breaking news
tadepalli mandal
-
ఇంతకీ గెస్ట్ హౌస్ ఎవరికి?
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ఉండవల్లి కరకట్టపై ఉన్న లింగమనేని ఎస్టేట్స్ అతిథి గృహం సీఎం చంద్రబాబు నివాసం కోసమా లేక విదేశీయుల బస కోసమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ భవనానికి వాస్తుకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. రాజధాని పనులను పర్యవేక్షించే విదేశీ ప్రతినిధులకు వసతి కల్పించేందుకే ఈ భవనాన్ని తీర్చిదిద్దుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి ఉండేందుకే వాస్తు మార్పులు చేస్తున్నారని కూడా అనుకుంటున్నారు. -
'కొన్ని మీడియా సంస్థలు భయపెడుతున్నాయి'
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ (ల్యాండ్ పూలింగ్) విధానం సరిగా లేదని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్రెడ్డి అభిప్రాయపడ్డారు. ల్యాండ్ పూలింగ్ విధానంపై తన వైఖరి మార్చుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో జస్టిస్ లక్ష్మణ్రెడ్డి బృందం పర్యటిస్తుంది. ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మణ్రెడ్డి... స్థానిక రైతులతో మాట్లాడారు. నూతన రాజధాని ఏర్పాటు... నిర్మాణంపై కొన్ని మీడియా సంస్థలు రైతులను భయాందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. న్యాయ సహాయం అందిస్తామని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. -
తెలుగు తమ్ముళ్ల హల్చల్
తాడేపల్లి రూరల్ డ్వాక్రా మహిళల సమావేశంలో తెలుగుతమ్ముళ్లు హల్చల్ సృష్టించారు. మినిట్స్ బుక్ లాక్కున్నారు. ఫొటోలు, వీడియోలు తీశారు. ఆ తమ్ముళ్లను ఏమంటే ఏమవుతుందోనని సమావేశం నిర్వహిస్తున్న అధికారి సైతం మిన్నకుండిపోయారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో బుధవారం జరిగిన ఈ సంఘటనతో డ్వాక్రా సంఘాలు భయాందోళన చెందారు. వివరాల్లోకి వెళితే... ఉండవల్లి ఇసుక క్వారీని ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు కేటాయించింది. దీని నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు ఉండవల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో డీఆర్డీఏ అడిషనల్ ప్రాజెక్టు డెరైక్టర్ డాక్టర్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఇందుకోసం డ్వాక్రా గ్రూపుల నుంచి ముగ్గురు మహిళలను ఎంపిక చేయాలనే అంశంపై సుదీర్ఘ చర్చ జరుగుతుండగా, హఠాత్తుగా అక్కడ తెలుగుతమ్ముళ్లు ప్రత్యక్ష్యమయ్యారు. సమావేశం కొనసాగడానికి వీల్లేదని అడ్డుతగిలారు. అంతటితో ఆగక మినిట్స్ బుక్ ఇష్టానుసారం రాసుకుంటే కుదరదంటూ, తాము చెప్పిందే రాయాలని పట్టుబట్టారు. ఫొటోలు వీడియోలు తీశారు. చివరకు తెలుగు తమ్ముళ్లే తీర్మానాలు రాయించి, చదివి వినిపించారు. ఉండవల్లి గ్రామంలో 80 గ్రూపుల వరకు డ్వాక్రా మహిళలు ఉన్నారని, ఇసుక క్వారీ పర్యవేక్షణకు ఎవరిని ఎంపిక చేస్తారంటూ హడావుడి చేశారు. ప్రభుత్వ అధికారి అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో అనుమతి లేకుండా తెలుగుతమ్ముళ్లు ప్రవేశించడం, ఇష్టానుసారంగా వ్యవహరించడంతో మహిళలకు ఇబ్బందికరంగా మారింది. ఏం చేయాలోపాలుపోక మహిళలు, అధికారి ప్రేక్షకపాత్ర వహించారు. వీడియో తీశాం, మీరు మాట్లాడిందీ రికార్డు చేశాం, ఏం చేయాలో మాకు తెలు సంటూ తెలుగుతమ్ముళ్లు చివరకు అక్కడ నుంచి వెళ్లిపోయారు. కాగా, ప్రభుత్వం కేటాయించిన ఇసుక క్వారీ పర్యవేక్షక బాధ్యతలను తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలకు అప్పగించే వ్యూహంలో భాగంగానే తెలుగుతమ్ముళ్లు ఈ సమావేశంలో గందరగోళం సృష్టించారని తెలుస్తోంది. మినిట్స్ బుక్లో ఉండవల్లి సెంటర్ నుంచి ఇసుక క్వారీ వరకు రోడ్డు వెడల్పు చేయించాలని, గుంటూరు కెనాల్ పై కొత్త బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ తీర్మానాలు రాయించారు. ఇలా రాయించడం వల్ల ఇసుక క్వారీ బాధ్యతల నిర్వహణకు డ్వాక్రా సంఘాలు ముందుకు రావని, తద్వారా తమ పార్టీ మహిళలకే క్వారీ బాధ్యతలు దక్కేలా చేసుకోవచ్చనే వ్యూహంలో భాగంగానే తెలుగుతమ్ముళ్లు హల్చల్ సృష్టించినట్టు అర్థమవుతోందని అక్కడ వున్న పలువురు మహిళలు వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, తెలుగుతమ్ముళ్ల స్పీడ్కు ఆ పార్టీ ప్రజాప్రతినిధులే కారణమంటూ పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తమ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్ అంటూ సాక్షాత్తూ వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొద్ది రోజుల క్రితం పెనుమాకలో జరిగిన బహిరంగ సభలో హెచ్చరించారు. అధికారులు సైతం తమ కార్యకర్తలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందేనంటూ ఆయన ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇలా తెలుగుదేశం పార్టీ నేతలు, మంత్రులు వారి సమావేశాల్లో హెచ్చరికలు జారీ చేస్తుండడంతో తెలుగుతమ్ముళ్ల స్పీడు మరింత జోరందుకుంది. ఈ క్రమంలోనే అధికారిక సమావేశాల్లో సైతం జొరబడి తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు.