breaking news
Sri Sathya Sai Trust
-
సేవకు ప్రతిరూపం... ఆధ్యాత్మిక కెరటం
సత్యసాయిబాబా తన జీవన ప్రస్థానంలో సత్య ధర్మ శాంతి ప్రేమలనే విలువలను బోధిస్తూ, మానవాళిని విలువైన జీవన మార్గం వైపు పయనింపజేశారు. ఆధ్యాత్మిక బోధనలతో అజ్ఞానాంధకారాన్ని పారదోలుతూ భక్త కోటిలో చైతన్యకాంతులు నింపారు. ప్రేమను పంచే ప్రేమమూర్తిగా, సేవకు ప్రతి రూపంగా; ఉచితంగా తాగునీరు, విద్య, వైద్య సేవలను అందించి సేవాప్రదాతగా కీర్తి గడించారు. పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఆపదలో భక్తులను ఆదుకునే ఆపద్బాంధవుడిగా, ఆరాధ్య దైవంగా భక్తుల మదిలో గూడుకట్టుకున్న సత్యసాయి నిర్యాణం చెంది పద్నాలుగేళ్లు పూర్తవుతున్నా, భక్తులు మాత్రం ఆయననే తమ శ్వాసగా, ధ్యాసగా కొలుస్తున్నారు. సత్యసాయి జయంతిని ఎంతో పవిత్రంగా భావించే భక్తులు పుట్టపర్తిలో జరుగుతున్న జయంతి వేడుకలకు తరలి వచ్చి భక్త నీరాజనాలు అర్పిస్తున్నారు.కరవుకు నిలయమైన అనంతపురం జిల్లాలోని అప్పటి కుగ్రామమైన పుట్టపర్తిలో 1926 నవంబర్ 23న ఈశ్వరాంబ, పెద్ద వెంకమరాజు దంపతులకు సత్యసాయి జన్మించారు. బాల్యం నుంచి ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉన్న సత్యసాయి, తన 14 వ ఏట తాను సత్యసాయి బాబాను, భూమిపై ధర్మ పరిరక్షణకు అవతరించినట్లు ప్రకటించుకున్నారు. నాటి నుంచి పుట్టపర్తిలో మందిరం ఏర్పాటు చేసుకుని ఆధ్యాత్మిక బోధనలు వినిపిస్తూ, తనను ఆరాధించే భక్తులను దగ్గరకు చేర్చుకున్నారు.మానవ సేవయే మాధవ సేవ అని బోధించిన సత్యసాయి, ఒక వైపు ఆధ్యాత్మిక బోధనలతో మానవాళిని చైతన్యవంతులను చేస్తూనే, కనీస అవసరాలకు నోచుకోని బడుగు జీవులకు సేవలందించే మహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 1972లో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ను ప్రారంభించారు. అప్పటి నుంచి విద్య, వైద్యం, తాగునీరు ఉచితంగా అందించే కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రకృతి విపత్తులు సంభవించే సమయాల్లో తన సేవాదళ్ విభాగాల ద్వారా బాధితులకు సేవలు అందిస్తున్నారు.కేజీ నుంచి పీజీ వరకువిద్య మనిషిని అవివేకం నుంచి వివేకవంతుణ్ణి చేస్తుందని విశ్వసించిన సత్యసాయిబాబా.. పుట్టపర్తి కేంద్రంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా మానవతా విలువలతో కూడిన విద్యను అందించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. పుట్టపర్తిలో సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ యూనివర్శిటీని (డీమ్డ్ టు బి యూనివర్సిటీ) ఏర్పాటు చేశారు. పుట్టపర్తి, నందిగిరి, అనంతపురం, బెంగళూరు సమీపాన బృందావనం వద్ద నాలుగు క్యాంపస్లు నిర్వహిస్తున్నారు. అనంతపురం క్యాంపస్ ద్వారా మహిళా విద్యను ప్రోత్సహిస్తున్నారు.ప్రతి ఏటా సుమారు పదివేల మందికి పైగా విద్యార్థులు సత్యసాయి విద్యాసంస్థల ద్వారా ఉచిత విద్యను పొందుతున్నారు. దేశీయంగా గ్రామీణ ప్రాంతాలలో సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా ఉన్న మారుమూల ప్రాంతాలలో విలువలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో 2010లో విద్యావాహిని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం దేశీయంగా 126 పాఠశాలలు ఈ పథకం ద్వారా విద్యను అందిస్తున్నాయి. ఈ సంస్థల ద్వారా విద్యను పొందిన ఎందరో విద్యార్థులు నేడు ఉన్నత స్థానాలలో సేవలు అందిస్తున్నారు.పైసా ఖర్చు లేకుండా‘వైద్యో నారాయణ హరి’ అనే నానుడిని సాకారం చేస్తూ సత్యసాయి ఉచిత వైద్యసేవకు ప్రాధాన్యం ఇచ్చారు. పుట్టపర్తి ప్రాంతంలో పేదలు వైద్యం అందక బాధలు పడుతున్నారని, ఒక ఆసుపత్రి నిర్మించాలని తల్లి ఈశ్వరాంబæకోరగా, తన తల్లికి ఇచ్చిన మాటకు కట్టుబడి పుట్టపర్తిలో 1956లో పుట్టపర్తి నడిబొడ్డున 30 పడకల జనరల్ ఆసుపత్రి నిర్మించారు. తర్వాత 1991లో ఆధునిక వసతులతో కూడిన శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని స్థాపించారు. ఈ ఆసుపత్రుల ద్వారా రోగులు ఉచితంగా ఖరీదైన వైద్యసేవలు పొందుతున్నారు.ఉచిత తాగునీటి సరఫరానిత్యం కరవుతో అల్లాడే రాయలసీమలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవు. రాయలసీమ ప్రజల కష్టాలను చూసి చలించిన సత్యసాయి 1995 నవంబర్లో రాయలసీమ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు సత్యసాయి తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో సుమారు 1,400 గ్రామాలు ఈ పథకం ద్వారా తాగునీటిని పొందుతున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైకి కూడా తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా కండలేరు నుంచి ‘సత్యసాయి తాగునీరు’ సరఫరా అవుతోంది. ప్రతిరోజూ సుమారు 20 లక్షల మంది సత్యసాయి తాగునీటి పథకం వినియోగించుకుంటున్నారంటే.. సాయి సంకల్పం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. -
సత్యసాయి ట్రస్ట్ ప్రేమను పంచడంలో ప్రపంచానికి దిక్సూచి
శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రేమ, శాంతి, సత్యం, ధర్మం తదితర ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. సాంకేతికతను ఆధారంగా చేసుకుని నిమిషాల వ్యవధిలోనే ప్రపంచ వ్యాప్తంగా సాయి నామస్మరణ పాటిస్తున్నారు. మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్ ఆధ్వర్యంలో బాబా ఆశయాలను ఆధునిక రూపంలో ముందుకు తీసుకెళ్తూ ప్రపంచానికి ప్రేమ, సేవా, సత్య సందేశాన్ని విస్తరిస్తున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నిర్మించిన ప్రశాంతి నిలయం ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా, మానవ సేవకు ఉదాహరణగా నిలుస్తోంది.విరివిగా డిజిటల్ వినియోగం» డిజిటల్ కమ్యూనికేషన్ సెంటర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా భక్తులతో ఆన్ లైన్ సత్సంగాలు, ప్రసంగాలు.» సౌర శక్తి వ్యవస్థల ద్వారా పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తి.» స్మార్ట్ కంట్రోల్ యూనిట్స్ ద్వారా ఆశ్రమంలో విద్యుత్, నీటి వినియోగ నియంత్రణ.సూపర్ స్పెషాలిటీ (ప్రశాంతిగ్రామ్ – వైట్ఫీల్డ్) ఆసుపత్రుల్లో రోబోటిక్ సర్జరీ సిస్టమ్స్, అధునాతన హృద్రోగ శస్త్ర చికిత్సల పరికరాలు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్, క్యాథ్ ల్యాబ్స్.» రోగుల వైద్య వివరాలు పూర్తిగా కంప్యూటరైజ్డ్ చేసి వేగవంతమైన సేవలు అందిస్తున్నారు.» ఇక్కడ అన్ని వైద్య సేవలను ఉచితంగా అందించడం ప్రపంచానికే ఆదర్శం.» శస్త్రచికిత్స అనంతరం రోగి వేగంగా కోలుకోవడం, కచ్చితమైన ఫలితాలు సాధించడం.» సత్యసాయి విద్యాసంస్థల్లో విలువల ఆధారిత సమగ్ర విద్యను అందించడం.» విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, ఆత్మవికాసం, సేవాస్ఫూర్తి కలిగించడం.» విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు విద్యాసహాయం.» శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, ప్రశాంతి నిలయం ఆధ్వర్యంలో 9 గ్రామీణ బాల సంరక్షణ కేంద్రాలు (అంగన్వాడీలు) పునర్నిర్మించారు.అంతర్జాతీయ సేవా విస్తరణభారతదేశంతో పాటు విదేశాలలో కూడా ట్రస్ట్ సేవా కార్యక్రమాలను విస్తరించడం. విద్య, ఆరోగ్య, శాంతి సదస్సులు, ఆహార సహాయం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. భగవాన్ శ్రీసత్యసాయి బాబా మహా సమాధి తర్వాత కూడా మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్జే రత్నాకర్ నేతృత్వంలో ట్రస్ట్ భగవాన్ ఆశయాలను కొనసాగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను మరింత విస్తరించింది.కొనసాగుతున్న బాబా ఆశయాలుశ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టుకు ప్రస్తుతం ఆర్.జె.రత్నాకర్ మేనేజింగ్ ట్రస్టీగా కొనసాగుతున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహా సమాధి పొందిన తర్వాత ఆయన ఆశయాలను రత్నాకర్ ముందుకు తీసుకువెళుతున్నారు. బాబా ఆశయాల మేరకు పలు సేవారంగాలలో బాబా ప్రారంభించిన సేవలను కొనసాగిస్తున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నిర్యాణం పొందిన తర్వాత గడచిన పద్నాలుగేళ్లలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రభుత్వంతోను, ఇతర సంస్థలతోను చేతులు కలిపి పలు కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది. ఒడిశాలో 2012–13లో వరద ముంపు బారిన పడ్డ గ్రామాల్లో ఇళ్లు కోల్పోయిన వారికి మూడువందల ఇళ్లను నిర్మించింది. కేరళలో 2018లో వరదలు సంభవించిన సుమారు పది గ్రామాల్లో నర్సరీ స్కూళ్ల పునరుద్ధరణ చేపట్టడమే కాకుండా, తొమ్మిది అంగన్వాడీ కేంద్రాలను నిర్మించింది. మరోవైపు అనంతపురం జిల్లాలోని మరో 118 జనావాసాలకు తాగునీటి సరఫరాను విస్తరించింది. పుట్టపర్తిలో నీటిఎద్దడిని తీర్చడానికి 52 ఆర్ఓ వాటర్ ప్లాంట్లను నెలకొల్పింది. అలాగే, శ్రీ సత్యసాయి ఎన్టీఆర్ సుజల పథకం కింద జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 1690 ఇళ్లకు సురక్షితమైన తాగునీటి సరఫరా కోసం ఎనిమిది నీటిశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒడిశాలోని కేంద్రపొడా జిల్లాకు చెందిన రెండు కుగ్రామాల్లో రెండు తాగునీటి సరఫరా కేంద్రాలను, నువాపడా జిల్లాలో ఐదు తాగునీటి సరఫరా కేంద్రాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు నెలకొల్పింది. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు 2019–20లో తెలంగాణలోని బెజ్జంకిలో ఉన్న శ్రీ సత్యసాయి గురుకుల విద్యానికేతన్, ఆంధ్రప్రదేశ్లోని పలాసలో ఉన్న శ్రీ సత్యసాయి విద్యావిహార్ పాఠశాలలతో పాటు కర్ణాటకలోని మైసూరులో ఉన్న భగవాన్ బాబా మహిళా మక్కల కూట ట్రస్టుకు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్లోని తాడిపత్రిలో గ్రామీణ వృత్తి విద్యా శిక్షణ కేంద్రానికి భవన నిర్మాణం కోసం రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించింది.శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు 2021–22లో తొమ్మిదేళ్లు కొనసాగే శ్రీ సత్యసాయి సమీకృత విద్యా కార్యక్రమాన్ని రూ.5.6 కోట్ల వ్యయంతో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా దివ్యాంగ బాలలకు ఉపయోగపడేలా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం 2020లో జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ట్రస్టు చేపట్టింది. ‘కరోనా’ కాలంలో సేవలు‘కరోనా’ మహమ్మారి వ్యాపించిన కాలంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రజలకు సేవలు అందించడానికి సత్వరమే రంగంలోకి దిగింది. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ‘కరోనా’ రోగుల కోసం అనంతపురం జిల్లాలో రూ.2 కోట్ల వ్యయంతో తొలి ప్రైవేటు క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే, ప్రధాన మంత్రి సహాయనిధికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చింది. ‘కరోనా’ కాలంలో ఇక్కట్లు పడిన వలస కార్మికులు సహా నిరుపేదలను ఆదుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ సత్యసాయి ట్రస్టులకు కోటి రూపాయలు ఇచ్చింది. లద్దాఖ్లోని మహాబోధి అంతర్జాతీయ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలోని మహాబోధి కరుణా చారిటబుల్ ఆసుపత్రికి విడతల వారీగా రూ.2 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. అలాగే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి సంవత్సరంలో దేశవ్యాప్తంగా కోటి మొక్కలను నాటడం కోసం శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్తో కలసి ట్రస్టు ‘శ్రీ సత్యసాయి ప్రేమతరు’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సత్యసాయిట్రస్ట్ ఆధ్వర్యంలోసేవా కార్యక్రమాలు -
సమాజ సేవే.. విద్యార్థి ధర్మం: భగవాన్ శ్రీసత్యసాయిబాబా
