breaking news
superbugs
-
‘సూపర్ బగ్స్’తో ముప్పే..!
యాంటీబయాటిక్స్ మానవాళి అభివృద్ధికి దోహదం చేసిన విలువైన ప్రాణాధార మందులు. మనుషులకు, జంతువులకు యాంటీబయాటిక్ ఔషధాలను నిర్దేశిత మోతాదుల కన్నా అధికంగా, విచక్షణారహితంగా వినియోగిస్తున్నందు వల్ల కొన్ని సూక్ష్మక్రిములు ఈ మందులకు అలవాటు పడిపోయి మొండి క్రిములుగా (సూపర్ బగ్స్) తయారవుతున్నాయి.దీంతో శక్తిమంతమైన యాంటీబయాటిక్స్ కూడా ప్రాణరక్షణలో నిష్ప్రయోజనంగా మారుతున్నాయి. ఇదే అంతర్జాతీయ సమాజాన్ని వణికిస్తున్న యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) సమస్య. ఏఎంఆర్ అనేది ప్రపంచ ఆరోగ్యం, ఆహార భద్రత, పర్యావరణం, సుస్థిర అభివృద్ధికి అతిపెద్ద ముప్పుల్లో ఇదొకటి. అతి వినియోగాన్ని నియంత్రించాలి..చాపకింద నీరులా విస్తరిస్తున్న బ్యాక్టీరియల్ ఏఎంఆర్ వల్ల 2019లో ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. దీన్ని అరికట్టకపోతే 2050 నాటికి ఏటా కోటి మందిని (ఇందులో 20 లక్షల మంది భారతీయులే) బలి తీసుకుంటుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఏఎంఆర్ సమస్యను పరిష్కరించాలంటే.. మనుషులు యాంటీబయాటిక్స్ను జాగ్రత్తగా వాడాలి.పాలు, గుడ్లు, మాంసం కోసం పెంచే పశు పక్ష్యాదులకు యాంటీబయాటిక్స్ వినియోగాన్ని నియంత్రించాలి. అతిగా ఉపయోగించే యాంటీబయాటిక్స్లో 90% విసర్జితాల ద్వారా పర్యావరణంలోకి చేరి నీరు, నేల కలుషితమవుతాయి. యాంటీబయాటిక్స్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు డబ్ల్యూహెచ్ఓ నవంబర్ 18–24 వరకు అంతర్జాతీయ వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఏఎంఆర్ను అరికట్టేదెలా?ఆహారాన్ని తయారు చేసేటప్పుడు, వంట చేసే ముందు చేతులు కడుక్కోవడం, ఆహారం వండే ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఔషధ–నిరోధక సూక్ష్మజీవుల వ్యాప్తిని నిరోధించవచ్చు. మీకు తెలుసా?యాంటీమైక్రోబయాల్స్ అనేవి మానవులు, జంతువులు, పంటల్లో అంటు వ్యాధులు/చీడపీడలు నివారించడానికి, నియంత్రించడానికి ఉపయోగించే అద్భుత ఔషధాలు. అయితే, మనుషులకు చికిత్సల్లో విచక్షణా రహితంగా యాంటీబయాటిక్స్ను వాడుతున్నారు. అదేవిధంగా పశుపోషణలో, పంటల సాగులోనూ గ్రోత్ ప్రమోటర్లుగా వినియోగిస్తున్నారు. జబ్బులు రాక ముందే నియంత్రణ కోసమని దాణాల్లో కలుపుతున్నారు.మనుషుల కోసం ప్రత్యేకించిన యాంటీ బయాటిక్స్ను పశుపోషణలో దుర్వినియోగం చేయడం ఒక సమస్య. బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు, పరాన్నజీవులు యాంటీమైక్రోబయల్ ఔషధాలకు స్పందించకుండా పోయినప్పుడు యాంటీ మైక్రోబయల్ రెసిస్టె¯Œన్స్ సంభవిస్తుంది. ఫలితంగా యాంటీబయాటిక్స్ అసమర్థంగా మారతాయి. ఇన్ఫెక్షన్లకు చికిత్స కష్టతరమవుతుంది లేదా అసాధ్యం అవుతుంది.తీవ్ర పేదరికంలోకి..ఏఎంఆర్ విసిరే సవాళ్లు సంక్లిష్టమైనవి. కానీ అధిగమించలేనివి కావు. మనుషులు, పశువులు, పక్షులు, పర్యావరణ ఆరోగ్యం వేర్వేరు కాదు ఒక్కటే అనే స్ఫూర్తిని అందించే డబ్ల్యూహెచ్ఓ ‘వన్ హెల్త్’ప్రచార కార్యక్రమం లక్షలాది మంది ప్రాణాలను కాపాడటానికి, యాంటీమైక్రోబయాల్స్ను సంరక్షించడానికి, ఔషధ–నిరోధక వ్యాధికారకాల నుంచి భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి సహాయపడుతుంది.ఉపయోగించకుండా ఉన్న టాయిలెట్లు, డబ్బాలు లేదా చెత్తలో పారేస్తున్న ఔషధాల నుంచి విడుదలయ్యే రసాయనాలు ఏఎంఆర్ సమస్యను తీవ్రం చేస్తాయి. ఈ మహమ్మారిని అరికట్టకపోతే 2050 నాటికి ప్రపంచ వార్షిక స్థూల జాతీయోత్పత్తిలో 3.8 శాతా న్ని దెబ్బతీస్తుంది. వచ్చే దశాబ్దంలో ఏటా 3.4 లక్షల కోట్ల డాలర్ల మేరకు స్థూల జాతీయోత్పత్తిని తగ్గించేస్తుందని, 2.4 కోట్ల మందిని తీవ్ర పేదరికంలోకి నెట్టివేస్తుందని అంచనా.-సాక్షి, స్పెషల్ డెస్క్ -
పూ పిల్స్తో సూపర్బగ్స్ ఖతం
శరీరంలో తిష్ట వేసి ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే సూపర్ బగ్స్ను తుదముట్టించడానికి బ్రిటన్ పరిశోధకులు సరికొత్త మాత్రను అభివృద్ధి చేశారు. ప్రధానంగా పేగుల్లో యాంటీబయోటిక్స్ను దెబ్బతీసే ఇన్ఫెక్షన్లకు విరుగుడు కనిపెట్టారు. ఈ మాత్రను మానవ మలంతో తయారు చేయడం గమనార్హం. వీటికి ‘పూ పిల్స్’ అని పేరు పెట్టారు. ఎండబెట్టి, పొడి చేసిన మలాన్ని ఈ మాత్రల తయారీకి ఉపయోగించారు. ఇందుకోసం ఆరోగ్యకరమైన దాతల నుంచి మలం నమూనాలు సేకరించారు. అందులో మనుషులకు మేలు చేసే బ్యాక్టీరియా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. జీర్ణం కాని వ్యర్థాలుంటే తొలగించారు. పూ పిల్స్లోని మంచి బ్యాక్టీరియా పేగుల అంతర్భాగంలోని సూపర్బగ్స్తో నేరుగా పోరాడి బయటకు పంపుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా పేగుల ఆరోగ్యానికి అవసరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నట్లు తేల్చారు. అండన్లోని గైస్ అండ్ సెయింట్ థామస్ ఆసుపత్రిలో 41 మంది రోగులపై ఈ ప్రయోగం చేశారు. వారికి పూ పిల్స్ ఇచ్చారు. ఇన్ఫెక్షన్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లను నివారించడానికి మలం మాత్రలు చక్కటి ప్రత్యామ్నాయమని డాక్టర్ బ్లెయిర్ మెరిక్ చెప్పారు. యాంటీబయాటిక్స్ను అడ్డుకొనే ఇన్ఫెక్షన్లకు, ఔషధాలకు లొంగని సూపర్బగ్స్కు మూలం పేగులేనని తెలిపారు. పూ పిల్స్తో సూపర్బగ్స్ను పేగుల నుంచి తరిమేయవచ్చని వెల్లడించారు. పూ పిల్స్ వాడకం కొత్తేమీ కాదు. క్లో్రస్టిడియం డిఫిసైల్ బ్యాక్టీరియా వల్ల ఏర్పడే డయేరియా చికిత్సకు ఈ మాత్రలు వాడుతున్నారు. సూపర్బగ్స్ నియంత్రణకు పూ పిల్స్పై మరింత పరిశోధన చేయాలని నిర్ణయించారు. – లండన్ -
వెల్లుల్లితో సూపర్బగ్స్కు చెక్
