సాఫ్ట్వేర్, ఎంబీఏ శకానికి చరమగీతం?
భారతదేశ జాబ్ మార్కెట్లో దశాబ్దాలుగా నడుస్తున్న ‘వైట్ కాలర్’ ఉద్యోగాల బూమ్ ఇకపై సాగకపోవచ్చని, సాఫ్ట్వేర్, ఎంబీఏ డిగ్రీల హవా ముగింపు దశకు చేరుకుందని దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ వ్యాఖ్యలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో.. వెల్డింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, వడ్రంగి వంటి భౌతిక, వాణిజ్య నైపుణ్యాలకే (ట్రేడ్ స్కిల్స్) రాబోయే రోజుల్లో విపరీతమైన గిరాకీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పని స్వభావం, ఉద్యోగ నష్టాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపాయి.శ్రమకు దక్కని గౌరవం‘స్విట్జర్లాండ్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాల్లో నైపుణ్యం కలిగిన కార్మికులకు, వృత్తి నిపుణులకు సమాజంలో అత్యున్నత గౌరవం లభిస్తుంది. కానీ భారతదేశంలో అది కరవైంది. వెల్డర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, వడ్రంగి వంటి వారిని మనం తక్కువ చేసి చూస్తాం. వారి వృత్తులను అగౌరవంగా, ఫ్యాషన్ కానిదిగా మార్చేశాం. ఈ ఆలోచనా విధానం తక్షణమే మారాల్సిన అవసరం ఉంది’ అని అనంత నాగేశ్వరన్ అన్నారు.సాంకేతిక పురోగతి అనేది ఉపాధిని పూర్తిగా హరించబోదని, అయితే అది ఉద్యోగాల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుందని నాగేశ్వరన్ విశ్లేషించారు. గతంలో ప్రపంచీకరణ వల్ల భారత సాఫ్ట్వేర్, కంప్యూటర్ సైన్స్, ఎంబీఏ విద్యార్థులకు భారీగా ప్రయోజనం చేకూరిన మాట వాస్తవమే అయినా ఆ శకం ఇప్పుడు ముగిసిందని పేర్కొన్నారు.ఏఐ భర్తీ చేయలేని రంగాలు‘మనుషుల ప్రత్యక్ష అవసరం ఉండే, ఆటోమేషన్కు గురికావడానికి తక్కువ అవకాశం ఉన్న రంగాలపై యువత దృష్టి పెట్టాలి. భారతదేశంలో నిరుద్యోగిత, తక్కువ ఉపాధి సమస్యలను ఒకేసారి పరిష్కరించాలంటే శ్రమశక్తి ఆధారిత రంగాలను బలోపేతం చేయాలి’ అన్నారు. ఉత్పాదక రంగంతో పాటు మానవ సంబంధాలు, సేవలతో ముడిపడి ఉన్న కొన్ని రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా భారీగా అవకాశాలు సృష్టించవచ్చని నాగేశ్వరన్ వెల్లడించారు.ఇదీ చదవండి: బంగారం ధరలో మార్పు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..