breaking news
Taxi services sector
-
లక్షలాది మందికి ఉపాధి లక్ష్యంగా ‘సహకార్’
న్యూఢిల్లీ: ట్యాక్సీ సేవల రంగంలో దేశంలో ఓలా, ఉబర్ పెద్ద ఎత్తున చొచ్చుకుపోయాయి. ఇప్పుడు వీటికి పోటీగా మరో సంస్థ రాబోతోంది. లక్షలాది మందికి ఉపాధి లక్ష్యంగా సహకార్ ట్యాక్సీ పేరుతో నేషనల్ టూరిజం, ట్రాన్స్పోర్ట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ (ఎన్ఎఫ్టీసీ) సేవలను పరిచయం చేయబోతోంది. కొరియర్ సేవల రంగంలోకి సైతం ప్రవేశించనున్నట్టు ఫెడరేషన్ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ధరల కంటే చవకగా ట్యాక్సీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఎన్ఎఫ్టీసీ చైర్మన్ వి.వి.పి.నాయర్ వెల్లడించారు. అధిక ప్రయోజనం డ్రైవర్లకు ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రారంభించే సహకార్ ట్యాక్సీ ద్వారా కొన్నేళ్లలో 10 లక్షలకుపైగా మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఎన్ఎఫ్టీసీ 2011 నుంచి సహకార రంగంలో సేవలు అందిస్తోంది. చదవండి: నితిన్ గడ్కారీ.. హైడ్రోజన్ ఫ్యూయల్పై భవీశ్ ఏమన్నాడో విన్నావా? -
బైక్ చాల్లే... క్యాబ్ ఎందుకు?!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బోడ బోడ, హబల్ హబల్, ఓజెక్, ఒకాడా... ఇక్కడైతే రాపిడో!!. పేర్లు వేరైనా.. ప్రాంతాలు వేరైనా వ్యాపార మంత్రం ఒక్కటే. అదే బైక్ షేరింగ్! ఇండోనేషియా, థాయ్లాండ్, వియత్నాం, కాంబోడియా వంటి దేశాల్లో ప్రాచుర్యం పొందిన బైక్ షేరింగ్ ఇక్కడా దూసుకుపోతోంది. ఇపుడు బైక్ షేరింగ్ పరిశ్రమ సరికొత్త ఉపాధి, ఆదాయ మార్గాలను సృష్టిస్తోంది. ప్రస్తుతం దేశంలో బైక్ షేరింగ్ మార్కెట్ 10 బిలియన్ డాలర్లకు చేరిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో తొలిసారిగా ద్విచక్ర వాహనాలకు పబ్లిక్ సర్వీస్ ట్యాక్సీగా అనుమతినిచ్చింది గోవా రాష్ట్రమే. ఆ తర్వాత హరియాణా, మిజోరాం, వెస్ట్ బెంగాల్ ఈ కోవలోకి వచ్చాయి. తెలంగాణ, రాజస్తాన్, యూపీల్లోనూ కమర్షియల్ బైక్ ట్యాక్సీలకు అనుమతులున్నాయి. ప్రస్తుతం ఉబర్ మోటో, రాపిడో, ఓలా బైక్ ట్యాక్సీ, డ్రైవజీ, మోబిసీ, బైక్సీ, బౌన్స్, బాక్సీ, రెన్ట్రిప్, వోగో, టాజో, రోడ్పండా, ఆన్బైక్స్, పీఎస్బ్రదర్స్, రాయల్ బ్రదర్స్, వీల్స్ట్రీట్ వంటివి ఈ రంగంలో ఉన్నాయి. ఎలా పనిచేస్తాయంటే...? బైక్ యజమాని తన పేరు, చిరునామా, డ్రైవింగ్ లైసెన్సు, బీమా వంటి వివరాలను కంపెనీకి సమర్పించాలి. వాటిని సమీక్షించి.. బైక్ను తన షేరింగ్ ప్లాట్ఫామ్పై లిస్ట్ చేస్తుంది. మనకు కావాల్సినపుడు బుకింగ్ను తీసుకోవచ్చు. బైక్ షేరింగ్లో డ్రైవర్ను కెప్టెన్గా పిలుస్తున్నారు. కస్టమర్ బైక్ను బుక్ చేయగానే.. డ్రైవర్ ఎవరు? అతని ప్రొఫైల్? ఎంత సమయంలో వస్తుంది? చార్జీ? వంటి వివరాలన్నీ వస్తాయి. కెప్టెన్ తలకు హెల్మెట్ పెట్టుకొని.. కస్టమర్కు కూడా ఒక హెల్మెట్ను తెస్తాడు. కస్టమర్ను గమ్య స్థానంలో డ్రాప్ చేయగానే అప్పటికప్పుడే కెప్టెన్ బ్యాంక్ ఖాతాలో నగదు జమవుతుంది. రియల్ టైమ్ రైడ్ బుకింగ్, ఆన్లైన్ పేమెంట్స్, బైక్ ట్రాకింగ్, ఎస్ఓఎస్ అలర్ట్ వంటివి బైక్ షేరింగ్లో ఉంటాయి. మహిళల కోసం ఎస్ఓఎస్ బటన్ ఉంటుంది. ఈ ఎస్ఓఎస్ బటన్ కంపెనీ కంట్రోల్తో అనుసంధానమై ట్రాకింగ్ చేస్తుంటుంది. ఎందుకింత డిమాండ్? ఓలా, ఉబర్ క్యాబ్ సంస్థలు ప్రోత్సాహకాలను రద్దు చేయడంతో చాలా మంది డ్రైవర్లు అన్లిస్ట్ అవుతున్నారు. దీంతో వీకెండ్స్లో, రద్దీ సమయంలో క్యాబ్స్ దొరకటం లేదు. ఇది బైక్ షేరింగ్ కంపెనీలకు కలిసొస్తుందని ర్యాపిడో కో–ఫౌండర్ అరవింద్ సంకా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో చెప్పారు. నగరాల్లో క్యాబ్తో పోల్చితే బైక్పై త్వరగా గమ్యానికి చేరుకోవటం, ధర 40–60% తక్కువగా ఉండటంతో డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బైక్లతో ఎంట్రీ.. ఇరుకైన రహదారులు, ట్రాఫిక్ జామ్స్, రద్దీ రోడ్లు, ప్రజా రవాణా పూర్తి స్థాయిలో లేకపోవటం వంటి దీర్ఘకాలిక సమస్యలకు బైక్ షేరింగ్ కంపెనీలు పరిష్కారం చూపిస్తున్నాయి. యువత, ఉద్యోగులు, ఐటీ నిపుణులు బైక్ షేరింగ్ను వినియోగిస్తున్నారు. యూనివర్సిటీలతో, పెద్ద కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం చేసుకొని కూడా షేరింగ్ సేవలను అందిస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరగటం కూడా బైక్ షేరింగ్ పరిశ్రమ వృద్ధికి కారణమని చెప్పొచ్చు. ర్యాపిడో, మొబిసీ, వోగో, జైప్ వంటి స్టార్టప్స్ ఎలక్ట్రిక్ బైక్స్ను వినియోగిస్తున్నాయి. సవాళ్లూ ఉన్నాయ్.. ప్రస్తుతం బైక్ షేరింగ్ కంపెనీలకు స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. దీంతో చాలా కంపెనీలు సేవలను నిలిపేస్తుండగా కొన్ని వ్యాపార విధానాల్ని మార్చుకుంటున్నాయి. డాట్, టువీల్జ్, రిడ్జీ, హెడ్లైట్, హెబోబ్, జిగో వంటివి బెంగళూరులో సేవలను నిలిపేశాయి. ఎంట్యాక్సీ, బైక్సీ, యాయా వంటివి పబ్లిక్ షేరింగ్ నుంచి డెలివరీ దిశగా వ్యాపారాన్ని మార్చుకున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో బైక్ షేరింగ్కు ప్రత్యేక చట్టాలు లేవు. కమర్షియల్ బైక్ ట్యాక్సీకి లైసెన్స్ లేకపోవటం, మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవటంతో చాలా స్టార్టప్స్ కష్టాలు ఎదుర్కొంటున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు బైక్ షేరింగ్ను నిషేధం విధించాయి. రహదారుల పరిస్థితులు, మహిళల భద్రత, ప్రమాదాల రేట్లు ఎక్కువగా ఉండటం వంటివి నిషేధానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లో 40 శాతం వృద్ధి.. హైదరాబాద్లో ఓలా, ఉబర్, రాపిడో, వోగో, బౌన్స్ వంటి కంపెనీలు సేవలందిస్తున్నాయి. గత ఏడాది కాలంగా నగరంలో బైక్ షేరింగ్కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఏడాదిలో 30–40 శాతం పెరిగినట్లు ర్యాపిడో ప్రతినిధి చెప్పారు. బిజీ వేళల్లో క్యాబ్స్ దొరకకపోవటం, ధర ఎక్కువగా ఉండటం ఒక కారణమైతే, మెట్రో రెండో కారణమని చెప్పారు. మెట్రో నుంచి వచ్చి 3–4 కి.