breaking news
Shyam Prasad Reddy
-
భూగర్భ నీరు @ కందకంతో చేరు!
నీరు మనకైనా పంటకైనా ప్రాణాధారం. భూగర్భంలో నీరంటూ ఉంటే బావి ద్వారానో, బోరు బావి ద్వారానో తోడుకొని పంటలు పండించుకోవచ్చు. అసలు భూగర్భంలోనే నీరు ఏటేటా అడుగుకు దిగిపోతుంటే అన్నదాతల ఆశలు ఆవిరైపోతున్నాయి. పంటల కోసం, పశువుల కోసం రోజూ తోడుకోవటానికి భూగర్భంలో నీరు పుష్కలంగా ఉండాలంటే.. వృథాగా చేను దాటి పోయే వర్షపు నీటి పరుగును ఆపి, భూమి లోపలికి చప్పున ఇంకింపజేసుకోవటం ఒక్కటే అత్యుత్తమ మార్గం. అందుకు కందకాలే సోపానాలంటున్నారు తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం పెద్దలు, వాన నీటి సంరక్షణ ఉద్యమకారులు సంగెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాం ప్రసాదరెడ్డి. తెలుగునాట రైతులు తమ భూముల్లో కందకాలు తవ్వుకోవటానికి పదేళ్లుగా మాట సాయం చేస్తున్నారు. వారి సూచనలు వారి మాటల్లోనే..ఎకరానికి రూ. 5 వేల ఖర్చు మన చేలో కురిసిన ప్రతి వాన బొట్టును పొలంలోనే ఇంకించుకోవాలి. మన చేను కిందే భూగర్భ జలాశయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అవసరమైనప్పుడు కావలసినంత నీటిని బోర్ల ద్వారా, బావుల ద్వారా తోడుకొని సమృద్ధిగా పంటలు పండించుకోవాలంటే.. ముందు మనం ‘చేను కిందే చెరువు’ను సృష్టించుకోవాలి. అందుకు ఇదే సరైన సమయం. వానా కాలానికి ముందే పొలంలో కందకాలు తవ్వుకోవాలి. అకాల వేసవి వర్షాలను సైతం భూగర్భంలోకి ఇంకింపజేసుకోవటం తెలివైన పని. వర్షాధార, ఆరుతడి పంటలు సాగు చేసే భూముల్లో.. పొలంలో ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో వాలుకు అడ్డంగా కందకాలు తవ్వుకుంటే.. ఆ పొలానికి అడుగునే చెరువును నిర్మించుకున్నట్లే నీటి భద్రత నిక్కచ్చిగా దొరుకుతుంది. దీనికి ఖర్చు ఎకరానికి సగటున రూ. 5 వేలకు మించి కాదు. కందకాలకు ఎకారానికి 2 సెంట్ల భూమి అవసరం అవుతుంది. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఈ పెట్టుబడి ఎక్కువేమీ కాదని రైతులు గ్రహించాలి.ఏ యే పొలాల్లో ఎలా తవ్వాలి?పొలంలో వాలుకు అడ్డంగా.. ప్రతి 50 మీటర్లకు ఒక చోట.. మీటరు లోతు, మీటరు వెడల్పున సమతల కందకాలను తవ్వుకోవాలి. నేలను బట్టి, వాలు ఎక్కువ తక్కువలను బట్టి కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. పొలం ఆ చివరి నుంచి ఈ చివరికి ఒకే కందకం తవ్వకూడదు. కందకం పొడవు 25 మీటర్లుండాలి. ఆ తర్వాత 5 మీటర్లు ఖాళీ వదిలి, అదే వరుసలో వాలుకు అడ్డంగా మరో 25 మీటర్ల కందకం తవ్వాలి. కందకం తవ్విన మట్టిని పొడవుగా ఒకే కట్టగా కందకం లోతట్టు వైపున గట్టు మాదిరిగా పోయాలి. ఇలా చేస్తే కందకంలోకి వచ్చిన వదర నీరు సైతం పొర్లిపోకుండా ఉంటుంది. నీటి సంరక్షణతో పాటు పొలంలోని విలువైన పైపొర మట్టి కొట్టుకుపోకుండా కూడా కాపాడుకోవచ్చు.ఎర్ర నేలల్లో ఎలా?ఇసుక కలిసిన ఎర్ర నేలలు, చల్కా నేలల్లో నీరు తొందరగా భూమిలోకి ఇంకిపోతుంది. ఇటువంటి పొలాలు వాలు 2% ఉంటే.. పొలం మధ్యలో 50 మీటర్లకు ఒక్కటి చొప్పున కందకాలు తవ్వుకోవాలి. వాలు ఇంకా ఎక్కువగా ఉంటే 40 మీటర్లకు ఒక వరుసలో కందకాలు తవ్వుకోవాలి. ఒక వేళ భూమి వాలు లేకుండా సమతలంగా ఉంటే.. కందకాలకు బదులు మడులు ఏర్పాటు చేసుకోవాలి. అర ఎకరం లేదా ఎకరానికి ఒక మడి చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. మడుల కట్టలు కనీసం అర మీటరు ఎత్తుగా వేసి.. పక్కనే కందకం తవ్వాలి.