breaking news
Suryanarayana Murthy
-
మళ్లీ బీజేపీదే అధికారం
సాక్షి, హైదరాబాద్: దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాబోతోందని పంచాంగ శ్రవణకర్త కాకునూరి సూర్యనారాయణ మూర్తి జోస్యం చెప్పారు. –ఈ ఏడాది అంతా మంచే జరుగుతుందనీ, పార్టీ నాయకుల్లో ఐక్యత పెరుగుతుందనీ, సమష్టి విజయం సాధించాలనే సంకల్పం సిద్ధిస్తుందన్నారు. తమ శక్తి మేర ప్రజలకు వ్యయం చేస్తే నాయకులకు పేరు వస్తుందన్నారు. వృద్ధుల సహకారం ఉంటేనే యువకులు విజయం పొందుతారని తెలిపారు. ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తాను 14 ఏళ్ల క్రితం బీజేపీ కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొని అయోధ్యలో శ్రీరామమందిర నిర్మాణం తర్వాత మళ్లీ కలుసుకుందామని చెప్పినట్టు మూర్తి గుర్తుచేశారు. అంతకు ముందు పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి దంపతులు హోమం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డుసభ్యుడు డా.కె.లక్ష్మణ్ , ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీ‹Ùబాబు, రాష్ట్రపార్టీ ప్రధానకార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ పాల్గొన్నారు. మోదీ సర్కార్నే ప్రజలు కోరుకుంటున్నారు: కిషన్రెడ్డి పంచాంగ శ్రవణం అనంతరం కిషన్రెడ్డి మాట్లాడుతూ.. శ్రీ క్రోధి నామ సంవత్సరం చాలా ప్రాధాన్యత కలిగిన సంవత్సరమని, మోదీ నాయకత్వంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. మంచి వర్షాలతో, పాడిపంటలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. మోదీ నేతృత్వంలో మరింత సుస్థిర, స్థిరమైన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశం కోసం పనిచేస్తున్న మోదీ నాయకత్వానికి మద్దతు తెలిపి లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థులందరినీ గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఈ డాక్టర్ కథ వెనుక ఒక కల ఉంది!
ప్రతి కథ వెనుక ఒక కథ ఉంటుంది. ఈ డాక్టర్ కథ వెనుక ఒక కల ఉంది. ఎప్పుడో దాదాపూ యేభై ఏళ్ల వెనుకటి కల ఇది. అనగనగా ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువు అయిపోయాక ఒక మూడేళ్లు ఖాళీగా ఇంట్లో కూచుంది. గోళ్ళు కొరుక్కునే అలవాటు అనేదొకటుంటుంది అని తెలీకపోవడం వల్ల ఆ పిల్ల ఆ మూడేళ్లూ వాళ్ళ చిన్న ఊళ్లో లైబ్రరీలో వున్న పుస్తకాలన్నీ కొరుక్కుని తినెయ్యడమే పనిగా పెట్టుకుంది. అలా చదివిన పుస్తకాల్లో ఒక