breaking news
Seed production system
-
విత్తన నాణ్యతకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి: కన్నబాబు
సాక్షి, అమరావతి: ఆర్బీకేల ద్వారా విత్తనోత్పత్తి చేయనున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. విత్తన నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని మంత్రి తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన వన శాఖల ఉన్నతాధికారులతో విత్తనోత్పత్తి, వర్షాల వల్ల నెలకొన్న వ్యవసాయ పరిస్థితులపై మంత్రి కన్నబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విత్తనాలు పండించే రైతులు, కంపెనీల వివరాలు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. విత్తనం పండించే ప్రతి ఎకరం రిజిస్ట్రేషన్ చేస్తామని, ప్రాచుర్యం పొందిన హైబ్రిడ్ విత్తనాల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని విత్తన హబ్గా చేసేందుకు సీడ్స్ నూతన పాలసీ తోడ్పడుతోందన్నారు. ఇతర రాష్ట్రాలకు సీడ్స్ మార్కెటింగ్ చేసేలా ప్రణాళికలు చేయాలన్నారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, రైతులకు అండగా నిలవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారని కన్నబాబు తెలిపారు. ‘‘జులై 22 వరకు 200.3 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాల్సి ఉంటే 256 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అనంతపురం, చిత్తూర్, కడప లో వర్షాలు పడ్డాయి. పశ్చిమ గోదావరి, కృష్ణ, కర్నూలులో అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 55 మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో పొలాల్లో ముంపుకి గురయ్యాయి. వర్షం నిలిస్తే ఆ నీరు పోయే అవకాశం ఉంది. వర్షాలు తగ్గితే పూర్తిగా ఎన్యుమరేషన్ చేయాలి. వర్షాలు తగ్గిన వెంటనే పంట నష్టాలని పక్కాగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని’’ అధికారులను కన్నబాబు ఆదేశించారు. రైతులకు నష్టం జరిగితే తక్షణమే స్పందించాలన్నారు. ఈ వర్షాలు కూడా ఖరీఫ్ కు కలిసొచ్చే అంశమన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బందితో వర్షాల వల్ల నెలకొన్న పరిస్థితులను టెలీ కాన్ఫెరెన్స్ ద్వారా మంత్రి కన్నబాబు అడిగి తెలుసుకున్నారు. ఏ రైతు ఈ వర్షాల వల్ల నష్టపోకుండా చూడాలని ఆదేశించారు. అనంతపురం జిల్లాలో ఆగస్టు 5 వరకు సబ్సిడీ వేరుశెనగ విత్తనాలను సరఫరా చేయాలని నిర్ణయించామన్నారు. రైతులకు ఇచ్చే ప్రతి విత్తనం నాణ్యమైనదై ఉండాలని, ధ్రువీకరించినదై ఉండాలని మంత్రి కన్నబాబు ఆదేశించారు. -
గ్రామాల్లో సంప్రదాయ విత్తన బ్యాంకులు
బహుళజాతి హైబ్రీడ్కు అడ్డుకట్ట జాతీయ జీవ వైవిధ్య మండలి నిర్ణయం హైదరాబాద్: వ్యవసాయంలో విత్తనం అత్యంత కీలకం. సంప్రదాయ విత్తనాల తయారీ వ్యవస్థ ధ్వంసమవడంతో అన్ని రకాల విత్తనాల కోసం రైతు బహుళజాతి సంస్థలు, ఇతర కంపెనీలపై ఆధారపడాల్సి వస్తోంది. పైగా హైబ్రీడ్ వంగడాలను సృష్టించి రైతులకు మరో గత్యంతరం లేకుండా చేస్తున్నాయి. విత్తనాల కోసం ప్రతిసారి తమ వద్దకే రావాల్సిన పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఇక పురుగుమందులు, ఎరువులను సకాలంలో వాడితేనే దిగుబడి పెరుగుతున్న నేపథ్యంలో రైతుకు పంటల పెట్టుబడి తడిసి మోపెడవుతోంది. మరోపక్క పర్యావరణం, జీవ వైవిధ్యం దిబ్బతింటోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు, అన్నదాతకు అండగా నిలిచేందుకు జాతీయ జీవవైవిధ్య మండలి నడుం బిగించింది. సంప్రదాయ విత్తనాలను అందుబాటులోకి తెచ్చి బహుళజాతి హైబ్రిడ్ విత్తన వ్యవస్థకు చరమగీతం పాడాలని నిశ్చయించుకుంది. రెండేళ్లలో తెలంగాణవ్యాప్తంగా కనీసం 400 గ్రామాల్లో సంప్రదాయ విత్తన బ్యాంకులను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఇందులో మొదటగా ఆదిలాబాద్ జిల్లాను, అందులోనూ తొలుత ఐదు గ్రామాలను ఎంపిక చేసింది. వ్యాపారం కాదు... ఇచ్చిపుచ్చుకునే పద్దతి ఇప్పటివరకు 50 రకాల సంప్రదాయ విత్తనాలను జీవ వైవిధ్య మండలి సేకరించింది. వాటిలో వరి, జొన్న, సజ్జ, రాగులు, అవిసెలు వంటి ధాన్యపు వంగడాలు, దేశీయ వంకాయ, టమాట, బెండకాయ తదితర కూరగాయలు, రకరకాల పూలకు సంబంధించిన విత్తనాలు ఉన్నాయి. ఒక్క వంకాయలోనే వెయ్యి రకాల దేశీయ రకాలు ఉండటం విశేషం. సంప్రదాయ సుగంధ, ఔషధ మొక్కలు, మామిడి, సపోట, నేరేడు, పనాస వంటి పండ్ల విత్తనాలు కూడా ఉన్నాయి. ఇంకా అనేక దేశీయ విత్తనాలను సేకరించేందుకు జీవ వైవిధ్య మండలి కృషి చేస్తోంది. ఇందుకోసం ఇక్రిశాట్, ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ, నేషనల్ బ్యూరో ఆఫ్ ఫ్లాంట్ జెనటిక్ రిసోర్సెస్(ఎన్బీపీజీఆర్) వంటి సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. ఆయా సంస్థల వద్ద సంప్రదాయ విత్తన నమూనాలు జాగ్రత్తగా ఉన్నాయి. వాటిని కూడా సేకరించి.. అన్ని రకాల వంగడాలను గ్రామ సంప్రదాయ విత్తన బ్యాంకులకు చేరవేస్తారు. గ్రామ సర్పంచి చైర్మన్గా, మరో ఇద్దరు మహిళా సభ్యులతో ఏర్పాటయ్యే కమిటీనే ఈ విత్తన బ్యాంకుల నిర్వహణ బాధ్యత తీసుకుంటుంది. ఒక్కో విత్తన బ్యాంకు ఏర్పాటుకు దాదాపు రూ. లక్ష ఖర్చవుతుందని అంచనా. ఆ డబ్బుతో విత్తనాల సేకరణ, ఒక షెడ్డు, నిల్వ ఏర్పాటు వంటివి సమకూర్చుతారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ నిధులను జీవ వైవిధ్య మండలే సమకూర్చుతుంది. ఈ విత్తన బ్యాంకుల ద్వారా దేశీయ విత్తనాలను రైతులకు అందజేస్తారు. ఎన్ని కేజీల విత్తనాలు తీసుకుంటే వాటికి రెట్టింపు విత్తనాలను పంట పండించాక ఈ బ్యాంకుకు రైతు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. మిగతావి అమ్ముకోవచ్చు. విత్తన బ్యాంకులు వ్యాపారం చేయవు. ఈ విత్తనాలతో పండించే పంటలకు సేంద్రీయ ఎరువులు, వర్మికంపోస్టు వంటివి మాత్రమే వాడేలా చేస్తారు.