నల్లరేగడి నేలల్లో ఎలా? నల్లరేగడి నేలల్లో నీరు త్వరగా ఇంకదు. కాబట్టి, ఈ నేలలు ఏటవాలుగా ఉన్నా, సమతలంగా ఉన్నా, పొలం మధ్యలో కందకాలు తవ్వకూడదు. పొలం చివరన (బావి లేదా బోరు కింది భాగంలో) నీటి కుంట లేదా ఫామ్ పాండ్ను తవ్వుకోవాలి. పొలాల్లో తవ్వే వాన నీటి సంరక్షణ కందకాల విషయంలో సందేహాలుంటే తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను సంప్రదించవచ్చు: సంగెం చంద్రమౌళి (విశ్రాంత ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్): 98495 66009, మేరెడ్డి శ్యాంప్రసాద్రెడ్డి (విశ్రాంత ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) 99638 19074.3 రోజుల్లో నా జీవితం మారిపోయింది!‘సాక్షి’ దినపత్రిక ‘సాగుబడి’లో కందకాల గురించి కథనం చదివి మా 135 ఎకరాల్లో ఐదేళ్ల క్రితం మేరెడ్డి శ్యాంప్రసాద్రెడ్డి సూచనల మేరకు కందకాలు వేసవిలోనే తవ్వించాను. నీటి కరువు శాశ్వతంగా తీరింది. అంతకుముందు వందలాది బోర్లు తవ్వినా ప్రయోజనం లేకపోయింది. కందకాలు తవ్విన 3 రోజుల్లోనే పెద్ద వర్షం కురవటంతో బోర్లు రీచార్జ్ అయ్యి నా జీవితం నాటకీయంగా మారిపోయింది. ఆఫ్ ఇంచ్ నీరు పోసే బోర్లు 3 రోజుల్లోనే 3 ఇంచులు నీరు పోయటం మొదలైంది. అంతకుముందు బావిలో నీరు వేసవిలో 60–80 అడుగుల లోతుకు వెళ్లేవి. ఇప్పుడు 18 అడుగుల్లోనే ఉన్నాయి. బోర్లలో అయితే 12–16 అడుగుల్లోనే ఉన్నాయి. 95 ఎకరాల్లో కుంకుడు, బత్తాయి, ఉసిరి, జామ, సీతాఫలం, శ్రీగంధం తోటలకు 3 బోర్లతోనే నీరు పెడుతున్నాం. గతంలో ఈ 95 ఎకరాల్లోనే 247 బోర్లు వేసినా దొరకని నీటి భద్రత కందకాలతో ఒక్క పెద్ద వర్షంతో దొరికింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీటి ఎద్దడి లేనే లేదు. కుంకుడు తోట ఎండిపోయే దశలో తవ్విన కందకాల వల్ల శాశ్వతంగా గొప్ప మేలు జరిగింది. నా తోటను ఇప్పటికి అనేక రాష్ట్రాల నుంచి 6 లక్షల మంది వచ్చి చూసెళ్లారు. ఈ పుణ్యం అంతా ‘సాక్షి’ ద్వారా తెలుసుకొని, తవ్వుకున్న కందకాలదే! కందకాల్లోనే 740 కొబ్బరి చెట్లు నాటా. చక్కగా పెరుగుతున్నాయి.– లోకసాని పద్మారెడ్డి (99481 11931), పోలేపల్లి, చందంపేట మం‘‘, నల్లగొండ జిల్లా మాతో పాటు ఊరందరికీ మేలు!9 ఏళ్ల క్రితం ‘సాక్షి’ సాగుబడిలో చదివి మా వందెకరాల పొలంలో కందకాలు తవ్వుతుంటే ఊళ్లో రైతులందరూ ‘వీడేందిరా చేనంత గుంతలు కొడుతున్నాడు..’ అంటూ నన్ను పిచ్చోడి లెక్క చూశారు. అయితే, మా పొలంతో పాటు దిగువున ఉన్న రైతుల పొలాల్లో (30 వరకు) బోర్లన్నీ బాగా పారుతున్నాయి. పొలంలో 50 అడుగులకు ఒక వరుస చొప్పున కందకాలు తవ్వటంతో పాటు చెరువులు కూడా తవ్వించాను. దీంతో భూగర్భంలోకి నీరు బాగా ఇంకి, నీటి సమస్య తీరింది. 40 ఎకరాల్లో కుంకుడు తోట నాటా. 5 వేల టేకు చెట్లు నాటా. మామిడి, నేరేడు తదితర వినూత్న రకాలు సాగు చేస్తున్నా.– సాదినేని శ్రీనివాసరావు (99490 99055), శివలింగాపురం, వెల్దుర్తి మండలం, పల్నాడు జిల్లా -
నిర్మాత శ్యామ్ప్రసాద్ రెడ్డి ఇంట్లో విషాదం
ప్రముఖ నిర్మాత, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తె, నిర్మాత శ్యాంప్రసాద్రెడ్డి సతీమణి వరలక్ష్మి (62) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆమె బుధవారం రాత్రి మరణించారు. నేడు ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. వరలక్ష్మి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.టాలీవుడ్లో ప్రముఖ ప్రొడ్యూసర్గా గుర్తింపు పొందిన శ్యామ్ప్రసాద్ రెడ్డి.. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ స్థాపించి పలు సీరియల్స్తో పాటు టీవీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, అంజి, అరుంధతి వంటి సినిమాలను శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. -
