అత్యాచారం.. అవమానభారంతో ఆత్మాహుతి!!
రాజస్థాన్లో ఘోరం జరిగింది. అత్యాచారానికి గురయ్యానన్న అవమానంతో ఓ యువతి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలు ఉండే భవనంలోనే అద్దెకు ఉంటున్న మనీష్ (25) అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ యువతి తల్లిదండ్రులు పనిమీద బయటకు వెళ్లగా, ఆమె ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో మంగళవారం నాడు ఈ దారుణం జరిగింది.
మనీష్ ఆమెపై అత్యాచారం చేస్తుండగా, అతడి స్నేహితుడు రాజేంద్ర శర్మ కిటికీలోంచి చూసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అవమాన భారాన్ని భరించలేక ఆమె తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె పెట్టిన కేకలు విని ఇరుగుపొరుగులు వచ్చి రక్షించి ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఆస్పత్రిలోనే ఆమె వాంగ్మూలం తీసుకున్నట్లు ఏసీపీ ప్రేమ్ దన్ రత్ను తెలిపారు. ఈ కేసులో నిందితులైన మనీష్, రాజేంద్ర ఇద్దరినీ అరెస్టు చేశామన్నారు.