మీ. వెళ్లేందుకు బైక్ వాడుతున్నారని చెప్పారాయన. లక్ష మంది డ్రైవర్లతో రోజుకు లక్ష రైడ్స్ జరుపుతున్న రాపిడోకు... హైదరాబాద్లో 15వేల మంది డ్రైవర్లు, 20వేల రైడ్స్ ఉన్నట్లు సమాచారం. బైక్ షేరింగ్లో మహిళలూ యాక్టివే.. గడిచిన ఏడాదిగా బైక్ షేరింగ్ డ్రైవర్స్గా మహిళలు కూడా నమోదవుతున్నారు. ర్యాపిడోలో 25% మహిళా కెప్టెన్లు ఉన్నారు. బైక్ షేరింగ్లో డ్రైవర్ అనే చిన్నచూపు ఉండదు. మన బైక్ను ఇతరులకు షేర్ చేస్తూ హెల్ప్ అవుతున్నామనే భావన ఉంటుందని ర్యాపిడో తొలి మహిళ రైడర్ గాయత్రి ఆకుండి తెలిపారు. మహిళా కెప్టెన్కు మహిళా కస్టమర్నే ఇస్తారు. రైడర్ నంబరు, ఫొటో ఏమీ కనిపించదు. ‘‘నేను ఫుల్ టైం డ్రైవర్ని కాదు. ఉదయం 7–10 గంటల వరకు రైడ్స్ తీసుకుంటా. తర్వాత యాప్ ఆఫ్ చేసి వర్క్లోకి వెళ్లిపోతా. నెలకు 150–200 రైడ్స్ తీసుకుంటా. నెలకు రూ.2,400–3,000 అదనపు ఆదా యం వస్తుంది. హ్యామ్స్టెక్లో ఫ్యాషన్ టెక్నాలజీలో పీజీ డిప్లొమా చేశా. 2 సినిమాలకు డిజైనర్గా పనిచేస్తున్నాను’’ అని గాయత్రి చెప్పారు. -
క్యాబ్ బ్రాండ్ ఏదైనా ఒకే ట్యాక్సీ!
సులువుగా బ్రాండ్ మార్చేస్తున్న ట్యాక్సీ ఓనర్లు - కుదిపేస్తున్న నగదు ప్రోత్సాహకాలు - ట్యాక్సీ రంగంలో తారస్థాయికి చేరిన పోటీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒక కారు.. నాలుగు బ్రాండ్లు! ఏంటని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంపెనీల ‘నగదు ప్రోత్సాహకాల’ పుణ్యమా అని ట్యాక్సీ సేవల రంగంలో వింత పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు ఒక బ్రాండ్కే పరిమితమైన క్యాబ్లు.. నేడు అన్ని బ్రాండ్లకు సేవలందిస్తున్నాయి. బ్రాండ్ పేర్లతో పెద్ద పెద్ద స్టిక్కర్లతో పరుగులు తీసిన కార్లు ఇప్పుడు అవేవీ లేకుండానే నడుస్తున్నాయి. కోట్లాది రూపాయలను ఇన్వెస్టర్లు, పీఈ సంస్థల నుంచి పెట్టుబడిగా స్వీకరిస్తున్న క్యాబ్ కంపెనీలు ఆ మొత్తాన్ని ప్రోత్సాహకాల రూపంలో బ్రాండింగ్కు ఖర్చు చేస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. క్యాబ్ కంపెనీల మధ్య పోటీతో కనీస చార్జీ కిలోమీటరుకు రూ.10కి తగ్గిపోయింది. వాస్తవానికి చిన్న కార్లకు కిలోమీటరుకు వ్యయం అటూ ఇటుగా రూ.10 అవుతుంది. ఇంత తక్కువ చార్జీతో కారు నడపడం నష్టంతో కూడుకున్నది. అందుకే క్యాబ్ కంపెనీలు పోటీపడి మరీ కారు యజమానులను ‘నగదు’తో ప్రోత్సహిస్తున్నాయి. కంపెనీల పోటీ కాస్తా కారు యజమానులకు కాసులు కురిపిస్తోంది. ప్రయాణికులు చెల్లించే మొత్తం కూడా కారు యజమానికే చేరుతుంది. చాలా మంది డ్రైవర్లు కారును కొనుక్కుని క్యాబ్ కంపెనీలకు నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఎక్కువగా