భారతదేశంలో ప్రాచీనకాలంలో వర్ధిల్లిన గురుకుల వ్యవస్థకు ప్రతిరూపంగా శ్రీ సత్యసాయి విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. ఉపాధి కోసం కావలసిన భౌతిక జ్ఞానం సంపాదించుకుంటే సరిపోదు. విద్యార్థి జీవితంలో నిజమైన ఆనందం పొందాలంటే, జ్ఞానాన్ని సమాజ సేవకు వినియోగించాలని మన ప్రాచీన గురువులు తెలుసుకున్నారు. అందుకే వారు విద్యాబోధనతో పాటు ధార్మికత, బాధ్యత, నైతిక విలువలతో విద్యార్థుల సౌశీల్యాన్ని పెంపొందించడమే విద్యకు గల పరమలక్ష్యంగా భావించేవారు. ఈ ప్రాచీన విలువల ప్రాతిపదికనే శ్రీ సత్యసాయి విద్యా సంస్థలను భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఏర్పాటు చేశారు.‘సా విద్యా యా విముక్తయే’ అని వేదోక్తి. అంటే, విద్యతోనే మనిషికి విముక్తి సాధ్యం. మనిషిని విముక్తి వైపు నడిపించేదే నిజమైన విద్య. నేటికాలంలో విద్య వాణిజ్యంగా మారింది. సమాజం భౌతికంగా అభివృద్ధి చెందుతున్నా, నైతికంగా పతనమవుతోంది. సత్యం, ధర్మం, కృతజ్ఞత, భక్తి వంటి ఉన్నత విలువలు వెనుకబడిపోయి; ధనాసక్తి, అధికారదాహం పెచ్చుమీరుతున్నాయి. విద్యార్థులలో పెరుగుతున్న అశాంతి, నిరాశ, ఆందోళన– విద్యా వ్యవస్థ తన లక్ష్యాన్ని కోల్పోయిందనేందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.ఎడ్యుకేర్ – బాబా ఆవిష్కరించిన విద్యా సూత్రంవిద్యారంగంలో విలువలను పునరుద్ధరించాలనే సంకల్పంతో శ్రీ సత్యసాయిబాబా ‘ఎడ్యుకేర్’ భావనను ప్రవేశపెట్టారు. ‘ఎడ్యుకేర్’ లాటిన్ పదం. దీని అర్థం ‘మనలో దాగి ఉన్నదానిని వెలికి తీయడం’. శ్రీ సత్యసాయి విద్యాసంస్థల్లో ఈ విధానం విద్యార్థుల్లో ఉన్న అంతర్గత జ్ఞానాన్ని వెలికితీసి, వారిలో ఉన్నత విలువలను పాదుకొల్పడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇది కేవలం అకాడమిక్ విద్య కాదు, మనసు, హృదయం, చేతులు అనే మూడు కోణాల సమగ్రాభివృద్ధి.శ్రీ సత్యసాయి విద్యాసంస్థల ఆవిర్భావంశ్రీ సత్యసాయిబాబా 1981లో అప్పటికే అనంతపురం, వైట్ఫీల్డ్, పుట్టపర్తిలలో ఉన్న కళాశాలలన్నింటినీ ఏకీకృతం చేసి, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (డీమ్డ్ యూనివర్సిటీ) నెలకొల్పారు. ఆ తర్వాత రెండేళ్లకు శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రారంభించారు. ఈ సంస్థల్లో ప్రైమరీ స్థాయి నుంచి పోస్ట్ డాక్టరల్ స్థాయి వరకు విద్యాబోధన జరుగుతుంది. ఈ సంస్థల్లో విద్య పూర్తిగా ఉచితం. విద్యార్థులు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన పని ఉండదు. శ్రీ సత్యసాయి విద్యాసంస్థల విశిష్టతకు ఇదే నిదర్శనం.శ్రీ సత్యసాయి విద్యావాహిని దేశంలోని ప్రతి విద్యార్థికి సమగ్ర విద్యను అందించాలనే సంకల్పంతో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 2010 నవంబర్ 23న ‘శ్రీ సత్యసాయి విద్యావాహిని’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ సత్యసాయి విద్యా సంస్థలు విలువలతో కూడిన విద్యను, ప్రావీణ్యాన్ని అందించడంలో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. ఈ సంస్థల్లో విజయవంతమైన విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడానికి సత్యసాయి విద్యావాహిని కార్యక్రమాన్ని చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని, సత్యసాయి విద్యావిధానాన్ని ప్రతి పాఠశాలకు, ప్రతి గురువుకు, ప్రతి విద్యార్థికి చేరవేయడానికి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.ఉన్నతమైన నైతిక విలువలు, ఆధ్యాత్మిక దృక్పథం, సామాజిక సేవా సంసిద్ధత కలిగిన సచ్ఛీలురైన భావి పౌరులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి విద్యావాహిని కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా తయారయ్యే విద్యార్థులు కేవలం విద్యార్హతలు మాత్రమే కలిగిన వారిగా కాకుండా; దేశసేవ పట్ల తపన, బాధ్యతాయుతమైన పౌరచైతన్యం, సమగ్రత, ప్రేమ, దయ, సహానుభూతితో కూడిన సమగ్ర వ్యక్తులుగా ఎదగాలనేదే దీని సంకల్పం. విలువలతో కూడిన సార్వత్రిక విద్యను ఉచితంగా అందించడమే శ్రీ సత్యసాయి విద్యావాహిని మూలసిద్ధాంతం. ఈ కార్యక్రమం కింద ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మానవీయ విలువలతో కూడిన పాఠ్యాంశాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉచితంగా అందిస్తుంది.సాంకేతిక సహకారంతో సేవ సత్యసాయి విద్యావాహిని కార్యక్రమంలో ఉన్నత విద్య, శిక్షణ, సాంకేతిక నైపుణ్యం, అనుభవం కలిగిన స్వచ్ఛంద సేవకులు అంకితభావంతో సేవలు అందిస్తున్నారు. ‘అందరికీ సమీకృత విద్య’ అనే బాబా ఆశయాన్ని సాకారం చేయడానికి నిస్వార్థంగా కృషి చేస్తున్నారు. ఇది సాధారణమైన విద్యా కార్యక్రమం కాదు, భారతీయ విద్యా వ్యవస్థను సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి అనే విలువలతో పునరుజ్జీవింపజేసే మహాయజ్ఞం. ‘విద్య అనేది కేవలం ఉపాధి కోసమే కాదు, అది దైవత్వానికి, సేవకు, సమగ్రతకు దారి చూపాలి’ అనే ప్రాచీన భారతీయ మౌలిక సూత్రానికి ఆధునిక కార్యాచరణ ప్రస్థానం.శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ విద్యాసంస్థలుపుట్టపర్తి, అనంతపురం, నందిగిరి, బెంగళూరులలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఉచిత రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ విద్యాసంస్థలను నిర్వహిస్తోంది. మానవీయ విలువలు, నైతికతలకు ప్రాధాన్యమిస్తూ ఈ విద్యాసంస్థల్లో బోధన కొనసాగుతోంది. పాఠ్యాంశాల బోధన మాత్రమే కాకుండా, పాఠ్యేతర కార్యకలాపాల ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ, త్యాగస్ఫూర్తి, సామాజిక సేవా నిబద్ధతలను పెంపొందించేలా ఈ సంస్థలు విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి. వీటిలో చదువుకునే విద్యార్థులు తమ విద్యాసంస్థలకు సమీపంలో ఉన్న గ్రామాలను సందర్శించి, తప్పనిసరిగా అక్కడ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ను బోధిస్తారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న విద్యాసంస్థలు ఇవీ...శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్, పుట్టపర్తి ఇది బాల బాలికల కోసం ప్రారంభించిన నాన్ రెసిడెన్షియల్ పాఠశాల. తొలుత దీనిని 1972లో తెలుగు మీడియం పాఠశాలగా బాబా తల్లి పేరిట ప్రారంభించారు. తర్వాత 2010లో సీబీఎస్ఈ సిలబస్ ప్రకారం ఇంగ్లిష్ మీడియం పాఠశాలగా మార్చారు. ఇందులో ఇంగ్లిష్ మీడియం మొదటి బ్యాచ్ 2010 జూన్ 10న ప్రారంభమైంది. పుట్టపర్తి, చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకుంటుంటారు.శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్, పుట్టపర్తి ఇది బాల బాలికల కోసం నెలకొల్పిన రెసిడెన్షియల్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల. ఇందులో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యాబోధన జరుగుతుంది.శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖ గుర్తింపు పొందిన స్వయంప్రతిపత్తి సంస్థ. ఇది పుట్టపర్తి, వైట్ఫీల్డ్–బెంగళూరు, నందిగిరి, అనంతపురం క్యాంపస్లలో పనిచేస్తోంది.ఇది విద్యార్థులకు ఉచితంగా గ్రాడ్యుయేట్, పోస్ట్గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తుంది. ఈ క్యాంపస్లలోని విద్యా వ్యవస్థ పూర్వకాలపు గురుకుల విద్యావ్యవస్థను పోలి ఉంటుంది. ఇక్కడ విద్యాబోధనతో పాటు వ్యక్తిత్వ వికాసానికి కూడా సమాన ప్రాధాన్యం ఉంటుంది. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ పుట్టపర్తి క్యాంపస్లో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ (సీఆర్ఐఎఫ్) ఉంది. అధునాతన పరిశోధన వసతులు ఈ సంస్థ ప్రత్యేకత. శ్రీ సత్యసాయి మీర్పురి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్, పుట్టపర్తి ఈ సంగీత కళాశాల 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. ఇది వివిధ సంగీత విభాగాలలో ఫౌండేషన్, డిప్లొమా, బ్యాచిలర్స్, మాస్టర్స్ కోర్సులను అందిస్తుంది. దీనిని 2017లో సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్లోని ఒక విభాగంగా మార్చారు.ఇతర రాష్ట్రాలలో శ్రీ సత్యసాయి పాఠశాలలుశ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని స్టేట్ ట్రస్టులు దేశంలోని వివిధ రాష్ట్రాలలో పాఠశాలలను నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్, ఇండోర్, ముంబై, దక్షిణ కన్నడ తదితర ప్రాంతాల్లో శ్రీ సత్యసాయి పాఠశాలలు నడుస్తున్నాయి. మీ తల్లిదండ్రులను గౌరవించండి.. గురువులను ఆరాధించండి..సమాజానికి సేవ చేయండి..ఇదే నిజమైన విద్యార్థి ధర్మం.‘గురువు ఇచ్చేది జ్ఞానం మాత్రమే కాదు, జీవన మార్గం చూపే వెలుగు’ అనేదివిద్యార్థులకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా తరచుగా చేసే ఉద్బోధ.రతన్ టాటా చేతుల మీదుగా శ్రీ సత్యసాయి విద్యా వాహిని ప్రారంభంశ్రీ సత్యసాయిబాబా 2010లో తన పుట్టినరోజు సందర్భంగా శ్రీ సత్యసాయి విద్యావాహిని కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమ రూపకల్పనకు టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా ఇతోధికంగా సహాయ సహకారాలందించారు. శ్రీ సత్యసాయి విద్యావాహిని కార్యక్రమం కింద 2023 నవంబర్లో దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో నైపుణ్యాలను పంచుకోవడానికి ఎన్సీఈఆర్టీ, సీఐఈటీలతో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. -
శ్రీ సత్యసాయి ట్రస్ట్ ద్వారా అతున్యత వైద్య సేవలు
వైద్యులు త్యాగ స్ఫూర్తితో పేదలకు సేవ చేయాలి. దీనికంటే గొప్ప సేవ మరొకటి లేదు. దిక్కులేని వారికి, నిస్సహాయులకు దేవుడే ఏకైక ఆశ్రయం. మానవుడు దేవుని స్వరూపం కాబట్టి, దిక్కులేని వారికి, నిస్సహాయులకు సహాయం చేయడం అతని ప్రాథమిక కర్తవ్యం. – శ్రీ సత్యసాయి బాబా‘సేవే సత్యసాధన’ అనే సూత్రంతో, సమాజంలో ఆర్థిక, సామాజిక స్థాయులకు అతీతంగా అందరికీ ఉచితంగా ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ విస్తృతంగా కృషి చేస్తోంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా స్థాపించిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, మానవాళి సేవలో అగ్రగామిగా నిలిచిన ఒక పుణ్య సంస్థ. ‘ప్రేమతో చేసే సేవే నిజమైన సేవ’ అనే సూత్రాన్ని ఆచరణలో అమలు చేస్తూ, ఈ ట్రస్ట్ సమాజంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారం లేకుండా ఉచిత వైద్య సేవలను అందిస్తోంది.శ్రీ సత్యసాయి మెడికల్ మిషన్ లక్ష్యాలుపేద ప్రజల ఇంటి ముంగిటకు సమగ్ర ఆరోగ్య సంరక్షణను సాధించడం.ఆరోగ్యం – పరిశుభ్రతతో సహా నివారణ ఆరోగ్య సంరక్షణపై ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ల ద్వారా అనారోగ్యానికి దూరంగా ఎలా ఉండాలో ప్రజలకు అవగాహన కల్పించడం.ఆరోగ్య సంరక్షణ అమలులో అనుసరించే సూత్రాలు :శ్రీ సత్యసాయి బాబా అమలు చేసిన ఆరోగ్య సంరక్షణకు ఈ కింది ఆరు సూత్రాలే మార్గదర్శకాలు. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆరోగ్య సంరక్షణ సంస్థల కార్యకలాపాలలో శ్రద్ధగా అనుసరిస్తారు. అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ ఉచిత ఆరోగ్య సంరక్షణ కారుణ్య ఆరోగ్య సంరక్షణ సమగ్ర ఆరోగ్య సంరక్షణ సకాలంలో ఆరోగ్య సంరక్షణ అందించడం వైద్యుడికి, రోగికి మధ్య హృదయపూర్వక, ప్రేమపూర్వక సంబంధాన్ని పెంపొందించడమే వైద్యసేవల ఉద్దేశం. శ్రీ సత్యసాయి మెడికల్ మిషన్ సమగ్ర ఆరోగ్య సంరక్షణ, వైద్య చికిత్సలను క్రమం తప్పకుండా అందించడం ద్వారా ఈ అంశాన్ని వివరిస్తుంది. శ్రీ సత్యసాయి ఆసుపత్రులలోని సంరక్షణలో మానవీయ అంశ స్పష్టంగా కనిపిస్తుంది.శ్రీ సత్యసాయి హెల్త్ కేర్ త్రికోణ విధానంశ్రీ సత్యసాయి హెల్త్ కేర్ ఒక సమగ్ర విధానాన్ని కలిగి ఉంది, ఇది కింది మూడు కోణాల విధానం ద్వారా అమలవుతోంది. నివారణ కార్యాచరణ, నివారణ దృష్టి, ఆధ్యాత్మిక స్థావరం వ్యక్తిగత స్థాయి, కుటుంబ స్థాయి, సమాజ స్థాయి వంటి అన్ని స్థాయులలోను ఆరోగ్య విద్యకు సత్యసాయి ఆసుపత్రులు ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. అలాగే, అన్ని స్థాయులలోనూ స్క్రీనింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు అసంఖ్యాక రోగులకు శ్రీ సత్యసాయి సేవా మెడికల్ మిషన్ ఆశాకిరణంగా నిలుస్తోంది. ఈ సంస్థ అందించే వైద్యసేవలు ఇవీ:వివిధ రాష్ట్రాలలో నిర్వహించే వైద్య శిబిరాలు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జన్మదిన వేడుకల సందర్భంగా వైద్య శిబిరాలు, స్పెషాలిటీ శిబిరాలు, గ్రామ సేవలో భాగంగా శిబిరాలు, శ్రీసత్యసాయి విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్తో వైద్య కార్యకలాపాల ఏకీకరణ, వ్యక్తిగత వైద్యుల క్లినిక్లు, అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద చికిత్స కేంద్రాలు కూడా ఇందులో భాగంగా పనిచేస్తున్నాయి. వీటితో పాటు శ్రీ సత్యసాయి మొబైల్ హెల్త్ సర్వీసెస్, టెలీ–మెడిసిన్ సేవలు, రక్తదాన శిబిరాలు (లిక్విడ్ లవ్ డొనేషన్ శిబిరాలు), సాయి పునరావాస కార్యక్రమాలు, పోషకాహార లోపం నిర్మూలన, విపత్తు నిర్వహణ తదితర సేవలను అందించడంలో ముందంజలో ఉంటున్నాయి.నివారణ ఆరోగ్య సంరక్షణ శ్రీ సత్యసాయి మొబైల్ హెల్త్ కేర్ సర్వీసెస్ చికిత్సలో భాగంగా వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణతో పాటు ప్రివెంటివ్ మెడిసిన్పై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత వంటి ప్రాథమిక ఆరోగ్య విధానాలపై గ్రామస్థులలో అవగాహన కల్పించడానికి నిపుణులతో ప్రసంగాలు, ప్రదర్శనలు, వీడియో ప్రదర్శనలు నిర్వహిస్తారు. మద్యపానం, ధూమపానం, పొగాకు నమలడం వంటి దురలవాట్ల వల్ల కలిగే దుష్ప్రభావాలపై కూడా వారికి అవగాహన కల్పిస్తారు.జనరల్ హాస్పిటల్స్ గ్రామీణ వైద్య సేవలుపుట్టపర్తిలో 1956లో స్థాపించిన శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్, 1976లో ప్రారంభమైన వైట్ఫీల్డ్ జనరల్ హాస్పిటల్, మహిళలు, పిల్లలు, వృద్ధులు, గ్రామీణ ప్రజలకు సాధారణ చికిత్సల నుంచి ప్రసూతి సేవల దాకా అన్ని వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నాయి. అలాగే, ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న మొబైల్ ఆసుపత్రులు దూర గ్రామాలకు చేరుకుని అక్కడ ప్రజలకు వైద్యపరీక్షలు, మందులు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉచిత వైద్యానికి ప్రతీకలు1991 నవంబర్ 22న భగవాన్ బాబా చేత శ్రీ సత్యసాయి ఇ¯Œ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ – పుట్టపర్తి ప్రారంభించబడింది.ఈ ఆసుపత్రి గుండె, మూత్రపిండాలు, న్యూరో, యూరాలజీ వంటి క్లిష్టమైన వ్యాధులపై అత్యాధునిక శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తుంది.ఆ తర్వాత 2001లో బెంగళూరులోని వైట్ఫీల్డ్లో మరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్థాపించబడింది. అక్కడ కూడా గుండె సంబంధిత శస్త్రచికిత్సలు, కేర్ యూనిట్లు ప్రపంచస్థాయి సదుపాయాలతో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.ఈ రెండు ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు లక్షలాది మంది రోగులు ఉచితంగా చికిత్స పొందారు. ప్రతి రోగికి బాబా ఆశీర్వాదం, వైద్యుల సేవానిరతి కలసిన మానవతా వాతావరణం అక్కడ ప్రతి మూలలోనూ కనిపిస్తుంది.ఉచిత వైద్య శిబిరాలుభగవాన్ నిస్వార్థ సేవకు ఉదాహరణగా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా చాలామంది తమ తోటి మానవులకు సేవ చేయడానికి ప్రేరణ కల్పించారు. భారతదేశంలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు వైద్యసంరక్షణ అందుబాటులో లేని ప్రాంతాలలో ఉచిత వైద్యశిబిరాలను నిర్వహిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్యం, పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. భగవాన్ ప్రేమ, ఆశీస్సులతో ఈ సంస్థల సేవకులు నిశ్శబ్ద ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టిస్తున్నారు. ఆరోగ్యప్రచారం, విద్య, శస్త్రచికిత్సలు, ఆరోగ్య సంరక్షణ సహా అన్నిరకాల ఆరోగ్యసేవలను నిర్వహించడానికి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రమం తప్పకుండా వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ రోగులకు ఉచితంగా మందులు ఇస్తున్నారు. లక్షలాది మంది రోగులకు కంటి వ్యాధులకు చికిత్స, వేలాది మందికి కంటిశుక్లాల శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు చెందిన వివిధ సమితిలు వివిధ ప్రాంతాలలో ఉచిత వైద్యకేంద్రాలను నిర్వహిస్తున్నాయి.భగవాన్ జన్మదిన వేడుకల సందర్భంగా వైద్య శిబిరాలుప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జన్మదిన వేడుకలలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా వేలాది మంది రోగులకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు అందిస్తారు. ఈ శిబిరాలకు రోగ నిర్ధారణ పరీక్షల కోసం వచ్చిన వారిలో ఎవరికైనా అధునాతన చికిత్స అవసరమైతే, వారిని శ్రీ సత్యసాయి జనరల్ ఆసుపత్రికి పంపుతారు.ప్రశాంతి నిలయం లేదా ప్రశాంతిగ్రామ్లోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ పురోగతిని సమీక్షించడానికి, శ్రీ సత్యసాయిబాబా బోధనలను గుర్తు చేసుకోవడానికి వైద్య శిబిరంలోని ప్రతి ఒక్కరితో రోజూ సాయంత్రం సత్సంగ్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లోనూ స్వామి జన్మదిన వేడుకల సందర్భంగా మారుమూల గ్రామాలకు వైద్య సేవలను విస్తరించడానికి ఎంపిక చేసిన గ్రామాల్లో దాదాపు పది రోజులు మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తారు. సాధారణ శస్త్రచికిత్సలు, కంటిశుక్లం రోగులను సమీప పట్టణాలకు తీసుకువచ్చి శస్త్రచికిత్సలు ఉచితంగా చేయిస్తారు.శ్రీ సత్యసాయి మొబైల్ హాస్పిటల్స్శ్రీ సత్యసాయి మొబైల్ హాస్పిటల్ అనేది మరొక ప్రత్యేకమైన ఉచిత గ్రామీణ ఆరోగ్యసేవ. శ్రీ సత్యసాయి బాబా ఈ సేవలను 2006 మార్చి 3న ప్రారంభించారు. వారానికి ఒకసారి శ్రీ సత్యసాయి ఉచిత వైద్య క్లినిక్లను అనేక సమితిలు నిర్వహిస్తున్నాయి.టెలీమెడిసిన్టెలీమెడిసిన్ కేంద్రాలు నేరుగా వైద్య చికిత్సలను అందించవు. రోగులు ఎవరైనా వీటిని సంప్రదిస్తే, వారికి తగిన ఆసుపత్రులను సూచించడం, అక్కడ లభించే చికిత్స వివరాలను తెలియజేయడం సహా అవసరమైన సమాచారాన్ని అందిస్తాయి.వివిధ సంస్థలలో వైద్య పరీక్షలువివిధ రాష్ట్రాలకు చెందిన శ్రీ సత్యసాయి సంస్థల వైద్య బృందాలు అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, కుష్టు వ్యాధిగ్రస్థుల నివాసాలు తదితర ప్రదేశాలను తరచు సందర్శించి, అక్కడి వారికి అవసరమైన వైద్య సేవలను అందిస్తాయి. సాధారణ వైద్య శిబిరాలతో పాటు స్థానిక గ్రామీణ పాఠశాలల విద్యార్థులకు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఆరోగ్య సేవలతో పాటు వ్యక్తిగత సంరక్షణ, ఉద్యోగ సంరక్షణ, విద్యా సంరక్షణ, ఆధ్యాత్మిక సంరక్షణ, వ్యవసాయ సంరక్షణ, సామాజిక సంరక్షణ వంటి సేవలన్నీ శ్రీ సత్యసాయి విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్తో అనుసంధానమై పనిచేస్తుంటాయి.సేవకు ప్రతీక సత్యసాయి వైద్య మిషన్సత్యసాయి ట్రస్ట్ వైద్య సేవలు కేవలం రోగాన్ని నయం చేయడమే కాదు, ప్రేమతో, కరుణతో రోగికి మానసిక బలాన్ని కూడా అందిస్తున్నాయి. ఇందులో పనిచేసే వైద్యు లందరూ సేవా భావంతో పనిచేస్తున్నారు. కుల మత ఆర్థిక వ్యత్యాసాలకు తావు లేకుండా, ప్రతి ఒక్కరూ భగవాన్ బాబా సూత్రం ప్రకారం ‘మానవుడు దేవుని రూపం’ అనే దృష్టితోనే సేవలను అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆరోగ్య సేవలు ప్రపంచానికి మానవతా దృక్పథానికి ఆదర్శం.‘ప్రేమలోనే వైద్యం ఉంది, సేవలోనే దేవుడు ఉన్నాడు’ అనే బాబా వాక్యం ఈ సంస్థ ప్రతి పనిలోనూ ప్రతిఫలిస్తుంది. భగవాన్ సత్యసాయి బాబా ఆశీస్సులతో ఈ సేవాయజ్ఞం శతాబ్దాల పాటు కొనసాగాలని ఆకాంక్షిద్దాం.