అదానీ పోర్ట్స్‌ లాభం జూమ్‌ క్యూ3లో రూ. 3,043 కోట్లు | Adani Ports Q3 net profit rises 21 Percentage to Rs 3043 crore | Sakshi
Sakshi News home page

అదానీ పోర్ట్స్‌ లాభం జూమ్‌ క్యూ3లో రూ. 3,043 కోట్లు

Feb 4 2026 3:56 AM | Updated on Feb 4 2026 3:56 AM

Adani Ports Q3 net profit rises 21 Percentage to Rs 3043 crore

న్యూఢిల్లీ: మౌలిక రంగ దిగ్గజం అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 21 శాతం జంప్‌చేసి రూ. 3,043 కోట్లను తాకింది. కార్గో హ్యాండ్లింగ్‌ బిజినెస్‌లో వృద్ధి కారణంగా ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 2,518 కోట్లు మాత్రమే ఆర్జించింది.

మొత్తం ఆదాయం సైతం రూ. 7,964 కోట్ల నుంచి రూ. 9,705 కోట్లకు బలపడింది. ఇది 22 శాతం అధికంకాగా.. దేశీ పోర్టుల నుంచి రూ. 6,701 కోట్లు, అంతర్జాతీయ పోర్టుల నుంచి రూ. 1,067 కోట్లు చొప్పున టర్నోవర్‌ సాధించింది. ఈ కాలంలో కార్గో హ్యాండ్లింగ్‌ 9 శాతం పుంజుకుని 123 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు చేరింది. పూర్తి ఏడాదికి రూ. 11,000– 12,000 కోట్ల పెట్టుబడి వ్యయాలపై దృష్టి పెట్టింది. 
ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్‌ఈలో 9 %పైగా జంప్‌చేసి రూ. 1,531 వద్ద ముగిసింది.

లియోనార్డోతో అదానీ గ్రూప్‌ భాగస్వామ్యం 
న్యూఢిల్లీ: భారత్‌లో సమగ్ర హెలికాప్టర్ల తయారీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇటాలియన్‌ దిగ్గజం లియోనార్డోతో అదానీ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ చేతులు కలిపింది. భారత సాయుధ బలగాలకు అవసరమైన ఉత్పత్తులను, ముఖ్యంగా లియోనార్డోకి చెందిన ఏడబ్ల్యూ169ఎం, ఏడబ్ల్యూ109 ట్రెకర్‌ఎం హెలికాప్టర్లకి సంబంధించి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దశలవారీగా దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు, మెయింటెనెన్స్‌–రిపేర్‌–ఓవర్‌హాల్‌ (ఎంఆర్‌వో) సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు, పైలట్లకు శిక్షణనిచ్చేందుకు ఈ డీల్‌ ఉపయోగపడుతుందని అదానీ గ్రూప్‌ తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement