breaking news
state criminal investigation department
-
మోసాల్లో బ్యాం‘కింగ్స్’!
సాక్షి, హైదరాబాద్: బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న సొమ్మును రుణాల రూపంలో ఆర్థిక నేరగాళ్లకు దోచిపెట్టడంలో కొందరు బ్యాంకు అధికారుల వ్యవహారం సంచలనం రేపుతోంది. బ్యాంకుల్లో మేనేజర్లుగా, ఆపై స్థాయిలో పనిచేసే కొందరు అధికారుల అవినీతి ఎంతటి స్థాయిలో ఉందంటే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), రాష్ట్ర నేర పరిశోధన శాఖ (సీఐడీ) నమోదు చేసిన బ్యాంకు మోసాల కేసుల్లో 75 శాతం వారి ప్రమేయం ఉన్నవే ఉండటం గమనార్హం. లేనివి ఉన్నట్టు.. ఉన్నవి లేనట్టు.. చేప పిల్లల పెంపకం, అమ్మకాల వ్యాపారం పేరుతో ఓ సంస్థ రూ. 6 కోట్లకుపైగా కొల్లగొట్టిన అభియోగాలపై కంపెనీ యజమాని, డైరెక్టర్లు సహా యూనియన్ బ్యాంక్ మేనేజర్పై సీబీఐ ఇటీవల కేసు నమోదు చేసింది. కంపెనీ సమర్పించిన నకిలీ పత్రాలపై రూ. 6 కోట్లు లోన్ మంజూరు చేసి కమిషన్ తీసుకున్నట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో స్పష్టం చేసింది. చేప పిల్లలు కాదు కదా.. కనీసం అక్కడ చేపల పెంపకానికి సంబంధించి చెరువు కూడా లేకపోవడం సంచలనం రేపింది. ఏకంగా రూ. 200 కోట్లు... హైదరాబాద్కు చెందిన లక్ష్మీ ఫైనాన్స్ లిమిటెడ్, వరుణ్ ఫైనాన్స్ బాధ్యులు ఫోర్జరీ పత్రాలతో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 200 కోట్ల రుణం పొందారు. ఈ వ్యవహారంలోనూ బ్యాంక్ అధికారుల పాత్రపై సీఐడీ విచారణ సాగిస్తోంది. కంపెనీ సమర్పించిన పత్రాలు అసలైనవా కాదా అని ధ్రువీకరించుకోకుండా లోన్లు జారీ చేసిన బ్యాంకు అధికారుల పాత్రపైనా సీఐడీ దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్బీఐ పరిశ్రమ భవన్లోనూ.. హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఉన్న ఎస్బీఐ పరిశ్రమ భవన్ బ్రాంచీ మేనేజర్ నవీన్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థకు రూ. 4 కోట్ల మేర రుణం మంజూరు చేశారు. సంస్థ సమర్పించిన బ్యాలెన్స్షీట్, కోలాటరల్ ఆస్తుల వివరాలను సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ధ్రువీకరించుకోకుండానే మేనేజర్ ఈ రుణం ఇచ్చారు. ఎస్బీఐ అంతర్గత ఆడిటింగ్లో కుట్ర బయటపడటంతో బ్యాంకు అధికా రులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. కాగా, తాజాగా తెలుగు అకాడమీకి చెందిన రూ. 64 కోట్లకుపైగా ఫిక్స్డ్ డిపాజిట్లను కొట్టేసిన నిందితులకు పలువురు బ్యాంక్ మేనేజర్లే సహకరించినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ విభాగాల్లో 75 శాతం కేసులు అవే... ఇప్పటివరకు సీఐడీ దగ్గర నమోదై దర్యాప్తు దశలో ఉన్న 107 కేసుల్లో 68 కేసులు బ్యాంకు మోసాలకు సంబంధించినవే కావడం గమనార్హం. ఈ ఏడాది సీబీ ఐ నమోదు చేసిన 17 ఎఫ్ఐఆర్లలో 9 కేసులు బ్యాంక్ చీటింగ్ కేసులే. దీనికితోడు రాష్ట్రవ్యాప్తంగా సీసీఎస్ పో లీసులు ఈ తరహా మోసాలపై నమోదు చేసిన కేసులు వందల్లోనే ఉన్నాయి. ఇలా ఏ ఒక్క ఏడాదిలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో రూ. 1,200 కోట్ల నుంచి రూ. 1,500 కోట్ల మేర సొమ్మును బ్యాంక్ అధికారుల అవినీతి వల్ల దోచేసినట్టు సీఐడీ అంచనా వ్యక్తం చేసింది. కనిపించని సైబర్ నేరాల్లో రూ. కోట్లు పోగొట్టుకోవడం ఒక ఎత్తయితే... కళ్ల ముందు జరుగుతున్న ఆర్థిక నేరాల నియంత్రణలో కొందరు బ్యాంకు అధికారులే సూత్రధారులు కావడం ఆందోళన రేకేత్తిస్తోంది. -
ప్రశ్నపత్రం లీకైందా..?
