breaking news
Second team
-
Ind Vs SL ఆడుతూ పాడుతూ... భారత్ ఘనవిజయం
కొలంబో: పేరుకు ద్వితీయ శ్రేణి జట్టయినా ఊహించినట్టుగానే భారత జట్టు పూర్తి ఆధిపత్యం చలాయించింది. అగ్రశ్రేణి ఆటగాళ్ల గైర్హాజరీలో డీలాపడ్డ శ్రీలంకపై తొలి వన్డేలో ఘనవిజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి వన్డేలో శిఖర్ ధావన్ నాయకత్వంలోని టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 262 పరుగులు చేసింది. చమిక కరుణరత్నే (35 బంతుల్లో 43 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు), కెప్టెన్ దసున్ షనక (50 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. లక్ష్యఛేదనలో భారత్ 36.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 263 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ శిఖర్ ధావన్ అజేయ అర్ధ సెంచరీ (95 బంతుల్లో 86 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్)తో చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. ‘బర్త్డే బాయ్’ వన్డేల్లో అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్ (42 బంతుల్లో 59; 8 ఫోర్లు, 2 సిక్స్లు)... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పృథ్వీ షా (24 బంతుల్లో 43; 9 ఫోర్లు) మెరుపులు మెరిపించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఇన్నింగ్స్ నిలకడగా సాగింది. అవిష్క ఫెర్నాండో (35 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్), మినోద్ భానుక (44 బంతుల్లో 27; 3 ఫోర్లు) భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 10వ ఓవర్లో బౌలింగ్కు వచ్చిన చహల్ భారత్కు తొలి వికెట్ను అందించాడు. దాంతో 49 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ను కోల్పోయింది. స్పిన్నర్ల రాకతో శ్రీలంక స్కోరు బోర్డు వేగం మందగించింది. ఒకదశలో 205/7గా నిలిచిన శ్రీలంక 250 మార్కును దాటడం కష్టంగా అనిపించింది. అయితే 8వ స్థానంలో వచ్చిన కరుణరత్నే (35 బంతుల్లో 43 నాటౌట్; ఫోర్, 2 సిక్స్లు) దూకుడుగా ఆడి లంకకు గౌరవప్రద స్కోరు అందించాడు. చివరి రెండు ఓవర్లలో శ్రీలంక 32 పరుగులు రాబట్టింది. పృథ్వీ... ధావన్... మధ్యలో ఇషాన్ ఛేదనలో భారత ఇన్నింగ్స్ మూడు దశలుగా సాగింది. పృథ్వీ షా మెరుపు ఆరంభాన్నిస్తే... చివర్లో ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఈ మధ్యలో ఇషాన్ కిషన్ ‘బర్త్డే స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాడు. చమీర వేసిన తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన పృథ్వీ... ఆ తర్వాతి ఓవర్లోనూ మరో రెండు ఫోర్లు బాదాడు. ఇక ఉదాన వేసిన నాలుగో ఓవర్లో మరింత రెచ్చిపోయిన అతను కవర్స్ దిశగా హ్యాట్రిక్ ఫోర్లు సాధించాడు. దాంతో భారత స్కోరు 4.5 ఓవర్లలో 50 పరుగుల మార్కును దాటింది. మరో ఎండ్లో ఉన్న ధావన్ మాత్రం సింగిల్స్కే ప్రాధాన్య ఇస్తూ పృథ్వీకే ఎక్కువగా స్ట్రయికింగ్ వచ్చేలా చేశాడు. హాఫ్ సెంచరీ చేసేలా కనిపించిన పృథ్వీ భారీ షాట్కు ప్రయత్నించి లాంగాన్లో అవిష్క ఫెర్నాండో చేతికి చిక్కాడు. వన్డేల్లో తొలి మ్యాచ్ ఆడుతోన్న ఇషాన్... తాను ఎదుర్కొన్న తొలి బంతినే లాంగాన్ మీదుగా సిక్సర్ కొట్టి ఖాతా తెరిచాడు. పృథ్వీ ఇన్నింగ్స్కు కొనసాగింపుగా ఇషాన్ బ్యాటింగ్ సాగింది. ధనంజయ వేసిన 8వ ఓవర్లో ఇషాన్ ‘హ్యాట్రిక్’ ఫోర్స్ కొట్టాడు. దాంతో 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ 91/1గా నిలిచింది. హిట్టింగ్కే ప్రాధాన్యం ఇచ్చిన ఇషాన్ 33 బంతుల్లో తొలి అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. ఆ కాసేపటికే సందకన్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ వెనుదిరిగాడు. ధావన్, ఇషాన్ రెండో వికెట్కు 85 పరుగులు జోడించారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ధావన్... ఇప్పుడు నా వంతు అంటూ తన బ్యాట్కు పని చెప్పాడు. కరుణరత్నే బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ధావన్... ఆ తర్వాతి ఓవర్లో సింగిల్ తీసి 61 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. మనీశ్ పాండే (26; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి మూడో వికెట్కు 72 పరుగులు జోడించాడు. పాండే అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ (20 బంతుల్లో 31; 5 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో మ్యాచ్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: అవిష్క (సి) పాండే (బి) చహల్ 32; మినోద్ భానుక (సి) పృథ్వీ షా (బి) కుల్దీప్ యాదవ్ 27; రాజపక్స (సి) ధావన్ (బి) కుల్దీప్ యాదవ్ 24; ధనంజయ (సి) భువనేశ్వర్ (బి) కృనాల్ పాండ్యా 14; అసలంక (సి) ఇషాన్ కిషన్ (బి) దీపక్ చహర్ 38; షనక (సి) హార్దిక్ (బి) చహల్ 39; హసరంగ (సి) ధావన్ (బి) దీపక్ చహర్ 8; కరుణరత్నే (నాటౌట్) 43; ఉదాన (సి) దీపక్ చహర్ (బి) హార్దిక్ 8; చమీర (రనౌట్) 13; ఎక్స్ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 262. వికెట్ల పతనం: 1–49, 2–85, 3–89, 4–117, 5–166, 6–186, 7–205, 8–222, 9–262. బౌలింగ్: భువనేశ్వర్ 9–0–63–0, దీపక్ చహర్ 7–1–37–2, హార్దిక్ పాండ్యా 5–0–33–1, చహల్ 10–0–52–2, కుల్దీప్ యాదవ్ 9–1–48–2, కృనాల్ పాండ్యా 10–1–26–1. భారత ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) అవిష్క ఫెర్నాండో (బి) ధనంజయ 43; ధావన్ (నాటౌట్) 86; ఇషాన్ కిషన్ (సి) భానుక (సి) సందకన్ 59; పాండే (సి) షనక (బి) ధనంజయ 26; సూర్యకుమార్ (నాటౌట్) 31; ఎక్స్ట్రాలు 18; మొత్తం (36.4 ఓవర్లలో 3 వికెట్లకు) 263. వికెట్ల పతనం: 1–58, 2–143, 3–215. బౌలింగ్: చమీర 7–0–42–0, ఉదాన 2–0–27–0, ధనంజయ 5–0–49–2, సందకన్ 8.4–0–53–1, అసలంక 3–0–26–0, హసరంగ 9–1–45–0, కరుణరత్నే 2–0–16–0. -
India Vs Srilanka: ఫేవరెట్గా భారత్
కొలంబో: భారత స్టార్ క్రికెటర్లతో కూడిన ఒక జట్టు ఇంగ్లండ్లో ఉంది. ఆ టీమ్ ఆట చూసేందుకు ఆగస్టు 4 వరకు ఆగాల్సిందే. కానీ ఆలోగా మరో టీమ్ ఆరు పరిమిత ఓవర్ల మ్యాచ్లతో ఆ లోటు తీర్చేందుకు సిద్ధమైంది. భారత్, శ్రీలంక మధ్య పోరులో భాగంగా ఆదివారం తొలి వన్డేకు రంగం సిద్ధమైంది. పేరుకు ద్వితీయ శ్రేణి జట్టుగా చెబుతున్నా, టీమిండియాలో దాదాపు అందరికీ అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉండగా... అటు శ్రీలంక మాత్రం కోవిడ్, కాంట్రాక్ట్ వివాదాలు, సీనియర్ల గైర్హాజరువంటి సమస్యలతో సతమతమవుతూ సిరీస్కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అన్ని రకాలుగా భారత జట్టు ఫేవరెట్గా కనిపిస్తుండగా, అభిమానుల కోణంలో చూస్తే మాత్రం ఈ సిరీస్పై ఆసక్తి తక్కువగా ఉంది. అవకాశం ఎవరికి... శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం భారత జట్టు 20 మందితో టీమ్ను ప్రకటించింది. కెప్టెన్ శిఖర్ ధావన్తో పాటు భువనేశ్వర్, కుల్దీప్ యాదవ్, చహల్, హార్దిక్ పాండ్యా, మనీశ్ పాండే సుదీర్ఘ కాలంపాటు ప్రధాన జట్టులో భాగంగా ఉంటూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు ‘వైట్ బాల్’ స్పెషలిస్ట్లుగా తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. వీరి అనుభవం, గత ప్రదర్శనలను పరిగణలోకి తీసుకుంటే తుది జట్టులో చోటు ఖాయం. కాబట్టి ఇతర యువ ఆటగాళ్లలో ఎవరికి అవకాశం లభిస్తుందనేది ఆసక్తికరం. వీరందరికీ ఐపీఎల్ అనుభవం ఉండటం సానుకూలాంశం. రెండో ఓపెనర్గా పృథ్వీ షా బరిలోకి దిగుతాడు. భారత్ తరఫున టి20లు మాత్రమే ఆడిన సూర్యకుమార్కు చాన్స్ దక్కవచ్చు. కీపర్గా సామ్సన్కంటే ఇషాన్ కిషన్ వైపే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపుతోంది. ఇక చాలా కాలం తర్వాత మరో అవకాశం దక్కించుకున్న కుల్దీప్, చహల్ ద్వయం గతంలోలాగా ఏమాత్రం ప్రభావం చూపిస్తుందనేది చూడాలి. గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యా తన పూర్తి స్థాయి ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. కొత్త ముఖాలతో... శ్రీలంక పరిస్థితి చూస్తే ఆ జట్టు ఒక్క మ్యాచ్ గెలిచినా గొప్పే అనిపిస్తోంది. దసున్ షనక రూపంలో గత నాలుగేళ్లలో ఆ జట్టుకు పదో కెప్టెన్ వచ్చాడు. కుశాల్ మెండిస్, డిక్వెలా సస్పెన్షన్లో ఉంటే కుశాల్ పెరీరా గాయంతో, మాథ్యూస్ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. ఇలాంటి స్థితిలో ఏమాత్రం అనుభవం లేని యువ ఆటగాళ్లపై పెను భారం పడనుంది. అవిష్క, నిసాంకా, మినోద్ భానుక, చమీరా, రజిత, రాజపక్సలాంటి కొత్త ఆటగాళ్లతో కూడిన ఆ టీమ్ భారత్ను నిలువరించగలదా అనేది సందేహమే. -
భారీస్కోరు దిశగా దక్షిణాఫ్రికా
ఎల్గర్ సెంచరీ వెస్టిండీస్తో రెండో టెస్టు పోర్ట్ ఎలిజబెత్: ఓపెనర్ డీన్ ఎల్గర్ (239 బంతుల్లో 121; 18 ఫోర్లు) సెంచరీ సహాయంతో వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 88 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (228 బంతుల్లో 99 బ్యాటింగ్; 12 ఫోర్లు; 2 సిక్సర్లు) సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. క్రీజులో తనకు జతగా కెప్టెన్ హషీమ్ ఆమ్లా (17 బ్యాటింగ్) ఉన్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 47 పరుగులకే తొలి వికెట్ను కోల్పోయింది. ఓపెనర్ పీటర్సన్ మరోసారి పేలవ ఆటతీరుతో పెవిలియన్కు చేరగా... ఎల్గర్ జట్టుకు అండగా నిలబడ్డాడు. డు ప్లెసిస్తో కలిసి విండీస్ బౌలర్లను ఆడుకున్నాడు. దీనికి తోడు ప్రత్యర్థి ఫీల్డింగ్ లోపాలను ఈ జోడీ సొమ్ము చేసుకుంది. డు ప్లెసిస్ 8, 26 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్లు నేలపాలయ్యాయి. అటు ఎల్గర్ కూడా 48, 73 పరుగుల దగ్గర అవుటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. రెండో వికెట్కు వీరిద్దరు 179 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జత చే శారు. 208 బంతుల్లో ఎల్గర్ కెరీర్లో మూడో సెంచరీ సాధించాడు. పీటర్స్, గాబ్రియెల్లకు చెరో వికెట్ దక్కింది.