శిల్పారామాలు కళకళ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని శిల్పారామాలు పర్యాటకులతో నిత్యం కళకళలాడుతున్నాయి. గత ఎనిమిదేళ్లతో పోలిస్తే 125 శాతం మేర సందర్శకుల తాకిడి పెరిగింది. కోవిడ్ సమయంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న శిల్పారామం సొసైటీ ఏడాది కాలంలోనే అనూహ్యంగా వృద్ధిని సాధించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా మెరుగైన రాబడి లభించింది. గతంలో ఎప్పుడూ నష్టాల్లోనే నడిచిన శిల్పారామాలు 2022–23లో ఏకంగా రూ.2 కోట్ల వరకు లాభం గడించడం రాష్ట్రంలోని పర్యాటక అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రంలో ఎనిమిది శిల్పారామాలు ఉండగా సగటున ప్రతినెల 1.25 లక్షల మంది సందర్శిస్తున్నారు. ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి గ్రామీణ వాతావరణానికి ప్రతీకలుగా నిలిచే శిల్పారామాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా తిరుపతి, కడప శిల్పారామాల్లో మల్టీపర్పస్ హాల్, డైనింగ్ హాల్, టాయిలెట్ల పునరుద్ధరణ పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. పర్యాటకుల భద్రత దృష్ట్యా శిల్పారామాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా బోటింగ్ (జలవిహారం) కార్యకలాపాల పనులను శరవేగంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే విశాఖపట్నంలో స్విమ్మింగ్ పూల్, వాటర్ గేమ్స్–జిమ్, సందర్శకులను ఆకట్టుకునేలా పెయింటింగ్ డిస్ప్లేలను ఏర్పాటు చేసింది. మిగిలిన శిల్పారామాల్లోను ఈ తరహా వినోదాన్ని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గుంటూరు శిల్పారామం పనులు దాదాపు పూర్తికావడంతో త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. పులివెందుల శిల్పారామంలో పునరుద్ధరణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. కొత్త శిల్పారామాల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా శ్రీకాకుళం, చిత్తూరు, విజయనగరం, కర్నూలు, రాయచోటిల్లో అర్బన్ హట్స్ (శిల్పారామాల) నిర్మాణాన్ని ప్రతిపాదించింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.8 కోట్లతో కర్నూలులో, రూ.9.20 కోట్లతో అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం బండపల్లిలో శిల్పారామాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం డీపీఆర్ తయారీ, భూ సేకరణపై ప్రభుత్వం దృష్టిసారించింది. మరోవైపు విశాఖ, కాకినాడ, కడప, పులివెందుల, అనంతపురం, పుట్టపర్తి, గుంటూరుల్లో ఒక్కోచోట రూ.1.50 కోట్లతో హస్తకళల మ్యూజియాల నిర్మాణానికి చర్యలు చేపడుతోంది. జిల్లాకో శిల్పారామం ప్రతి జిల్లాలో శిల్పారామం ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన వాటా స్కీమ్లను సది్వనియోగం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. శిల్పారామాల్లో పచ్చదనాన్ని కాపాడుతూనే ఆధునికీకరణ చేపడుతున్నాం. అందుకే రాష్ట్ర విభజన తర్వాత గణనీయమైన వృద్ధిని సాధించాయి. నెలకు 1.25 లక్షల మంది సందర్శకులు రావడం ఇందుకు నిదర్శనం. – ఆర్.కె.రోజా, పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి చక్కని ఆటవిడుపు కేంద్రాలు గతంలో ఎన్నడూ లేనివిధంగా శిల్పారామాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాం. చక్కని ఆటవిడుపు కేంద్రాలుగా పిల్లలు, పెద్దలు కూడా సంతోషంగా గడిపే వాతావరణాన్ని సృష్టిస్తున్నాం. ముఖ్యంగా బోటింగ్ కార్యకలాపాలపై దృష్టిసారించాం. హస్తకళలు, కళాకారుల కోసం శిల్పారామాల్లో ఉచితంగా ప్రత్యేక స్టాల్స్, స్టేజ్లను అందిస్తున్నాం. – శ్యామ్ప్రసాద్రెడ్డి, సీఈవో, శిల్పారామం సొసైటీ -
సీఎం జగన్తో టాలీవుడ్ అగ్ర నిర్మాతల భేటీ
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమ అగ్ర నిర్మాతలు భేటీ అయ్యారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనివంశీతో పాటు నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యాంప్రసాద్రెడ్డిలతో పాటు జెమిని కిరణ్లతో కూడిన బృందం సీఎం జగన్ను క్యాంపు కార్యాలయంలో కలిసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హుద్హుద్ తుఫాను సమయంలో ఇళ్లు కోల్పోయిన బాధితుల కోసం సినీపరిశ్రమ సాయంతో 320 ఇళ్లు నిర్మించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చామన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయినందున వాటిని ప్రారంభించి హుద్హుద్ సమయంలో ఇళ్లు కోల్పోయిన వారికి అందించాలని విజ్ఞప్తి చేశామన్నారు. దీని కోసం తెలుగు సినీపరిశ్రమంతా రెండు రోజుల పాటు అన్ని కార్యక్రమాలు నిలిపివేసి, ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు టెలీథాన్ పేరుతో ప్రత్యేక షో నిర్వహించామని చెప్పారు. ఆ షో నిర్వహణ ద్వారా వచ్చిన రూ.15 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు. ఆ ఇళ్ల నిర్మాణం ఇప్పుడు పూర్తైందని.. అదే విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించామని చెప్పారు. పూర్తైన ఇళ్లను పేదలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. అందుకు సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. చదవండి: విద్యుత్ రంగంలో పెట్టుబడులే లక్ష్యం: సీఎం జగన్ -
రైతులందరికీ ప్రాజెక్టుల ఫలాలు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టుల ఫలాలు రైతులందరికీ అందాలని, అందుకు సమర్థ నీటి యాజమాన్యం అవసరమని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం ప్రధాన కార్యదర్శి ఎం.శ్యామ్ప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. ఓపెన్ కాల్వలకు బదులు పైపుల ద్వారా నీటి పంపిణీ వ్యవస్థ అత్యుత్తమమైనదని వివరించారు. రాష్ట్రంలో భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ల రీ ఇంజనీరింగ్ అంశంపై శుక్రవారం రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం పరి శోధకులు, అధ్యాపకులతో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెంగాణ నీటిపారుదల రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిపారుదల ప్రాజెక్ట్ల రీఇంజనీరింగ్ చేపట్టారని అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం సమర్థ నీటి యాజమాన్య పద్ధతులు గురించి రైతాంగంలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. దేశంలో ఎక్కడ ఏ సమావేశానికి వెళ్లినా మన సీఎం కేసీఆర్, ఆయన నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్ట్లు, రైతుబంధు తదితర వాటి గురించే మాట్లాడుతున్నారని వర్సిటీ వీసీ డాక్టర్ వి.ప్రవీణ్రావు చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర జలసంఘం చైర్మన్ రాజేంద్రసింగ్, రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్కుమార్, డాక్టర్ జగదీశ్వర్, డి.వసంత్కుమార్, శాస్త్రవేత్తలు, పరిశోధకులు పాల్గొన్నారు. -
వివాహ వేడుక..
-
ఆయన సినిమాలన్నీ నా లైబ్రరీలో ఉన్నాయి
► నిర్మాత శ్యామ్ప్రసాద్రెడ్డి ‘‘నేను చిత్ర పరిశ్రమకు రావాలనుకున్నప్పుడు వంశీగారి సినిమాలనే ఎక్కువగా చూశా. ప్రతి పాత్రలో తెలుగుదనాన్ని చూపిస్తారు. వంశీగారికి టెక్నికల్గా మంచి నాలెడ్జ్ ఉంది. ఆయన ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన పాతిక సినిమాలు నా మూవీ లైబ్రరీలో ఉంచాను. వంశీగారి తాజా చిత్రం ‘ఫ్యాషన్ డిజైనర్’ పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు నిర్మాత శ్యామ్ప్రసాద్రెడ్డి. సుమంత్ అశ్విన్, అనీషా ఆంబ్రోస్, మనాలీ రాథోడ్, మానసా హిమవర్ష హీరో హీరోయిన్లుగా వంశీ దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘ఫ్యాషన్ డిజైనర్’. మణిశర్మ స్వరపరచిన ఈ చిత్రం పాటల్ని విడుదల చేయడంతో పాటు ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. దర్శకుడు వీవీ వినాయక్ సినిమా విడుదల తేదీ (జూన్ 2) బోర్డ్ని ఆవిష్కరించారు. సుమంత్ అశ్విన్ మాట్లా డుతూ– ‘‘లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల’ చిత్రాలు చూసి వంశీగారికి పెద్ద ఫ్యాన్ అయ్యా. ‘సితార, అన్వేషణ’ సినిమాలు చూసి, ఆయన్ను ఆరాధించడం మొదలుపెట్టా. మణిశర్మగారి ‘ఖుషి’ సినిమా పాటల్ని వెయ్యిసార్లు చూసుంటా’’ అన్నారు. ‘‘వంశీ, మణిశర్మ గారి కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. ఓ అభిమానిగా వాళ్ల కాంబినేషన్లో ‘ఫ్యాషన్ డిజైనర్’ తీశా. మణిశర్మగారు మంచి పాటలిచ్చారు. మా ‘మధుర’ ఆడియో ఆల్బమ్స్లో ఇదే బెస్ట్’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్. ‘‘వంశీగారిదో ప్రత్యేకమైన శైలి. ‘లేడీస్ టైలర్’ని ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు’’ అన్నారు వినాయక్. దర్శకుడు వంశీ, నిర్మాతలు ఎమ్మెస్ రాజు, తమ్మారెడ్డి భరద్వాజ, లగడపాటి శ్రీధర్, నటులు తనికెళ్ల భరణి, దర్శకులు బి.గోపాల్, బీవీయస్ రవి,æహీరో విజయ్ దేవరకొండ, సంగీత దర్శకుడు రఘుకుంచె తదితరులు పాల్గొన్నారు. -
శ్యాంప్రసాద్రెడ్డి పిటిషన్పై వివరణ ఇవ్వండి
సీబీఐకి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్ : జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఇందూ గ్రూపు సంస్థల చైర్మన్ ఐ.శ్యాంప్రసాద్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై వివరణ ఇవ్వాలని హైకోర్టు సోమవారం సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కంపెనీల తరఫున బోర్డు డెరైక్టర్ల ప్రతినిధిగా శ్యాంప్రసాద్రెడ్డి పెట్టుబడులు పెట్టారే తప్ప వ్యక్తిగతంగా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది బి.విజయసేన్రెడ్డి అన్నారు. వ్యక్తిగతంగా ప్రయోజనం కూడా పొందలేదని వివరించారు. పిటిషనర్ వ్యక్తిగత ప్రయోజనం పొందినట్టు సీబీఐ కూడా తన చార్జిషీట్లో ఎక్కడా పేర్కొనలేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ‘‘ఇందూటెక్ కేసులో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారి రత్నప్రభపై సీబీఐ కేసును హైకోర్టు కొట్టేసింది. దీన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఇండియా సిమెంట్స్ కేసులో శ్రీనివాసన్పై కేసును కూడా హైకోర్టు కొట్టేసింది. ఈ కేసుల్లో పలువురు నిందితులు హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు’’ అని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. -
పెద్ద హీరో కోసం రాసిన కథను నాతో తీస్తున్నారు : సునీల్
సునీల్ హీరోగా వాసూ వర్మ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్న చిత్రం సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కీరవాణి కెమెరా స్విచాన్ చేయగా, శ్యామ్ప్రసాద్రెడ్డి క్లాప్ ఇచ్చారు. అల్లు అరవింద్ గౌరవ దర్శకత్వం వహించారు. సునీల్ మార్క్ కామెడీ, ‘దిల్’ రాజు చిత్రాల తరహాలో ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ ఉన్న కథ ఇదని చిత్ర కథారచయిత కోన వెంకట్ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ - ‘‘గోపిచంద్ మలినేని, కోన వెంకట్ తయారు చేసుకున్న ఈ కథలో ఉన్న వినోదం నచ్చి, చేయాలనుకున్నాను. వాసూ వర్మ చాలా టాలెంటెడ్. వచ్చే నెల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఓ పెద్ద హీరో కోసం రాసుకున్న కథను తనతో తీయడం ఆనందంగా ఉందని సునీల్ అన్నారు. మంచి చిత్రం అవుతుందని వాసూవర్మ చెప్పారు. ఈ చిత్రం ద్వారా దినేష్ను సంగీతదర్శకునిగా పరిచయం చేస్తున్నారు. -
‘టీడీపీకి మద్దతు’ ప్రచారంలో వాస్తవం లేదు
ఇచ్ఛాపురం,న్యూస్లైన్: కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించి అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటామని వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు స్పష్టం చేశారు. టీడీపీకీ మద్దతు ఇస్తున్నట్టు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో పార్టీ తరఫున గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థులు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ మున్సిపల్ కన్వీనర్లు పి.పోలారావు, పి.కోటి తదితరులు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలోనే మున్సిల్ పాలన పగ్గాలు చేపడతామని, 23 వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ బీ-ఫారం ద్వారా ఎన్నికయ్యామని, ఇతర పార్టీలకు మద్దతు పలుకుతామనడంలో అర్థం లేదని, అటువంటి ప్రచారాలను నమ్మనవసరం లేదని కొట్టిపారేశారు. పార్టీ కౌన్సిలర్దందరూ ఒకే తాటిపై ఐకమత్యంగా ఉంటామని, పార్టీ అబివృద్ధికి కృషి చేస్తామన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు సాడి శ్యాంప్రసాద్ రెడ్డి, కౌన్సిలర్లుగా విజయం సాధించిన సుగ్గు ప్రేమ్ కుమార్, సాలిన ఢిల్లీ, రవికుమార్ బెహరా, బోనెల ఆనంద్, బాసి పార్వతీశం, మహిళా కౌన్సిలర్ల ప్రతినిధులు కాళ్ల దేవరాజ్, పి.కోటి, పల్లంటి వెంకట ప్రసాద్, రెయ్యి నారాయణ, బి.త్రినాథ్, పి.దేవరాజ్, ఎం.వెంకటరెడ్డి, జగన్, పార్టీ నాయకులు అనపాన పితాంబర్, గుజ్జు తారకేష్ పాల్గొన్నారు.