దాదాపుగా అందరి వంటిళ్లలో విరివిగా వాడే వెల్లుల్లిలో యాంటీబాక్టీరియల్ లక్షణాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, యాంటీ బయోటిక్స్కు లొంగని సూపర్బగ్స్ను కూడా వెల్లుల్లితో సమర్థంగా అరికట్టవచ్చని ఒక తాజా పరిశోధనలో తేలింది. వెల్లుల్లిలో ఉండే ‘అజోనే’ అనే రసాయనం ఎలాంటి మొండిరకం బ్యాక్టీరియాలనైనా ఇట్టే నాశనం చేయగలదని డానిష్ శాస్త్రవేత్తల ప్రయోగాల్లో తేలింది. యాంటీబయోటిక్స్ను తట్టుకుని మరీ మనుషుల శరీరంలోని కణజాలానికి అంటిపెట్టుకుని ఉండే బ్యాక్టీరియా డీఎన్ఏను వెల్లుల్లిలోని ‘అజోనే’ అనే రసాయనం నాశనం చేయగలుగుతోందని తమ ప్రయోగాల్లో తేలినట్లు కోపెన్హాగెన్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ టిమ్ హామ్ జాకబ్సన్ వెల్లడించారు. మొండి బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్లు సోకిన వారికి యాంటీ బయోటిక్స్తో పాటు వెల్లుల్లి నుంచి సేకరించిన ‘అజోనే’తో తయారు చేసిన ఔషధాలను వాడినట్లయితే ప్రాణాంతక పరిస్థితుల నుంచి బయటపడవచ్చని కోపెన్హాగెన్ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. -
చికెన్తో చిక్కులెన్నో!
న్యూఢిల్లీ: తందూరీ చికెన్, బటర్ చికెన్.. ఇలాంటి చికెన్ వంటకాల పేర్లు వింటేనే నోరూరుతుంది కదూ ? రుచికి మారుపేరైన చికెన్తోపాటు గుడ్లతోనూ ఎన్నో అనర్థాలు ఉన్నాయట. మన భారతీయ కోళ్ల కారణంగా మన వాళ్లకే కాదు ప్రపంచానికి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇక్కడి కోళ్లలో వ్యాధి నిరోధక వ్యవస్థకు కూడా లొంగని సూపర్బగ్స్/బ్యాక్టీరియాలు ఉన్నట్టు భారత్–అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. పంజాబ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎన్నో పెద్ద పెద్ద పౌల్ట్రీఫారాలు ఉంటాయి. వీటిలోనే సరికొత్త బ్యాక్టీరియాలు ఉత్పత్తి అవుతున్నాయి. కోళ్లు అనారోగ్యం బారినపడకుండా చూడడానికి, త్వరగా బరువు పెరగడానికి యాంటీబయోటిక్ మందులు ఎక్కువగా ఇస్తుండడంతో హానికారక బ్యాక్టీరియాలు ఉత్పత్తి అవుతున్నాయి. యాంటీబయోటిక్ సత్తా క్రమంగా తగ్గిపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ అధికారి, ఈ పరిశోధనలో పాలుపంచుకున్న మార్గరెట్ చాన్ అన్నారు. ఇలాంటి చికెన్ తినేవాళ్లకు ఏదైనా జబ్బు సోకితే సాధారణ యాంటీబయోటిక్స్ పనిచేయవని తెలిపారు. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ డిసీజెస్ డైనమిక్స్, ఎకనమిక్స్ అండ్ పాలసీ సంస్థ పరిశోధకులు పంజాబ్లోని ఆరు జిల్లాల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. పంజాబ్లోని మెజారిటీ పౌల్ట్రీఫారాల్లో పెరిగే కోళ్లు, గుడ్లలో సూపర్బగ్స్ ఉంటున్నాయని సంస్థ డైరెక్టర్ రామనన్ లక్ష్మీనారాయణ్ చెప్పారు. అనారోగ్యం బారినపడ్డ జంతువులు మినహా మిగతా వాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ యాంటీబయోటిక్స్ ఇవ్వకూడదని స్పష్టం చేశారు.