ఇన్సెంటివ్ ఇచ్చే కంపెనీ బ్రాండ్తో కార్లను నడిపారు. ప్రోత్సాహకాల భారం తడిసిమోపెడవడంతో ఈ మొత్తాన్ని క్యాబ్ సంస్థలు ఇటీవల తగ్గించి వేశాయి. దీంతో కారు యజమానులు కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. ఎటువంటి బ్రాండ్ లేకుండానే కార్లను నడుపుతున్నారు. అన్ని కంపెనీలకు చెందిన మొబైల్ డివైస్లను కారులో ఉంచుతున్నారు. ఏ మొబైల్కైతే ఎస్ఎంఎస్ వస్తుందో ఆ బుకింగ్ను స్వీకరిస్తున్నారు. ఇలా అన్ని కంపెనీలతో ‘టచ్’లో ఉంటున్నారు. క్యాబ్ కంపెనీ యాప్ మాత్రమే పనిచేసే మొబైల్ పరికరం కార్లలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ డివైస్ను కంపెనీలు ఉచితంగా ఇస్తున్నాయి. దీని ఆధారంగానే డ్రైవర్కు సమాచారం ఇచ్చి కస్టమర్ను అనుసంధానిస్తారు. ఊహించని స్థాయిలో.. ఓలా, జినీ, ట్యాక్సీ ఫర్ ష్యూర్, ఉబర్లు నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని కారు యజమానులు చెబుతున్నారు. ఒకానొక దశలో రోజుకు 10 ట్రిప్పులకుగాను కంపెనీలు రూ.3 వేల దాకా చెల్లించాయని తెలిపారు. చెల్లింపుల వ్యవహారం 2014 డిసెంబర్లో తార స్థాయికి చేరుకుంది. ఓలా రోజుకు 10 ట్రిప్పులకు రూ.6 వేల దాకా అదనంగా ముట్టజెప్పిందని ఒక కారు యజమాని వెల్లడించారు. జనవరి మూడో వారం నుంచి ఈ మొత్తాన్ని తగ్గించిందని చెప్పారు. అయితే కంపెనీలు ప్రోత్సాహకాల మొత్తాన్ని సవరించగానే ఎక్కువగా ఇచ్చే కంపెనీ వైపుకు కార్లు దూసుకెళ్లాయి. సింపుల్గా కారుపై ఉన్న స్టిక్కర్లను మార్చేవారు. ప్రస్తుతం వివిధ కంపెనీలు 12 ట్రిప్పులకుగాను రూ.750 మాత్రమే అదనంగా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకేముంది అన్ని కంపెనీలకూ అది కూడా ఏ స్టిక్కరూ లేకుండానే కార్లు తిరుగుతున్నాయి. నగదు ప్రోత్సాహకాలను పెట్టుబడిగా భావించాలని ఓలా మార్కెటింగ్ డెరైక్టర్ ఆనంద్ సుబ్రమణియన్ అన్నారు. ప్రతిభ కనబరిచే డ్రైవర్లకు స్టార్ రేటింగ్ ఆధారంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ఆకర్షించే చార్జీలు, ఆఫర్లు కస్టమర్లను ప్రోత్సహించేందుకేనని చెప్పారు. ఇదిలావుంటే తక్కువ చార్జీల భారం నుంచి కొంతైనా బయటపడేందుకు పీక్ సమయాల్లో చార్జీలను కంపెనీలు సవరించాయి. ఉదయం 7.30-10, సాయంత్రం 5.30-8 వరకు కొంత మొత్తాన్ని అదనంగా చార్జీ చేస్తున్నాయి. యాప్తో బుక్ చేస్తే.. క్యాబ్ కంపెనీల మధ్య పోటీ ఏ స్థాయికి చేరిందంటే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే తొలి రైడ్ను ఉచితంగా అందించే వరకు వెళ్లింది. ప్రస్తుతం యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక చేసే తొలి ట్రిప్కు రూ.150 డిస్కౌంట్ను మేరు, జినీ క్యాబ్స్ ఇస్తున్నాయి. కరెంట్, నౌ స్టేటస్పై మేరు, మేరు ఫ్లెక్సీ కార్లకు 25% తగ్గింపు పొందవచ్చు. సిటీ ట్యాక్సీ బుకింగ్పై రూ.200 తగ్గింపును ఓలా అందిస్తోంది. ఆఫర్లు ఎప్పటికప్పుడు మారుతున్నాయి.