస్తుత రిబేటు విధానం సరిపోదని, కొత్త విధానాన్ని ఈఆర్సీ రూపొందించాలని కోరింది. అదే విధంగా వినియోగదారులూ ముందస్తుగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తే డిస్కంలకు వర్కింగ్ కాపిటల్ భారం తప్పనుంది. ఆ మేరకు ముందస్తుగా చెల్లింపులు జరిపితే రిబేటు అందించేందుకు వారి విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరింది. -
విద్యుత్ టారిఫ్ తగ్గించండి
జలమండలి వినతి నేడు తెలంగాణ ఈఆర్సీతో అధికారుల భేటీ సిటీబ్యూరో: రూకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న జలమండలికి విద్యుత్ టారిఫ్ తగ్గించాలని కోరుతూ బోర్డు అధికారులు శనివారం తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్కు విన్నవించనున్నారు. ప్రస్తుతం కృష్ణా, మంజీర, సింగూరు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నుంచి సేకరిస్తున్న 340 మిలియన్ గ్యాలన్ల జలాలను గ్రేటర్ నలుమూలలకు సరఫరా చేసేందుకు నెలకు 110 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. దీనికి ప్రతి నెలా జలమండలి రూ.45 కోట్లు బిల్లులు చెల్లిస్తోంది. బోర్డును పరిశ్రమ కేటగిరీగా (హెచ్టీ) పరిగణిస్తూ యూనిట్కు రూ.5.70 వంతున వసూలు చేస్తున్నారు. ఇక నుంచి యూనిట్కు రూ.3.70కే సరఫరా చేయాలని జలమండలి అధికారులు ఈఆర్సీని కోరనున్నారు. దీంతో బోర్డుకు నెలకు రూ.10 కోట్ల వంతున ఆదా అవుతుందని.. ఈ నిధులు శివార్లలో మంచినీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు, స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం, మరమ్మతులకు వినియోగించే అవకాశం ఉంటుందని ఈఆర్సీకి వివరించనున్నారు.బెంగళూరులో జలబోర్డుకు సరఫరా చేస్తున్న విద్యుత్ యూనిట్కు రూ.3.70 మాత్రమే వసూలు చేస్తున్నారని, మరోవైపు గ్రామీణ నీటి సరఫరా విభాగానికి సైతం రాయితీపై విద్యుత్ అందిస్తున్నారని బోర్డు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. జలమండలి వాదనకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వంటి స్వచ్ఛంద సంస్థలు సైతం మద్దతు పలుకుతుండడం విశేషం. రెట్టింపు భారం ఈ ఏడాది జూన్కు పూర్తి కానున్న కృష్ణా మూడోదశ నీటి పంపింగ్, సరఫరాకు 36 మెగావాట్లు, ఆగస్టు చివరికి పూర్తి కానున్న గోదావరి మంచినీటి పథకానికి మరో 72 మెగావాట్ల విద్యుత్అవసరమవుతుందని జలమండలి అంచనా వేస్తోంది. ఈ రెండు పథకాలు పూర్తయితే ప్రతినెలా రూ.90 కోట్ల మేర విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తుందని బోర్డు వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం బోర్డుకు నెలకు రూ.90 కోట్ల ఆదాయం వస్తుండగా.. విద్యుత్ బిల్లుల చెల్లింపు, ఉద్యోగుల జీతభత్యాలు, రుణ వాయిదాల చెల్లింపు, మరమ్మతులకు రూ.93 కోట్లు వ్యయమవుతోంది. ఈ రెండు మంచినీటి పథకాలు పూర్తయితే బోర్డుకు వచ్చే ఆదాయమంతా విద్యుత్ బిల్లులకే సరిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో సర్కారు జోక్యం చేసుకొని విద్యుత్ టారిఫ్ తగ్గించాలని బోర్డు వర్గాలు కోరుతున్నాయి. ఈఆర్సీ సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.