చిన్న పుస్తకం ఆ చిన్నారిని అమితంగా ఆకర్షించింది. అవడానికి చిన్న పుస్తకమే గానీ ఆ వయసులో ఆ అమ్మాయిమీద ఆ పుస్తకం చూపిన ప్రభావం మరపురానిది. ఇవ్వాల్టి దినాన ఆవిడ డాక్టరయి, ప్రాక్టీసు పెట్టి చాలా ఏళ్లయిపోయినా , తను చిన్నప్పుడు చదివిన ఆ పుస్తకం, అందులోని విషయాలు ఆవిడకు గుర్తొస్తూనే వుండేవి. ఒక రకంగా తను డాక్టర్నవడానికి కూడా స్ఫూర్తిని ఇచ్చిందా పుస్తకం. ఆవిడ పేరు డాక్టర్ భార్గవి, ఆ పుస్తకం పేరు "ఒక డాక్టర్ కథ". అపుడాకాలంలో చదివింది కేవలం ఒక పుస్తకం కాదని అది సాధించి తీరవలసిన ఒక గొప్ప కల అని కూడా గ్రహించని ఆ నాటి అమాయక్కపిల్ల గట్టిగా పట్టుకున్న కల ఇది . కల చుట్టూ బోలెడన్ని ఆశలు, ఆత్రుతలు, ఆలోచనలు అన్నీ కలిసి ఒక ఊహగా దిద్దుకుని కాపాడుకున్న కల అది. ఇన్ని ఏళ్ల తరువాత, అనేక ప్రయత్నాల తరువాత ఆ కల ఒక రూపం దాల్చి ఈ రోజు ఒకటి , రెండూ , పది , వందల సంఖ్యగా మారి పాఠకుల చేతుల్లో నిలిచింది. ఈ రోజు మనందరి ముందున్న ఈ ఫలితం, డాక్టర్ చాగంటి సూర్యనారాయణ మూర్తి అనే ఒక మహానీయుడి కృషికి, దాని వెనుక జీవితానికి నూటా పద్నాలుగు పేజీల పుస్తక రూపం. నూరేళ్ల దీర్ఘ ప్రయాణం అనంతరం భౌతికంగా ఒక జీవితం ముగిసిపోతుందేమో కానీ.. ఇలా అక్షరాల ఆసరాగా పుటల మీదికి ఎక్కిన జీవితాలు అంత సులువుగా దూరమయ్యేవి కావు. సుమారు అర్థ శతాబ్దం మునుపు మానవ మస్తిష్క జ్ఞాపకాలు లో నుంచి మరుగయిన ఒకనొక గొప్ప వ్యక్తి జీవితం ఈ పుస్తకం రూపంలో బయటికి వచ్చినపుడు, మిగతా వారెవరికీ తెలీనంత, అందనంత, పొందనంత సంతోషాన్ని పొందిన వాళ్లము ప్రథమంగా ఇద్దరమున్నాము.. ఒకరు మా అమ్మ భార్గవి , ఇంకొకరు నేను. మా ఇద్దరమూ కాక నిజానికి మూడో వ్యక్తి కూడా ఒకరున్నారు. వాస్తవానికి ఈ పుస్తకం రంగూ, వాసనా, రుచి చూసి ఆయన కన్నా గొప్పగా పొంగిపోయేవారు మరొకరెవరూ ఉండలేరు. ఆయనే డాక్టర్ చాగంటి సూర్యనారాయణ మూర్తి గారు. ఎంత సంతోషపడి ఉండేవారో ఆయన ఈ పుస్తకాన్ని ఇలా చూసి ఉంటే. మీకు తెలియక పోవచ్చు. మాకు తెలుస్తుంది. నన్ను మా చిన్నాయన ఎంతో గొప్ప ప్రేమతో పెంచాడు. ఒక్కోసారి ఆయన పని మీద బయటికి వెళ్ళి అర్థరాత్రుళ్ళు ఆలస్యంగా వచ్చేవాడు. ఎంత అర్థరాత్రి అయినా సరే - మహా ఆలస్యమయినా సరే, వస్తూ వస్తూ నా కొసమని ఏదో ఒక మిఠాయినో, పండో, తినుబండారమో తెచ్చి, బాగా నిద్రలో ఉన్న నన్ను లేపి మరీ ఆ తెచ్చినది తినపెట్టి ఆ తరువాతే నన్ను నిద్రపుచ్చేవాడు. అలా నిద్రలు పోయీ పొయీ నిద్రలోనే పెరిగి పెద్దయి పోయిన నా దగ్గరకు ఈ అమ్మ వచ్చింది. ఎంత నా పనిలో నేనున్నా, చచ్చేంత చావులో మునిగి తేలలేకున్నా సరే , జుట్టు పట్టి తేల్చి మరీ "అన్వర్ చూడు ఈ పుస్తకం ఎంత బావుంటుందో, ఆ పుస్తకం చదువు ఎంత హాస్యంగా ఉంటుందో " అని పట్టుబట్టి నాతో పుస్తకాలు చదివించే పని మా అమ్మది. ఆవిడకు అన్ని పుస్తకాలూ సమానమే, అయిననూ రెండు పుస్తకాలు మరీ ఎక్కువ సమానం. ఒకటి జమ్మి కోనేటి రావు గారి సూక్ష్మ క్రిమి అన్వేషకులు మరోటి చాగంటి సూర్యనారాయణ మూర్తి గారి డాక్టర్ కథ. మొదటి పుస్తకం "సూక్ష్మ క్రిమి అన్వేషకులు " అమ్మ దగ్గర ఉంది. డాక్టర్ కథ మాత్రం ఆవిడ దగ్గర లేదు. దాని గురించి ఆవిడ చెప్పడం, నేను వినడం తప్పా. సరిగా ఆరు నెలల క్రిందట ఆవిడ చేతికి శిధిలావస్థ లో ఈ పుస్తకం కాపి అందింది. అప్పటికీ రాత్రి పది అయి ఉంటుంది. పుస్తకం వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేసి, ఫలానా పుస్తకం పంపుతున్నాను చూడు, వెంఠనే చదువు అన్నది. సరేనమ్మా చదివి రేపు ఉదయం మాట్లాడుకుందాములే అన్నా. పుస్తకం చదవడం మొదలు పెట్టా. రేపు ఉదయం ఫోన్ చేస్తా అన్నవాడిని చదువుతూ చదువుతూ పేజీల మధ్య ఆగిపోయి సంతోషం పట్టలేక ఆ రాత్రి ఎన్ని సార్లు ఆవిడకు ఫోన్ చేసానో, ఆయన కథనం గురించి, చక్కని వాక్యం గురించి, హాయైన శైలీ గురించి ఎంతగా మురిసిపోయామో ... ఒక్కోసారి ప్రొస్ ఈజ్ బాటిల్డ్ వైన్ అంటారే! అంత నషాని ఇచ్చిందా పుస్తకం నాకు. సంతోషమంటే ఒకే ఒకరు తనతో తాను పంచుకోవడమా? గదిలో నాలుగు రెళ్ళ ఎనిమిది అద్దాలు ఏర్పాటు చేసుకుని ప్రతిబింబాల తోడుగా మురియడమా? కాదు కదా! ఒక చేయి చప్పట్లు పలకించలేదు. ఒక రెక్క రివ్వున ఆకాశం వైపు దూసుకోపోలేదు. పదిమందితో పంచుకోనిది ఏమానందం? నలుగురితో కలిసి రుచి చూడనీదీ ఏం భోజనం? ఒక పిట్టకథ చెబుతా. 1960 నాటి జగతి పత్రికలో "జియార్ ఫాన్ డీర్ ష్రింగ్ " గారి రచన ఒకటి అచ్చయ్యింది - అందులో పదమూడేళ్ళ హాన్స్ తన మిత్రురాలు పదహైదేళ్ల అమ్మాయి ఊటా కి కాస్త డబ్బు అప్పు పడతాడు. ఏం చేసయినా సరే ఆ అప్పు తీర్చాలని హాన్స్ పట్టుదల. సరిగ్గా అదే సమయం లో బయట పెద్ద తుఫాను- గాలి వానా. బయట కాలు అడుగుపెట్టడానికే లేదు. ఏం పని చేసేట్టు? ఎట్లా డబ్బు సంపాదించేట్టు? పిల్లవాడికి కాలక్షేపంగా ఉంటుందని హాన్స్ తాతగారు వాడికి ఇదిగో ఈ అద్భుతమైన పుస్తకం చదువు అని ప్రపంచ ప్రఖ్యాత హొమర్ విరచిత ఒడిస్సే అతని చేతిలో పెడతాడు. పదమూడేళ్ల పిల్లవాడికి ఎంత భారం? ఏమర్థమవుతుంది అంత మహాకావ్యం? అయితే వాడికి ఒక ఆలొచన వస్తుంది. ఆ పుస్తకాన్ని కంఠోపాఠం చేసి పేజీ పేజీ ఒప్పచెప్పితే తాతయ్య నాకేమైన డబ్బు ఇస్తాడేమో? అలా డబ్బులు సంపాదించి తన ప్రెండు ఊటా’ దగ్గర చేసిన అప్పు తీర్చేయవచ్చు కదా! అలా అని అలోచన చేసి ఆ పుస్తకాన్ని రాగయుక్తంగా కంఠస్థం చేయ మొదలు పెదతాడు ఆ బుల్లబ్బాయి. మిగతా కథ అంతా తరువాతి సంచికల్లో అని అక్కడిక్కకడ నన్ను మోసం చెసి వెల్లిపోయిందా సంచిక. ఎంత ప్రయత్నించినా నాకు తదుపరి సంచికలు దొరకలేదు. ఆ కథను అద్భుతంగా అనువాదం చెసినవారు , డాక్టర్ వి. ఎన్. శర్మ గారు. ఆయన పేరు మీద వెదికినా అసలేమి సమాచారం లేదు ఇంటర్నెట్లో. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే! ఒక చిన్న రొట్టె ముక్కనో, ఒక జామ పండునో, చివరికీ పిసరంత పిప్పరమెంట్ ను కూడా ముక్కలు చేసుకుని నలుగురితో పంచుకునే మనుష్యులము మనము. ఇక్కడ డాక్టర్ భార్గవి గారు పంచుకున్నదల్లా తన కలను. తను చదివి ఆనందించడమనేది సరి. కానీ తను పొందిన ఆనందాన్ని పదిమందికి పంచాలని ఉంటుందే! అందునా అదేమి తన స్వంత రచన కాదు. ఈ పుస్తకం వలన తనకు కొత్తగా తెచ్చుకునే, వచ్చిపడే పేరూ ఉండదు. పుస్తకం వేయడమంటే డబ్బు ఎదురు పోయడమే కానీ, రావడం కాదు కదా. పైన నేను చెప్పిన కథ లో నాకు తప్పి పోయిన హాన్స్, ఊటా, డాక్టర్ వి. ఎన్. శర్మ గారు వీళ్లంతా నాకు ఏనాడో ఒకనాడు దొరక్కపొతారా? అనే ఆశకు ఆలంబన ఇదిగో ఈ డాక్టర్ భార్గవి గారి వంటి వారు, ఇంకా ఎవరైనా ఇటువంటి అద్భుతమైన పుస్తకాలు తేక పోతారా అని. గాలి ఎట్లా వస్తుందో ముక్కు కు తెలీదు , గొప్ప పుస్తకాలకు తెలీని ఊపిరి పోసేది ఈ అమ్మ వంటి వారే! . కానీ ఏదీ అంత సులువుగా మొదలవదు. ముగియదు. ఈ పుస్తకం మళ్ళీ తేవడం కోసం డాక్టర్ భార్గవి ఎంత సంకల్పశక్తి తో ముందుకు సాగిందో , ఎన్నెన్ని అవాంతరాలు ఎదురయ్యి దిగాలు బొమ్మలా చిన్నబోయిందో నాకు తెలుసు. పాటలా గలగల సాగే మా అమ్మ, ఈ పుస్తకం కొసమని అపుడపుడూ బరువుగా దుఖంగా అయ్యేది. నేను దానిని భరించలేక ఉండే వాడిని. పుస్తకమొద్దు ఏమీ వద్దు, ఇప్పుడు అది బయటికి రాకపోతే మునిగి పోయేదేం ఉంది? నీ ఆరోగ్యం, ఆనందం పాడు కావడం తప్పా ఆని! కేకలు కూడా వేసేవాడ్ని. అన్నీ వింటూనే ఉండేది, భరిస్తూనే ఉండేది. నేను మొత్తుకోళ్ళు పెడతానని తెలిసీ కూడా ఏ రోజుకారోజూ పనిలో ప్రొగ్రెస్ చేస్తూనే ఉండేది. నాకు చెబుతూనే ఉండేది . ఈ ఆరు నెలలు ఈ పుస్తకం తప్పా మరో పనేం పెట్టుకోలేదు. అదిగో అక్కడ ఆ డాక్టరు గారి బంధువులెవరో ఉన్నారు అంటే అటు పరిగెత్తింది. అటు కాదు ఇటు అంటే ఈ వైపు పరిగెత్తింది. ఏ దిక్కునైనా దిక్కు చూపించే వారెవవరున్నారని తెలిసినా దిక్కులన్నీ కొలిచే పని పెట్టుకుంది. అలా మొదలు పెట్టి పేజీ పేజీ తడుము కుని ప్రాణంగా, ముచ్చట గా, ముద్దుగా పుస్తకాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. పుస్తకం చివరిదాకా వచ్చాక కూడా చాగంటి వారి ఫోటో దొరకలేదు. ఇద్దరమూ కలిసి దయ్యాల గది లాంటి ఒక చిన్న గదిలో కుప్పలుగా పొసిన ఫోటో గ్రాఫుల మధ్య దుమ్మూ, బూజు, ధూళి , అలర్జీల మధ్య ఎన్నో ఫ్రేముల మధ్య ఎప్పుడూ చూడని సూర్యనారాయణ గారిని వెదికే పని పెట్టుకున్నాము. ఆయన అక్షరాన్ని బట్టి, ఆయన శైలిని బట్టి ఆయనని పోల్చుకునే పని చేసాము. మా అమ్మ మొహమంతా మురికి, అలసట, కళ్లల్లో మాత్రం దొరికి తీరుతుందనే ఆశ. ఆశ గొప్పది. అది పొస్టల్ స్టాంపంత విశాలమైనది, స్టాంపు వెనుక పూసి ఉంచిన జిగురంత లోతైనది. శ్రీ చాగంటి సూర్యనారాయణ గారి పోస్టల్ స్టాంపంత ఫోటో దొరికినపుడు ఆ గదిలో మేము ఇద్దరమే ఉన్నాము. అమ్మ ఎంత సంతోషించిందో చెప్పగలిగిన భాష నా దగ్గర లేదు. నాకైతే ఇంకాస్త దురాశ కలిగింది. చాగంటి వారు ఈ పుస్తకాన్ని వారి సతీమణి వేంకట రమణమ్మ గారికి అంకితం ఇచ్చారు. ఆవిడ ఫోటో కూడా దొరికితే అంకితం పేజి లో పెట్టవచ్చు కదా అని. పాఠకుడి మనసుకి చదువుతో పాటూ కళ్లకి గొప్ప ఆనందం ఇవ్వడం కోసం ఈ పుస్తకాన్ని మాకు వీలయినంత అందంగా తేవడానికి ఇష్టపూర్వకంగా ప్రయత్నం చేసాము. పాతికకు పైగా బొమ్మలు వేసి కూడా మా లౌల్యం వల్ల పుస్తకం సింప్లిసిటి చెడకూడదని నిర్దాక్షిణ్యంగా ఆ బొమ్మలని పోగులు పెట్టాము. కథలో తగిలే ప్రతి ఉప శీర్షిక ని టక టక కీబోర్డ్ తో టైపాడించి పెట్టింది కాదు. కొత్తగా తయారు చేసింది. అందులో నింపిన కేవలం పాతిక శాతపు నలుపు రంగు రేపు ఈ పుస్తకంలో ప్రింట్ రూపంలో ఎలా వస్తుందో, అచ్చయిన పేపరుని చూస్తే తప్పా మాకూ తెలిసే అవకాశం లేదు. అయినా సాహసం చేశాం. పుస్తకం బాగా రాకపోతే , ప్రతులన్నీ తగలెట్టి మళ్ళీ కొత్త పుస్తకం వేద్దాం అనే ఉన్నాం. పుస్తకం తొలి పేజీలో రచయిత బొమ్మ పై పెట్టిన టైటిల్ డిజైన్ హెయిర్ లైన్ థిక్ నెస్ ఫాంట్ పరిస్థితీ అంతే, ఏది ఎలా అచ్చవుతుందో మాకు తెలీదు. కొత్తగా చేయాలనుకున్నాము. తన రచనతో మా మనసుల్లో కి గొప్ప స్థానంలో వచ్చి కూర్చున్న శ్రీ చాగంటి సూర్యనారాయణ గారి పట్ల మేము చూపించగలిగిన కృతజ్ఞత ఇది మాత్రమే. అదే చేశాము. ఈ పుస్తకపు పని చేస్తున్న రోజుల్లో నా బుర్రనిండా ఇద్దరు మనుషులే నిండి పోయారు ఒకరు నికోలా టెస్లా, 1856 ల నాటి మనిషి. మరొకరు ఈ చాగంటి సూర్యనారాయణ 1898 ల వారు. 2023 ల నాటి నాకు ఇప్పటి నా ప్రపంచంలో నేను మోయవలసిన ఆలోచనలు, ఇతరాలు చాలా ఉన్నాయి. కానీ నా బుర్రలో అవేమీ నన్ను ఆక్రమించుకొలేదు. ఈ ఇద్దరు మనుషులు తప్పా. ఎందుకా అంటే, వీరు చేసిన పనల్లా, అలోచించినదల్లా కేవలం మానవాళి గురించే. వీళ్లని గురించి నేను చేసిన ఆలొచనలు, వీరి గురించిన నేను చదివిన చదువు నన్ను ఎంతగానో సంతోషపెట్టింది. నన్ను ఎక్కడో పడనివ్వకుండా సజ్జన స్మరణ లో ఆపింది. ఇదంతా ఎందుకు తలపోసుకుంటున్నానంటే మనిషి అనేవాడు మిగలడు కానీ అతను సంకల్పించిన మానవీయమైన కార్యాలు నిలుస్తాయి. పుస్తకాలు కూడా అన్ని నిలబడవు, కేవలం అత్మశక్తి అక్షరాలలో నిలిచి మీ మనసులు తాకుతుందో,మనల్ని మనగా ఉంచ చూస్తుందో ఆ రచనలు మిగులుతాయి. ఇప్పుడు మీ చేతుల్లో అత్యంత సులువుగా పెంపుడు పావురాయిలా ఒదిగి కూచున్న ఆ పుస్తకం కోసం మేం ఎన్నెన్ని చెట్లు గుట్టలు ఎక్కినా, కొండా కోనలు గాలించినా అదంతా మా సంతోషం కోసమే. పంచడానికి మా వద్ద కేవలం సంతోషం మాత్రమే ఉంది. దయచేసి స్వీకరించండి. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి -
సినిమాకి ‘మార్కెట్’ పెరిగింది
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేపథ్యంలో సినిమా రంగంలో మార్కెటింగ్ వనరులు కూడా విస్తృతంగా పెరిగాయని ప్రముఖ సినీ దర్శకుడు బండ్రెడ్డి సుకుమార్ అన్నారు. అంగరలో శిల్ప కళాకారుడు పెద్దింశెట్టి సూర్యనారాయణమూర్తి కుమారుడు నాయుడు నివాసంలో జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు సుకుమార్ సోమవారం సతీసమేతంగా వచ్చారు. ‘కరెంట్’ చిత్ర దర్శకుడు ప్రతాప్ కూడా సుకుమార్తో ఉన్నారు. ఈ సందర్భంగా ‘న్యూస్లైన్’తో సుకుమార్ ముచ్చటించారు. వన్ చిత్రం విజయంపై మీ కామెంట్? ఈ సినిమా ద్వారా ఏది చెప్పాలనుకున్నానో అది చెప్పానన్న సంతృప్తి పొందాను. నా అన్ని సినిమాల్లోకెల్లా వన్కి ఇండియాతో పాటు యూఎస్ నుంచి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. సినీ రంగం పరిస్థితి ఎలా ఉంది? సినిమా మార్కెటింగ్ రంగం బాగా అభివృద్ది చెందింది. గతంలో సినిమా అంటే థియేటర్కు వెళ్లి చూడటమే అన్నట్టుండేది. టెక్నాలజీ పెరగడంతో మల్టీ ప్లెక్స్లు వచ్చాయి. ఇతర దేశాల్లోనూ తెలుగు సినిమా విడుదల చేసే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. మీ సినిమాలు ఆలస్యం అవుతాయనే విమర్శ ఉంది కదా..? వన్ సినిమాను 2013లోనే ప్రారంభించాం. సమంత మూడు నెలలు పాటు సిక్ కావడం, మహేష్బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో బిజీగా ఉండటంతో ఆలస్యమైంది. ప్రతి సినిమా ఆలస్యానికీ ఏదో ఒక కారణం ఉంటుంది. మీరు నిర్మాణ రంగంపై దృష్టి పెట్టారేమిటి? తక్కువ బడ్జెట్తో మంచి సినిమాలు నిర్మించడం ద్వారా కొత్త దర్శకులకు అవకాశం కల్పించడం నా ఉద్దేశం. అందుకే ‘సుకుమార్ ఎంటర్టైన్మెంట్’ సంస్థను స్థాపించాను. మీ బ్యానర్పై తీసే సినిమాల వివరాలు? మూడు సినిమాలు ప్లాన్ చేస్తున్నాను. నా దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన ప్రతాప్ (కరెంట్ ఫేం) దర్శకత్వంలో ఫిబ్రవరిలో ఒక సినిమా ప్రారంభమవుతుంది. తదుపరి ప్రాజెక్టుల కోసం కథలు ఆలోచిస్తున్నాం. మీ సినీ ప్రస్థానం గురించి చెబుతారా? మాది మల్కిపురం మట్టపర్రు. చిన్నప్పుడు అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం, బుర్రకథలు ప్రదర్శించేవాడిని. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ సినిమాలుఆసక్తిగా చూసేవాడిని. ఆ ఆసక్తే సినిమా రంగంలోకి నన్ను పురిగొల్పింది. ఒడిదుడుకులు ఎదుర్కొన్నారంటారు కదా.. 1999లో సినిమా రంగంలోకి వచ్చాను. అమ్మ, నాన్న సపోర్టు ఇచ్చారు. ఎడిటర్ మోహన్, వీవీ వినాయక్ వద్ద పనిచేశాను. దిల్ సినిమాకు అసిస్టెంటు డైరక్టర్గా పనిచేశాను. కష్టాలు అనుభవించిన వ్యక్తిగా మా నాన్న, అన్నయ్యలు, కుటుంబ సభ్యులు నాకు తోడ్పాటునిచ్చారు. ఇబ్బం దులు ఉన్నప్పుడు ఆదిత్య క ళాశాలలో లెక్చరర్గా పనిచేసి మళ్లీ సినిమా రంగంలోకి వెళ్లాను. మీరు తీసిన సినిమాల్లో మీకు బాగా పేరుతెచ్చిన సినిమా ఏదంటే ఏం చెబుతారు? పనిచేసిన వ్యక్తిగా అన్ని సినిమాలు సంతృప్తిని ఇచ్చాయి. మహేష్బాబు సినిమా వన్ కు ఎక్కువ ప్రశంసలు వచ్చాయి. ఎన్టీఆర్తో యాక్షన్ ప్రేమకథ మట్టపర్రు (మలికిపురం) : జూనియర్ ఎన్టీఆర్తో యాక్షన్ ప్రేమకథాచిత్రం తీస్తున్నట్టు దర్శకుడు బి.సుకుమార్ తెలిపారు. స్వగ్రామం మట్టపర్రు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ మే నెలలో ఈ చిత్రం సెట్స్పైకి వెళుతుందన్నారు. ‘వన్ చిత్రం సక్సెస్ అయింది. హీరో మహేష్బాబు తనయుడు గౌతమ్ కూడా ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది’ అని చెప్పారు. -
స్పందించిన సహృదయం
