breaking news
T20 World Cup final match
-
T20 World Cup 2022: ఆఖరి పోరాటం
26 అక్టోబర్, 2022: ఐర్లాండ్ చేతిలో అనూహ్యంగా ఓడిన ఇంగ్లండ్ 27 అక్టోబర్, 2022: జింబాబ్వే చేతిలో స్వయంకృతంతో ఓడిన పాక్ టి20 ప్రపంచకప్లో ఈ మ్యాచ్ల తర్వాత ఈ రెండు జట్లపై సహజంగానే విమర్శలు చుట్టుముట్టాయి... టోర్నీలో ముందుకెళ్లడంపై సందేహాలు కనిపించాయి. కానీ అటు పాక్, ఇటు ఇంగ్లండ్ మళ్లీ ఉవ్వెత్తున ఎగిసాయి. తమలోని అసలు సత్తాను చూపిస్తూ దూసుకొచ్చాయి. ఇప్పుడు నవంబర్ 13, 2022న ప్రపంచకప్ ఫైనల్లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. అన్ని అంచనాలను దాటి, ఫేవరెట్లను వెనక్కి నెట్టి విశ్వ విజేతగా నిలిచేందుకు పోటీ పడుతున్నాయి. ఈ మెగా టోర్నీని ఇప్పటికే చెరోసారి గెలుచుకున్న టీమ్లలో ఎవరి ఖాతాలో రెండోసారి ట్రోఫీ వెళుతుందో చూడాలి. ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికపై ఐసీసీ టోర్నీలో ఫైనల్లో ఈ రెండు జట్లు ముఖాముఖిగా ఎదుర్కోవడం ఇది రెండోసారి. 1992 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్పై పాక్ గెలవగా... మూడు దశాబ్దాల తర్వాత అదే పునరావృతమవుతుందా లేక భిన్నమైన ఫలితం వస్తుందా అనేది ఆసక్తికరం. మెల్బోర్న్: అనూహ్య ఫలితాలు, హోరాహోరీ మ్యాచ్లు, çసంచలన ప్రదర్శనలతో ఆసక్తికరంగా సాగిన 2022 టి20 ప్రపంచకప్ ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. 42 గ్రూప్ మ్యాచ్లు, 2 నాకౌట్ మ్యాచ్ల తర్వాత 45వ పోరులో విశ్వ విజేత ఎవరో తేలనుంది. నేడు జరిగే ఫైనల్లో మాజీ చాంపియన్లు పాకిస్తాన్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ప్రస్తుత బలాబలాలు, ఫామ్ను బట్టి చూస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. సెమీఫైనల్ మ్యాచ్లలోనూ రెండు జట్లూ ఏకపక్ష విజయాలు సాధించి తుది పోరుకు అర్హత సాధించాయి. పాకిస్తాన్ గడ్డపై ఇటీవలే ఇరు జట్ల మధ్య దాదాపు ఇదే ఆటగాళ్లతో 7 టి20 మ్యాచ్ల సిరీస్ జరిగింది కాబట్టి ప్రత్యర్థి గురించి ఆయా జట్టుకు మంచి అవగాహన ఉంది. మార్పుల్లేకుండా... సెమీస్లో అన్ని విధాలా సత్తా చాటిన పాకిస్తాన్ ఫైనల్ కోసం ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. కెప్టెన్ బాబర్ ఆజమ్, రిజ్వాన్ విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. మిడిలార్డర్లో మసూద్, ఇఫ్తికార్, నవాజ్లతో జట్టు బ్యాటింగ్ మెరుగ్గానే ఉంది. ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’కి పోటీ పడుతున్న లెగ్స్పిన్నర్ షాదాబ్ ఆల్రౌండర్ పాత్రలో జట్టుకు టోర్నీ ఆసాంతం అండగా నిలిచాడు. అన్ని మ్యాచ్లలాగే పాక్ నలుగురు రెగ్యులర్ పేసర్లతో బరిలోకి దిగడం ఖాయం. షాహిన్ అఫ్రిది గాయం నుంచి కోలుకున్న తర్వాత ప్రమాదకరంగా మారడం సానుకూలాంశం. నసీమ్, వసీమ్ కూడా తమ పరిధిలో రాణిస్తుండగా రవూఫ్పై కూడా పాక్ ఆశలు పెట్టుకుంది. బిగ్బాష్ లీగ్లో మెల్బోర్న్ స్టార్స్ తరఫున ఆడిన అతడిని ఎదుర్కోవడం ఇంగ్లండ్కు అంత సులువు కాదు. ఓపెనర్లే కీలకం... సెమీస్లో హేల్స్, కెప్టెన్ బట్లర్ ఆటను చూస్తే వారిద్దరు ఎలాంటి విధ్వంసం సృష్టించగలరో తెలుస్తుంది. అయితే వీరిద్దరు మినహా ఇంగ్లండ్ మిడిలార్డర్లో ఎవరు కూడా టోర్నీ మొత్తంలో ఒక సిక్స్కు మించి కొట్టలేదు! స్టోక్స్, బ్రూక్స్, లివింగ్స్టోన్ కూడా తమపై ఉన్న అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయారు. ఈ బలహీనతపై తమ స్పిన్తో పాక్ దెబ్బ కొట్టగలిగితే ఇంగ్లండ్కు కష్టం కావచ్చు. అయితే ఓపెనర్లే ఆటను ఏకపక్షంగా మార్చేయగలరు కాబట్టి వారిద్దరే కీలకం కానున్నారు. ఆరంభంలో షాహిన్ని సమర్థంగా ఎదుర్కోగలిగితే హేల్స్, బట్లర్ ఆపై ఆధిపత్యం ప్రదర్శించగలరు. జట్టులో దాదాపు అందరూ బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్నవారే అయినా అదే దూకుడుతో వికెట్లు కూడా చేజార్చుకోగలరు. ఈ నేపథ్యంలో ఆల్రౌండర్లు మొయిన్ అలీ, వోక్స్, స్యామ్ కరన్లపై అదనపు బాధ్యత ఉంది. అయితే టోర్నీలోనే ఫాస్టెస్ట్ బౌలర్గా ఉన్న మార్క్ వుడ్ టీమ్లో లేకపోవడం జట్టుకు కొంత సమస్యగా మారింది. సెమీస్ లో కూడా అతను ఆడలేదు. ఫైనల్కు అతను వస్తే జట్టు బౌలింగ్ బలం పెరుగుతుంది. టోర్నీలో చక్కటి ప్రభావం చూపించిన కరన్ కూడా రాణిస్తే పాక్ బ్యాటర్లకు కష్టాలు తప్పవు. మొత్తంగా చూస్తే ఇంగ్లండ్ బ్యాటింగ్లో బలంగా ఉండగా, బౌలింగ్లో పాకిస్తాన్ది పైచేయిగా కనిపిస్తోంది. ఇంగ్లండ్ గెలిస్తే ఒకే సమయంలో వన్డే, టి20 వరల్డ్కప్లను తమ వద్ద ఉంచుకున్న తొలి జట్టుగా నిలుస్తుంది. పిచ్, వాతావరణం ఫైనల్కు పెద్ద సమస్య వర్షం రూపంలోనే పొంచి ఉంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఆదివారం 100 శాతం వర్ష సూచన ఉంది. అయితే మెల్బోర్న్ వాతావరణం అనిశ్చితికి మారుపేరు. భారత్, పాక్ మ్యాచ్కు ముందు కూడా ఇలాగే భావించినా, ఒక్క చుక్క వర్షం పడలేదు! ఫైనల్కు రిజర్వ్ డే ఉంది. అయితే నిబంధనల ప్రకారం రెండో ఇన్నింగ్స్లో కనీసం 10 ఓవర్ల ఆట జరిగితే ఆదివారమే ఫలితం తేలిపోతుంది. అంతకన్నా తక్కువకే ఆట ఆగిపోతే, సోమవారం అదే స్కోరు నుంచి కొనసాగిస్తారు. పిచ్ ఆరంభంలో పేస్, బౌన్స్కు అనుకూలంగా ఉంటుంది. అయితే బ్యాటర్లు దానిని అధిగమిస్తే భారీ స్కోరుకు అవకాశం ఉంది. 9: పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 28 టి20 మ్యాచ్లు జరిగాయి. 9 మ్యాచ్ల్లో పాకిస్తాన్ నెగ్గగా... 17 మ్యాచ్ల్లో ఇంగ్లండ్ గెలిచింది. ఒక మ్యాచ్ ‘టై’ అయింది. మరో మ్యాచ్ రద్దయింది. 29: టి20 ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండు మ్యాచ్లు జరగ్గా... రెండింటిలోనూ ఇంగ్లండే విజయం సాధించింది. 3: ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్లకిది మూడో టి20 ప్రపంచకప్ ఫైనల్. 2007లో పాక్ రన్నరప్గా నిలిచి, 2009లో టైటిల్ సాధించింది. ఇంగ్లండ్ 2010లో చాంపియన్గా నిలిచి, 2016లో రన్నరప్తో సంతృప్తి పడింది. 59: ఇప్పటి వరకు ఏడు టి20 ప్రపంచకప్ ఫైనల్స్ జరగ్గా... ఛేజింగ్ చేసిన జట్లు ఐదుసార్లు... తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు రెండుసార్లు గెలిచాయి. -
క్రికెట్ బెట్టింగ్ ఆడితే రౌడీషీట్
► ప్రత్యేక బృందాలతో దాడులు ► పది మంది బెట్టింగ్రాయుళ్ల అరెస్ట్ ► రూ. 5.02 లక్షల నగదు, 10 సెల్ఫోన్లు స్వాధీనం ► కీలక బుకీ శివారెడ్డి కోసం ముమ్మర గాలింపు ► డీఎస్పీ మల్లికార్జునవర్మ వెల్లడి అనంతపురం : బెట్టింగ్ ఆడుతూ పట్టుబడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మ హెచ్చరించారు. ఎస్పీ ఎస్.వి.రాజశేఖర్బాబు ఆదేశాల మేరకు రూరల్, వన్టౌన్ పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి పది మంది క్రికెట్ బెట్టింగ్రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 5.02 లక్షల నగదు, పది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ సోమవారం సాయంత్రం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో మీడియాకు వివరించారు. టీ-20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ రోజున క్రికెట్ పందేలపై నిఘా ఉంచారు. డీఎస్పీ మల్లికార్జునవర్మ పర్యవేక్షణలో అనంతపురం రూరల్ సీఐ ఎంఆర్ కృష్ణమోహన్, ఎస్ఐలు జగదీష్, నాగేంద్రప్రసాద్, వెంకటరమణ ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. సిండికేట్నగర్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న కోమల మహమ్మద్ రఫి, గొల్ల గోపాల్, కవ్వల పెద్దిరాజు అలియాస్ మహేష్, ముత్తులూరి లోకేష్ అలియాస్ బాలు, గాలం మారుతీప్రసాద్ను అరెస్ట్చేశారు. వీరి నుంచి రూ. 3,80,500 నగదు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే స్థానిక హౌసింగ్బోర్డు రాజీవ్ చిల్డ్రన్ పార్కు వద్ద క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న నీరుగంటివీధికి చెందిన దంపెట్ల శివయ్య, యర్రగుంట నారాయణరెడ్డి, సాకే కేశవర్ధన్, సాకే రామాంజనేయులు, షేక్ సాదిక్ను వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 1,21,500 నగదు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కీలక బుకీ అయిన శివారెడ్డి పరారీలో ఉన్నాడు. అతనికోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని డీఎస్పీ వెల్లడించారు. క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న వారిలో కొందరు విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ వ్యసనానికి లోనై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. క్రికెట్ బెట్టింగ్ల్లో దొరికితే కచ్చితంగా రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సమావేశంలో రూరల్ సీఐ కృష్ణమోహన్, పలువురు ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.