-
పేదరాశి వైద్యమ్మ
చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. కూరగాయలు అమ్మి, కొడుకును డాక్టర్ని చేసింది. ఊళ్లోని పేదలకు ఉచితంగా వైద్యం చేయించింది. ఊరి కోసం పెద్ద ఆసుపత్రినే కట్టించింది. ఇప్పుడీ పేదరాశి ‘వైద్యమ్మ’ ను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది! కూరగాయలు అమ్మి ఆసుపత్రి కట్టించింది! రాత్రీ పగలూ లేకుండా ఏ సమయంలో ఎవరు అనారోగ్యంతో వచ్చినా వెంటనే వారికి వైద్య సదుపాయం అందించే ఆసుపత్రి అది. మానవత్వానికి ఎప్పుడూ ద్వారాలు తెరిచి వుంచే ఆ వైద్యాలయం పశ్చిమ బెంగాల్లోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హన్స్పుకూర్ గ్రామంలో పాతికేళ్ల క్రితం వెదురు గుడిసెలో ప్రారంభమైంది. నాటి నుంచీ పేదలకు ఉచితంగా వైద్యసేవలు, సదుపాయాలు అందిస్తూ ఇప్పుడు ఒకటిన్నర ఎకరం స్థలంలో 45 పడకలతో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా విస్తరించింది. ఈ ఆసుపత్రిలో పది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఉండగా 17 మంది వైద్యులు సేవలు అందిస్తున్నారు. రోజూ 300 మంది ఇక్కడ ఉచితంగా వైద్యం పొందుతున్నారు. ‘హ్యుమానిటీ’ పేరుతో పేదలకు ఉదారంగా వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రి నిర్వహణ వెనకాల ఓ వృద్ధురాలైన ఒక స్త్రీమూర్తి ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒకనాడు కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించిన ఆ మహిళ.. సుభాషిణీ మిస్త్రీ. ప్రస్తుతం 78 ఏళ్ల వయసున్న సుభాషిణిని పేదలకు అందిస్తున్న సేవలకు గాను భారతప్రభుత్వం ఈ యేడు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. కళ్ల ముందే భర్త మరణం కొడుకుతో తీరిన రుణం ఆసుపత్రి దగ్గరలో లేకపోవడం మూలాన సరైన వైద్యం అందక రోగులు దారి మధ్యలోనే ప్రాణాలు విడవడం సుభాషిణి మనసును కలిచివేసేది. అలాగే ఆమె భర్త సాధన్ చంద్ర మిస్త్రీ కూడా ఉదరకోశ సమస్యతో తగిన వైద్యం అందక తన కళ్ల ముందే ప్రాణాలు విడవడం ఆమె గుండెను ఛిద్రం చేసింది. భర్త అలా కన్ను మూస్తున్నప్పుడు నిస్సహాయంగా ఉండిపోయిన సుభాషిణి నాటి పరిస్థితులను తలుచుకుంటూ కంట తడి పెట్టుకున్నారు. ‘‘అప్పుడు నా వయసు 23 ఏళ్లు. నలుగురు చిన్న పిల్లలు. కూరగాయలు అమ్ముకుంటూ నా పిల్లలను పోషించుకున్నా. నా భర్తలా ఎవరూ వైద్యం అందక చనిపోకూడదని నిర్ణయించుకున్నాను. మా జీవనానికి పోను కొద్ది కొద్దిగా పొదుపు చేసేదాన్ని. ఆ డబ్బుతో నా పెద్ద కొడుకును డాక్టర్ని చదివించాను. నా కొడుకు డాక్టర్ అజయ్ మిస్త్రీ నా మాటపై ఉన్న ఊరిలోనే వైద్యం ప్రారంభించాడు. కూరగాయలు అమ్మే ఆ వెదురు గుడిసెలోనే రోగులను పరీక్షించేవాడు. ఆసుపత్రి అంటే సకల సదుపాయాలు ఉండాలి. అందుకు చాలా డబ్బు కావాలి. రేయింబవళ్లు ఒకటే ధ్యాస.. మంచి ఆసుపత్రి కట్టాలి. డబ్బులు కావాలి ఎలా అని. తెలిసిన డాక్టర్లతో మాట్లాడాను. అంతా లెక్క వేస్తే పేదలకు ఉచితంగా వైద్యం అందించాలంటే నెలకు కనీసం 16 లక్షల రూపాయలు కావాలని స్పష్టమైంది. నిధుల కోసం ఊరూ వాడా, పల్లె పట్నం అని తేడా లేకుండా అందరినీ కలుస్తూనే ఉన్నాను. ఇందుకు నా పిల్లల సాయం తీసుకున్నాను. ప్రకటనలు ఇచ్చాను. దక్షిణ భారతం నుంచి ఎక్కువ మంది దాతలు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఏడాది ప్రయత్నం తర్వాత ప్రభుత్వం నుంచి సాయం అందడానికి అంగీకారం లభించింది. చెప్పలేనంత ఆనందం. ఆ క్షణం నుంచి దాతల నుంచి డబ్బు తీసుకోవడం ఆపేశాను. ఆసుపత్రి ప్రారంభమైంది. రోగుల ప్రాణాలు నిలబడ్డాయి’’ అని ఆసుపత్రి ఆవిర్భావ పరిస్థితులను, తను ఎదుర్కొన్న ఒత్తిడులను వివరించారు సుభాషిణీ మిస్త్రీ. ఆసుపత్రి పక్కనే ఓ కాలేజీ ద్వీపంలోనూ ఒక ఆసుపత్రి ఆ తర్వాత ‘‘ఈ ఆసుపత్రికి దగ్గర్లోనే నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుంది’’ అని స్థానిక డాక్టర్లు సుభాషిణికి చెప్పారు. ఆమె అలాగే ఏర్పాటు చేసింది. ఓసారి.. సుందర్ బన్స్లోని సజ్జలీయా ద్వీపంలో సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలంటే పడవ మీద రెండు గంటలు పడుతుందని, రోగులు నానా ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తోందని సుభాషిణి దృష్టికి వచ్చింది. అక్కడా ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి ఆమె నడక సాగించారు. 25 మంచాల ఆసుపత్రిని ఆ ఊళ్లో ఏర్పాటు చేశారు. ఇక్కడితో ఆమె ప్రయాణం ఆగిపోలేదు. ఝర్గామ్ జిల్లాలోని మానికపరాలో హెల్త్ క్యాంప్లు ఏర్పాటు చేస్తున్నారు.‘‘సుభాషిణీ మిస్త్రీ వారంలో ఒక్కో రోజు ఒక్కో ఆసుపత్రిలో రోగులకు సరైన సేవలు అందుతున్నాయా లేదా అని పర్యవేక్షిస్తుంటారు. అలాంటి మనిషి చాలా అరుదు’’ అని ఆమె గురించి తెలిసిన డాక్టర్ ఎ.పాల్ అంటారు. ఆసుపత్రుల నిర్వహణకే కాదు అనా«థ పిల్లలకు చక్కని భవిష్యత్తును ఇవ్వడానికి ఆశ్రమాల ఏర్పాటుకు ఈ వయసులోనూ ఆమె అడుగులు పరుగులు తీస్తూనే ఉన్నాయి. – ఎన్.ఆర్ కూరగాయలు అమ్ముతున్న సుభాషిణి (ఫైల్ ఫొటో) -
పేదింటి అమ్మ కట్టించిన పెద్ద ఆసుపత్రి!
స్ఫూర్తి సుభాషిణీ మిస్త్రీ ఆసుపత్రి కట్టాలనుకున్నారు. కాని మనసులో ఆరాటం తప్ప, చేతిలో కానీ లేదు. అయితేనేం...గుండెలనిండా ఆత్మవిశ్వాసం ఉంది... పేదలకు సేవ చేయాలన్న తపన ఉంది... అహరహం శ్రమించింది... అందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్థుల సహకారం తోడైంది... అందరి కృషి ఫలించింది... ‘హ్యూమానిటీ హాస్పిటల్’ పేరుతో ఆసుపత్రి వెలసింది. ఎందరో పేదలకు ఉచిత వైద్యసేవలు అందిస్తోంది. సుభాషిణిలో చుట్టు పక్కల వారిని నవ్వించే హాస్యచతురత అంతగా ఏమీ లేదు. ఎప్పుడూ కాస్త గంభీరంగానే ఉంటుంది ఆవిడ. కానీ, ఆమె ఒక మాట అంటున్నప్పుడు మాత్రం...వినేవాళ్లు నవ్వినంత పని చేసేవారు. కొందరు వెటకారం కూడా చేసేవారు. అయినా ఆమె వాటికి పెద్దగా స్పందించేది కాదు. ఇంతకీ, కోల్కతాకు సమీపంలోని హన్సుపుకుర్ గ్రామానికి చెందిన సుభాషిణీ మిస్త్రీ ఏమనేవారు? ‘‘పేదవాళ్ల కోసం ఆసుపత్రి కడతాను. వాళ్లకు ఏ కష్టం లేకుండా ఉచితంగా వైద్యం చేయిస్తాను’’ పేదవాళ్లకు ఉచిత వైద్యసేవ చేయాలనుకున్న సుభాషిణి పెద్దింటావిడ ఏమీ కాదు. ఊళ్లో పలుకుబడి ఉన్న మహిళ అంతకంటే కాదు. ఆమె ఒక సాధారణమైన పేద మహిళ. ఎర్రటి ఎండల్లో కూలీ పని చేసేది. పెద్దవాళ్ల ఇంట్లో ఇంటి పని చేసేది. వీధి వీధి తిరుగుతూ కూరగాయలు అమ్మేది. ఏ రోజుకు ఆరోజు అన్నట్లుగానే ఉండేది ఆమె ఆర్థిక పరిస్థితి. ఇంతకీ ఆమె ఆసుపత్రి ఎందుకు కట్టాలనుకున్నారు? 23 ఏళ్ల వయసులోనే సరియైన వైద్యసదుపాయాలు లేని స్థితిలో సుభాషిణి భర్త చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె ఎన్ని కష్టాలు పడిందో ఆ దేవుడికే తెలుసు. కడుపు నిండా తిన్న రోజుల కంటే పస్తులు ఉన్న రోజులే ఎక్కువ. భర్త మాత్రమే కాదు...ఆమె బంధువులలో కొద్దిమంది సరైన వైద్యం లేక చిన్నవయసులోనే చనిపోయారు. ఇక అప్పటి నుంచి ఆసుపత్రి కట్టాలనేది ఆమె కల, ఆశయం. ఒక పేదరాలికి ఆసుపత్రి కట్టించేంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరో సుభాషిణితో అన్నారట- ‘‘ఇదేమన్నా సినిమా అనుకున్నావా? జీవితం’’ అని. అలా అంటారు గానీ, నిజానికి చాలా సినిమాలకు జీవితమే ప్రేరణ. జీవితంలోని ఎగుడుదిగుళ్ల నుంచే ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి. ప్రేక్షకులకు నచ్చాయి. సుభాషిణిది కూడా అలాంటి కథే. ఇప్పుడు మళ్లీ ఒకసారి వెనక్కి వెళదాం... సకాలంలో వైద్యం అందక, నిస్సహాయస్థితిలో తన భర్తలాగా ఇకముందు ఎవరూ చనిపోకూడదనుకుంది సుభాషిణీ. భవిష్యత్తు కలను దృష్టిలో పెట్టుకొని తనకు వచ్చిన డబ్బును జాగ్రత్తగా పొదువు చేయడం ప్రారంభించింది. కొన్నిసార్లయితే ఓవర్టైమ్ కూడా చేసేది. ఒక భూస్వామి కొంత భూమిని అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిసి అతడిని కలిసింది. అతడి కాళ్ల మీద పడి తన ఆశయం గురించి చెప్పింది. తాను పొదుపు చేసిన డబ్బుతో మార్కెట్ రేటుతో పోల్చితే కాస్త తక్కువ ధరకే ఆ భూమిని కొన్నది. ‘‘తొలి విజయం సాధించాను’’ ఆమె తనలో తాను గర్వంగా అనుకుంది. ఇల్లలకగానే పండగ కాదు కదా! ఆ విషయం...ఆమెకు స్పష్టంగా తెలుసు. ‘పండగ’ వచ్చే రోజు కోసం మరింత ఎక్కువ కష్టపడాలనే విషయం కూడా తెలుసు. ఆసుపత్రి కోసం పైసా, పైసా కూడబెడుతున్న తనకు పిల్లల్ని చదివించడం కష్టమైపోతుందనే విషయం అర్థమై ముగ్గురు పిల్లలలో ఇద్దరిని అనాథాశ్రమంలో చేర్పించింది. ‘హవ్వా’ అనుకున్నారు చుట్టాలు పక్కాలు. ‘‘మీ ఆయన చనిపోవచ్చు. నువ్వు బతికే ఉన్నావు కదా! అలా పిల్లలను అనాథాశ్రమంలో చేర్పించవచ్చా?’’ అన్నాడు ఒక సన్నిహిత బంధువు. ఎవరేమన్నా ఆమె మౌనంగా ఉండేది. తన ఇద్దరు కొడుకుల్లో ఒకరిని వైద్యశాస్త్రం చదివించాలని కూడా ఆమె బలంగా అనుకునేది. అనుకున్నట్లే రెండో కొడుకు అజయ్ మెడిసిన్ చదివాడు. రెండో విజయం! తన తల్లి కల నెరవేర్చడానికి తన వంతు పాత్ర పోషించాడు అజయ్. 1993లో గ్రామస్థుల సహకారంతో ఒకే ఒక్క గదిలో ‘హ్యూమానిటీ హాస్పిటల్’ పేరుతో చిన్నగా మొదలైంది ఆసుపత్రి. ప్రజలు తమకు తోచిన రీతిలో సహాయం అందించారు. కొందరు డబ్బు ఇచ్చారు. కొందరు తమ దగ్గర ఉన్న కలప ఇచ్చారు. కొందరు శ్రమదానం చేశారు. కొందరు ఏమీ ఇవ్వక పోయినా ధైర్యాన్ని మాత్రం ఇచ్చారు. మూడు సంవత్సరాల తరువాత శాశ్వత ఆసుపత్రి నిర్మాణానికి అప్పటి పశ్చిమ బెంగాల్ గవర్నర్ కె.వి.రఘునాథరెడ్డి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరో పేదలు ఈ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యచికిత్స పొందారు. పొందుతున్నారు. ‘‘చూడడానికి పొట్టిగా కనిపించే సుభాషిణి ఈ ఆసుపత్రి నిర్మాణంతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది’’ అంటారు గ్రామస్థులు. దేశవిదేశాల నుంచి ఎన్నో పురస్కారాలు సుభాషిణిని వరించాయి. అయితే ఇవేవీ కాదు... వైద్యసేవలు పొందిన తరువాత పేదరోగుల కళ్లలో కనిపించే సంతృప్తినే అతి పెద్ద పురస్కారంగా భావిస్తుంటుంది డెబ్బై సంవత్సరాల సుభాషిణీ మిస్త్రీ. నేను చదువుకోలేదు. గడియారం చూసి టైమ్ చెప్పడం కూడా నాకు రాదు. అయినప్పటికీ ఏదో ఒకరోజు నా కోరిక నెరవేరుతుందనే నమ్మకం బలంగా ఉండేది. - సుభాషిణి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement