breaking news
sp amber kishore jha
-
‘ఆపరేషన్’ ఇంకా కొనసాగుతోంది: ఎస్పీ
-
‘ఆపరేషన్’ ఇంకా కొనసాగుతోంది: ఎస్పీ
సాక్షి, భద్రాద్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతంలో రాష్ట్ర గ్రేహౌండ్స్ బలగాలకు మావోయిస్టు బలగాలకు మధ్య శుక్రవారం ఉదయం ఎదురుకాల్పులలో 10మంది మావోయిస్టులతో పాటు ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి చెందినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ అంబర్ కిశోర్ ఝ తెలిపారు. ఎన్కౌంటర్పై ఆయన శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో నిఘా పెట్టామని తెలిపారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. మృతి చెందిన మావోయిస్టుల్లో ఇద్దర్ని గుర్తించామని, బూద్రి అలియాస్ రేణుక, సంజీవ్ ఛత్తీస్గఢ్కు చెందినవాళ్లుగా ఎస్పీ వెల్లడించారు. మిగిలిన మృతదేహాలను ఇవాళ రాత్రికి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలిస్తామన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పోస్ట్మార్టం నిర్వహిస్తామని అన్నారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47తో పాటు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కాగా ఎన్కౌంటర్లో మృతి చెందిన కమెండో సుశీల్ కుమార్ మృతదేహానికి ఎస్పీ అంబర్ కిషోర్ ఝా నివాళులు అర్పించారు. చర్ల ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ మృతి చెందారు. మరో కీలక నేత బడే చొక్కారావు కూడా నేలకొరిగారు. పోలీసులు సైతం వీరి మరణాలను ధృవీకరించారు. నిషేధిత సీపీఐ -మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలతో పాటు ఆరుగురు మహిళలు, ఓ కమెండో సహా మొత్తం 11 మంది ఈ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. -
అనుక్షణం.. అప్రమత్తం
జిల్లాపై మావోయిస్టుల ప్రభావం లేదు ♦ సరిహద్దు నుంచి కార్యకలాపాలు విస్తరించకుండా జాగ్రత్తలు ♦ బంద్ నేపథ్యంలో విస్తృత తనిఖీలు ♦ ఎస్పీ అంబర్కిషోర్ ఝా వెల్లడి సాక్షి, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపై మావోయిస్టుల ప్రభావం ఎంతమాత్రం లేదని, గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వారి కార్యకలాపాలు పెద్దగా లేకపోవడమే ఇందుకు నిదర్శనమని ఎస్పీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఆంధ్ర – ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్టు పార్టీ ఐదు రాష్ట్రాల బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతలపరంగా తీసుకుంటున్న ముందస్తు చర్యల గురించి బుధవారం ఆయన ’సాక్షి’తో మాట్లాడారు. జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు లేకపోయినా.. ఛత్తీస్గఢ్కు సరిహద్దులో ఉన్నందున అటువైపు నుంచి కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఇవ్వకుండా, ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండేందుకు పోలీస్ యంత్రాంగాన్ని అనుక్షణం అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలతోపాటు గతంలో మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టామని వివరించారు. మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చిన ప్రతీసారి శాంతిభద్రతలపరంగా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామో, ఈసారి కూడా అదే రీతిలో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలోని పలు ప్రధాన ప్రాంతాల్లో వాహనాల తనిఖీ చేస్తున్నామని, అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. రైల్వేస్టేషన్, బస్టాండ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. బస్సులు, ఇతర వాహనాల ద్వారా జరుగుతున్న రాకపోకలను పరిశీలిస్తున్నామని, అనుమానం ఉన్న ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నామని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే అటవీ ప్రాంతాల్లో సైతం ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని, మిషన్ భగీరథ, రహదారుల నిర్మాణం వంటి కార్యకలాపాలు మారుమూల పల్లెల్లో విస్తృతంగా జరుగుతున్నాయని, గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం కావడంతో అక్కడి ప్రజలు మావోయిస్టుల ప్రభావం నుంచి దూరంగా ఉంటున్నారని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలు గిరిజన గ్రామాల్లో పూర్తయితే అక్కడి ప్రజల్లో మరింత మార్పు వచ్చే అవకాశం ఉందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. జిల్లాలో ప్రజలతో పోలీసులు స్నేహితులుగా వ్యవహరిస్తారని, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకునే రీతిలో, ఆపద సమయాల్లో తక్షణం స్పందించే రీతిలో పోలీస్ యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉంటుందని అన్నారు. ప్రజలకు పోలీసులను మరింత చేరువ చేసేందుకు గల అవకాశాలను అన్వేషించి ప్రజా సంబంధాలను మరింత మెరుగుపర్చుతామని వివరించారు. అనేక సహజ వనరులున్న కొత్తగూడెం జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అపారమైన అవకాశాలున్నాయని, జిల్లా అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములమవుతామని చెప్పారు. పోలీస్ అంటే లాఠీ ఎత్తడమే కాదని, ప్రజల అభివృద్ధిని కాంక్షించి సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం సైతం తమ బాధ్యత అనే భావన ప్రజల్లో కలిగేలా కార్యకలాపాలు చేపడతామని అన్నారు.