‘పీజీ మెడికల్ ఎంట్రన్స్’ స్కామ్లో సీఐడీ అనుమానం 24 మంది పీజీ ర్యాంకర్లపై అధికారుల కన్ను వర్సిటీ రిజిస్ట్రార్ బాబూలాల్ వాంగ్మూలం నమోదు ప్రశ్నపత్రం ముద్రించిన మంగళూరులోని ప్రెస్లో మెటీరియల్ సీజ్ సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర నేరపరిశోధన విభాగం (సీఐడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రాథమికంగా సేకరించిన వివరాల ప్రకారం పరీక్షకు ముందే పేపర్ లీక్ అయిందని అధికారులు అనుమానిస్తున్నారు. అలా బయటకొచ్చిన ప్రశ్నపత్రం కొందరికి అందినట్లు భావిస్తున్నారు. లీక్కు సూత్రధారులు, పాత్రధారులు ఎవరో కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలు మూడు రాష్ట్రాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. సీఐడీ పోలీసులు మంగళవారం ఎన్టీఆర్ వర్సిటీ రిజిస్ట్రార్ ఎస్.బాబూలాల్ వాంగ్మూలం నమోదు చేశారు. పరీక్షల విభాగం అధికారులదే పీజీ ఎంట్రన్స్ నిర్వహణ బాధ్యత అని రిజిస్ట్రార్ చెప్పారు. మరోవైపు వర్సిటీ అధికారులు అంతర్గతంగా చేపట్టిన విచారణలో 24 మంది అభ్యర్థులకు వచ్చిన మార్కులు, ర్యాంకులపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఈ వివరాలనూ సీఐడీ అధికారులు సేకరించారు. వీరికి పదో తరగతి, ఇంటర్, ఎంసెట్ ఎంట్రన్స్లో వచ్చిన మార్కులు, ర్యాంకులను విశ్లేషించిన నేపథ్యంలో దర్యాప్తు అధికారులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరంతా గతంలో కర్ణాటకకు సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (కొమెడ్ కే) రాసిన వారే. కానీ, అందులో వారు సాధించిన ర్యాంకుకు, ఏపీపీజీలో సాధించిన ర్యాంకుకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. వారు ఎవరెవరితో మెయిల్, ఫోన్ సంప్రదింపులు జరిపారనేది విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా 17 మంది వైద్య విద్యార్థులు, కొందరు ప్రైవేటు వ్యక్తులు ఈ కుంభకోణంలో కీలకపాత్ర వహించినట్లు అనుమానిస్తున్న అధికారులు వారి కోసం గాలిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో వర్సిటీ రిజిస్ట్రార్ అందజేసిన కొందరు విద్యార్థుల సెల్ నంబర్ల ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మ రం చేశారు. సోమవారం అర్ధరాత్రి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అనుమానితుల నివాసాలపై అధికారులు దాడులు నిర్వహించినట్లు సమాచారం. ముద్రణ, రవాణా సమయంలో లీక్? మొత్తం ఐదు ప్రత్యేక బృందాలు హైదరాబాద్, విజయవాడతో పాటు కర్ణాటక, చండీగఢ్లో దర్యాప్తు చేపట్టాయి. 2012లో చండీగఢ్ పీజీ మెడికల్ ఎంట్రన్స్ స్కామ్లో నిందితుడిగా ఉన్న విద్యార్థికి ఈ పరీక్షలో మెరుగైన ర్యాంకు రావడంతో అతడి పాత్రను అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ బృందం చండీగఢ్ బయలుదేరింది. మరోవైపు ఎన్టీఆర్ వర్సిటీ నిర్వహించిన పరీక్ష ప్రశ్నపత్రాలు కర్ణాటకలోని మంగళూరులో ఉన్న ఓ ప్రెస్లో ముద్రితమైనట్లు సీఐడీ గుర్తించింది. దీంతో దర్యాప్తు కోసం ఓ బృందం అక్కడికి బయలుదేరింది. క ర్ణాటక పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రెస్లో ఉన్న కొన్ని డాక్యుమెంట్లు, ఇతర సామగ్రిని అనధికారికంగా సీజ్ చేరుుంచారు. ఆ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రాలు రవాణా చేసే సందర్భంలో ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న సిబ్బందిని, వర్సిటీలో భద్రపరిచినప్పుడు విధుల్లో ఉన్న వారినీ ప్రశ్నించాలని సీఐడీ నిర్ణయించింది. స్కామ్ జరిగినట్లు ఆరోపిస్తున్న, ఆరోపణలు ఎదుర్కొంటున్న ర్యాంకర్లు, వారి తల్లిదండ్రుల్నీ ప్రశ్నించాలని నిర్ణయించిన సీఐడీ అధికారులు మంగళవారం కొందరి వాంగ్మూలాలు నమోదు చేశారు.