breaking news
suryanarayanareddy
-
సొంతింటి కోసం సై
వైఎస్సార్ సీపీ నేత డాక్టర్ సూర్యనారాయణరెడ్డి లబ్ధిదారులతో కలిసి భారీ ర్యాలీ అనపర్తి (బిక్కవోలు) : పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ఎలాంటి పోరాటమైనా చేపడతామని వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి లబ్ధిదారులకు భరోసా ఇచ్చారు. అనపర్తిలోని ఇందిరానగర్ కాలనీ లబ్ధిదారుల గృహాలు నిర్మించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీ సందర్భంగా శ్రీతేతలి రామిరెడ్డి, మంగయమ్మ కళావేదిక వద్ద సోమవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా లబ్ధిదారులు తరలివచ్చారు. డాక్టర్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరుపేదలకు గృహాలు కల్పించాలన్న ఉద్దేశంతో కోట్లాది రూపాయలతో స్థలాన్ని సేకరించి, 1,640 మందికి పట్టాలు ఇచ్చారని గుర్తుచేశారు. అక్కడ పరిస్థితులు నివాసయోగ్యంగా లేకపోవడంతో దాదాపు రూ.2 కోట్లు వెచ్చించి తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక వసతులు కల్పించినట్టు పేర్కొన్నారు. లబ్ధిదారులంతా నిరుపేదలు కావడంతో ప్రభుత్వమే గృహాలు నిర్మించి ఇస్తుందని హామీ ఇవ్వగా, 1,240 మంది తమ పట్టాలను తిరిగి గృహనిర్మాణశాఖ కార్యాలయంలో అప్పగించి మూడేళ్లు కావస్తోందన్నారు. ఇప్పటివరకూ కనీసం శంకుస్థాపన కూడా చేయలేదని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణ పనులు దాదాపు గత ప్రభుత్వమే పూర్తి చేసిందని, కేవలం గృహనిర్మాణ శాఖ నిర్మాణాలు చేయాల్సిఉండగా, ప్రస్తుత ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని ఆరోపించారు. తక్షణం ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని, అర్హత కలిగిన వారికి మిగిలిన స్థలంలో గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. పార్టీ అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు వంటిమి సూర్యప్రకాష్, చిర్ల వీర్రాఘవరెడ్డి సీఐటీయూ నాయకురాలు కృష్ణవేణి తదితరులు మాట్లాడారు. అనంతరం డాక్టర్ సూర్యనారాయణరెడ్డి భారీ సంఖ్యలో లబ్ధిదారులతో కలసి తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్నారు. ప్రజావాణిలో తహసీల్దార్ ఆదినారాయణకు, హౌసింగ్ ఏఈ ఈఎస్ఎన్ మూర్తికి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సత్తి వీర్రెడ్డి, మండల కన్వీనర్ మల్లిడి ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన జనం
కెనాల్ రోడ్డు మేలుకొలుపు పాదయాత్రకు అనూహ్య స్పందన 12 కిలోమీటర్ల మేర యాత్ర సాగించిన అనపర్తి వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సూర్యనారాయణరెడ్డి, దంపతులు పలుచోట్ల హారతులు పట్టిన మహిళలు సంఘీభావంగా నిలిచిన ఆటో, లారీ యూనియన్లు అనపర్తి (బిక్కవోలు) : కాకినాడ – రాజమండ్రి కెనాల్ రోడ్డు అభివృద్ధి విషయంలో కాంట్రాక్టర్కు వెసులుబాటు కల్పిస్తూ ప్రజల గోడును పట్టించుకోని ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం మేలుకొలుపు పాదయాత్ర నిర్వహించింది. పార్టీ అనపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు భారీ జనసందోహంతో రోడ్డు సాధన కోసం అనపర్తి నుంచి బిక్కవోలు వరకు సుమారు 12 కిలోమీటర్లు దూరం పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రతో కెనాల్ రోడ్డు శుక్రవారం జనసంద్రంగా మారిపోయింది. గడువులోపు పనులు జరగకపోవడంతో రోడ్డు అ«ధ్వానంగా తయారై ప్రమాదాల బారిన పడి జనం ప్రాణాలు కోల్పోతున్నా స్థానిక పాలకులు కూడా పట్టించుకోవడం లేదు. డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి చేపట్టిన మేలుకొలుపు పాదయాత్రకు రోడ్డు వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలంతా బాసటగా నిలిచారు. అడుగడుగునా ఆయనకు రోడ్డు వెంబడి గ్రామాల మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. రోడ్డు బాధితులైన ఆటో, లారీ యూనియన్లు, వాహనదారులు బాసటగా నిలవడంతో యాత్ర విజయవంతం అయింది. అనంతరం ఇప్పటి వరకు రోడ్డు ప్రమాదాలలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని వారు రెండు నిముషాల మౌనం పాటించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ బాధితులకు రూ.10లక్షల పరిహారం ఆందచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ.260 కోట్లతో అభివృద్ధి చేయవలసిన ఈ రోడ్డులో గడచిన మూడేళ్లుగా కేవలం ఐదుశాతం పనులే జరిగాయని, ట్రాన్స్ట్రాయ్ సంస్థ అలసత్వం వహిస్తున్నా తెలుగుదేశం పార్టీ ఎంపీ సంస్థ కావడంతోనే ఈ జాప్యాన్ని ప్రభుత్వం కప్పిపుచ్చుతోందని సూర్యనారాయణరెడ్డి అన్నారు. ప్రభుత్వం ఒత్తిడి తేవాలి పాదయాత్రను విజయవంతం చేయడంలో భాగస్వాములైన వారందరికీ డాక్టర్ సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వాల తీరు దారుణంగా ఉందన్నారు. ప్రజలంతా సంఘటితంగా పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పనులు చేయించుకోవలసిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొల్లాటి ఇజ్రాయేల్, రాష్ట్ర మహిళ కార్యదర్శి యరకారెడ్డి సత్య, రాష్ట్ర యువజన కార్యదర్శి నల్లమిల్లి దుర్గాప్రసాదరెడ్డి, సహాయ కార్యదర్శి సత్తి సుబ్బారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, నాయకులు నల్లమిల్లి వీనురెడ్డి,«ధర్మారెడ్డి కార్యకర్తలు, స్వఛ్ఛంద సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు.