1.1 బిలియన్‌ డాలర్లు ముందస్తు చెల్లింపు | Adani to prepay 1. 11 billion Dollers loans on shares | Sakshi
Sakshi News home page

1.1 బిలియన్‌ డాలర్లు ముందస్తు చెల్లింపు

Feb 7 2023 6:09 AM | Updated on Feb 7 2023 6:09 AM

Adani to prepay 1. 11 billion Dollers loans on shares - Sakshi

న్యూఢిల్లీ: తనఖాలో ఉన్న అదానీ గ్రూప్‌ సంస్థల షేర్లను విడిపించుకునేందుకు  ప్రమోటర్లు 1.1 బిలియన్‌ డాలర్లను ముందస్తుగా చెల్లించనున్నారు. అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్స్‌ (ఏపీసెజ్‌) , అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌ (ఏటీఎల్‌) సంస్థల షేర్లు వీటిలో ఉన్నాయి. ఇవి వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో మెచ్యూర్‌ కానున్నాయి. ఇటీవల మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు అదానీ గ్రూప్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

అదానీ గ్రూప్‌ సంస్థల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికన్‌ షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణలతో కంపెనీల షేర్లు కుప్పకూలిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రకటన ప్రకారం తనఖా ఉంచిన షేర్లకు సంబంధించి ఏపీసెజ్‌లో 12 శాతం, అదానీ గ్రీన్‌ ఎనర్జీలో 3 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 1.4 శాతం ప్రమోటర్ల వాటాలను విడిపించనున్నారు.

అదానీ ట్రాన్స్‌మిషన్‌ లాభం 73 శాతం అప్‌..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అదానీ ట్రాన్స్‌మిషన్‌ లాభం దాదాపు 73 శాతం పెరిగి రూ. 478 కోట్లకు చేరింది. అమ్మకాల వృద్ధి, వన్‌టైమ్‌ ఆదాయం నమోదు కావడం ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ త్రైమాసికంలో లాభం రూ. 277 కోట్లు. తాజాగా ఆదాయం రూ. 2,623 కోట్ల నుంచి రూ. 3,037 కోట్లకు చేరింది.
 

Advertisement
 
Advertisement
Advertisement