మిషన్ భగీరథ పనుల్లో జాప్యం
-వర్క్ ఏజెన్సీల ప్రతినిధులపై టీడీడబ్ల్యుఎస్సీ వైస్ చైర్మన్ ఆగ్రహం
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్ట్ పనులు నాలుగు సెగ్మెంట్లలో నత్తనడకన సాగుతున్నాయని తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ప్రశాంత్రెడ్డి అన్నారు. శనివారం ఆయా సెగ్మెంట్లలో ప్రాజెక్ట్ పనులు చేస్తున్న వర్క్ ఏజెన్సీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధానంగా హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బీ-జనగాం, శ్రీశైలం-రంగారెడ్డి, పరకాల-వరంగల్, సంగారెడ్డి-మెదక్ సెగ్మెంట్లలో పనుల్లో జాప్యంపై వర్క్ ఏజెన్సీల ప్రతినిధులను ఆయన వివరణ కోరారు. సిబ్బంది సంఖ్యను భారీగా పెంచుకోవాలని, కావాల్సిన మేరకు యంత్ర సామాగ్రిని సమకూర్చుకోవాలని ఆదేశించారు. సాంకేతిక అనుమతుల విషయమై ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
పనులు జరిగిన వెంటనే బిల్లులను చెల్లిస్తున్నప్పటికీ, జాప్యం చేస్తే సహించేది లేదన్నారు. సకాలంలో పనులు చేయని వర్క్ ఏజెన్సీలపై కఠిన చర్యలు చేపడతామని ప్రశాంత్రెడ్డి హెచ్ఛరించారు. వచ్చే ఏడాది డిసెంబరు కల్లా భగీరథ పనులన్నీ పూర్తి కావాల్సిందేనన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యుఎస్ ఈఎన్సీ సురేందర్రెడ్డి, చీఫ్ ఇంజనీర్లు సురేశ్కుమార్, కృపాకర్రెడ్డి, జగన్ మోహన్రెడ్డి తదితరులున్నారు.