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్లైన్ : స్పందించే హృదయం ఉండాలే కానీ.. సొంత ప్రాంతానికి ఎంత దూరంలో ఉన్నా, ప్రజల కష్టం గురించి తెలిశాక చలించకుండా ఉండదు. ఇప్పుడూ అదే జరిగింది. దీనికి ప్రేరణ ఇచ్చింది ‘సాక్షి’ జిల్లా సంచిక లో వచ్చిన ప్రత్యేక కథనం కావటం విశేషం. నిధుల కొరత కారణంగా జిల్లా కేంద్రంలో రెడ్క్రాస్ చేపట్టిన రక్త కణ విభజన కేంద్రం ఏర్పాటు పూర్తికాని వైనాన్ని ‘అత్యవసరంలోనూ అంతులేని జాప్యం’ శీర్షికన ‘సమర సాక్షి’ ప్రత్యేక కథనం డిసెంబర్ 18వ తేదీ సంచికలో ప్రచురితమైంది. అమెరికాలో నివసిస్తున్న ఈ జిల్లా వ్యక్తి పుల్లెల సూర్యనారాయణమూర్తి ఈ కథనాన్ని చదివి స్పందించారు. జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కేఎఎన్ భుక్త కూడా సహాయం అందించాల్సిందిగా ప్రోత్సహించటంతో సోదరుడు శ్యామసుందర్రావుకు 10 లక్షల రూపాయలు పంపి కలెక్టర్కు అందజేయాలని కోరారు. ఈ మేరకు శ్యామసుందర్రావు, డాక్టర్ పి.వి.బి.రామలక్ష్మిలు గురువారం కలెక్టర్ సౌరభ్గౌర్ను కలిసి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు ప్రబలాయని, అక్కడి రోగులకు రక్తం ఎంతో అవసరమని చెప్పారు. రక్త కణ విభజన కేంద్రం ఉంటే రక్తంలోని కణాలను విభజించి నలుగురికి వినియోగించవచ్చని తెలిపారు. రూ.10 లక్షల విరాళం అందించిన సూర్యనారాయణమూర్తి దివంగత స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే పుల్లెల శ్యామసుందరరావు కుమారుడని చెప్పారు. ఆయన విరాళమిచ్చేలా మాజీ ఎమ్మెల్యే కేఏఎన్ భుక్త ప్రోత్సహించారని తెలిపారు. కలెక్టర్ సౌరభ్ మాట్లాడుతూ సూర్యనారాయణమూర్తి వంటివారు స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారన్నారు. భారీ మొత్తం విరాళంగా అందించడం సంతోషదాయకమన్నారు. రక్తకణ విభజన కేంద్రం ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపడతామని చెప్పారు. రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ ఇంత పెద్ద మొత్తం విరాళంగా అందించిన సూర్యనారాయణమూర్తికి అభినందనలు తెలిపారు. రెడ్క్రాస్ సంస్థకు తొలుత మగటపల్లి రమణమూర్తి రూ.52 లక్షలు ఇచ్చారని, తర్వాత ఇంత పెద్దమొత్తం రావడం ఇదేనని చెప్పారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సభ్యులు డాక్టర్ నిక్కు అప్పన్న, నిక్కు హరిసత్యనారాయణ, ఎం.రామారావు, గీతా శ్రీకాంత్, ఎం.అప్పారావు, కిమ్స్ వైద్యులు పి.జె.నాయుడు, రాజా ప్రమీల, రాజేంద్ర కర్ణాని తదితరులు పాల్గొన్నారు.