ప్రమాదానికి కారణం ట్రావెల్స్ బస్సు డ్రైవరే
ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదానికి కారణం శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు డ్రైవరేనని ప్రకాశం జిల్లా ఏఎస్పీ రామానాయక్ తెలిపారు. ట్రావెల్స్ నిర్వాహకులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రమాద ఘటనా స్థలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు చెప్పారు. కాగా, కందుకూరు ప్రభుత్వాస్పత్రిలో మృతుల, క్షతగాత్రుల బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి.
కాగా, ప్రమాద విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మార్పీఎస్ తీవ్రంగా మండిపడింది. ఇంత ఘోరమైన ఘటన జరిగినా.. ప్రభుత్వాస్పత్రికి మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లి పరామర్శించకపోవడం సిగ్గుచేటని ఎమ్మార్పీఎస్ విమర్శించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల వంతున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపింది.
ఈ ప్రమాద ఘటనపై ప్రకాశం జిల్లా ఎస్పీతో ఏపీ డిప్యూటీ సీఎం, హోం మంత్రి చినరాజప్ప మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపాలని ఆదేశించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, డీఎంహెచ్ఓలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సమీక్షించారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించాలని ఆదేశించారు. చర్లోపల్లి ప్రమాదఘటనపై మంత్రి శిద్దా రాఘవరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.