breaking news
srnagar
-
వైఎస్ షర్మిలకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: ► వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ఊరట లభించింది. ప్రగతి భవన్ను ముట్టడించేందుకు యత్నించిన వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న నాంపల్లి కోర్టు రిమాండ్ను రద్దు చేసి వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. షర్మిలతో పాటు మరో ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది. పాదయాత్ర సందర్భంగా టీఆర్ఎస్ నేతల తీరును నిరసిస్తూ మంగళవారం ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న క్రమంలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను అడ్డుకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడే ఆమెను అక్కడే అరెస్ట్ చేసిన పోలీసులు.. నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వైఎస్ షర్మిలను 14ఏసీ ఎంఎం మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు ఎస్ఆర్ నగర్ పోలీసులు. ఆమె రిమాండ్ ప్రధానాంశంగా వాదనలు సాగుతున్నాయి. తమ క్లయింట్ పై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్న వైఎస్ షర్మిల తరపు లాయర్లు వాదించారు. శాంతి యుతంగా నిరసన తెలపడానికి వెళ్తే అక్రమంగా అరెస్ట్ చేశారని, పోలీసుల తీరును తప్పుపట్టారు. అంతేకాదు.. గతంలో ఎమ్మెల్యే రాజాసింగ్ రిమాండ్ వ్యవహారాన్ని ఈ సందర్భంగా న్యాయవాది మెజిస్ట్రేట్ ముందు ప్రస్తావించారు. పోలీస్ విధులకు ఎక్కడ ఆటంకం తమ క్లయింట్ ఆటంకం కలిగించలేదని షర్మిల తరపు లాయర్లు పేర్కొన్నారు. అయితే.. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉన్నందునే ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముందస్తుగా సహకరించాలి అని కోరామని, కానీ, ఆమె, పార్టీ కార్యకర్తలతో న్యూసెన్సు క్రియట్ అయ్యిందని పోలీసులు తెలిపారు. ఇలాంటి సమయంలో రిమాండ్ విధించకపోతే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు, మెజిస్ట్రేట్ను కోరారు. వైఎస్ఆర్టీపీ కార్యకర్తల నిరసనల నేపథ్యంలో.. నాంపల్లి కోర్టు దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోర్టు ముందు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాంపల్లి కోర్టుకు వైఎస్ఆర్టీపీ లీగల్సెల్ చైర్మన్ వరప్రసాద్తో పాటు షర్మిల భర్త బ్రదర్ అనిల్ చేరుకున్నారు. ఏం జరిగిందంటే? సోమవారం టీఆర్ఎస్ నేతల దాడిలో ధ్వంసమైన కారును.. మంగళవారం తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ సీఎం క్యాంప్ ఆఫీస్కు షర్మిల బయలుదేరారు. ఈ నేపథ్యంలో రాజ్భవన్ రోడ్డులో వైఎస్ షర్మిలను అడ్డుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు అద్దాలు మూసివేసి వైఎస్ షర్మిల లోపలే కూర్చున్నారు. డోర్ లాక్ చేసి కారు దిగేందుకు నిరాకరించారు. దీంతో షర్మిల కారును క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఇదీ చదవండి: హైదరాబాద్లో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత -
వరకట్న వేధింపులు తాళలేక...
అమీర్పేట: వరకట్న వేధింపులు భరించలేక నవవధువు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్సపెక్టర్ వహీదుద్దీన్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మచిలీపట్నంకు చెందిన బ్రహ్మయ్య కూతురు భార్గవి(25)కి విజయవాడకు చెందిన నరేంద్రతో 9 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో నరేంద్రకు రూ.25 లక్షల నగదు, 20 తులాల బంగారం ఆధిబట్లలో ఓ ప్లాట్ కానుకగా ఇచ్చారు. భార్గవి మాదాపూర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తుండగా, నరేంద్ర మధురానగర్లోని వామన కన్సల్టెన్సీలో హెచ్ఆర్గా పనిచేస్తూ..రాజీవ్నగర్ స్వర్ణపురి కాలనీలో ఉంటున్నారు. అదనపు కట్నం కోసం నరేంద్ర భార్గవిని వేధిస్తూ రావడంతో ఆమె తల్లిదండ్రులు నెలరోజుల క్రితమే మరో రూ.5 లక్షలు ఇచ్చారు. అయినా అతను వేధింపులు మానకపోవడంతో మనస్థాపం చెందిన భార్గవి సోమవారం ఉదయం చున్నీతో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమీపంలోనే ఉంటున్న బంధువులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో మధ్యాహ్నం ఇంటికి వచ్చి తలుపులు తట్టగా సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు విరగొట్టి లోపలకు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె భర్త నరేంద్రను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.