ఓటుతో మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలి
భారత ఎన్నికల సంఘం ప్రచారకర్త జేఏ చౌదరి
ఇబ్రహీంపట్నం, న్యూస్లైన్: ఓటుపైననే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందన్న విషయాన్ని నేటి యువత తెలుసుకోవాలని భారత ఎన్నికల (ఈసీఐ)సంఘం ప్రచారకర్త, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు జేఏ చౌదరి అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం సమీపంలోని సెయింట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఓటరు నమోదుకు సంబంధించి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓటు ద్వారానే సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి వీలుంటుం దని ఆయన అన్నారు. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మనదేశంలో మేథావులు, విద్యావంతులు ఓటు హక్కును వినియోగించుకోవడంలో అశ్రద్ధను వహిస్తుండడం శోచనీయమన్నారు.
18 ఏళ్లు నిండిన యువతీ, యువకులంద రూ విధిగా తమ ఓట్లను నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రపంచ ంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన మన దేశంలో ఓటుకు ఎంతో విలువ ఉందన్నారు. దేశ దశ, దిశను మార్చగలిగే శక్తి కేవలం ఓటుకు మాత్రమే ఉందన్న విషయాన్ని యువత గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. మన దేశంలో సాంకేతిక వనరులు పుష్కలంగా ఉన్నా సక్రమంగా వినియోగించుకోలేక పోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు మేథావులను, గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన కోరారు. కష్టపడే మనస్తత్వం కలిగి ఉండడంతో పాటు సమయపాలన పాటించిన వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆయన అన్నారు.సమావేశంలో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన సార్ధకత చేకూరుతుందన్నారు. ఇప్పటికీ కొందరు ఓటు విలువను తెలుసుకోలేక పోతుండడం శోచనీయమన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ గిరిజన విభాగం రాష్ట్ర కన్వీనర్ ఆంగోత్ వెంకటేశ్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.