breaking news
shares buy back
-
బెర్క్షైర్లో భారీగా షేర్ల బై బ్యాక్..
వారెన్ బఫెట్ వారసుడిగా బెర్క్షైర్ హాత్వే పగ్గాలు చేపట్టిన గ్రెగ్ అబెల్.. కంపెనీ వద్ద పోగైన భారీ నగదు నిల్వలను క్రమంగా పెట్టుబడుల వైపు మళ్లిస్తున్నారు. 2026 రెండో త్రైమాసికంలో బెర్క్షైర్ హాత్వే దాదాపు 4.5 బిలియన్ డాలర్ల విలువైన సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. 2021 తర్వాత ఒక త్రైమాసికంలో కంపెనీ చేసిన అతిపెద్ద బైబ్యాక్ ఇదే కావడం విశేషం.జూన్తో ముగిసిన మూడు నెలల్లో బెర్క్షైర్ నిర్వహణ లాభాలు పన్నుల అనంతరం సుమారు 16 శాతం పెరిగి 13 బిలియన్ డాలర్లకు చేరాయి. రైల్వే, ఇంధన-విద్యుత్, తయారీ, సేవలు, రిటైల్ విభాగాల్లో మెరుగైన పనితీరు లాభాల పెరుగుదలకు ప్రధాన కారణమైంది. అయితే ఇన్సూరెన్స్ అండర్రైటింగ్ లాభాలు తగ్గడం కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపింది.14 త్రైమాసికాల తర్వాత ఈక్విటీల కొనుగోలుబెర్క్షైర్లో అత్యంత ఆసక్తికరమైన మార్పు దాని పెట్టుబడి వ్యూహంలో కనిపించింది. వరుసగా 14 త్రైమాసికాల పాటు అమెరికా ఈక్విటీలను నికరంగా విక్రయించిన సంస్థ.. ఈసారి సుమారు 20 బిబిలియన్ డాలర్ల నికర స్టాక్ కొనుగోళ్లు చేసింది. ఫలితంగా జూన్ చివరి నాటికి కంపెనీ వద్ద నగదు, నగదుతో సమానమైన ఆస్తులు, అమెరికా ట్రెజరీ బిల్లుల నిల్వలు కలిపి సుమారు 365.5 బిలియన్ డాలర్లకు తగ్గాయి. మార్చి చివర్లో ఈ మొత్తం దాదాపు 397.4 బిలియన్ డాలర్లుగా ఉంది.అయితే ఈ భారీ నగదు నిల్వ పూర్తిగా తగ్గిపోలేదు. బెర్క్షైర్ ఇప్పటికీ అమెరికాలోనే అత్యంత భారీ నగదు నిల్వ కలిగిన కంపెనీల్లో ఒకటిగా ఉంది. జూన్ చివరి నాటికి దాని వద్ద సుమారు 325 బిలియన్ డాలర్ల ట్రెజరీ బిల్లులు ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి.గూగుల్పై 10 బిలియన్ డాలర్ల బెట్టింగ్గ్రెగ్ అబెల్ నాయకత్వంలో బెర్క్షైర్ భారీగా పెట్టుబడులు పెడుతున్న మరో రంగం టెక్నాలజీ. కంపెనీ రెండో త్రైమాసికంలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్లో సుమారు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టినట్లు వెల్లడైంది. ఈ పెట్టుబడితో ఆల్ఫాబెట్ బెర్క్షైర్ ఈక్విటీ పోర్ట్ఫోలియోలోని టాప్-5 హోల్డింగ్స్లోకి చేరింది. చెవ్రాన్ స్థానాన్ని ఆల్ఫాబెట్ ఆక్రమించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆల్ఫాబెట్ భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.టేలర్ మోరిసన్ కొనుగోలుతో హౌసింగ్లో అడుగుఅబెల్ నాయకత్వంలో బెర్క్షైర్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ప్రముఖ హోమ్బిల్డర్ టేలర్ మోరిసన్ హోమ్ కార్పొరేషన్ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో షేరుకు 72.50 డాలర్ల చొప్పున నగదు చెల్లించే ఈ డీల్లో ఈక్విటీ విలువ సుమారు 6.8 బిలియన్ డాలర్లు, మొత్తం ఎంటర్ప్రైజ్ విలువ సుమారు 8.5 బిలియన్ డాలర్లు. బెర్క్షైర్ ఇప్పటికే క్లేటన్ హోమ్స్, ఇతర బిల్డింగ్ ప్రొడక్ట్స్ వ్యాపారాల ద్వారా హౌసింగ్ రంగంలో ఉన్న నేపథ్యంలో ఈ కొనుగోలు ఆ వ్యాపారాన్ని మరింత విస్తరించే అవకాశం కల్పిస్తుంది.బఫెట్తో పోలిస్తే భిన్నమైన దిశవారెన్ బఫెట్ కాలంలో బెర్క్షైర్ భారీ నగదు నిల్వలను కొనసాగిస్తూ, ఆకర్షణీయమైన విలువలు కనిపించే వరకు పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండేది. ముఖ్యంగా అమెరికా షేర్ల విలువలు అధికంగా ఉన్నాయంటూ బఫెట్ పలుమార్లు హెచ్చరించారు. అయితే 2026లో అబెల్ నాయకత్వం ప్రారంభమైన తర్వాత పరిస్థితి మారుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. షేర్ల బైబ్యాక్లు, ఆల్ఫాబెట్లో భారీ పెట్టుబడి, టేలర్ మోరిసన్ కొనుగోలు.. బెర్క్షైర్ తన నగదు నిల్వలను మరింత చురుగ్గా వినియోగించేందుకు సిద్ధమవుతోందనే సంకేతాలుగా మార్కెట్ విశ్లేషకులు చూస్తున్నారు.అయితే ఈ మార్పుల మధ్య బెర్క్షైర్ షేరు పనితీరు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఆగస్టు 7న మార్కెట్ ముగిసే సమయానికి క్లాస్-B షేర్లు ఈ ఏడాది సుమారు 3.8 శాతం మాత్రమే పెరిగాయి. ఇదే సమయంలో S&P 500 దాదాపు 13 శాతం లాభపడింది. దీంతో అబెల్ తీసుకుంటున్న కొత్త పెట్టుబడి నిర్ణయాలు బెర్క్షైర్కు దీర్ఘకాలంలో ఎంత మేర విలువను సృష్టిస్తాయన్నది ఇప్పుడు ఇన్వెస్టర్ల ప్రధాన ప్రశ్నగా మారింది. -
జూలై 1 నుంచి బజాజ్ ఆటో షేర్ల బైబ్యాక్
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో రూ.5,632 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ ప్రక్రియ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. బైబ్యాక్లో భాగంగా దాదాపు 46.94 లక్షల ఈక్విటీ షేర్లను కంపెనీ తిరిగి కొనుగోలు చేయనుంది. ప్రతి షేరు ధరను రూ.12,000 గా నిర్ణయించారు. ఈ ఆఫర్ జూలై 7న ముగుస్తుందని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. ఈ ప్రతిపాదనకు బజాజ్ ఆటో బోర్డు మే 6న ఆమోదం తెలపగా... మే 14న పోస్టల్ బ్యాలెట్ ద్వారా షేర్హోల్డర్లు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించారు. -
1.1 బిలియన్ డాలర్లు ముందస్తు చెల్లింపు
న్యూఢిల్లీ: తనఖాలో ఉన్న అదానీ గ్రూప్ సంస్థల షేర్లను విడిపించుకునేందుకు ప్రమోటర్లు 1.1 బిలియన్ డాలర్లను ముందస్తుగా చెల్లించనున్నారు. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్స్ (ఏపీసెజ్) , అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్ (ఏటీఎల్) సంస్థల షేర్లు వీటిలో ఉన్నాయి. ఇవి వచ్చే ఏడాది సెప్టెంబర్లో మెచ్యూర్ కానున్నాయి. ఇటీవల మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు అదానీ గ్రూప్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అదానీ గ్రూప్ సంస్థల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికన్ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో కంపెనీల షేర్లు కుప్పకూలిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రకటన ప్రకారం తనఖా ఉంచిన షేర్లకు సంబంధించి ఏపీసెజ్లో 12 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 3 శాతం, అదానీ ట్రాన్స్మిషన్లో 1.4 శాతం ప్రమోటర్ల వాటాలను విడిపించనున్నారు. అదానీ ట్రాన్స్మిషన్ లాభం 73 శాతం అప్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అదానీ ట్రాన్స్మిషన్ లాభం దాదాపు 73 శాతం పెరిగి రూ. 478 కోట్లకు చేరింది. అమ్మకాల వృద్ధి, వన్టైమ్ ఆదాయం నమోదు కావడం ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో లాభం రూ. 277 కోట్లు. తాజాగా ఆదాయం రూ. 2,623 కోట్ల నుంచి రూ. 3,037 కోట్లకు చేరింది. -
షేర్ల బైబ్యాక్పై సెబీ కీలక నిర్ణయం.. ఇక ఆ విధానానికి చెల్లుచీటీ
ముంబై: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షేర్ల బైబ్యాక్ విధానాన్ని క్రమబద్ధీకరించేందుకు నడుం బిగించింది. ఇందుకు మంగళవారం(20న) జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఎఫ్పీఐల రిజిస్ట్రేషన్ సమయాన్ని కుదించడం, స్టాక్ ఎక్స్ఛేంజీలు, ఇతర మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలలో సుపరిపాలన పెంపు, తదితర పలు చర్యలను చేపట్టింది. చైర్మన్ మాధవీ పురీ బచ్ అధ్యక్షతన సమావేశమైన సెబీ బోర్డు పలు ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. స్టాక్ ఎక్స్ఛేంజీల రూట్కు చెక్ లిస్టెడ్ కంపెనీలు ఈక్విటీ షేర్ల బైబ్యాక్లను స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా చేపట్టే విధానానికి దశలవారీగా తెరపడనుంది. ఈ విధానంలో లొసుగులకు చెక్ పెడుతూ భవిష్యత్లో టెండర్ మార్గంలోనే వీటిని అనుమతించనుంది. ఇకపై ప్రస్తుత విధానంలో స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా బైబ్యాక్ను చేపడితే ఇందుకు కేటాయించిన నిధులను 75% వరకూ వినియోగించవలసి ఉంటుంది. ప్రస్తుతం ఈ పరిమితి 50 శాతంగా ఉంది. షేర్ల కొనుగోలు వివరాలపై స్పష్టత కోసం స్టాక్ ఎక్స్ఛేంజీలలో ప్రత్యేక విండోను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. కేకి మిస్త్రీ కమిటీ సూచనలు చ్డీఎఫ్సీ వైస్చైర్మన్, సీఈవో కేకి మిస్త్రీ అధ్యక్షతన ఏర్పాటైన సెబీ కమిటీ షేర్ల బైబ్యాక్ మెకనిజంలో మార్పులను సూచించింది. 2025 ఏప్రిల్కల్లా స్టాక్ ఎక్స్ఛేంజీల విధానానికి గుడ్బై చెప్పమని సలహా ఇచ్చింది. టెండర్ ఆఫర్ మార్గంలో బైబ్యాక్ను 18 రోజుల్లోగా పూర్తి చేయవలసి ఉంటుంది. వీటితోపాటు రికార్డ్ డేట్కు ఒక రోజు ముందువరకూ బైబ్యాక్ ధరను పెంచేందుకు వీలు కల్పించింది.పస్తుతం బైబ్యాక్లకు స్టాక్ ఎక్స్ఛేంజీలు, టెండర్ ఆఫర్ మార్గాలను అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. గ్రీన్ బాండ్లకు దన్ను: గ్రీన్ బాండ్ల మార్గదర్శకాలకు బలాన్నిస్తూ బ్లూ బాండ్లు, యెల్లో బాండ్ల జారీకి అనుమతించింది. తద్వారా నిలకడైన ఫైనాన్స్కు కొత్త విధానాలను ప్రవేశపెట్టింది. గ్రీన్ రుణ సెక్యూరిటీలలో భాగంగా వాటర్ మేనేజ్మెంట్, సముద్ర సంబంధ(మెరైన్) రంగాలకు బ్లూ బాండ్లు, సోలార్ ఎనర్జీకి యెల్లో బాండ్లను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా గ్రీన్వాషింగ్ సంబంధ రిస్కులకు చెక్ పెట్టనుంది. అంటే గ్రీన్ బాండ్ల జారీ ద్వారా సమీకరించే నిధులను పర్యావరణ లబ్ధి అంతగాలేని ప్రాజెక్టులకు మళ్లించడాన్ని అడ్డుకోనుంది. కాలుష్య నివారణ, నియంత్రణలతోపాటు.. పర్యావరణ అనుకూల ప్రొడక్టులకు నిధులు లభించేలా నిబంధనలకు తెరతీసింది. దేశీ కంపెనీలు ఈఎస్జీ, గ్రీన్ బాండ్ల ద్వారా 2021లో 7 బిలియన్ డాలర్లను సమీకరించాయి. 2020లో ఇవి కేవలం 1.4 బిలియన్ డాలర్లుకాగా.. 2019లో 4 బిలియన్ డాలర్లు సమకూర్చుకున్నాయి. గ్రీన్ బాండ్లలో అత్యధికం విదేశీ ఎక్స్ఛేంజీలలో లిస్టవుతున్నాయి. మూడు కీలక విభాగాలుగా స్టాక్ ఎక్స్ఛేంజీలు సహా క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీలు తదితర మార్కెట్ మౌలిక సంస్థ(ఎంఐఐ)లలో మరింత సుపరిపాలనకు నిబంధనలు సవరించింది. దీంతో మెరుగైన పారద్శకత, జవాబుదారీతనాలకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఎంఐఐలను మూడు విభాగాలుగా వర్గీకరించింది. వీటిని క్రిటికల్ ఆపరేషన్స్, రెగ్యులేటరీ, కంప్లయెన్స్, రిస్క్ మేనేజ్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్సహా ఇతర కార్యకలాపాలుగా పేర్కొంది. ఇతర నిబంధనలు... ► మ్యూచువల్ ఫండ్ పథకాలకు ఎగ్జిక్యూషన్ ఓన్లీ ప్లాట్ఫామ్స్(ఈవోపీ) విధానానికి తెరతీసింది. తద్వారా ఎంఎఫ్ స్కీముల ప్రత్యక్ష పథకాలలో పెట్టుబడులకు సరళతను తీసుకువచ్చింది. డిజిటల్ మార్గంలో వీటికి సంబంధించిన కొనుగో లు, రిడెంప్షన్లను చేపట్టేందుకు వీలుంటుంది. ► కొన్ని సందర్భాలలో ట్రేడింగ్ సర్వీసుల వైఫల్యంతో ఇన్వెస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెడుతూ ఇన్వెస్టర్ రిస్క్లు తగ్గించే ప్లాట్ఫామ్ను వచ్చే ఏడాది(2023–24) మూడో త్రైమాసికానికల్లా ప్రవేశపట్టే వీలుంది. తద్వారా స్టాక్ బ్రోకర్లు అందించే సర్వీసుల్లో అవాంతరాలు ఎదురైనప్పుడు ఇన్వెస్టర్లకు రక్షణగా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అందుబాటులోకి వచ్చే వీలుంది. ► లిస్టెడ్ కంపెనీల బాటలో రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(రీట్స్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(ఇన్విట్స్)కు సైతం పాలనా సంబంధ మార్గదర్శకాలు రూపొందించింది. ఆడిటర్ల ఎంపిక, క్లెయిమ్కాని, చెల్లించని పంపిణీకాని నిధులు తదితర అంశాలలో నిబంధనలను క్రమబద్ధీకరించింది. దీంతో ఈ నిధులు ఇన్వెస్టర్ రక్షణ, ఎడ్యుకేషన్ ఫండ్కు బదిలీకానున్నాయి. చదవండి: 8 ఏళ్లలో రూ. 4 లక్షల కోట్లు.. డిజిన్వెస్ట్మెంట్తో కేంద్రం ఆదాయం -
సెప్టెంబర్ వరకూ తనఖా షేర్ల విక్రయం ఉండదు
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు ఊరట లభించింది. ప్రమోటర్ తనఖా పెట్టిన షేర్లను ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ విక్రయించకుండా రుణదాతలతో ఒక ఒప్పందాన్ని రిలయన్స్ గ్రూప్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి రుణదాతల్లో దాదాపు 90 శాతం సంస్థలు అంగీకరించాయి. ఈ ఒప్పందంలో భాగంగా రుణదాతలకు గడువు ప్రకారమే వడ్డీ, అసలు చెల్లింపులను రిలయన్స్ గ్రూప్.. జరుపుతుంది. అంతే కాకుండా రిలయన్స్ పవర్లో రిలయన్స్గ్రూప్నకు నేరుగా ఉన్న 30 శాతం వాటాలో పాక్షిక వాటాను సంస్థాగత ఇన్వెస్టర్లకు విక్రయించడం కోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లను నియమించింది. ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు త్వరలో రోడ్షోలను నిర్వహిస్తారు. రిలయన్స్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకున్న రుణదాతల్లో టెంపుల్టన్ ఎమ్ఎఫ్, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా ఎమ్ఎఫ్, ఇండియాబుల్స్ ఎమ్ఎఫ్, ఇండస్ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్లు ఉన్నాయి. కాగా తనఖా షేర్లు విక్రయించకుండా యథాతథ ఒప్పందం కుదిరినందుకు రుణదాతలకు రిలయన్స్ గ్రూప్ ధన్యవాదాలు తెలిపింది. తమపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞులమని రిలయన్స్ గ్రూప్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఇటీవల రిలయన్స్ గ్రూప్ షేర్లు భారీగా పతనమైన విషయం తెలిసిందే. ఈ పతనం కారణంగా తనఖా పెట్టిన షేర్ల విలువ బాగా తగ్గినప్పటికీ, రుణదాతలు తనఖా షేర్లను విక్రయించబోమని తాజా ఒప్పందం ద్వారా అభయం ఇచ్చాయి. ఎడెల్వీజ్కు బకాయి రూ.150 కోట్లు తనఖా పెట్టిన షేర్లను ఎల్ అండ్ టీ ఫైనాన్స్, ఎడెల్వీజ్ సంస్థలు అన్యాయంగా కావాలని ఓపెన్ మార్కెట్లో విక్రయించాయని, ఫలితంగా తమ కంపెనీల షేర్ల విలువలు భారీగా పడిపోయాయని రిలయన్స్ గ్రూప్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను ఈ ఇరు కంపెనీలు ఖండించాయి. తనఖా ఒప్పందం ప్రకారమే షేర్లను విక్రయించామని, ఎలాంటి దురుద్దేశం లేదని ఎడెల్వీజ్ పేర్కొంది. కాగా క్యాపిటల్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఎడెల్వీజ్ను తక్షణం నిషేధించాలని కూడా సెబీని రిలయన్స్ గ్రూప్ కోరింది. కాగా రిలయన్స్ గ్రూప్ ఎడెల్వీజ్ సంస్థకు రూ.150 కోట్ల రుణం చెల్లించాల్సి ఉండగా, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ రుణం పూర్తిగా తీరిపోయింది. -
జోరుగా షేర్ల బైబ్యాక్..!!
ముంబై: గత రెండేళ్లుగా కంపెనీలు షేర్లను బైబ్యాక్ చేయడం గణనీయంగా పెరుగుతోంది. 2009 తర్వాత మళ్లీ ఈ ఆర్థిక సంవత్సరం అత్యధిక స్థాయిలో బైబ్యాక్ జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల సారథ్యంలో దేశీ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 52,350 కోట్ల నిధులు ఇందుకోసం వెచ్చించాయి. గత ఆర్థిక సంవత్సరంలో వెచ్చించిన రూ. 34,000 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 54 శాతం అధికం కావడం గమనార్హం. 2017–18లో మొత్తం 56 కంపెనీలు షేర్ల బైబ్యాక్ ప్రకటించాయి. ఈ జాబితాలో ఐటీ కంపెనీలే అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ. 16,000 కోట్లు వెచ్చించగా, మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ. 13,000 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. అటు విప్రో రూ. 11,000 కోట్లు, హెచ్సీఎల్ టెక్నాలజీస్ రూ. 3,500 కోట్లు.. షేర్లను తిరిగి కొనుగోలు చేసేందుకు వెచ్చించాయి. మరోవైపు, ప్రభుత్వ రంగ సంస్థలు సైతం విస్తరణ ప్రణాళికలకు కాకుండా కేంద్రం డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాల సాధన కోసం షేర్ల బైబ్యాక్ చేపట్టాయి. 12 ప్రభుత్వ రంగ సంస్థలు ఇందులో ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) గణాంకాల ప్రకారం.. ఆయిల్ ఇండియా, ఈఐఎల్, హెచ్ఏఎల్, ఎస్జేవీఎన్ తదితర సంస్థల్లో బైబ్యాక్ మార్గం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 5,000 కోట్లు సమీకరించింది. విస్తరణ ప్రణాళికలు లేకపోవడం కారణం.. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్కి అదనంగా డివిడెండ్ ట్యాక్స్ను ప్రవేశపెట్టడం, దీనికి తోడు మెరుగైన విస్తరణ ప్రణాళికలేమీ లేకపోవడం తదితర అంశాల కారణంగా కంపెనీలు ఈ విధంగా బైబ్యాక్లు జరిపి ఉంటాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. తమ బుక్ వ్యాల్యూను మెరుగుపర్చుకునే క్రమంలో నగదు నిల్వలను ఇందుకోసం వెచ్చించి ఉంటాయని తెలిపాయి. 2016 ఏప్రిల్ 1 నుంచి కేంద్రం అదనపు డివిడెండ్ ట్యాక్స్ను అమల్లోకి తెచ్చింది. డివిడెండ్ రూ. 10 లక్షలకు మించిన పక్షంలో .. దాన్ని అందుకున్న వారు 10 శాతం మేర పన్ను కట్టాల్సి ఉంటుంది. కంపెనీ అప్పటికే చెల్లించే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ)కి ఇది అదనం. వ్యాపార వృద్ధి అంతంత మాత్రంగా ఉంటున్న నేపథ్యంలో దేశీ సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రధానంగా ఈ బైబ్యాక్స్ చేపట్టినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. డిమాండ్ మందగించడంతో గడిచిన కొన్నేళ్లుగా కంపెనీలు .. వ్యాపార వృద్ధికి ఉపయోగపడే పెట్టుబడుల వ్యయాలను తగ్గించాయి. సీఎంఈఐ డేటా ప్రకారం 2017వ సంవత్సరంలో కొత్త పెట్టుబడుల ప్రతిపాదనలు కేవలం రూ. 7.9 లక్షల కోట్లు మాత్రమే రావడం దీనికి నిదర్శనం. 2014లో రూ. 16.2 లక్షల కోట్లుగా ఉన్న కొత్త పెట్టుబడుల ప్రతిపాదనలు.. 2015లో రూ. 15.3 లక్షల కోట్లకు, 2016లో రూ. 14.5 లక్షల కోట్లకు తగ్గిపోయాయి. -
ఒత్తిళ్లకు తలొగ్గిన ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్
బెంగళూరు : ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యుషన్ కార్ప్ తన కంపెనీలోకి కొత్త డైరెక్టర్లను నియమించుకుంది. తన ప్రధాన పెట్టుబడిదారి ఇరియట్ మేనేజ్మెంట్ ఒత్తిళ్లకు తలొగ్గి ముగ్గురు కొత్త డైరెక్టర్లను నియమించుకునేందుకు సమ్మతించింది. అంతేకాక ఇన్వెస్టర్లకు 3.4 బిలియన్ డాలర్ల(రూ.22831కోట్లు)ను రిటర్న్ ఇవ్వనున్నట్టు పేర్కొంది. నవంబర్లో ఇలియట్కు 4 శాతం కంటే ఎక్కువ స్టాక్ ఉంది. షేర్హోల్డర్ విలువను పెంచడానికి ఈ ఐటీ సర్వీసు ప్రొవైడర్ మరింత సహకరించాలని ఇలియట్ ఎప్పటినుంచో వాదిస్తోంది. ఈ మేరకు ఒత్తిళ్లకు తలొగ్గిన కంపెనీ బోర్డు వచ్చే రెండేళ్లలో షేర్హోల్డర్స్కు రూ. 22,831 కోట్లకు పైగా కేటాయించే ప్లాన్ను బుధవారం ఆమోదించింది. షేర్ల బై బ్యాక్, డివిడెంట్ రూపంలో ఈ మొత్తాన్ని ఐటీ దిగ్గజం షేర్ హోల్డర్స్కు కేటాయించనుంది. 2017-18 ఆర్థికసంవత్సరంలో తొలి క్వార్టర్లో 1.5 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను, రెండో క్వార్టర్లో 1.2 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను పునః కొనుగోలు చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.