మారుమూల ప్రాంతాలకూ విస్తరణశ్రీ సత్యసాయి ఆస్పత్రుల ఆధ్వర్యంలో ఉచిత వైద్యసేవలు దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించాయి. పుట్టపర్తి, బెంగళూరులోని వైట్ఫీల్డ్లలోని శ్రీ సత్యసాయి జనరల్ ఆస్పత్రులు 2023–24 నాటికి దాదాపు 4.3 లక్షల మంది ఔట్పేషెంట్లకు ఉచితంగా వైద్యసేవలు అందించడంతో పాటు సుమారు 38 వేల మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేశాయి. శ్రీ సత్యసాయి ఆస్పత్రుల ఆధ్వర్యంలో దేశంలోని మారుమూల ఉన్న లద్దాఖ్ సహా ఇతర హిమాలయ ప్రాంతాలలోని రోగులకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నాయి. అలాగే, ప్రసూతి సేవలు, హృద్రోగాలు, మధుమేహం, శిశువైద్యం, దంత చికిత్సలు, మానసిక చికిత్సలు తదితర రంగాలకు చెందిన ప్రత్యేక క్లినిక్లను కూడా నిర్వహిస్తున్నాయి. వైద్య చికిత్సల ఖర్చు విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో శ్రీ సత్యసాయి ఆస్పత్రులు ఉచితంగా ఉన్నతస్థాయి వైద్య సేవలను అందిస్తుండటం విశేషం.మారుమూల ప్రాంతాలకూ విస్తరణశ్రీ సత్యసాయి ఆస్పత్రుల ఆధ్వర్యంలో ఉచిత వైద్యసేవలు దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించాయి. పుట్టపర్తి, బెంగళూరులోని వైట్ఫీల్డ్లలోని శ్రీ సత్యసాయి జనరల్ ఆస్పత్రులు 2023–24 నాటికి దాదాపు 4.3 లక్షల మంది ఔట్పేషెంట్లకు ఉచితంగా వైద్యసేవలు అందించడంతో పాటు సుమారు 38 వేల మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేశాయి. శ్రీ సత్యసాయి ఆస్పత్రుల ఆధ్వర్యంలో దేశంలోని మారుమూల ఉన్న లద్దాఖ్ సహా ఇతర హిమాలయ ప్రాంతాలలోని రోగులకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నాయి. అలాగే, ప్రసూతి సేవలు, హృద్రోగాలు, మధుమేహం, శిశువైద్యం, దంత చికిత్సలు, మానసిక చికిత్సలు తదితర రంగాలకు చెందిన ప్రత్యేక క్లినిక్లను కూడా నిర్వహిస్తున్నాయి. వైద్య చికిత్సల ఖర్చు విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో శ్రీ సత్యసాయి ఆస్పత్రులు ఉచితంగా ఉన్నతస్థాయి వైద్య సేవలను అందిస్తుండటం విశేషం. -
జగనన్న గోరుముద్ద మెనూలో మరో న్యూట్రియెంట్ ‘రాగిజావ’
సాక్షి, అమరావతి: జగనన్న గోరుముద్దలో మరో న్యూట్రియెంట్ రాగిజావ చేరింది. మధ్యాహ్న భోజన పథకంలో మార్చి 2 నుంచి రాగిజావ ఇవ్వనున్నారు. పిల్లలకు ఐరన్, కాల్షియం లోపాలు లేకుండా నివారించడానికి రాగిజావను చేరుస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి ఛారిటబుల్ ట్రస్టు భాగస్వామ్యం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో విద్యాశాఖ అధికారులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టు ప్రతినిధులు ఎంఓయూ చేసుకున్నారు. జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన పథకం) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమం. బడి ఈడు పిల్లల్లో ఎన్రోల్మెంట్ను పెంచడంతో పాటు వారిలో ధారణ సామర్ధ్యం మెరుగుపర్చి, డ్రాపౌట్స్ను తగ్గించే కార్యక్రమాల్లో భాగంగా వారికి స్కూళ్లోనే రుచికరమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజనంలో అందిస్తోంది. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44,392 స్కూళ్లలో.. 37,63,698 విద్యార్ధులకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఈ పథకాన్ని 1 నుంచి 10 వ తరగతి వరకూ అమలు చేస్తోంది. జనవరి 2020 న నిర్వహించిన సమీక్షలో... పిల్లలకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా మిడ్ డే మీల్స్పై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమీక్షించి... వారికి అందిస్తున్న మెనూలో పలు మార్పులు చేపట్టారు. అందులో భాగంగా రోజు వారీ అందిస్తున్న మెనూతో పాటు పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి వారంలో 5 రోజులు గుడ్డు, మూడు రోజులు బెల్లం, పల్లీ చిక్కీ ఇవ్వాలని నిర్దేశించారు. బెల్లం, పల్లీ చిక్కీ ఇవ్వని రోజుల్లో పిల్లలకు తగినంత ఐరన్, కాల్షియం అందించేందుకు వీలుగా చిరుధాన్యాలను మధ్యాహ్న భోజనపథకంలో భాగం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ... జగనన్న గోరుముద్దలో రాగిజావ అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మధ్యాహ్న భోజనంలో చిక్కీ ఇవ్వని రోజుల్లో అందుకు బదులుగా రాగిజావను మెనూలో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. వారానికి మూడు రోజుల పాటు రాగిజావను మిడ్ డే మీల్స్లో భాగం చేశారు. ఈ కార్యక్రమం అమలు కోసం వివిధ స్వచ్ఛంద సంస్ధల భాగస్వామ్యం కూడా తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మిడ్ డే మీల్స్లో పిల్లలకు రాగిజావ అందించే కార్యక్రమంలో భాగస్వామి అయింది. ఇందులో భాగంగానే ఇవాళ క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో విద్యాశాఖ అధికారులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రతినిధులు ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే...: ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. శ్రీ సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులకు ధన్యవాదాలు. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమంలో భాగస్వామ్యులైనందుకు మీకు ధన్యవాదాలు. గోరుముద్ద కార్యక్రమంలో రాగిజావను అదనంగా చేర్చడం ద్వారా మరింత పౌష్టిహాకారం పిల్లలకు అందుతుంది. కేవలం గోరుముద్ద కార్యక్రమానికే రూ.1700 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మూడున్నరేళ్ల క్రితం గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించాం. గతంలో కేవలం రూ.600 కోట్లు మాత్రమే మధ్యాహ్న భోజన పథకానికి ఖర్చు పెడితే మన ప్రభుత్వ హయాంలో ఆ ఖర్చు దాదాపు మూడు రెట్లు పెరిగింది. విద్యారంగంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టాం. తల్లులు తమ పిల్లలను బడికి పంపించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్నివ్వడానికి ఉద్దేశించిన అమ్మఒడి దగ్గర నుంచి మొదలు పెడితే.. నాడు– నేడు ద్వారా స్కూళ్ల వ్యవస్ధను మార్పు చేసే కార్యక్రమం చేస్తున్నాం. 6వతరగతి ఆ పై తరగతుల్లో ప్రతి తరగతి గదిలో డిజిటిల్ స్క్రీన్ ఐఎఫ్పి ఏర్పాటు చేస్తున్నాం. 30,230 తరగతి గదుల్లో ఈ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్(ఐఎఫ్పి)లను ఏర్పాటు చేస్తున్నాం. నాడు–నేడు తొలిదశ పూర్తి చేసుకున్న సుమారు 15వేల స్కూళ్లలో ఈ జూన్ నాటికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. నాడు –నేడులో ఆఖరు కాంపొనెంట్ 6వతరగతి ఆపై తరగతులను డిజిటలైజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. అంతకంటే దిగువ తరగతుల వారికి స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తున్నాం. చదవండి: మెరుగైన పనితీరు కనబర్చాలి: సీఎం జగన్ వీటితో పాటు పిల్లలకు విద్యాకానుక, గోరుముద్ద, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్ఈ సిలబస్, బైలింగువల్ టెక్ట్స్బుక్స్, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్, 8వతరగతి పిల్లలకు ట్యాబులు పంపిణీ వంటి అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపడతున్నాం. పిల్లల కరిక్యులమ్ను బైజూస్ కంటెంట్తో అనుసంధానం చేస్తూ.. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నాం. మరోవైపు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పిల్లల కోసం విద్యాదీవెన– 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్, రూ.20 వేల వరకు వసతి దీవెనను అమలు చేస్తున్నాం. తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తున్నాం. మరోవైపు విదేశీ విద్యా దీవెనను కూడా అమలు చేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ –50 కాలేజీలలో, 21 రకాల విభాగాలు, లేదా కోర్సులకు సంబంధించి సీట్లు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.1.25 కోట్ల వరకు ఈ పథకం కింద ప్రభుత్వం అందిస్తుంది. మిగిలిన వారికి రూ.1 కోటి వరకు అందిస్తుంది. రేపు కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ పథకంలో అర్హత పొందాలంటే కనీసం పదోతరగతి పాస్ కావాలనే నిబంధన విధించాం. ఇవన్నీ విద్యాంగంలో గొప్ప మార్పులు తీసుకొచ్చే అడుగులు. గోరుముద్ద మెనూలో రాగిజావను అమలు చేసే ప్రయత్నంలో సత్యసాయి ట్రస్టు భాగస్వామ్యం కావడం మంచి పరిణామం. సత్యసాయి ట్రస్టు భాగస్తులు కావడం ద్వారా.. భగవాన్ సత్యసాయి కూడా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి ముందుకు తీసుకుపోతున్నారని చెప్పవచ్చు. మనం కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం మెరుగైన సమాజం దిశగా ఉపయోగపడుతుంది. అందరికీ అభినందనలు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ జే. రత్నాకర్లు మాట్లాడారు. బొత్స సత్యనారాయణ, విద్యాశాఖమంత్రి మీ ఆలోచనలు, ఆదేశాలతో మార్చి 2 వ తేదీ నుంచి రాగిజావను జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా అందించాలని నిర్ణయించారు. దీనికి రూ.86 కోట్లు ఖర్చవుతుంది. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్ధలను భాగస్వామ్యం చేయాలన్న ఆలోచనతో సత్యసాయి ట్రస్టును ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది. దీనికి అవసరమైన రాగి పిండి, బెల్లం పిండి సత్యసాయి ట్రస్టు సరఫరా చేస్తుంది. దీని ఖరీదు సుమారు రూ.42 కోట్లు ఉంటుంది. మూడు సంవత్సరాల పాటు సరఫరా చేస్తారు. దీనికి సంబంధించి ఇవాళ ఒప్పందం చేసుకుంటున్నాం. వారికి కృతజ్ఞతలు. భారతదేశంలో మిడ్ డే మీల్స్ను ఇంత సమర్ధవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. రత్నాకర్, శ్రీ సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ సత్యసాయి సేవా సంస్ధలు సేవానిరతితో పనిచేస్తున్నాయి. బాబా గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. విద్యాశాఖ మంత్రి, అధికారులు మిడ్ డే మీల్స్లో రాగిజావ అందించే కార్యక్రమం గురించి చెప్పినప్పుడు .... ట్రస్టు బృందం సభ్యులందరూ దీనిని చాలా మంచి కార్యక్రమమని ప్రోత్సహించారు. అందుకే ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చాం. ముఖ్యమంత్రిగా మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగాంలో చేస్తున్న కృషి కచ్చితంగా విద్యకు పునరుజ్జీవనం తీసుకొస్తుంది. మీరు చెప్తున్న ప్రతి మాటను అక్షరాలా అమలు చేసి చూపిస్తున్నారు. విద్యా రంగంలో మీరు అమలు చేస్తున్న పథకాలు వింటున్నాం.. చూస్తున్నాం. మీరు మధ్యాహ్న భోజనానికి పెట్టిన జగనన్న గోరుముద్ద పేరు చాలా బాగుంది. అమ్మ చేతి గోరు ముద్ద గుర్తుకు వచ్చేలా మంచి పేరు ఎంపిక చేశారు. మీరు అమలు చేస్తున్న అమ్మఒడి, ఆసరా ఇలా అన్నీ మంచి పథకాలు. మీరు చేస్తున్న కార్యక్రమాల్లో అన్నింటి కంటే నాడు–నేడు కార్యక్రమం అందరి కళ్లకూ ప్రత్యక్షంగా కనిపిస్తున్న మంచి, గొప్ప కార్యక్రమం. ఈ దేశం, రాష్ట్రం సురక్షితమైన భవిష్యత్తుకు పిల్లల చదువులు చాలా ముఖ్యం. పేద పిల్లలను చదువుకునే ప్రభుత్వ బడులను.. మీరు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మారుస్తున్నారు. చివరిగా.. నూతనంగా ఏర్పడిన జిల్లాకు శ్రీ సత్యసాయి జిల్లాగా నామకరణం చేయడంపై మీకు ఈ రాష్ట్రం, దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సాయి భక్తుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కేవలం మీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఈ నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సీ ఎన్ దీవాన్రెడ్డి, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి బసంత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు. -
శాస్త్ర,సాంకేతిక రంగాల్లో భారత్ అమోఘ ప్రగతి
సాక్షి, పుట్టపర్తి/ పుట్టపర్తి అర్బన్: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ అమోఘ ప్రగతి సాధిస్తోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ సోమనాథ్ అన్నారు. మంగళవారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరిగిన సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 41వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. గతంలో రాకెట్ ప్రయోగాలు, డిజైన్, తయారీ, పరికరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడేవాళ్లమని, ప్రస్తుతం సొంతగా రాకెట్ ప్రయోగాలు చేస్తూ ప్రపంచానికి సవాల్ విసురుతున్నామని చెప్పారు. భారతదేశం త్వరలోనే అతిపెద్ద ఐటీ, మెడిసిన్ ఎగుమతిదారుగా మారనుందన్నారు. అనంతరం 22 మంది విద్యార్థులకు డాక్టరేట్లు, 17 మందికి బంగారు పతకాలు అందజేశారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి: కిషన్ రెడ్డి సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరఫున∙తాము కూడా భాగస్వామ్యం అవుతామని తెలిపారు. సత్యసాయిబాబా 97వ జయంత్యుత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన సౌండ్ అండ్ లైట్, మల్టీమీడియా షోను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు. సత్యసాయి బాబా జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఈ షో ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. -
సేవా ముసుగులో అక్రమం
రూ.25 కోట్ల స్థలంపై కన్ను - శ్రీ సత్యసాయి ట్రస్టుకు దక్కాల్సిన స్థలం - సొంత ట్రస్టుకు మార్చుకున్న అక్రమార్కుడు - గతంలోనే ప్రభుత్వం నుంచి షోకాజు నోటీసులు - స్వాధీనం చేసుకోవడంలో సర్కారు నిర్లక్ష్యం ఆదిలాబాద్ : సేవా ముసుగులో ఓ ప్రైవేట్ వైద్యుడు రూ.25 కోట్ల స్థలాన్ని కబ్జా చేసేందుకు మరోసారి ప్రయత్నాలు మొదలెట్టాడు. శ్రీ సత్యసాయి ట్రస్టుకు దక్కాల్సిన స్థలాన్ని అప్పట్లో దొడ్డిదారిన అధికారులను తప్పుతోవ పట్టించి తన సొంత ట్రస్టుకు మళ్లించాడు. భూమి కేటాయింపులో ప్రభుత్వం విధించిన నిబంధనలు ఉల్లంఘించి అడ్డదారులు తొక్కాడు. దీనిపై శ్రీ సత్యసాయి ట్రస్టు సభ్యులు జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో అధికారులు చర్యలు చేపడుతామని చెప్పి మిన్నకుండి పోయారు. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న వైద్యుడు మళ్లీ ఆ స్థలాన్ని స్వాహా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. తాజాగా ఆ స్థలంలోని భవనంలో ఓ ప్రైవేట్ స్కూల్ నడిపేందుకు ఇతరులకు అనుమతి ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. దీన్ని బట్టి ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు మళ్లీ మొదలు పెట్టాడని తెలుస్తోంది. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సేవా ముసుగులో.. పుట్టపర్తి సత్యసాయి సంస్థకు అనుబంధంగా జిల్లాలో శ్రీశ్రీశ్రీ భగవన్ సత్యసాయి సేవా సమితి విద్యాసంస్థను నెలకొల్పాలని నిర్ణయించింది. దీని కోసం సేవా సమితికి 40 నుంచి 50 ఎకరాల భూమి కేటాయించాలని ఆ సంస్థ తరపున డాక్టర్ బి.ప్రకాశ్ 1996 డిసెంబర్ 25న అప్పటి కలెక్టర్కు దరఖాస్తు చేశాడు. అప్పట్లో ఈ సంస్థ సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రాచుర్యం పొందడంతో జిల్లాలోనూ భూమి కేటాయించాలని అప్పటి కలెక్టర్ శాంతికుమారి నిర్ణయించారు. ఆ సమయంలో సత్యసాయి సేవా సమితి పేరిట కలెక్టర్కు దరఖాస్తు సమర్పించిన వైద్యుడే స్వార్థానికి పాల్పడ్డాడు. అదే పేరు స్పూరించే రీతిలో శ్రీ సత్యసాయి విద్యానికేతన్ పేరుతో అందులో సభ్యునిగా తాను, తన తల్లి, భార్య, తమ్ముళ్లను నియమించుకుని 1997 ఫిబ్రవరి 4న సత్యసాయి విద్యానికేతన్ అనే ట్రస్టును రిజిస్ట్రర్ చేయించాడు. ఆ ట్రస్టుకే ప్రభుత్వం 1999 ఆగస్టు 22న నంబర్ వి3/625/97 ద్వారా భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఆదిలాబాద్ మండలం బట్టిసావర్గాలోని సర్వే నంబర్ 72 న్యూహౌసింగ్బోర్డు కాలనీలో 13.31 ఎకరాల భూమిని ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.1,37,750 మార్కెట్ విలువతో ఈ విద్యా సంస్థకు కేటాయించారు. ఈ విద్యాసంస్థలో చదువుకునే 50 శాతం మంది విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలు వసూలు చేస్తున్న రుసుంను వసూలు చేయాలని, ఇతర అవసరాలకు వినియోగిస్తే స్వాధీనం చేసుకుంటామన్న షరతులతో అప్పటి కలెక్టర్ శాంతికుమారి ఈ స్థలం ఇవ్వడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘన కలెక్టర్ విధించిన షరతులు ఈ విద్యాసంస్థ నిబంధనలు ఉల్లంఘించినట్లు గత పరిశీలనలో తేటతెల్లమైంది. సగం మంది విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుం వసూలు చేయాల్సి ఉండగా ఈ నిబంధనను పాటించలేదని అప్పట్లో విద్యాశాఖ అధికారుల పరిశీలనలో స్పష్టమైంది. భూమిని కేటాయించిననాలుగేళ్లకు విద్యాసంస్థను ఏర్పాటు చేసినా.. స్వాధీనం చేసుకునే విషయంలో అధికారులు శ్రద్ధ చూపలేదు. వరంగల్ ఆర్జేడీ ద్వారా అనుమతి పొందిన శ్రీ సత్యసాయి విద్యానికేతన్ 2007-08 విద్యా సంవత్సరం వరకు అదే స్థలంలో కొనసాగింది. అనంతరం పునరుద్ధరణ గడువు ముగియడంతో ఆ స్థలంలో విద్యాసంస్థ కార్యకలాపాలు సాగలేదు. ప్రభుత్వం కేటాయించిన ఈ స్థలంలో సత్యసాయి విద్యానికేతన్ కొనసాగడం లేదని, ప్రస్తుతం ఇందులో మరో పాఠశాలను నిర్వహిస్తున్నారని అప్పటి తహశీల్దార్ 2010 జూన్ 23న ఆర్డీవోకు నివేదిక సమర్పించారు. ఆ నివేదికను ఆర్డీవో అప్పటి కలెక్టర్ ద్వారా భూసేకరణ ముఖ్యకార్యదర్శి (సీసీఎల్ఏ)కు పంపారు. ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు చేపట్టదంటూ పైస్థాయి నుంచి ఒత్తిళ్లు రావడంతో ఆ తర్వాత అధికారులు మిన్నకున్నారు. ఆ తర్వాత మరోసారి ఈ భూమిపై వివాదం చెలరేగడంతో 2011 డిసెంబర్లో సత్యసాయి విద్యానికేతన్ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. అప్పట్లో కలెక్టర్గా ఉన్న డాక్టర్ అశోక్ ఈ సత్యసాయి విద్యానికేతన్ భూమి కేటాయింపు రద్దు చేయాలని సీసీఎల్ఏకు రాయడం జరిగింది. ఆ తర్వాత ఈ వ్యవహారంలో ముందడుగు పడలేదు. అప్పటి నుంచి ఆ స్థలంలో ఎలాంటి నిర్వహణ చేపట్టలేదు. ఈ విషయంలో స్తబ్దత నెలకొంది. తాజాగా ఓ ప్రైవేటు స్కూల్ నిర్వహణకు అనుమతినివ్వడంతో మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. దీనిపై సత్యసాయి ట్రస్టు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సదరు ప్రైవేట్ వైద్యుడు, పట్టణంలోని కొంత మంది భూకబ్జాదారులు కలిసి ఈ భూమిని స్వాహా చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో కొంత మంది ప్రైవేట్ పాఠశాలల యజమానులు కూడా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైన ఈ వ్యవహారంలో ప్రభుత్వం చొరవ తీసుకొని స్థలం స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై జేసీ లక్ష్మీకాంతం, ఆర్డీవో సుధాకర్రెడ్డిలను ‘సాక్షి’ వివరణ కోరగా ఇది తమ దృష్టికి రాలేదని తెలిపారు. వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా డీఈవో సత్యనారాయణరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా ఇందులో నిర్వహిస్తున్న స్కూల్కు అనుమతి లేదని, ఎలాంటి అనుమతి తీసుకోకుండానే నడుపుతున్నారని పేర్కొన్నారు. దీనిపై పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటామని వివరించారు.


